మయూర్భంజ్ జిల్లాలో మూక హింస వెలుగులోకి వచ్చింది. మేకను దొంగతనం చేశాడనే అనుమానంతో ఇద్దరు యువకులను గ్రామస్తులు తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో 14 ఏళ్ల బాలుడు మరణించగా, తనతోపాటుగా ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
న్యూఢిల్లీ: ఒడిశాలోని మయూర్భంజ్లో మేకను దొంగతనం చేశాడనే అనుమానంతో 14 ఏళ్ల బాలుడిని కొట్టి చంపారు. ఈ ఘటనలో మరో మైనర్ తీవ్రంగా గాయపడ్డాడు.
న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం, జిల్లాలోని తిరింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మార్చి 2న ఒక గుంపు ఈ దాడికి పాల్పడింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మయూర్భంజ్ పోలీసులు ఈ ఘటనకు సంబంధించి నాలుగు గ్రామాలకు చెందిన 11 మందిని అరెస్టు చేశారు.
బాధితుల వివరాలు
మృతుడిని భూతకబరి గ్రామానికి చెందిన రాజ్కుమార్ బింధాని ఏకైక కుమారుడు సంబిత్ బింధానిగా గుర్తించారు. అతను బాసింగి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. తిరింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండోఖోలి గ్రామ పంచాయతీకి చెందిన హీరోగోడా గ్రామంలో తన మామతో కలిసి నివసించేవాడు. ఈ ప్రాంతం బహల్దా బ్లాక్లో భాగంగా ఉంది.
గాయపడిన మరో మైనర్ను రాకేష్ మోహంతగా గుర్తించారు. అతన్ని బారిపాడాలోని పండిట్ రఘునాథ్ ముర్ము మెడికల్ కాలేజీ & ఆసుపత్రిలో చేర్చి, చికిత్స అందించారు.
కంగారూ కోర్టు- మూక దాడి
మేక దొంగతనం చేశారనే అనుమానంతో గ్రామస్తులు సంబిత్తోపాటు ఉన్న మరో ముగ్గురిని పట్టుకున్నట్టు సమాచారం.
అయితే, వారిలో ఇద్దరు అక్కడి నుంచి తప్పించుకోగలిగారు. ఆ తర్వాత సంబిత్తోపాటు తన మరొక సహచరుడిని మూక దారుణంగా కొట్టింది. వారు తీసుకువచ్చిన మోటార్ సైకిల్కు కూడా నిప్పంటించారు.
ఆ యువకులను పోలీసులకు అప్పగించే ముందు, గ్రామస్తులు వారి కోసం ఒక రకమైన ‘కంగారూ కోర్టు’ నిర్వహించారని, అక్కడే ఇద్దరినీ దారుణంగా కొట్టారని ఆరోపణలు ఉన్నాయి.
పోలీసుల కేసు నమోదు, అరెస్టులు..
పోలీసులు వారిని రక్షించే సమయానికి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మొదట ఝార్దిహి ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వారిని రాయరంగ్పూర్ ఆసుపత్రికి మార్చారు.
చికిత్స పొందుతూ సంబిత్ మరణించగా, రాకేష్ పరిస్థితి విషమంగా మారడంతో అతన్ని బారిపాడాలోని పీఆర్ఎం ఎంసీహెచ్(పీఆర్ఎం ఎంసీహెచ్)ఆసుపత్రిలో చేర్చారు.
ఈ సంఘటనపై సంబిత్ తండ్రి సోమవారం రాత్రి టిరింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారని రాయరంగ్పూర్ ఎస్డీపీఓ బీరేంద్ర సేనాపతి తెలిపారు.
ఇదిలా ఉండగా, తిరింగ్- బహల్దా పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఇండోఖోలి, హీరోగోడా, గిధిఘాటితోపాటు కుల్గి గ్రామాలకు చెందిన 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ 11 మంది నిందితులపై భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) 2023 లోని 191(2), 191(3), 126(2), 115(2), 109(1), 103(1), 326(1), 303(2); 190 సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఎస్డీపీఓ తెలిపారు.
