భ్రమల్లో బతక్కండి, వాస్తవాలు గ్రహించండి, నిజాలు అన్వేషించండి – అని చెబుతూ వస్తున్న మహానుభావులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. మన దేశంలోనూ ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు.
హేతువాద స్థాపన కోసం జీవితాలు ధారపోసిన రచయితలు, సైన్స్ రచయితలు, సంఘసంస్కర్తలు లోగడ ఉన్నారు.
వారి స్థాయిలో వారి కృషి కొనసాగిస్తూ వచ్చారు, ఇప్పుడూ కొనసాగిస్తున్న వారున్నారు. భవిష్యత్తులో కూడా కొందరుంటారు. ఇది నిరంతరం కొనసాగుతున్న – కొనసాగాల్సిన కార్యక్రమం.
వందేళ్ల క్రితం కంటే ఇప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మనకు ఎక్కువగా అందుబాటులోకి వచ్చింది. ఇక ముందు కూడా వస్తూనే ఉంటుంది.
అందువల్ల ఈ విషయంలో యువతరం ఎక్కువ చొరవ తీసుకుని పనిచేయాల్సిన అవసరం కనిపిస్తోంది.
సామాజిక రుగ్మతలపై అక్షర శస్త్రాలు..
1862 సెప్టెంబర్ 12 – 1915 నవంబర్ 30 మధ్యకాలంలో జీవించిన మహాకవి గురజాడ అప్పారావు హేతువాది, సంఘసంస్కర్త. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహిత్యకారుడు.
పంతొమ్మిదవ శతాబ్దంలోనూ, ఇరవయ్యవ శతాబ్దపు మొదటి దశాబ్దంలోనూ ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలు పొందుతున్నాయి.
విజయనగరం మహారాజా కాలేజీ వారి పాఠశాలలో ఉపాధ్యాయుడిగానూ, తర్వాత కాలంలో అధ్యాపకుడిగానూ పనిచేసిన గురజాడ, మద్రాస్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్ అయ్యారు. ‘మతములన్నియు మాసిపోవును’ అని తన ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.
గిడుగు వేంకట రామమూర్తి గురజాడకు సమకాలికులు. పాఠశాలలో గురజాడతో కలిసి చదువుకున్నారు.
1863 ఆగస్టు 29 – 1940 జనవరి 22 మధ్యకాలంలో జీవించిన గిడుగు భాషోద్యమ మూలపురుషుడు, చరిత్రకారుడు, హేతువాది, సంఘసంస్కర్త.
గిడుగు జయంతి ఆగస్టు 29ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
మూఢవిశ్వాసాలపై తిరుగుబాటు..
అలాగే కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి 1887 జనవరి 15- 1943 జనవరి 16 మధ్యకాలంలో జీవించిన హేతువాది, మానవవాది.
అంటరానితనానికి వ్యతిరేకంగా, హిందూ మతాచారాలకు, వివాహ వ్యవస్థకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించారు.
ఆయన తెనాలి మున్సిపల్ ఛైర్మన్గా ఉన్న రోజుల్లో జంతుబలుల్ని ఆపారు.
‘శంభుక వధ’ వీరి ప్రసిద్ధ రచన. భారత ప్రభుత్వం 1987లో వీరిపై పోస్టల్ స్టాంపు విడుదల చేసింది.
కవి, రచయిత, సినీ గీతరచయిత అయిన తాపీ ధర్మారావు నాయుడు 1887 సెప్టెంబర్ 19 – 1973 మధ్య జీవించారు.
‘విధి విలాసం’, ‘దాని పుట్టుపూర్వోత్తరాలు’, ‘దేవాలయంపై బూతు బొమ్మలెందుకూ?’, ‘ఇనుప కచ్చడాలు’, ‘పాతపాళీ – కొత్తపాళీ’, ‘ఆలిండియా అడుక్కు తినే వాళ్ళ మహాసభ’ వంటి పుస్తకాలు తెలుగువారి సామాజిక జీవితంలో ఆలోచనల్ని గిలకొట్టాయి. సంప్రదాయం పేరుతో చలామణి అవుతున్న మూఢవిశ్వాసాల్ని బద్దలుకొట్టాయి.
ఇప్పటివరకు తాపీ ధర్మారావు పుస్తకాలు చదవని వారుంటే, ఇప్పుడైనా చదవడం మంచిది. ‘రాళ్ళు – రప్పలు’ శీర్షికతో వెలువడ్డ వీరి జీవితచరిత్ర కూడా చదవాల్సిందే!
సాహిత్య రంగంతోనే కాక, సినీ రంగంతో కూడా చాలా దగ్గరి సంబంధం ఉన్న తాపీ, ‘మాలపల్లి’, ‘రైతుబిడ్డ’, ‘ద్రోహి’, ‘కీలుగుర్రం’, ‘ఇల్లాలు’ వంటి సాంఘిక చిత్రాలకు సంభాషణలు రాశారు.
ఆ రకంగా కూడా సామాజిక చైతన్యానికి దోహదం చేశారు. శ్రీకాకుళం పర్లాకిమిడిలో చదువుకుంటున్న దశలో వీరు గిడుగు రామమూర్తి ప్రియశిష్యులు!
నాస్తిక ఉద్యమ సారథి గోరా..
గోపరాజు రామచంద్రరావు 1902 నవంబర్ 15 – 1975 జూలై 26 కాలంలో 72 ఏళ్ళు జీవించారు. గోరాగా ప్రసిద్ధులు. స్వాతంత్ర్య సమరయోధుడు, హేతువాది, సంఘసంస్కర్త! తన భార్య సరస్వతీ గోరాతో కలిసి విజయవాడలో నాస్తిక కేంద్రం స్థాపించి జీవితకాలం కృషి చేశారు.
మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాల నుంచి వృక్షశాస్త్రంలో పీజీ డిగ్రీ తీసుకున్నారు. మధురై, కోయంబత్తూర్, కొలంబో, కాకినాడలలో పదిహేనేళ్ళు అధ్యాపకుడిగా పనిచేశారు.
తన పద్దెనిమిదో ఏటి నుంచే మూఢనమ్మకాల నిర్మూలనకు నడుంబిగించారు.
గర్భిణి స్త్రీలు సూర్యగ్రహణం చూడొద్దన్న విషయాన్ని ఖండించారు. ఎప్పుడు ఏ ఊరికి వెళ్ళినా, మాలవాడలో ఉండటానికి ఇష్టపడేవారు.
అక్కడే వెన్నెల రాత్రుల్లో మత, వర్గ, వర్ణభేదాలు లేకుండా అందరినీ భోజనానికి ఆహ్వానించేవారు. కులాంతర, మతాంతర వివాహాలు విరివిగా జరిపించారు.
స్వతహాగా బ్రాహ్మణ కులానికి చెందిన వారైనా తన కూతురు, కొడుకు అంటరాని కులాల వారిని వివాహం చేసుకోవడానికి ప్రోత్సహించారు.
అంటరానితనాన్ని రూపుమాపడానికి గోరా చేస్తున్న ప్రయత్నాల్ని ఆనాడు మహాత్మాగాంధీ సైతం ప్రశంసించారు. గోరా తర్వాత ఆయన భావజాలాన్ని ఆయన కుటుంబసభ్యులంతా ముందుకు తీసుకెళ్లారు.
1941లో ‘నాస్తికత్వం’ శీర్షికతో గోరా తొలి పుస్తకం ప్రచురించారు.
ఆయన నాస్తిక భావజాలాన్ని సరిగా అర్థం చేసుకోలేని కాకినాడ పీఆర్ కాలేజీ, మచిలీపట్నం హిందూ కాలేజీ యాజమాన్యం వారు ఆయనను ఉద్యోగంలోంచి తీసేశారు. ఆయన అధైర్యపడలేదు. ధైర్యంగా ముందుకు నడిచారు.
గోరా పెద్ద కొడుకు లవణం, హేమలతను పెండ్లి చేసుకున్నాడు. ఆమె మహాకవి గుర్రం జాషువా కూతురు. గోరాకు తొమ్మిది మంది సంతానం. అందులో విజయం, సమరం, మైత్రి, చెన్నుపాటి విద్య(మాజీ ఎంపీ)లాంటి వాళ్ళంతా సామాజిక కార్యకర్తలుగా, వైద్యులుగా, శాస్త్రీయ అవగాహన పెంపొందించే కార్యకర్తలుగా కృషి చేస్తూ వచ్చారు. చేస్తూనే ఉన్నారు. గోరా పలుదేశాలు పర్యటించారు.
1974లో అమెరికాలో ఉండగా అక్కడి ప్రఖ్యాత హేతువాది మాడలిన్ ముర్రే ఓ’హేర్ను కలుసుకున్నారు. అప్పుడే వారు చర్చించుకుని ప్రపంచ నాస్తిక మహాసభలు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆ పని గోరాతోనే సాధ్యమైంది.
హేతువాద రావిపూడి..
హేతువాదానికి నిబద్ధుడై నిరంతరం కృషి చేస్తూ వచ్చిన రావిపూడి వెంకటాద్రి(96) గురించి తప్పక చెప్పుకోవాలి. 1922 ఫిబ్రవరి 9న నాటి గుంటూరు(నేటి ప్రకాశం) జిల్లా, ఇంకొల్లు మండలం, నాగండ్ల గ్రామంలో రావిపూడి జన్మించారు.
వ్యవసాయ కుటుంబం. ఆజానుబాహుడైన యువకుడిగా మొదట నాటకరంగంలో శ్రీకృష్ణ పాత్రధారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత కవిరాజు త్రిపురనేని భావజాలంతో హేతువాదం వైపు మొగ్గారు. ‘కవిరాజాశ్రమం’ స్థాపించి, హేతువాదాన్ని ప్రచారం చేశారు.
ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షులు. భారత హేతువాద సంఘానికి, ఆంధ్రప్రదేశ్ రాడికల్ హ్యూమనిస్ట్ సంఘాలకు ఛైర్మన్.
శాస్త్రం, మతం, హేతువాదం, నాస్తికత్వం, మార్క్సిజం, హ్యూమనిజంలకు సంబంధించి తెలుగులోనూ, ఇంగ్లిష్లోనూ ఎనభైకి పైగా పుస్తకాలు ప్రకటించారు.
1982లో ‘హేతువాది’ పత్రిక స్థాపించి, ప్రధాన సంపాదకుడిగా దాన్ని నేటివరకు కొనసాగిస్తున్నారు. అలాగే ‘రేషనలిస్ట్’ ఇంగ్లిష్ త్రైమాసిక పత్రికకు సంపాదకులు. వివిధ సాంస్కృతిక సంఘాల ఆహ్వానంపై అమెరికా పర్యటించి వచ్చారు. పలు అవార్డులు స్వీకరించారు. ప్రస్తుతం చీరాలలో ఉంటున్నారు.
పరిణామవాద, శాస్త్రీయ స్పృహను రగిలించిన నార్ల, నండూరి, కొడవటిగంటి..
గతకాలపు ప్రఖ్యాత సంపాదకులు, రచయిత నార్ల వెంకటేశ్వరరావు రచన ‘జాబాలి’ చదివిన వారికి తప్పకుండా కొన్ని భ్రమలు తొలగిపోతాయి. అపోహలు ఇగిరిపోతాయి.
అలాగే ఆయన తర్వాత నండూరి రామమోహనరావు (1927-2011) రచన ‘నరావతారం’ ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన గ్రంథం. మానవ పరిణామవాదాన్ని అత్యంత సులభంగా, సరళంగా తెలుగులో రాసిన నండూరికి తెలుగు జాతి రుణపడి ఉంది. ఆయనకు సైన్స్ నేపథ్యం అంతగా లేకపోయినా, తెలుగు ప్రజలకు విషయం చెప్పాలన్న తహతహ ముందు ఆయన అధ్యయనం చేసి, అర్థం చేసుకుని, ‘నరావతారం’తో పాటు ‘విశ్వరూపం’ కూడా రాశారు. ఇది కూడా తెలుగు సైన్స్ రచనల్లో ఆణిముత్యం!
సృజనకారుడిగా కొడవటిగంటి కుటుంబరావు తెలుగు సమాజంపై తీవ్రమైన ప్రభావం చూపారు. సైన్స్ నేపథ్యంలోంచి హేతుబద్ధంగా రచనలు చేశారు. కానీ, వీరి కుమారుడు కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ తెలుగులో విరివిగా సైన్స్ రచనలు చేసిన మరొక ప్రసిద్ధ రచయిత.
రోహిణీ ప్రసాద్ అణుశాస్త్రవేత్తగా ముంబైలో పనిచేసి, తరువాతి కాలంలో అమెరికాలో స్థిరపడ్డారు. శాస్త్రీయ స్పృహను, హేతువాద దృక్పథాన్ని పెంచడానికి తెలుగులో ఎన్నో విలువైన గ్రంథాలు ప్రకటించారు.
‘జీవశాస్త్ర విజ్ఞానం – సమాజం’, ‘ప్రకృతి పర్యావరణం’, ‘విశ్వాంతరాళం’, ‘అణువుల శక్తి’, ‘మనుషులు చేసిన దేవుళ్ళు’ వంటివి అందులో కొన్ని. శాస్త్రవేత్త మాత్రమే కాక, ఈయన సితార్ వాయిద్యకారుడు కూడా! మోహన్ రావు, రోహిణీ ప్రసాద్ లాంటి వారిని తెలుగు సమాజం, నాటి తెలుగు ప్రభుత్వం సరైన పద్ధతిలో గౌరవించుకోలేకపోయింది.
ప్రజలకు, ప్రయోగశాలకు వారధి: డా నళినీ మోహనరావు..
డా మహీధర నళినీ మోహనరావు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఉన్నత స్థాయిలో రోదసి శాస్త్రవేత్తగా ఎదిగి, తెలుగు సైన్స్ రచయితగా తనకు తాను ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ‘నక్షత్ర వీధుల్లో భారతీయుల పాత్ర’, ‘గ్రహణాల కథ’, ‘రాకెట్ కథ’, ‘సౌరశక్తికి సంకెళ్ళు’ వంటి పుస్తకాలు అంతర్జాతీయ స్థాయి గలవి. ఆయన తెలుగులో రాయడం వల్ల అవి ప్రపంచానికి అంతగా అందలేదు.
‘ప్రపంచానికి ఆఖరు ఘడియలు’ అనే విలువైన గ్రంథం యాభైమూడేళ్ల తర్వాత 2012లో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ పునర్ముద్రించినపుడు దాన్ని పరిష్కరించి, ముందుమాట రాసే అవకాశం ఈ వ్యాస రచయితకు దక్కింది.
ముప్పై దాకా సైన్స్ పుస్తకాలు రాసిన నళినీ మోహన్ రావుకు సాహిత్యంతో కూడా చాలా దగ్గరి సంబంధం ఉంది. నాలుగు పద్య కావ్యాలూ, నలభై ఇతర గ్రంథాలూ ప్రకటించారు. బహుగ్రంథకర్త మహీధర జగన్మోహన్ రావు వీరి పినతండ్రి. సుప్రసిద్ధ నవలా రచయిత, జర్నలిస్ట్ మహీధర రామమోహనరావు వీరి తండ్రి. వీరిది రచయితల కుటుంబం. ముఖ్యంగా ప్రజలకూ, ప్రయోగశాలకూ మధ్య వారధిగా నిలిచినవారు డా మహీధర నళినీ మోహన్ రావు.
అయితే జనంలో ఉన్న పర్వతంలాంటి మూఢత్వాన్ని బద్దలుకొట్టడానికి వందల, వేల సంఖ్యలో మనకు సరళ విజ్ఞానశాస్త్ర, హేతువాద, మానవవాద రచయితలు అవసరం! ఆ దిశలో మనం ప్రయాణిస్తూ ఉండాలి.
వ్యాసకర్త ప్రొఫెసర్ దేవరాజు మహారాజు ప్రముఖ సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
