మన పోటీ పరీక్షలు అధిక శాతం మంది నెగ్గుకురాలేని విధంగా రూపొందించబడ్డాయి. తద్వారా వారిలో ప్రతిభ లేదని ముద్ర వేస్తున్నాయి.
ఈ వడపోత విధానం ఎంత అన్యాయంగా ఉందంటే, దీని స్థానంలో లాటరీ విధానాన్ని ప్రవేశపెట్టినా ఇంతకన్నా మెరుగైన ఫలితాలు వస్తాయేమో.
పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ కావడంపై యువత చేపట్టిన నిరసనలు, ఈ సమస్యను పరిష్కరించేలా భారత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చాయి.
ఇందులో భాగంగా ప్రభుత్వం రెండు కీలక చర్యలు తీసుకుంది.
మొదటిది వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించడానికి, “మరింత పారదర్శకత, నిష్పాక్షికత, విశ్వసనీయతలను” తీసుకురావడానికి ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) యాక్ట్’ను సవరించింది.
ఈ సవరణ పరీక్షల మోసాల కేసులను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలని నిర్దేశిస్తుంది.
రెండవది, దేశంలోని పరీక్షల వ్యవస్థను “లీకేజీలకు తావులేనిదిగా, సాంకేతికతతో నడిచేదిగా” మార్చడానికి నందన్ నిలేకణి నాయకత్వంలో ఒక ఉన్నతాధికార టాస్క్ ఫోర్స్ను నియమించింది.
ఈ టాస్క్ ఫోర్స్ సభ్యుల ప్రతిష్టను బట్టి, ఇది తన లక్ష్యంలో విజయం సాధిస్తుందని ఆశించవచ్చు.
అయితే ఈ రెండు చర్యలు మౌలికంగా అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నాయి.
ఏమిటా అసలు విషయం? పెరుగుతున్న అభ్యర్థుల సంఖ్య, తగ్గుతున్న ఉద్యోగావకాశాలు ఈ రోజు అత్యంత క్లిష్టమైన సంక్షోభాన్ని సృష్టించాయి.
ఎవరు అర్హులు, ఎవరు కాదో నిర్ధారించే ప్రక్రియలోనూ, దాని సామాజిక పరిణామాలలోనూ ఇది ప్రతిఫలిస్తోంది. దీనికి తోడు, ప్రతీ వైఫల్యం ఒక మోసం వల్లనే జరిగిందని భావించే “విశ్వాసరాహిత్య సమాజంగా” మనం తయారయ్యాం.
భయపెడుతున్న గణాంకాలు – నిరాశలో యువత..
2023-24లో 22 సివిల్, డిఫెన్స్ సేవలలోని 7,999 ఉద్యోగాల కోసం మొత్తం 15,08,430 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. అంటే విజయాల శాతం కేవలం 0.5% మాత్రమే. మిగిలిన 99.5% మందికి ప్రతిభ లేదని ఈ వ్యవస్థ తేల్చేస్తోంది.
ఫలితంగా, మన చదువుకున్న యువతలో ఎక్కువ మంది తమ ఆకాంక్షలకు తగ్గ ఉద్యోగాలను పొందలేకపోతున్నారు.
పోటీ పరీక్షల చరిత్ర – మారిన పద్ధతులు, మారని పక్షపాతం..
1854లో మెకాలే, ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారుల నియామకాలలో ఉన్న రికమెండేషన్ల విధానాన్ని రద్దు చేసి, పోటీ పరీక్షల ద్వారా ప్రతిభ ఆధారిత నియామకాలను ప్రవేశపెట్టారు.
అదే సంవత్సరం సివిల్ సర్వీసెస్ కమిషన్(యూపీఎస్సీకి పూర్వరూపం) ఏర్పడింది, మరుసటి సంవత్సరం దాని మొదటి పరీక్ష జరిగింది.
1864లో సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన మొదటి భారతీయుడిగా నిలిచారు.
అయితే, మెకాలే ఒక రకమైన రికమెండేషన్ల విధానానికి స్వస్తి పలికినప్పటికీ, ఇతర రూపాలు మిగిలిపోయాయి, నేటికీ అవి స్పష్టంగా కొనసాగుతున్నాయి.
భారతీయులు లండన్కు వెళ్ళి(1922 వరకు ఉన్న ఏకైక పరీక్షా కేంద్రం) యూరోపియన్ క్లాసిక్స్లో నైపుణ్యం సాధించి పరీక్షలో విజయం సాధించడానికి “స్వేచ్ఛ” ఉండేది.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 1980ల ప్రారంభం వరకు, భారతీయులకు ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే పరీక్ష రాసే “స్వేచ్ఛ” ఉండేది.
ఈ సమయంలో పరీక్షా ప్రశ్నలలో ఒకటి గుర్రపు స్వారీకి సంబంధించిన నిబంధనలపై రావడంతో ఒక చిన్న వివాదం కూడా చెలరేగింది.
ఏ వడపోత విధానం కూడా సంపూర్ణంగా పక్షపాతం లేనిది కాదు. మన పోటీ పరీక్షలను నిష్పాక్షికంగా, పారదర్శకంగా మార్చడానికి ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నాలు కేవలం యాంత్రిక సమస్యను మాత్రమే సరిచేస్తాయి కానీ, నిర్మాణాత్మక సమస్యను కాదు.
చివరకు, వేలాది ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న లక్షల మంది ఆశావహులలో 90% కంటే ఎక్కువ మంది తిరస్కరణకు గురవుతున్నారు.
విజేతకు, మిగిలిన లక్షలాది మంది వైఫల్యానికి మధ్య ఉన్న తేడా బహుశా గుర్రపు స్వారీకి సంబంధించి ఒక్క మార్కు మాత్రమే కావచ్చు.
అలాంటప్పుడు, ఈ ఎంపిక ప్రక్రియ కేవలం వడపోత ప్రక్రియ కాదా? ఇది పాత పద్ధతులనే కొనసాగించేలా లేదా? పైగా, కోచింగ్ కోసం నగరాలకు మారి ఖర్చులను భరించాల్సి రావడంతో, తక్కువ ఆదాయం ఉన్న గ్రామీణ అభ్యర్థులపై ఇది ఎంత అదనపు భారాన్ని మోపుతుందో ఊహించండి.
అర్హతలకు, అకడమిక్ మార్కులకు ముడిపెట్టడం సరైనదేనా?
మనం పోటీ పరీక్షలలో అకడమిక్ అర్హతలకు, ర్యాంకులకు అతిగా ప్రాధాన్యత ఇస్తాము. నిజానికి ఇవేవీ ఒకరిని సమర్థుడైన అధికారిగా మార్చలేవు.
రాకెట్ సైంటిస్ట్ అయినా, ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ అయినా పరీక్షలో ఉత్తీర్ణులయ్యాక ఆ ఉద్యోగానికి ఇద్దరూ సమానంగా శిక్షణ లేనివారే. అందుకే ఉద్యోగానికి ముందు ఇచ్చే విస్తృతమైన శిక్షణ, కెరీర్ పొడవునా ఇచ్చే శిక్షణా రౌండ్లు ముఖ్యమవుతాయి.
“అస్పష్టతలోనే చెడు వర్ధిల్లుతుంది” అన్న జీకే చెస్టర్టన్ మాటను నిజం చేయడం తప్ప, మన సంక్లిష్టమైన ఎంపిక ప్రక్రియ సాధిస్తున్నది ఏమిటి? అన్నిటికంటే మించి, మన యువతకు మెరుగైన ఉద్యోగాలు కల్పించకపోవడమే కాకుండా, వారిలో ఎక్కువ మందికి ప్రతిభ లేదని ముద్ర వేయడం ఎంత అన్యాయం?
ఎంపిక ప్రక్రియ ప్రతిభ గురించేనా? కాదు. ఇది అనర్హులుగా ముద్ర వేసి లక్షలాది మందిని పోటీ నుండి తప్పించాలనే వడపోతకు సంబంధించినది. అలాంటప్పుడు, ఆ కత్తికి కాస్త తేనె పూస్తే తప్పేంటి? మన రెండు దశల ఎంపిక విధానం ఇదే చేస్తుంది: ప్రైమరీ పరీక్ష ద్వారా దిగువన ఉన్న 10% మందిని తొలగిస్తుంది, రెండవ దశ అదృష్టవంతులైన వారిని మిగిలిన వారి నుండి వేరు చేస్తుంది.
ఎంపికా? వడపోతా? – లాటరీ విధానం మెరుగా?
హార్వర్డ్ తత్వవేత్త మైఖేల్ జే శాండెల్, హార్వర్డ్ ప్రొఫెసర్ ఎర్నెస్ట్ ఎఫ్ థాంప్సన్(యేల్ యూనివర్సిటీ అడ్మిషన్ల కమిటీ సభ్యుడు) మాటలను ఉటంకిస్తూ – “మీరు దరఖాస్తులన్నింటినీ మెట్లపై నుంచి కిందకు వెదజల్లి, వాటిలో నుంచి ఒక వెయ్యి దరఖాస్తులను ఏరి తీసుకురావడానికి, కమిటీ మీటింగ్ ద్వారా ఎంపిక చేయడానికి తేడా ఏముంది? నాకైతే ఏం తేడా లేదనిపిస్తుంది” అన్నారు.
పైన పేర్కొన్న 22 కేంద్ర సర్వీసులకే కాకుండా, ఇతర అనేక పోటీ పరీక్షలకు కూడా ఇది వర్తిస్తుంది. ఇంతకన్నా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో దాదాపు అన్ని సీట్లను లాటరీ విధానం ద్వారా భర్తీ చేయవచ్చు.
అయితే నిజమైన ప్రతిభావంతులను ఎన్నుకోవడానికి సాంకేతిక, ప్రత్యేక కోర్సులను లాటరీ విధానం నుండి మినహాయించాలా? అవసరం లేదు. ఇంటర్వ్యూ ప్రక్రియతో కూడిన పోటీ పరీక్షల కంటే(ఇందులో వ్యక్తిగత అభిప్రాయాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది), లాటరీ ద్వారా ఎంపిక చేయడం మరింత సమర్థవంతంగా, వేగంగా, న్యాయబద్ధంగా ఉంటుంది.
సరళమైన, ప్రత్యక్ష పరిష్కారాలను చూసి నవ్వే మన ధోరణే మనకు ఆటంకంగా మారుతుంది. అధికారం, అధికారాల వినియోగం అనేవి కేవలం కొద్దిమంది మాత్రమే మానిప్యులేట్ చేయగల సంక్లిష్టమైన ప్రక్రియల ద్వారా నడుస్తాయి.
విద్యా వ్యాపారీకరణ – ప్రశ్నాపత్రాల లీకేజీలు..
చివరిగా, రెండు అంశాలు మీ దృష్టికి తీసుకురావాలి. విద్యారంగ వ్యాపారీకరణ ఫలితంగానే ప్రశ్నా పత్రాల లీకేజ్ చోటుచేసుకుంటుంది. కోచింగ్ సెంటర్లు తమ అభ్యర్థులకు 100% విజయం అందిస్తామని పోటీ పడుతున్నంత కాలం, మోసాలకు పాల్పడేలా ప్రేరేపించే వాతావరణం ఉంటూనే ఉంటుంది.
ఒక సాంకేతిక లోపాన్ని సరిదిద్దినప్పుడల్లా చట్టాన్ని కఠినతరం చేయడం, కమిటీని ఏర్పాటు చేయడం వంటి చర్యల ద్వారా మనం మళ్లీ మొదటికే వస్తాము. లాటరీ విధానం వ్యాపారీకరణను రద్దు చేయకపోయినా, తగ్గిస్తుంది.
లాటరీ పరిష్కారం: లాటరీ వంటి పరిష్కారాన్ని రేపటి నుండే భారతదేశం అంతటా అమలు చేయాల్సిన అవసరం లేదు.
ఎక్కడో ఒకచోట పాఠశాల ప్రవేశాలతో ఒక ప్రయోగాత్మక ప్రాజెక్టు ప్రారంభించవచ్చు. కానీ ప్రతిభ అనే పీఠం ముందు మనం గుడ్డిగా సాష్టాంగ పడకూడదు. అసలు ప్రతిభ అంటే ఏమిటి? అది అంగారక గ్రహం మీది కలుపు మొక్కలాంటిది.
డీ శ్యామ్ బాబు
(రచయిత సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ లో సీనియర్ ఫెలో. వ్యాసంలోని అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతం)
టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము.
అనువాదం: కే సత్యరంజన్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
