ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా వ్యవస్థలో క్రియాశీలక భాగస్వామిగా కాకుండా ఒక సానుభూతిపరుడైన న్యాయమూర్తిలా తనను తాను ప్రదర్శించుకోవడానికి ప్రయత్నించడం పాత చిట్కానే.
దేశవ్యాపిత యువజన నిరసనలు ప్రభుత్వం నిర్వహించే వారికి ఇప్పటివరకు అత్యంత తీవ్రమైన రాజకీయ భయాన్ని కలిగించిన తర్వాత, అధికారంలో ఉన్నవారు చేసే కుతంత్రాలు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించవు.
ఈసారి అది సరిపోవడం లేదని రుజువవుతున్నప్పటికీ, వారి పాత ప్రణాళికే మళ్లీ బయటకు వచ్చింది. ఎప్పటిలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి పోలీస్ పాత్రను పోషిస్తుంటే, అమిత్ షా చెడు పోలీస్ పాత్రను అభినయిస్తున్నారు.
ఇక ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ తరచుగా అన్నీ సరైన విషయాలు చెబుతూ, ఆ తర్వాత యథాతథ స్థితిని కొనసాగించే ఒక మంచి న్యాయమూర్తిలా మధ్యలో జోక్యం చేసుకుంటారు. ఈ విధానం మీకు పరిచితంగానే అనిపిస్తోంది కదా?
గత అర్ధ శతాబ్దంలోనే అత్యంత క్రూరమైన అణచివేత అధికార నిర్మాణాన్ని సృష్టించిన సంఘ్ పరివార్ చాలా జాగ్రత్తగా రూపొందించిన ఈ నాటకాన్ని చూసి పాత్రికేయులు, అనుభవజ్ఞులైన రాజకీయ విశ్లేషకులు మళ్లీ మళ్లీ మోసపోతున్నారు.
ప్రధాని ఇమేజ్ రక్షణే మొదటి ప్రాధాన్యత..
మోదీ ఇమేజ్ను కాపాడుకోవడానికి ఈ ‘మంచి పోలీస్-చెడు పోలీస్’ నాటకం చాలా ముఖ్యం. అదెలా ఉంటుందో మనందరికీ తెలిసిందే: ఎన్డీఏ ప్రభుత్వానికి ఏదైనా పెద్ద రాజకీయ సంక్షోభం ఎదురైనప్పుడల్లా, మోదీ ఆ రంగం నుండి మాయమై కొంతకాలం అందుబాటులో లేకుండా పోతారు. ఇక మిగిలిన వ్యవస్థ అంతా ప్రధానమంత్రి ఇమేజ్కు రక్షణ కల్పించడానికి విస్తృతమైన యంత్రాంగాలతో నిమగ్నమవుతుంది.
పెద్ద సంక్షోభాన్ని పరిష్కరించడం కంటే ప్రధానమంత్రి ఇమేజ్ను కాపాడటమే ఎప్పుడూ అత్యంత తక్షణ, అత్యవసరమైన పనిగా ఉంటుంది.
మణిపూర్లో అంతర్యుద్ధం అయినా, సుదీర్ఘంగా సాగిన రైతుల ఆందోళన అయినా, ఆపరేషన్ సింధూర్ అయినా, డోనాల్డ్ ట్రంప్ భారత్పై అత్యధిక సుంకాలను విధించడం అయినా, లేదా భారతదేశం అంతటా మోదీ అసలు రంగును బట్టబయలు చేస్తామని బెదిరిస్తున్న అనేక లక్షల మంది ‘జెన్ జీ'(నవతరం) నిరసనకారులు అయినా- మొదటి ప్రాధాన్యత ఎల్లప్పుడూ ప్రధానమంత్రిని రక్షించడమే.
జంతర్ మంతర్ వద్ద జెన్ జీ నిరసన, ఆ తర్వాత భయంకరమైన పెల్లెట్ తుపాకులను ఉపయోగించడంతో సహా హింసను అత్యంత వినాశకరంగా ఉపయోగించడం మోదీకి ఒక ప్రత్యేకమైన సంక్షోభాన్ని సృష్టించింది. అందుకే మోదీకి రాజకీయంగా ఎటువంటి ఆటంకం కలగకుండా రక్షణ కల్పించడానికి వ్యవస్థ వేగంగా పనిచేయడం ప్రారంభించింది.
షా ఎందుకు మాయమయ్యారు?
సాధారణంగా, వ్యవస్థలోని మిగిలిన భాగం మోదీ ఇమేజ్ను కాపాడే మార్గాలను వెతుకుతున్నప్పుడు, కేవలం మోదీకి మాత్రమే రంగంలో లేకుండా మాయమయ్యే సదుపాయం ఉంటుంది. కానీ విచిత్రంగా ఈసారి, ప్రధానమంత్రి తరఫున సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మాయమయ్యారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన వారాల తర్వాత కూడా ఆయన పార్లమెంటులో తన ముఖం చూపించలేదు.
ఇది చాలా అసాధారణమైనది, ఎందుకంటే గతంలో మోదీ ఇమేజ్ను రక్షించే ప్రచారానికి షా ముందుండి నాయకత్వం వహించేవారు.
మరి ఇప్పుడు అసలు ఏమి జరుగుతున్నది? షా ఎందుకు అందుబాటులో లేకుండా పోయారు? జెన్ జీ ఇచ్చిన షాక్ నంబర్ 1, నంబర్ 2 ఇద్దరినీ లొంగదీసుకుందా? మితిమీరిన హింసను ఉపయోగించి నిరసనలను తప్పుగా నిర్వహించినందుకు హోంమంత్రిపై ప్రధాని అసంతృప్తిగా ఉండవచ్చని అనుభవజ్ఞులైన పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నందున ఈ ప్రశ్నలు ఇంకా సుడిగుండంలా తిరుగుతూనే ఉన్నాయి.
అదంతా నాటకంలో భాగమేనా?
ఇటువంటి అంచనా వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది కూడా ‘మంచి పోలీస్ – చెడు పోలీస్’ నాటకంలో భాగం కావచ్చు. నిరసనలను తాను నిర్వహించిన తీరుపై ప్రధాని కోపంగా ఉన్నారనే పుకార్లను షా వ్యాపించనిస్తూ ఉండవచ్చు.
పార్లమెంటుకు హాజరుకాకపోవడం ద్వారా, మోదీ ఇమేజ్ను రక్షించడం కోసం షా తన తప్పు ఉన్నట్లు భావన కలిగిస్తూ ఉండవచ్చు.
ఏమైనా ప్రధానమంత్రి ఇమేజ్ను మెరుగుపరచడం అత్యంత ముఖ్యమైనది అని గుర్తుంచుకోండి. ఈ నిబంధనను ఒక్క క్షణం కూడా మరచిపోవద్దు. కాబట్టి షా చర్యలను ఈ కోణంలో అర్థం చేసుకోవచ్చు తప్ప, ఆయనకు ప్రధానికి మధ్య ఏదో తీవ్రమైన విభేదాలు వచ్చాయని ముగింపుకు రాకూడదు. సంక్షోభం స్వభావాన్ని బట్టి ఈ ‘మంచి పోలీస్-చెడు పోలీస్’ ఆటలో సృజనాత్మక మార్పులు ఉండవచ్చు.
ఈ సంక్షోభం మోదీ ఎదుర్కొన్న ఏ సంక్షోభం కంటే కూడా చాలా పెద్దది కావచ్చు. అందుకే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఈ నాటకంలో చేరారు.
సంఘ్ పరివార్ కఠినంగా నియంత్రిస్తున్న అత్యంత అవినీతిమయమైన, స్వార్థపూరితమైన వ్యవస్థపై విసిగిపోయిన యువత పట్ల అవగాహన, ప్రేమను చూపాలని ప్రపంచాన్ని కోరుతూ, ఆయన తటస్థ న్యాయమూర్తిగా, జెన్ జీ కి పెద్ద సానుభూతిపరుడిగా నటిస్తున్నారు.
విద్యా వ్యవస్థ ధ్వంసం వెనుక ఉన్నది ఎవరు?
విద్యారంగంపై విద్యార్థుల ఫిర్యాదులను అత్యవసరంగా పరిష్కరించాలని భగవత్ పిలుపునివ్వడం పూర్తిగా కపటత్వమే. ఎందుకంటే విద్యను మోదీ దాదాపుగా ఆర్ఎస్ఎస్కు అవుట్సోర్స్ చేశారు.
భగవత్ ఇక్కడ తనకేమీ సంబంధం లేని బయటి వ్యక్తిలా నటించలేరు. ఆయనను నేరుగా బాధ్యుడిని చేయాలి. ప్రస్తుత పాలన ద్వారా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వంటి అగ్రగామి, ఉన్నతమైన సంస్థ ఏ విధంగా ధ్వంసమైందో చెప్పడానికి ఆ ఒక్క ఉదాహరణ సరిపోతుంది.
‘గురు దక్షిణ’ ముసుగులో వందల కోట్ల నిధులు..
ఏది ఏమైనప్పటికీ, ఓఎన్జీసీ వంటి భారీ నిధులున్న ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అనేక ఆర్ఎస్ఎస్ మద్దతు ఉన్న సంస్థలు వందల కోట్ల సీఎస్ఆర్ నిధులను పొందుతున్నందున భగవత్ తటస్థ న్యాయమూర్తిగా వ్యవహరించలేరు.
కొన్ని దశాబ్దాల క్రితం కుటుంబాల నుండి విరాళంగా స్వల్ప “గురు దక్షిణ” స్వీకరించే ఆచారాల గురించి ఆర్ఎస్ఎస్ నాయకులు గర్వంగా మాట్లాడతారు. ఆ కాలం చెల్లిపోయింది.
ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అధికారంలో ఉంది. కోట్లాది రూపాయల విరాళాలను సంపాదిస్తున్నది. కాబట్టి అణచివేత ప్రభుత్వం, పౌర సమాజం మధ్య నిజాయితీ గల మధ్యవర్తిగా వ్యవహరించే స్థితిలో భగవత్ లేరు. తాము ఎల్లప్పుడూ “సమాజ్” కోసం పని చేశామని, “అధికారం” కోసం కాదని ఆర్ఎస్ఎస్ తరచుగా చేసే ప్రకటనలు ఈరోజు పూర్తిగా నిరర్థకంగా అనిపిస్తున్నాయి.
2024 లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రానప్పుడు, ప్రచారంలో అత్యంత విభజనపూరితమైన ప్రసంగాలను ఉపయోగించినట్లు రూఢి అయిన తర్వాత భగవత్ మోదీని పరోక్షంగా విమర్శించడానికి ప్రయత్నించిన విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి.
ప్రతిపక్షాలను శత్రువులుగా చూడకూడదని కూడా ఆయన అన్నారు. ఈ వారం మొదట్లో, కేవలం ప్రసంగాలు ఇస్తూ ఎన్నికల్లో గెలవడం వల్లనే ఎవరూ నిజమైన నాయకుడు కాలేరని భగవత్ తీవ్రమైన వ్యాఖ్య చేశారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎప్పటికప్పుడు సరైన మాటలే చెబుతున్నారు. కానీ ఇది ఈ కపటమైన, అణచివేత పాలన వైఖరిలో లేదా ప్రవర్తనలో ఎటువంటి మార్పును తీసుకొని రాలేదు.
మంచి పోలీస్, చెడు పోలీస్, “సానుభూతిపరుడైన” న్యాయమూర్తి మధ్య ఉన్న ఈ విస్తృతమైన, కుట్రపూరితమైన సంబంధంలో ఆర్ఎస్ఎస్ పూర్తిగా భాగస్వామిగా ఉంది. జెన్ జీ కూడా దీనిని పూర్తిగా అర్థం చేసుకుంది.
(ఎంకే వేణు ది వైర్ ఇంగ్లీష్లో రాసిన వ్యాసానికి తెలుగు అనువాదం.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
