రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల వల్ల నదుల్లో నీటి నిల్వలు పడి పోయాయని, అందువల్ల కృష్ణా డెల్లాకు సాగునీరు ఇవ్వలేమని జూలై 24-2026న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రకటించింది. మంత్రివర్గ నిర్ణయాన్ని సమాచార మంత్రి కె.పార్థసారథి తెలియ చేశారు. వరి పంట వేయ వద్దని, వరి పంట వేస్తే తర్వాత నీరు లేక నష్టపోయేది మీరేనని రైతులకు హెచ్చరిక జారీ చేశారు.
ఏల్ ని నో ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షాభావంతో పాటు కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు ఖరీప్ కు చాలా ముందే ప్రకటించారు. ఆ విధంగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్ ని నో ప్రభావాన్ని ఎదుర్కోవఢానికి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. కాని చంద్రబాబు నాయకత్వాన ఉన్న కూటమి ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోలేదు. నదుల్లో నీరు నిల్వకు అవసరమైన చర్యలు తీసుకోలేదు. అలాంటి చర్యలు తీసుకోకుండా సాగు నీటి విడుదల గురించి ఆర్భాటపు ప్రకటనలు చేశారు.
జూన్ 1 నుంచే కాల్వలకు నీరు విడుదల చేస్తామని మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామ నాయుడు ప్రకటించారు. కృష్ణా డెల్టాకి జూలై 1 నుంచి, నాగార్జున సాగర్ ఆయకట్టుకు జూలై చివరికి ,కే సీ కెనాల్ కి మరియు వంశధార ఆయకట్టుకు జూలై 15 నుంచి సాగు నీరు విడుదల చేస్తామని, రైతులు సేద్యానికి సిద్దం కావాలని చెప్పారు. కృష్ణా డెల్టా ఆయకట్టుకి 150 టి ఎం సి లు అవసరమని, బ్యారేజిలో 461 టి ఎం సి ల నీరు అందుబాటులో ఉందని కూటమి ప్రభుత్వం ప్రకటించి జూలై 1న ప్రకాశం బ్యారేజీ నుంచి ఆర్భాటంగా నీరు విడుదల చేసింది. ఏరువాక పౌర్ణమి నాడు సాగు నీరు విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఎన్ టి ఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మి శా అన్నారు. కృష్ణా డెల్టా లోని 13 లక్షల ఎకరాలకు అవసరమైన నీరు కృష్ణా బ్యారేజి నుంచి ప్రకాశం బ్యారేజి కి ప్రవహిస్తుందని, రైతుల మొఖాల్లో ఆనందం నింపేందుకు నీటిని విడుదల చేశామని ఆమె అన్నారు.
మంత్రుల ప్రకటనతో రైతాంగం ఖరీప్ సేద్యానికి సమాయత్తం అవుతూ ఉండగా రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా డెల్టాకి సాగు నీరు విడుదల చేయలేమని జూలై 24న ప్రకటించింది. మంత్రివర్గ ప్రకటన తర్వాత ఇరిగేషన్ శాఖ సమావేశం జరిగింది. ఆ సమావేశం అనంతరం ఇరిగేషన్ చీఫ్ ఇంజనీరు కె. నరసింహమూర్తి మాట్లాడుతూ ఎల్ ని నో ప్రభావం వల్ల కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గాయని చెప్పారు. రాష్ట్రంలో 51%, కృష్ణా డెల్టాలో 49% లోటు వర్ష పాతం ఉందని పేర్కొన్నారు. ఏ పీ ప్రభుత్వం తాగు నీటి కే ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు. పులిచింతల నీటిని కూడా తాగు నీటి అవసరాలకే భద్రపర్చినట్లు వెల్లడించారు. గోదావరి ప్రవాహం తగ్గడంతో పట్టి సీమ ఎత్తిపోతల పంపింగ్ పై ప్రభావం పడిందని అన్నారు. సీలేరు నీటి లభ్యత కూడా తగ్గిందని చెప్పారు. అందువల్ల కృష్ణా డెల్టా సాగు కు అవసరమైన నీటి లభ్యత ప్రస్తుతం లేదని చావు కబురు చల్లగా చెప్పారు. ప్రకాశం బ్యారేజి నుంచి అనధికారికంగా నీరు తీసుకోవద్దని రైతాంగానికి హెచ్చరిక జారీ చేశారు. కుడి కాల్వ పరిధిలో రైతులు వరి సాగు చేయవద్దని చెప్పారు. ఆరు తడి పంటలు సాగు చేయాలని పేర్కొన్నారు.
జూన్- జూలై నెలల మధ్య సాగు నీరు విడుదల విషయంలో కూటమి ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చింది. జూన్ నెలలో రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలకు సాగు నీరు విడుదల తేదీలను కూటమి మంత్రులు ప్రకటించారు. సాగుకి రైతులు సిద్దం కావాలని చెప్పారు. మంత్రుల ప్రకటనతో అప్పులు చేసి సేద్యానికి కావాల్సిన వాటిని సమకూర్చుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఎకరాకు 10 వేలకు పైగా రైతులు సేద్యానికి ఖర్చు చేశారు.ఇలాంటి పరిస్థితుల్లో ఎల్ ని నో ప్రభావం వల్ల ఇప్పుడు సాగు నీరు ఇవ్వలేమని ప్రభుత్వం చెప్పడం వల్ల రైతాంగం తీవ్రమైన మనో వేదనకు గురౌతున్నారు. జూలై 1లో 461 టి ఎం సి ల నిల్వ ఉన్న నీరు జూలై 23 నాటికి ఏమైంది. సాగు నీరు ఇవ్వలేమని ప్రభుత్వం ఎలా చెప్పగలుగుతున్నది. ఎల్ ని నో ప్రభావం ముందుగానే కూటమి ప్రభుత్వానికి తెలుసుగా, తెలిసే సాగు నీరు ప్రాంతాల వారిగా విడుదల చేస్తామన్నది గదా! ఇప్పుడు సాగు నీరు విడుదల సాధ్యం కాదని చెప్పడం రైతులను మోసం చేయడం కాదా! సేద్యం పైనే చిన్న,సన్న కారు రైతు కుటుంబాల ఆధారపడి ఉన్న విషయం కూటమి ప్రభుత్వానికి తెలియదా, ఆ కుటుంబాల పరిస్థితి ఏమికావాలి.
సాగు నీరు విడుదల గురించి ప్రభుత్వం చెప్పే మాటలు వాస్తవ విరుద్దంగా ఉన్నాయి. జల వనరుల వ్యవస్థ తాజా గణాంకాల ప్రకారం ప్రకాశం బ్యారేజి నీటి నిల్వ 2.978 టి ఎం సి లు కాగా,పూర్తి నీటి మట్టం 3.071 టి ఎం సి లు. అంటే పూర్తి నీటి మట్టానికి అతి తక్కువ మాత్రమే. 96.97% నీటి నిల్వతో సురక్షితంగా ఉన్నందువల్ల సాగు నీటి సరఫరాకు ఎటువంటి ఆటంకం లేదని నిపుణులు చెబుతున్నారు. డెడ్ స్టోరేజికి చేరాలంటే 2 టి ఎం సి ల కంటే తక్కువ ఉండాలి. బ్యారేజి లో నీరు లేనప్పుడు సాగు నీరు ఇవ్వాల్సి వస్తే, నాగార్జున సాగర్ లేదా పులిచింతల నుంచి నీరు విడుదల చేయాలి. పులిచింతలలో ప్రస్తుతం 29.039 టి ఎం సి ల నీరు ఉంది.సాగు,తాగు నీటి అవసరాలకు నీటిని దిగువకు విడుదల చేయవచ్చని కూడా నిపుణులు అంటున్నారు. అంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం సాగు నీరు ఎందుకు విడుదల చేయడం లేదు. గతంలో బ్యారేజి లో ఇంతకన్నా తక్కువ నీరు ఉన్నప్పుడే సాగు నీరు విడుదల చేయడం జరిగింది.
కృష్ణా డెల్టా లో ప్రధాన సేద్యం వరి. అలాంటి వరి సేద్యం చేయ వద్దంటే, రైతులు ఖరీఫ్ సేద్యానికి దూరం కావడమే గదా! ఆగస్టు నెల నాటికి పూర్తిగా సేద్యం జరగాలి.ఆ తర్వాత పంటలు వేసినా ప్రయోజనం లేదు. నల్ల రేగడి భూముల్లో ఇప్పుడు ఆరు తడి పంటల సాధ్యా సాధ్యాలను పరిగణన లోకి తీసుకోవాలి. ఆరు తడి పంటలకు మల్లడం కూడా రైతులకు చాలా ఇబ్బందికరం అవుతుంది. వరి సేద్యం జరగక పోతే ఆహార సమస్య కూడా ముందుకు వస్తుంది. రెండు కోస్తా తీర ప్రాంతాల్లోని చాలా జిల్లాల్లో వరి పంట తర్వాత జొన్న, మొక్కజొన్న పంట వేస్తారు. ఈ పంటలు రైతులకు కొంత మిగులు ఆదాయాన్ని ఇస్తున్నాయి. ప్రకాశం బ్యారేజి కుడి,ఎడమ కాల్వలకు సాగు నీరు విడుదల చేయక పోతే ఆ పంటల సేద్యం సాధ్యం కాదు. అందువల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది.
ఆరు తడి పంటలు వేయమనే కూటమి ప్రభుత్వ, అందుకు అవసరమైన వాటిని కూడా ముందు జాగ్రత్తగా సిద్ధం చేయలేదు. రైతులు వాటిని సమకూర్చుకోవాలంటే అనేక అవస్థలు పడాలి. అవస్థలు పడి ఆరు తడి పంట వేసినా చేతికి వస్తాయనే నమ్మకం లేదు. వరి పంట వల్ల మిగులు ఎక్కువ లేక పోయినా నష్టం అనేది తక్కువగా ఉండటంతో రైతాంగం వరి పంట సాగు కే మొగ్గు చూపుతున్నారు.
నేడు సాగు నీటి సమస్యకు పాలకుల విధానాలే కారణం. ఎల్ ని నో ప్రమాదం గురించి ముందుగానే సమాచారం ఉన్నప్పుడు నదుల నీటి నిల్వల గురించి సరైన చర్యలు తీసుకోవాలి. అలాంటి చర్యలు కూటమి ప్రభుత్వం తీసుకోలేదు. భారతదేశంలో అత్యధిక చెరువులు ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు ఉంది. 2023లో కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1,90,777 నీటి వనరులు ఉండగా,వాటిల్లో 99.7% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిలో 81,703 చెరువులు పంచాయతీ మరియు ఇరిగేషన్ వంటి ప్రభుత్వ శాఖల పరిధిలో ఉన్నాయి. ఈ చెరువులు ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకుని , పూడికలు తీసి నీటితో వాటిని నింపి ఉంటే ,వాటి ద్వారా సాగు నీరు లభించేది. చెరువులను కాపాడే చర్యలను ఏ ప్రభుత్వం తీసుకోలేదు.పట్టి సీమ ఎత్తిపోతల పంపింగ్ గురించి గొప్పలు చెప్పే కూటమి ప్రభుత్వం ముందుగానే కృష్ణా బ్యారేజికి నీరు పంపింగ్ ఎందుకు చేయలేదు. ఇప్పుడు పంపింగ్ చేయడం సాధ్యం కాదని ఎందుకు చేతులు ఎత్తింది. అవసరానికి ఉపయోగపడని పట్టి సీమ స్కీమ్ ప్రయోజనం ఏముంది. చెరువులను నీటితో నింపి , నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితుల్లో కూడా తాగు,సాగు నీరు సమస్య తీరేదిగదా! ఇది పాలకుల వైఫల్యం కాదా !
ప్రస్తుత పరిస్థితులను తన వ్యవసాయ విధానాలను అమలు జరపడం కోసం కూటమి ప్రభుత్వ విధానంగా ఉంది. వరి ధాన్యం ఎవరూ కొనరని, ఆ పంట మాని లాభదాయక పంటలు వేయాలని కొద్ది నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పటం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటలకు న్యాయమైన మద్ధతు ధరలు ప్రకటించకుండా సేద్యాన్ని నష్ట దాయకంగా మార్చి, సేద్యం నుంచి రైతులు సేద్యం నుంచి వైదొలిగేలా చేసి, ఆ రైతుల భూములు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే విధానాలు అమలు చేస్తున్నాయి. నేటి సాగు నీటి విడుదల చేయక పోవడంలో కూడా ఈ ప్రమాదం దాగి ఉంది.
రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితుల వల్ల కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రం లోని 608 మండలాల్లో 250 మండలాలు తీవ్ర కరువు మండలాలుగా ఉన్నాయి. వీటిలోనూ 122 మండలాలు అత్యంత తీవ్ర కరువు మండలాలు. ఇలాంటి పరిస్థితుల్లో కరువును ఎదుర్కొనేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ప్రకాశం బ్యారేజి కుడి,ఎడమ కాల్వలకు వెంటనే సాగు నీరు విడుదల చేయాలి.కరువు మండలాల్లో గ్రామీణ ఉపాధి హామీ పనులను 250 రోజులకు పెంచి గ్రామీణ పేద కుటుంబాలకు పనులు కల్పించాలి. ఆ పనుల వేతనం పెంచాలి. రైతాంగానికి కావాల్సిన ఎరువులు, విత్తనాలను చిన్న, సన్న కారు రైతులకు ఉచితంగా ఇవ్వాలి. వారు తీసుకున్న పంట రుణాలు రద్దు చేయాలి. గ్రామ పంచాయితీలకు ఎరువులు సరఫరా చేసి మిగతా రైతులకు తక్కువ ధరలకు అందించాలి.రేషన్ దుకాణాలకు అన్ని రకాల నిత్యావసరాల సరుకులు సప్లయ్ చేసి చౌకగా ప్రజలకు ఇవ్వాలి. వ్యవసాయ కూలీ కుటుంబాలకు ప్రతి నెల అవసరం మేరకు ఉచితంగా నిత్యావసర సరుకులు అందించాలి. తాగు నీటి సమస్య లేకుండా చూడాలి. ఈ డిమాండ్ల సాధన కోసం రైతాంగం , ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలి.
బొల్లిముంత సాంబశివరావు
రైతు కూలీ సంఘం ( ఆం.ప్ర)రాష్ట్ర
కార్యవర్గ సభ్యులు
సెల్ : 9885983526
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
