శ్రీరామ్ జన్మభూమి ట్రస్ట్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జూన్ 25న ఎనిమిది మందితో పాటు మరికొందరు వ్యక్తులపై అయోధ్యలో ప్రథమ సమాచార నివేదిక(ఎఫ్ఐఆర్) నమోదైంది.
రామ్ శంకర్ యాదవ్, మనీష్ యాదవ్, లవకుశ, ఉమేష్ పాండే, రమాశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, అనుకల్ప్ మిశ్రా, అవినాష్ శుక్లాలపై నేరపూరితమైన కుట్ర, నిధుల దుర్వినియోగం, విశ్వాసఘాతుకం లాంటి ఆరోపణలతో ఈ ప్రాథమిక దర్యాప్తు నివేదిక(ఎఫ్ఐఆర్) నమోదైంది.
శ్రీరామజన్మభూమి ట్రస్ట్ సభ్యుడు కృష్ణ మోహన్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ప్రాథమిక దర్యాప్తు నిర్వహించింది.
ఈ నేపథ్యంలో భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్)లోని సెక్షన్ 306, 316(5), 317(5), 61, 3(5) కింద ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది.
అఖిలేష్ యాదవ్ విమర్శలు – సిట్ దర్యాప్తుపై అనుమానాలు..
ఈ ఎఫ్ఐఆర్పై స్పందిస్తూ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఈ పరిణామం బీజేపీ పరిపాలనలో జరుగుతున్న అన్యాయానికి పెద్ద నిదర్శనమని అన్నారు.
పలుకుబడి లేని వారికి శిక్షలు, పలుకుబడి కలిగిన వారిని కాపాడటం జరుగుతోందని విమర్శించారు.
ప్రత్యేక దర్యాప్తు బృందం పేరుతో అందుబాటులో ఉన్న సాక్ష్యాలన్నింటినీ రూపుమాపడం ఈ ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమని, తద్వారా పెద్ద మనుషులను కాపాడుకోవడానికి ఇది పెద్ద వ్యూహమని ఆయన అన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికను ముందుగా తయారుచేసి తదనుగుణంగా దర్యాప్తు నడిపించారని ఆయన ఆరోపించారు.
రామజన్మభూమి నిర్మాణం విషయంలో చందాల సేకరణను పర్యవేక్షించిన చంపత్ రాయ్ బన్సల్ లాంటి వారిని కాపాడటానికి పన్నిన కుట్రే ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం నాటకమని అఖిలేష్ యాదవ్ అభిప్రాయపడ్డారు.
ఈ ట్రస్ట్ నాయకత్వం ప్రమేయం లేకుండా ఈ స్థాయిలో చోరీ జరగదని ఆయన స్పష్టం చేశారు.
అంత పటిష్టమైన పోలీసు నిఘా, రక్షణ వ్యవస్థల నడుమ ఈ చోరీ జరగడం అసాధారణ ఘటన అని ఆయన అన్నారు.
కఠిన చర్యలు తీసుకోవాలి – వీహెచ్పీ డిమాండ్..
రామజన్మభూమి విరాళాల విషయంలో జరిగిన అవకతవకలు, వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరగాలని విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ జూన్ 24న డిమాండ్ చేశారు. దోషులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందన..
ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు పూర్తయిన తర్వాత సత్యం అదే బయటపడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
రాజకీయ పార్టీలు నిరాధారమైన ఆరోపణలు చేయవద్దని ఆయన సూచించారు.
ఈ విషయంలో దూకుడు పెంచిన ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఆలయ విరాళాల లెక్కింపు ప్రక్రియతో సంబంధం ఉన్న ఎనిమిది మంది నిందితులను గురువారం రాత్రి అయోధ్యలోనే అరెస్ట్ చేసినట్లు సీనియర్ అధికారులు వెల్లడించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
