1960 జనవరి 15న నిజామాబాద్ జిల్లా అశోక్ ఫారంలో కృష్ణ కానూరి జన్మించారు. విజయవాడలో ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో సుమారు 25 సంవత్సరాలు జర్నలిస్టుగా పనిచేశారు. విద్యార్థి దశ నుంచే సామాజిక, రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక అంశాలపై ఆసక్తి, లోతైన అధ్యయనం ఆయన ప్రత్యేకత. ప్రముఖ తత్వవేత్తలు జిడ్డు కృష్ణమూర్తి, యూజీ కృష్ణమూర్తిల రచనలు, తాత్విక చింతన కృష్ణను ఎంతగానో ప్రభావితం చేశాయి. జిడ్డు కృష్ణమూర్తిపై వచ్చిన 20 ప్రసిద్ధ గ్రంథాలను పరిచయం చేస్తూ రాసిన పుస్తకం ప్రస్తుతం ప్రచురణకు సిద్ధంగా ఉంది. తెలుగు, ఆంగ్ల సాహిత్యాలపై అనురక్తి కలిగిన కృష్ణ.. సమకాలీన అంతర్జాతీయ, దేశీయ సామాజిక సమస్యలపై పదునైన ఎడిట్ పేజీ విశ్లేషణాత్మక వ్యాసాలు రాయడంపై విశేష ఆసక్తి కనబరుస్తారు. ప్రచారాల వెనుక దాగిన నిజాలను వెలికితీయడమే ఆయన రచనల ప్రధాన లక్ష్యం.