దేశవ్యాప్తంగా గత నాలుగేళ్లుగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
ఏ ప్రజాస్వామిక దేశంలోనైనా చట్టసభలు ప్రజలకు ప్రాతినిధ్యం వహించాలి.
ప్రజలకు తామే ప్రాతినిధ్యం వహించగలమని పోటీ పడుతున్న రాజకీయ నాయకులు, అభ్యర్థులు నిజానికి ప్రజా ప్రతినిధులుగా మనగలుగుతారా లేదా అన్నదే ప్రధాన ప్రశ్న.
ఎవరు ఎవరికి ప్రాతినిధ్యం వహించాలి, అలా ప్రాతినిధ్యం వహించేవారు ప్రజా ప్రయోజనాలకు ఎలా కట్టుబడి ఉండాలి అన్న విషయాలు లోతైన రాజకీయ తర్కానికి సంబంధించిన అంశాలు.
మనం అనుభవిస్తున్న ప్రజాస్వామ్య స్వరూప స్వభావాలను నిర్ధారించే అంశమిది.
గత 75 సంవత్సరాలుగా వివిధ నియోజకవర్గాల్లో ప్రజలకు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తులు, వారు ప్రాతినిధ్యం వహించిన పార్టీలు, గెలవడానికి ముందు, గెలిచిన తర్వాత వారి ఆర్థిక స్థితిగతులు పరిశీలిస్తే సమకాలీన భారత ప్రజాస్వామ్య తీరుతెన్నులు అర్థం చేసుకోవడానికి కీలకమైన ప్రమాణాలుగా నిలుస్తాయి.
వలస పాలనలో ఓటుహక్కు – చారిత్రక పరిణామం..
భారత ప్రజాస్వామ్యం నిరంతరం తనను తాను రూపుదిద్దుకుంటూ మెరుగుపరుచుకుంటూ, మెరుగైన, నికరమైన ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది.
స్వాతంత్ర్యానికి ముందు కూడా భారతదేశంలో చట్టసభలు ఉన్నప్పటికీ, అవి పరిమిత ప్రజానీకానికి మాత్రమే ఓటుహక్కును ఇచ్చి ఆ పరిమిత ప్రజానీకం ఎన్నుకున్న ప్రతినిధులతోనే నడిచేవి. సార్వత్రిక ఓటుహక్కు అనేది కూడా స్వాతంత్ర్యోద్యమ నినాదాల్లో ఒకటి.
1885 నుంచి భారతదేశానికి సంబంధించిన విషయాలను చర్చించి, విధానాలు రూపొందించేందుకు భారతీయులతో కూడిన చట్టసభలే ఉండాలని జాతీయ కాంగ్రెస్ డిమాండ్ చేసినప్పటికీ 1909 వరకూ బ్రిటిష్ పాలకులు ఈ డిమాండ్ను అంగీకరించలేదు.
1861లో ఇండియా కౌన్సిల్స్ చట్టం రూపంలో వలస ప్రభుత్వం కొంతమందిని సలహాదారులుగా నామినేట్ చేసే వ్యవస్థ ఉనికిలోకి వచ్చింది.
నాటి నుంచి క్రమంగా చట్టసభల్లో భారతీయుల ప్రాతినిధ్యం విస్తరిస్తూ 1909 మింటో-మార్లే సంస్కరణల నాటికి ఆస్తిపర వర్గాలకు మాత్రమే ఓటుహక్కు ఇచ్చేందుకు వలస ప్రభుత్వం అంగీకరించింది.
1919 మాంటేగ్-చెమ్స్ఫర్డ్ ఒప్పందం పేరుతో అమలైన సంస్కరణలు అప్పటి కేవలం 50 లక్షల మందికి పరిమితమైన ఓటుహక్కును 1935 భారత ప్రభుత్వ చట్టం నాటికి మూడున్నర కోట్ల మందికి విస్తరించాయి.
అయినా 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఏర్పాటైన చట్టసభల్లో రెండు దొంతరులు ఉండేవి.
ఒకటి భారతీయులు ఎన్నుకున్న ప్రతినిధుల సభ, రెండోది వలస ప్రభుత్వం నియమించిన ప్రతినిధుల సభ.
ఈ రెండింటి మధ్య అధికారాలు, విధానాలు, ప్రాధాన్యతల్లో నిరంతరం ఘర్షణలు జరుగుతూ ఉండేవి.
ఈ తరహా ప్రాతినిధ్యం స్థానంలో సార్వత్రిక ఓటుహక్కు ద్వారా మాత్రమే ప్రజలు ప్రతినిధులను ఎన్నుకోవాలని అప్పటి భారత కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమం ప్రతిపాదించింది.
సార్వత్రిక ఓటుహక్కు – కమ్యూనిస్టుల డిమాండ్..
మదురైలో 1954లో ఆమోదించిన భారత కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమం “22. చట్టసభలు, స్థానిక సంస్థలకు జరిగే అన్ని ఎన్నికల్లోనూ రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరగాలి. స్త్రీ, పురుష భేదం లేకుండా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ సార్వత్రిక ఓటుహక్కు ఉండాలి. చట్టసభలకు ఎన్నుకోవడానికి ప్రతి ఒక్క పౌరుడూ ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం ఉండాలి. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారికి ప్రభుత్వమే పారితోషికం చెల్లించాలి. అన్ని ఎన్నికల్లోనూ దేశంలోని పార్టీలన్నిటికీ దామాషా ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించాలి” అని ప్రతిపాదిస్తోంది.
ఈ ప్రతిపాదనలు రావడానికి ముందు నుంచే ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో ఈ అంశాలకు సంబంధించిన చర్చలు జరుగుతూ వచ్చాయి. ఈ చర్చల నేపథ్యంలోనే 1952లో రాజ్యసభలో పునర్వ్యవస్థీకరణ బిల్లుపై పుచ్చలపల్లి సుందరయ్య చేసిన ఉపన్యాసం ప్రాధాన్యత సంతరించుకుంటుంది.
దామాషా ప్రాతినిధ్యంపై సుందరయ్య గళం..
ఈ ఉపన్యాసంలో సుందరయ్య “అత్యంత నిజమైన ప్రజా ప్రాతినిధ్యం దామాషా ప్రాతినిధ్యం మాత్రమే. ఆరోగ్యకరమైన ప్రజాస్వామిక దేశాల్లో అమలు జరగాల్సింది ఇదే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పార్లమెంట్లో ఆ మేరకు చట్టం చేయమని డిమాండ్ చేసే పరిస్థితి లేదు. మంత్రిగారు కూడా ఒకే వ్యక్తికి ఒకే ఓటు పద్ధతి ద్వారా దామాషా ప్రాతినిధ్య విధానం మెరుగైనది అని ఒప్పుకుంటున్నారు. దామాషా ప్రాతినిధ్యంలో అనేక మార్గాలున్నాయి, కోణాలున్నాయి. ద్విసభ్య నియోజకవర్గాల ప్రతిపాదన నిజమైన ప్రజా ప్రాతినిధ్యం కాబోదు. ప్రతి నియోజకవర్గంలోని ప్రజలూ తమకంటూ ఒక ప్రతినిధిని ఎన్నుకునేందుకు అవకాశం, హక్కు ఉండాలి. అందువల్ల రిజర్వుడ్ నియోజకవర్గాలను ద్విసభ్య నియోజకవర్గాలుగా కొనసాగించాలన్న కొందరు సభ్యుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాను. ఇది నిజమైన ప్రాతినిధ్య వ్యవస్థకు దోహదం చేయదు.” అని స్పష్టం చేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
