ఒక ఫ్యాక్టరీ, 76 మందికి గాయాలు, చర్యలు సున్నా. ఆటో పరిశ్రమలో కార్మికుల భద్రతా సంక్షోభాన్ని ఎత్తి చూపుతున్న నివేదిక.
“యాజమాన్యం వల్ల గాయపడిన కార్మికుడు ఒక పర్యవసానం కాదు. కేవలం మార్చాల్సిన ఒక అసౌకర్యం మాత్రమే” అని సేఫ్ ఇన్ ఇండియా ఫౌండేషన్ ఎనిమిదవ వార్షిక నివేదిక ‘క్రష్డ్ 2026’ వెల్లడించింది.
భారతదేశపు ఆటోమోటివ్ సరఫరా గొలుసులో ప్రతి సంవత్సరం వేలాది మంది కార్మికులు తీవ్ర గాయాలకు గురవుతున్నారు.
సరైన శిక్షణ లేదా రక్షణ లేకుండా లోపభూయిష్టమైన యంత్రాలను నడపడం వల్ల శరీర భాగాలపై తీవ్రమైన ఒత్తిడి పడటం వలన ఈ గాయాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి.
దీనివల్ల వారు వేళ్లు, చేతులు కోల్పోవడమే కాకుండా, కొన్నిసార్లు మొత్తం జీవనోపాధిని కూడా కోల్పోతున్నారు.
ప్రతి సంవత్సరం ఈ కార్మికులలో చాలామందికి ప్రమాదానికి ముందు తమ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) కార్డులు జారీ చేయబడలేదని తెలుస్తోంది.
దీనివల్ల వారికి అర్హత ఉన్న వైద్య సంరక్షణ, ఆర్థిక పరిహారం అందకుండా పోతోంది.
ఫ్యాక్టరీ సూపర్వైజర్లు, ఆటోమోటివ్ తయారీదారులు, ప్రభుత్వ సంస్థల దృష్టికి ఈ లోపాలను పదేపదే తీసుకువస్తున్నప్పటికీ- ప్రతి సంవత్సరం ఈ వ్యవస్థలో పెద్దగా మార్పులేమీ రావడం లేదు.
సేఫ్ ఇన్ ఇండియా(ఎస్ఐఐ) ఫౌండేషన్ ఎనిమిదవ వార్షిక నివేదిక ‘క్రష్డ్ 2026’, ఈ కొనసాగుతున్న సమస్యను వెలుగులోకి తెచ్చింది.
ఇందులో కార్మికుల సాక్ష్యాలు, బ్రాండ్ – రాష్ట్ర స్థాయి విశ్లేషణలు, ప్రభుత్వ వృత్తిపరమైన భద్రత, ఆరోగ్య నిబంధనల క్షేత్రస్థాయి అమలు వంటివి ఉన్నాయి.
కేవలం 2025లోనే, ఎస్ఐఐ 2,514 మంది గాయపడిన కార్మికులకు సహాయం అందించింది. ఇది సంస్థ కార్యకలాపాలు ప్రారంభించిన తొమ్మిదేళ్లలో ఒకే సంవత్సరంలో అత్యధిక సంఖ్య.
2016 నుంచి హర్యానా, మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్ఐఐ కార్మిక సహాయ కేంద్రాలు 11,000 మందికి పైగా గాయపడిన కార్మికులకు మద్దతుగా నిలిచాయి.
వీరిలో 9,000 మందికి పైగా ఆటోమోటివ్ రంగానికి చెందినవారు. వీరిలో అధిక శాతం మంది వలస కార్మికులు.
యువకులు, యూనియన్లో చేరనివారు, జీవనోపాధి భద్రత లేని కాంట్రాక్టు ఉద్యోగాలలో ఉన్నారని నివేదిక పేర్కొంది.
నిరంతర ఆందోళనలు – భద్రతా సెన్సార్ల ఉల్లంఘన..
“నేను మొదటి రోజు వచ్చినప్పుడు, నా బాస్ నన్ను పని చేయమన్నారు. అందుకే నేను పనిచేశాను. వాళ్ళు నాకు అసలు శిక్షణ ఇవ్వలేదు” అని గాయపడిన కార్మికురాలు జయశ్రీ ఫాడ్ ఎస్ఐఐకి తెలిపారు.
ఆమె స్పందన వేలాది మంది కార్మికుల విస్తృత భావాలను ప్రతిబింబిస్తుంది.
ఒక కార్మికుడు పవర్ ప్రెస్లో లోహపు భాగాన్ని ఉంచుతున్నప్పుడు యంత్రం రెండుసార్లు కొట్టడం అనేది అత్యంత సాధారణంగా గుర్తించిన గాయాలలో ఒకటి.
ఈ “డబుల్ స్ట్రోక్” అనేది వదులుగా ఉన్న పిన్లు, విరిగిన పాడిల్స్ లేదా దెబ్బతిన్న స్ప్రింగ్ల వంటి సులభంగా మరమ్మత్తు చేయగల లోపభూయిష్ట భాగాల నుంచి ఉత్పన్నమవుతుంది.
2016 నుంచి ఎస్ఐఐ ద్వారా నమోదు చేయబడిన అన్ని నలిగిపోయే గాయాలలో ఇది 76 శాతం వాటాను కలిగి ఉంది.
ప్రతి ప్రమాదానికి సగటున రెండు వేళ్లు కోల్పోతున్నారు, ఈ సంఖ్య ఏడు సంవత్సరాల తరబడి ఎలాంటి మార్పు లేదు.
నివేదిక ప్రకారం, దాదాపు 95 శాతం పవర్ ప్రెస్ గాయాలు పనిచేయని భద్రతా సెన్సార్ ఉన్న యంత్రాలపైనే జరిగాయి.
2019 నుంచి ఈ సంఖ్య 91 శాతం, 99 శాతం మధ్య స్థిరంగా హెచ్చుతగ్గులకు లోనవుతోంది. ఇందులో గుర్తించదగిన మెరుగుదల ఏమీ లేదు.
76 శాతం కేసులలో, చట్టం నిర్దేశించిన సాధారణ ప్రక్రియగా కాకుండా, ప్రమాదం జరిగిన తర్వాత లేదా నిర్ణీత ఆడిట్కు ముందు మాత్రమే యంత్ర తనిఖీ జరిగింది.
అంతేకాకుండా, ప్రమాదాలకు ముందు యంత్ర లోపాలను గుర్తించి 84 శాతం మంది కార్మికులు ముందే తెలియజేసినప్పటికీ పట్టించుకోలేదు.
బీహార్కు చెందిన కార్మికుడు సింటు కుమార్ ఎస్ఐఐతో మాట్లాడుతూ, “నేను రాత్రి షిఫ్ట్లో పని చేస్తున్నాను. యంత్రంలోని బటన్ పాడైందని నేను ముందే ఫిర్యాదు చేశాను. కానీ దాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత, రాత్రి 12:10 గంటలకు, ఆ బటన్ అనుకోకుండా నొక్కుకుపోవడంతో నా ఎడమ చూపుడు వేలు తెగిపోయింది” అని చెప్పారు.
దీని వెనుక ఇంకా చాలా ఉంది. ఫ్యాక్టరీ కార్మికుడైన రామ్సింగ్ ఎస్ఐఐతో మాట్లాడుతూ, కార్మికులకు నడపడానికి అర్హత లేని యంత్రాలను తరచుగా వారికి కేటాయిస్తారని చెప్పారు.
ప్రమాదం జరిగిన తర్వాత యాజమాన్యం తరచుగా, “ప్రమాదం జరిగిపోతే జరిగిపోయింది, ఇంకెవరైనా దొరుకుతారు” అని సమాధానం ఇస్తుంటుంది.
ఈ నిర్లక్ష్యం ప్రాథమిక భద్రతా నిబంధనలకు కూడా విస్తరించింది.
సమీప హెచ్చరికల కారణంగా యంత్రాలు ఆగిపోవడం ఉత్పాదకతను తగ్గిస్తుందనే కారణంతో, ఫ్యాక్టరీలు ఉద్దేశపూర్వకంగానే యంత్రాలపై సెన్సార్లను అమర్చడం లేదని కార్మికులు ఎస్ఐఐకి తెలిపారు.
నిర్లక్ష్యం – కాంట్రాక్ట్ ఉద్యోగుల వెతలు..
ఎస్ఐఐలో కార్మిక భద్రతా విభాగాధిపతి వీఎన్ సరోజ, ఫోకస్ గ్రూపులలోని కార్మికులు కూడా ఇలాంటి ధోరణినే నివేదిస్తున్నారని ‘ది వైర్’కు తెలిపారు.
“వారు ఒక లోపాన్ని నివేదించినప్పుడు, వారి మాట వినరు” అని ఆమె అన్నారు. దీనికి కారణం కార్మికులు యువకులుగా, తక్కువ చదువుకున్నవారిగా, వలసదారులుగా, అన్నింటికన్నా ముఖ్యంగా కాంట్రాక్టు కార్మికులుగా ఉండటమేనని ఆమె పేర్కొన్నారు.
“కాంట్రాక్టు కార్మికులుగా ఉండటం వల్ల వారికి స్వేచ్ఛ దాదాపు ఉండదు. ఫ్యాక్టరీతో ప్రత్యక్ష సంబంధం ఉండదు. శిక్షణ అడగడానికి లేదా అసురక్షితమైన పనిని తిరస్కరించడానికి వారికి అర్హత ఉండదు” అని ఆమె అన్నారు.
ఈఎస్ఐసీ నిబంధనల పాటింపుకూ, గాయాల తీవ్రతకూ మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని కూడా ఈ నివేదిక పేర్కొంది. ఈఎస్ఐసీ అనేది ప్రభుత్వం నడిపే ఒక సామాజిక భద్రతా పథకం. ఇది కార్మికులకు ఆరోగ్య సంరక్షణ, వైకల్య పరిహారాన్ని అందిస్తుంది.
కార్మికులు తమ ఇ-పెహచాన్ కార్డులను(ఈఎస్ఐసీ పథకం కింద జారీ చేసే అధికారిక ఆరోగ్య కార్డులు) మొదటి రోజే పొందవలసి ఉంటుంది.
ప్రమాదం జరిగిన తర్వాత మాత్రమే కార్డులు పొందిన వారు, ప్రమాదానికి ముందే కార్డులు పొందిన వారితో పోలిస్తే సగటున ఎక్కువ వేళ్లను కోల్పోయారని నివేదిక పేర్కొంది.
పరిపాలనాపరమైన నిబంధనల ఉల్లంఘనను అనుమతించే యజమానులు అసురక్షిత పని వాతావరణాలను ప్రోత్సహించే అవకాశం ఉందని, ఇది అధిక సంఖ్యలో ప్రమాదాలకు దారితీస్తుందని ఈ నివేదిక తెలియజేస్తున్నది.
ఎస్ఐఐ సీఈఓ సందీప్ సచ్దేవా ఈ అంచనాతో ఏకీభవిస్తున్నారు.
“ఇ-పెహచాన్ కార్డులను తిరస్కరించడానికీ, యంత్రాలలో భద్రతా యంత్రాంగాలు లేకపోవడానికీ ఇదే మూల కారణం” అని ఆయన ‘ది వైర్’కు తెలిపారు.
2025లో, సర్వే చేయబడిన కార్మికులలో కేవలం 5 శాతం మంది మాత్రమే నియామక పత్రాలను అందుకున్నారు. ఇవి కార్మికులందరికీ తప్పనిసరి.
43 శాతం మంది చెల్లింపు సమయంలో జీతం స్లిప్లను అందుకోలేదు.
అదనంగా, జారీ చేయబడిన స్లిప్లలో 92 శాతం మంది తప్పులు ఉన్నాయని నివేదించారు. తరచుగా ఓవర్టైమ్ గంటలను చాలా తక్కువగా చూపించారు.
అణగారిన వర్గాల కార్మికులే అధికం..
గాయపడిన కార్మికులలో అధికశాతం మంది అణగారిన వర్గాలకు చెందినవారే.
ఎస్ఐఐ ఎనిమిదేళ్ల ఈ ఉద్యమంలో గాయపడిన కార్మికుల జనాభా వివరాలు చాలా వరకు స్థిరంగా ఉన్నాయి. వీరిలో చాలామంది తాత్కాలిక, ఒప్పంద ఉద్యోగులు.
హర్యానాలో, గాయపడిన కార్మికులలో సుమారు 59 శాతం మంది బాహ్య కాంట్రాక్టర్ల ద్వారా నియమించబడినవారు. మహారాష్ట్రలో ఈ సంఖ్య దాదాపు 81 శాతం.
కాంట్రాక్ట్ విధానంలో యజమానికి, ఉద్యోగికి చట్టపరంగా నేరుగా ఎలాంటి సంబంధం లేనప్పుడు సామాజిక, చట్టపరమైన రక్షణలను పొందడం అత్యంత కష్టతరం అవుతుంది.
హర్యానాలో ఎస్ఐఐ సహాయం పొందిన గాయపడిన కార్మికులలో సుమారు 85 శాతం మంది అంతర్రాష్ట్ర వలస కార్మికులు. వీరిలో అధికశాతం బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు.
మహారాష్ట్రలో 63 శాతం మంది వలస కార్మికులు. వీరిలో గణనీయమైన సంఖ్యలో మరాఠ్వాడా ప్రాంతానికి చెందిన రాష్ట్రాంతర వలసదారులు ఉన్నారు. ఈ కార్మికులలో దాదాపు ఎవరూ ఏ కార్మిక సంఘంలోనూ సభ్యులుగా లేరు.
రెండు రాష్ట్రాల్లోనూ సుమారు 67 శాతం కార్మికులు చాలా తక్కువ చదువుకున్నవారు. వీరిలో చాలామంది పదవ తరగతి లేదా అంతకంటే తక్కువ వరకు మాత్రమే చదువుకున్నారు.
కార్మికులలో దాదాపు ఐదవ వంతు మందికి ఎలాంటి అధికారిక విద్య లేదు. ఆటోమోటివ్ స్కిల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారం, మెషిన్ ఆపరేటర్లకు కనీసం ఐదవ తరగతి విద్యతో పాటు నాలుగేళ్ల సంబంధిత అనుభవం లేదా ఎనిమిదవ తరగతి విద్యతో పాటు ఒక సంవత్సరం అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
అయితే ఈ నిబంధనలను యాజమాన్యాలు నిత్యం విస్మరిస్తున్నాయి.
విద్యా అర్హతలకు, గాయాల తీవ్రతకు మధ్య ప్రతికూల సంబంధం ఉందని నివేదిక కనుగొంది. అలాగే వేతనాలకు, నలిగిపోయే గాయాల తీవ్రతకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది.
తక్కువ విద్యార్హతలు కలిగిన కార్మికులు ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నారు. నెలకు రూ 8,000 కంటే తక్కువ సంపాదించే కార్మికులు ఒక్కో ప్రమాదంలో సగటున 2.25 వేళ్లను కోల్పోతుండగా, రూ 20,000 కంటే ఎక్కువ సంపాదించేవారు సగటున 1.97 వేళ్లను కోల్పోతున్నారు.
సరైన శిక్షణ లేదా జీతాల పెంపు లేకుండా తక్కువ వేతనం పొందే సహాయకులను మెషిన్ ఆపరేటర్లుగా నియమించడం ఈ విషయంలో ఒక పాత్ర పోషిస్తుందని నివేదిక సూచిస్తుంది.
“ఫ్యాక్టరీ యజమానులు తమ ఉత్పత్తి సజావుగా సాగడానికి ఏదైనా చేస్తారు. ఒకవేళ మెషిన్ ఆపరేటర్ సెలవులో ఉంటే, ఎలాంటి శిక్షణ ఇవ్వకుండా రోజుకు రూ 450లు దినసరి కూలి ఇచ్చి అతనితో ఆ మెషిన్పై పని చేయిస్తారు” అని ఒక కార్మికుడు ఎస్ఐఐకి తెలిపారు.
మహిళా కార్మికులు రోజురోజుకు అసమానమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. పరిమిత ఉపాధి అవకాశాలతో, తమ ఏకైక ఆదాయ వనరుగా ప్రమాదకరమైన, సరిగ్గా పనిచేయని యంత్రాలతో పనిచేయవలసి వస్తోంది.
అదే పనికి, అనుభవానికి పురుషుల కంటే తక్కువ వేతనాలు పొందుతున్నారు. వారి వృత్తిపరమైన పురోగతికి కూడా అవకాశాలు నామమాత్రంగా ఉన్నాయి.
‘అధిక పౌనఃపున్య కర్మాగారాలు’ – ప్రమాదాల కేంద్రాలు..
ఎస్ఐఐ డేటా ప్రకారం, 2018 నుంచి 2025 మధ్య ఫరీదాబాద్లోని ఒక ఫ్యాక్టరీలో 76 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వ భాగస్వాములకు, ఆ ఫ్యాక్టరీ ప్రధానంగా సరఫరా చేసే ఆటోమొబైల్ బ్రాండ్కు వివరాలు పదేపదే తెలియజేసినప్పటికీ ఎలాంటి నివారణ చర్యలు తీసుకోలేదు.
హర్యానాలో కనీసం 34 ఫ్యాక్టరీలలో 15 కంటే ఎక్కువ ప్రమాదాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 2022 నుంచి కనీసం ఆరు ఫ్యాక్టరీలలో 10 కంటే ఎక్కువ ప్రమాదాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యంత అధ్వాన్నంగా పనిచేస్తున్న ఫ్యాక్టరీలో ఒక్క 2025లోనే 15 తీవ్రమైన ప్రమాదాలు నమోదయ్యాయి.
అదనంగా, ఈ రెండు రాష్ట్రాల్లో ఎస్ఐఐ సహాయం పొందిన గాయపడిన కార్మికులలో 98 శాతం మంది ఆరు మ్యాన్పవర్ కాంట్రాక్టర్ ఏజెన్సీల ద్వారా వచ్చినవారే.
2022 నుంచి గాయపడిన కార్మికులలో మారుతి సుజుకి 30.6 శాతం, మహీంద్రా 16.5 శాతం, హోండా 15.7 శాతం, టాటా మోటార్స్ 15.7 శాతం, హీరో 14.8 శాతం, బజాజ్ 4.7 శాతం.
అంతేకాకుండా, 12 లేదా అంతకంటే ఎక్కువ ప్రమాదాలు నమోదైన ఫ్యాక్టరీలలో 41 శాతం ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఉన్నాయి. దీని సభ్యులు అనేక ప్రధాన ఆటోమొబైల్ బ్రాండ్లకు టైర్ వన్, టైర్ టూ విడిభాగాలను సరఫరా చేస్తారు. వీరు స్పష్టంగా బాగా సంపన్నులు.
2019 నుంచి ఎస్ఐఐ పనిచేస్తున్న హర్యానాలో మరింత అర్థవంతమైన ధోరణిని గమనించవచ్చు. గత మూడేళ్లుగా హర్యానాకు చెందిన బ్రాండ్లతో ముడిపడి ఉన్న గాయాలు తగ్గాయి. భద్రతా యంత్రాంగాలు, విధానాలను అంచనా వేసే ఎస్ఐఐ సేఫ్టీనీతి సూచికలో బజాజ్ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది.
మారుతిలో కూడా తగ్గుదల ధోరణి కనిపించగా, హీరో, హోండా కంపెనీలలో 2022 నుంచి ఎటువంటి మార్పు లేదు. “మేము 2022లో సేఫ్టీనీతి నివేదికలను ప్రచురించడం ప్రారంభించినప్పటి నుంచి ఈ పది బ్రాండ్లు తమ భద్రతా విధానాలను మెరుగుపరుచుకున్నాయి. కానీ అమలులో వెనుకబడి ఉన్నాయి” అని సచ్దేవా పేర్కొన్నారు.
సరఫరా గొలుసు ప్రమాదాల త్రైమాసిక ధోరణి గ్రాఫ్లు ఒక కాలానుగుణ నమూనాను వెల్లడిస్తున్నాయి. అధిక ఉత్పత్తి ఒత్తిడి ఉన్న కాలాలతో ఇవి ఏకీభవిస్తున్నాయి.
ఈ కాలానుగుణత “అధిక ప్రమాదం ఉన్న కాలాల్లో లక్షిత ఆడిట్లు, తనిఖీల”కు హామీ ఇస్తుందని, మరింత చురుకైన, డేటా ఆధారిత ప్రభుత్వ జోక్యాలను సాధ్యం చేస్తుందని నివేదిక భావిస్తున్నది. అయినప్పటికీ, ఎనిమిదేళ్లుగా నిరంతరం డేటాను ప్రచురిస్తున్నా కూడా, ఒక్క బ్రాండ్ కూడా ముందస్తు ఆడిట్ కార్యక్రమాన్ని రూపొందించలేదు.
లోతైన సరఫరా గొలుసు – బ్రాండ్ల బాధ్యత లేదా?..
“ఇది తప్పు, దురదృష్టకరం” అని సచ్దేవా అన్నారు. “ఒక బ్రాండ్ తన సొంత ప్లాంట్లను, దాని అతిపెద్ద ప్రత్యక్ష సరఫరాదారులను మాత్రమే చూస్తుంది. దానికి దిగువన, చాలా వరకు నష్టాలు జరిగే చోట నియంత్రణ సంస్థలకు, మార్కెట్లకు, పెట్టుబడిదారులకు కూడా ఒక అంధ ప్రదేశం ఉంటుంది. ఒక నిజమైన ముందడుగు అయిన బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టైనబిలిటీ రిపోర్టింగ్ కూడా కేవలం ఒక బ్రాండ్ కార్యకలాపాలు, దాని అతిపెద్ద ప్రత్యక్ష సరఫరాదారుల గురించి మాత్రమే నివేదిస్తుంది. ఆ సరఫరాదారుల వివరాలు వెల్లడించడం కూడా స్వచ్ఛందమే. పెద్దగా ఒత్తిడి లేకపోవడం, ఎటువంటి వ్యవస్థ లేకపోవడంతో ఆ ఫ్యాక్టరీలను ఆడిట్ చేయడం అటుంచి, కనీసం మ్యాప్ కూడా చేయరు.”
భద్రతా నిబంధనల అమలులో ఖాళీలు..
కార్మికుల పరిస్థితులను లక్ష్యంగా చేసుకున్న నిబంధనల అమలులో అనేక లోపాలను క్రష్డ్ 2026 గుర్తించింది. వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల నియమాలు వారపు పని గంటలను 48కి పరిమితం చేసినప్పటికీ, 2025 నాటికి గాయపడిన కార్మికులలో 72 శాతం మంది చట్టబద్ధంగా అవసరమైన రెట్టింపు రేటు ఓవర్టైమ్ చెల్లింపు లేకుండా వారానికి 60 గంటలకు పైగా పనిచేశారు.
గత సంవత్సరంలో ఆడిట్ జరిగినట్లు నివేదించిన కార్మికులలో 88 శాతం మంది కార్మికులను హాజరు కావడానికి అనుమతించలేదని, 82 శాతం మంది ఆడిటర్లు ఏ కార్మికులతోనూ మాట్లాడలేదని పేర్కొన్నారు.
అంతేకాకుండా, 56 శాతం మందికి ఆడిట్ గురించి అధికారికంగా కూడా తెలియజేయలేదు. యంత్రాలను అకస్మాత్తుగా శుభ్రం చేయడం ప్రారంభించిన తర్వాతే వారు ఆ విషయాన్ని గ్రహించారు.
హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ఎస్ఐఐ నిర్వహించిన సర్వేలో, హర్యానా- మహారాష్ట్రలలో కార్మికులతో సంభాషణతో కూడిన ప్రభుత్వ తనిఖీ జరిగినట్లు ఏ కార్మికుడూ నివేదించలేదని తేలింది.
దీనికి విరుద్ధంగా, కర్ణాటకలో 89 శాతం మంది ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్ లేదా కొనుగోలుదారు తనిఖీలు జరిగినట్లు నివేదించారు. దీనిని బట్టి, కార్మికులను కలుపుకొని పోయే పద్ధతులు అసాధ్యం కాదని, కేవలం గాయాలు అత్యంత తీవ్రంగా ఉండే రాష్ట్రాలలో అవి లోపించాయని స్పష్టమవుతోంది.
అధికారిక సంఖ్య కంటే ఇరవై రెట్లు ఎక్కువ..
అధికారిక గణాంకాలలో అత్యంత స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది.
2023లో, డైరెక్టరేట్ జనరల్ ఫ్యాక్టరీ అడ్వైస్ సర్వీస్ అండ్ లేబర్ ఇన్స్టిట్యూట్స్ హర్యానా రాష్ట్రం మొత్తం మీద 40 ప్రమాదాలను మాత్రమే గుర్తించింది.
ఆ సంవత్సరం హర్యానాలోని మూడు నగరాల్లో ఎస్ఐఐ ఒక్కటే 1,500 మందికి పైగా కార్మికులకు సహాయం చేసింది. వాస్తవ సంఖ్యలు అధికారికంగా అంగీకరించిన దానికంటే దాదాపు 20 రెట్లు ఎక్కువగా ఉంటాయని అంచనా.
తనిఖీ వ్యవస్థ “సులభతరం” వైపు మళ్లిందని సరోజ చెప్పారు. దీనిలో సందర్శనలు ఎక్కువగా ప్రమాదాలు జరిగిన తర్వాత జరుగుతాయి. కర్మాగారాలకు చాలా ముందుగానే తెలియజేయబడుతుంది.
యాజమాన్యం తనిఖీ అధికారులకు చూపించడానికి ఎంచుకున్న దానిపై ఇన్స్పెక్టర్లు ఆధారపడతారు.
“ప్రభుత్వ ఇన్స్పెక్టర్లు తప్పనిసరిగా ఈ కర్మాగారాలకు చేరుకోవడం లేదు. వారు చేరుకున్నప్పుడు వారు కార్మికులతో మాట్లాడరు” అని కూడా ఆమె చెప్పారు.
అధిక ప్రమాదకర కర్మాగారాలను లక్ష్యంగా చేసుకోవడానికి మరింత ఖచ్చితమైన ప్రత్యామ్నాయంగా ఈఎస్ఐసీ శాశ్వత వైకల్య ప్రయోజన డేటాను ఉపయోగించాలని నివేదిక సిఫార్సు చేశారు.
ఏమి చేయవచ్చు?..
నలిగిపోయే ప్రమాదాలను నివారించడానికి తగిన సాంకేతికత, చట్టాలు ఉన్నప్పటికీ, కర్మాగారాలు కార్మికుల సంక్షేమం కంటే లాభాలకే బరితెగించి ప్రాధాన్యత ఇస్తున్నాయి.
ఈ దయనీయమైన వాస్తవికతను మెరుగుపరచడానికి, సరఫరా గొలుసు భద్రతపై ఆటోమొబైల్ బ్రాండ్లు మరింత బాధ్యత వహించాలి.
తాత్కాలిక కార్మికులను కూడా చేర్చి, ఒప్పందపరంగా కట్టుబడి ఉండే కాంట్రాక్టర్ల ప్రవర్తనా నియమావళిని ప్రచురించాలి. అలాగే ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని నివేదిక కోరుతోంది.
“ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాలు వారి సొంత ఫ్యాక్టరీ గేట్ల వద్దే ఆగిపోతాయి” అని సచ్దేవా పేర్కొన్నారు,
“యూనియన్లో భాగం కాని కార్మికులకు వేరే మార్గం లేదు. వారిని నిజంగా చేరుకునే బ్రాండ్ యంత్రాంగం గానీ లేదా రాష్ట్ర యంత్రాంగం గానీ లేకుండా, గాయపడిన కార్మికుడికి ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది” అన్నారు.
బంగ్లాదేశ్లోని రానా ప్లాజా కూలిపోయిన తర్వాత 2,000 ఫ్యాక్టరీలను తనిఖీ చేస్తూ, 200కి పైగా బ్రాండ్లు భద్రతా ఒప్పందంపై సంతకం చేసిన వస్త్ర రంగంతో పోలుస్తూ, ఆటో రంగం కూడా దీనిని చురుకుగా చేయగలదని, “ఒక బ్రాండ్ నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందని” సచ్దేవా చెప్పారు.
ఈ నివేదిక సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్, ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఒక భద్రతా కార్యదళాన్ని ఏర్పాటు చేయాలని సూచిస్తోంది.
ముఖ్యంగా పవర్ ప్రెస్ ఆపరేటర్ల కోసం సమగ్ర శిక్షణా ధ్రువీకరణ పత్రాన్ని అభివృద్ధి చేయాలని సిఫార్సు చేస్తోంది.
ప్రమాదాలు జరగడానికి ముందు కార్మికులను నమోదు చేయడంలో విఫలమైనందుకు యజమానులను బాధ్యులను చేస్తూ, ప్రణాళికలో ఈఎస్ఐసీ డేటాను ఏకీకృతం చేయాలని ఇది కేంద్ర, రాష్ట్ర కార్మిక మంత్రిత్వ శాఖలను కోరుతోంది.
“సురక్షితమైన కర్మాగారాలు అంటే స్థిరమైన నైపుణ్యాలు, నమ్మకమైన అప్టైమ్, ఊహించదగిన నాణ్యత” అని సచ్దేవా చెప్పారు. “వృత్తి నైపుణ్యం, మెరుగైన పని పరిస్థితులు, ఉత్పాదకత ఒక గొలుసు. ఒకదానికొకటి ప్రత్యామ్నాయం కాదు” అంటారు.
అనువాదం: ఆర్. లక్ష్మయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
