నిరసనలు, ప్రదర్శనలు చేస్తే 500 రూపాయల సుంకం చెల్లించాలని రాయ్పూర్ నగర మున్సిపల్ కార్పోరేషన్ నిర్ణయించింది. ప్రతిపక్ష నేతలు, సామాజిక కార్యకర్తలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిని అప్రజాస్వామిక నిర్ణయంగా, “అసమ్మతిపై ట్యాక్స్”గా అభివర్ణించారు.
న్యూఢిల్లీ: నిరసనలు, ప్రదర్శనలు చేసేవారందరూ అనివార్యంగా రూ 500 సుంకం చెల్లించాలని రాయ్పూర్ నగర మున్సిపల్ కార్పోరేషన్ తీర్మానించింది.
ఈ చర్యను ప్రతిపక్ష నేతలు, విమర్శకులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిని అప్రజాస్వామికమైనదిగా, “అసమ్మతిపై పన్ను”గా అభిర్ణించారు.
నగరంలోని ప్రధాన నిరసన స్థలం, టుటా ధర్నా స్థలంలో కొనసాగుతోన్న మరమ్మత్తుల నేపథ్యంలో ఈ స్థలంలో రెండు నెలలపాటు నిరసనలను నిషేధిస్తూ రాయ్పూర్ కలెక్టర్ గౌరవ్ సింగ్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం నిరసనలు తెలియజేడానికి పౌరులకు నిరసన వేదిక లేకుండా పోయింది. అంతేకాకుండా నిషేధం తొలిగించిన తర్వాత తమ అసమ్మతి తెలియజేయడానికి నిరసనకారులు ఖచ్చితంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ కొత్త సుంకం తీర్మానాన్ని సమర్థిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం సూచనల మీద రూపొందించినట్టుగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేత, మేయర్ మీనాల్ చౌబే తెలియజేశారు.
“నిరసన ప్రదేశాల “పారిశుద్ధ్యం, నిర్వహణ”కు ఈ నిర్ణయం అనివార్యం. అంతేకాకుండా, ఈ అనుమతి విధానంతో ఏ కార్యక్రమానికి “సంబంధించిన పూర్తి సమాచారమైన” పాలనా యంత్రాంగం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది” అని సమర్థించుకున్నారు.
మరోవైపు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఈ నిర్ణయం వల్ల ప్రజలు ఎదుర్కొనే సమస్యల గురించి ప్రభుత్వం దృష్టిని ఆకర్షించడానికి నిరసన తెలిపే అవకాశం లేకుండా పోతుందని, ప్రత్యామ్నాయ స్వరాలు వినిపించే ప్రయత్నాలను నీరుగార్చే లక్ష్యంతో రాయ్పూర్ పాలనా యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకన్నదని ప్రతిపక్ష నాయకులు, సామాజిక కార్యకర్తలు విమర్శించారు.
కార్పోరేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానం ప్రకారం, నిరసన వేదిక లేదా శిబిరం ఏర్పాటుకు ప్రతీ చదరపు అడుగుకు అదనంగా 5 రూపాయల సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
అంతేకాకుండా, తొందరలోనే నిరసన సుంకాన్ని రెండింతలు చేసి 1000 రూపాయలకు పెంచే ఆలోచన కూడా ఉందని అధికారులు సంకేతమిచ్చారు.
