ప్రజలందరినీ ఎప్పుడూ మోసం చేయగలరా? బిలియన్నర జనాభా ఉన్న దేశాన్ని శాశ్వతంగా ఒక శవంలా ఈడ్చుకెళ్లగలరా? అది సాధ్యం కాదు. బొద్దింకలు బయటకు వచ్చాయి.
ఏళ్ల తరబడి తర్వాత మొదటిసారిగా, భారతీయుడు అనిపించుకోవడం ఎంతో అద్భుతంగా అనిపిస్తోంది.
ఆశలు పూర్తిగా వదులుకున్న సమయంలో వారు వచ్చారు. వర్షంలో ప్రయాణిస్తూ వచ్చిన యువ బొద్దింకలు.
ఒక న్యాయమూర్తికి, ఒక అపహాస్యానికి మధ్య జరిగిన అపవిత్ర కలయిక సంతతి వీళ్ళు.
మనందరికీ ఈ కథ తెలుసు, కానీ రికార్డు కోసం ఇక్కడ మళ్లీ చెప్పుకుందాం. ఒక అహంకారపూరితమైన వ్యాఖ్యకు స్పందనగా, కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది.
దీప్కే బొద్దింకలకు నాదస్వరం ఊదే ‘పైడ్ పైపర్’లా మారాడు. అవినీతి, కుళ్లిపోయిన మంత్రిత్వ శాఖకు నేతృత్వం వహిస్తూ, క్రమం తప్పకుండా ప్రభుత్వ పరీక్షల పేపర్లు లీక్ అవుతున్నందుకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది వారి మొదటి డిమాండ్.
ప్రతిపక్షాల సమాచారం మేరకు 2014 నుంచి ఇప్పటివరకు సుమారు 152 పేపర్లు లీక్ అయ్యాయి.
ఈ లీకేజీలు ప్రవేశ పరీక్షల కోసం ఏళ్ల తరబడి సిద్ధమైన లక్షలాది మంది యువకుల జీవితాలను నాశనం చేశాయి.
వీరిలో కొందరి తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం, పరీక్ష ఫీజు చెల్లించడానికి తమ భూములను లేదా ఇళ్లను విక్రయించాల్సి వచ్చింది.
ఇది చట్టబద్ధమైన దోపిడీ కొత్త రూపం. ఇటీవల జరిగిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) పేపర్ లీక్ తర్వాత, మనస్తాపానికి గురైన 12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని మరణించారు.
జంతర్ మంతర్ నిరసనలు – నిరాహార దీక్షలు..
బొద్దింకల ఆగ్రహం ఆన్లైన్ సునామీగా మారడంతో, దీప్కే జూన్ 6న బాస్టన్ నుంచి తిరిగి వచ్చి విమానాశ్రయం నుంచి నేరుగా ఢిల్లీలోని ప్రసిద్ధ నిరసన వేదిక జంతర్ మంతర్కు వెళ్లాడు.
లడఖ్కు చెందిన ప్రముఖ కార్యకర్త, విద్యా సంస్కర్త సోనమ్ వాంగ్చుక్ అతనితో చేయి కలిపాడు. నిరవధిక నిరాహార దీక్ష ప్రకటించారు.
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (లిబరేషన్) విద్యార్థి విభాగమైన ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ)కు చెందిన ఆరుగురు విశ్వవిద్యాలయ విద్యార్థులు — నేహా బోరా, మనీష్ కుమార్, ఆమీన్ అమితోష్, దానిష్ అలీ, హృషికేష్, దీపక్ — తాము కూడా నిరాహారదీక్షకు సిద్ధమని ప్రకటించి వాంగ్చుక్కు సంఘీభావంగా నిలిచారు.
ఇతర నగరాల్లోనూ నిరసనలు మొదలయ్యాయి. నిరాహార దీక్షలో ఉన్నవారి పరిస్థితి విషమించడంతో, ఇంటర్నెట్ను ముంచెత్తిన యువ బొద్దింకలు ఈ సారి ఏకంగా జంతర్ మంతర్ వద్దకు రావడం ప్రారంభించారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే రోజైన జూలై 20న పార్లమెంట్ ముట్టడి (మార్చ్) చేపడతామని కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించింది.
ప్రణాళికాబద్ధమైన మార్చ్కు రెండు రోజుల ముందు, సోనమ్ వాంగ్చుక్ను పోలీసులు వేదికపై నుంచి లాక్కెళ్లి, మొదట ప్రభుత్వ ఆసుపత్రిలో, తరువాత ఆయన భార్య పట్టుబట్టడంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నిర్బంధించారు. ఆయన ఇప్పటికీ నిరాహార దీక్షలోనే ఉన్నారు. పార్లమెంట్ మార్చ్ జరిగిన జూలై 20 ఉదయం, ఏఐఎస్ఏ విద్యార్థులు తమ దీక్షను విరమించారు.
ఢిల్లీని ముంచెత్తిన యువ సునామీ..
బొద్దింకలు రాజధాని నగరాన్ని తుఫానులా చుట్టుముట్టాయి. రైలు, బస్సు, విమానం, మెట్రో ద్వారా గంటగంటకూ వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది.
ఢిల్లీ వర్షాకాలపు ఆకాశాన్ని సూర్యకిరణాలు తాకడానికి కొన్ని గంటల ముందే, పదివేల సంఖ్యలో వారు జంతర్ మంతర్ వద్దకు చేరుకోవడం ప్రారంభించారు.
సూర్యోదయ సమయానికి, తమ భవిష్యత్తు కళ్లముందే తుడిచిపెట్టుకుపోవడంతో నిరాశ, తీవ్ర ఆగ్రహాలకు గురైన యువతరం తమ తల్లిదండ్రులు, తాతల తరాలు వదులుకున్న దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోబోతోందని స్పష్టమైంది: ఈ నిరసనకారులు నిష్కల్మషమైన ధైర్యం, ప్రాప్తకాలజ్ఞత, హాస్యచతురతతో మనందరిలో భాగమైపోయిన విషపూరితమైన భయాన్ని తరిమికొట్టారు.
రోజు ముగిసేసరికి, నిరసనకారులు లేదా వారి నాయకులు డిమాండ్ చేస్తున్న దానికంటే చాలా పెద్ద విషయంగా ఈ నిరసన మారిందని స్పష్టమైంది.
ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు చిన్న విషయం. అసలు పందెం చాలా పెద్దది.
పై నుంచి కింద వరకు ఉన్న మొత్తం పాలనా వ్యవస్థలోని కుళ్లు స్పష్టంగా కనిపిస్తోంది. కుళ్లిపోతున్న శవంలా కంపు కొడుతోంది.
చివరికి ఏడేళ్లు ఎనిమిదేళ్ల వయస్సు ఉన్న చిన్న బొద్దింకలు కూడా దీనిని స్పష్టంగా చెప్పగలిగాయి.
నిరసనల అణచివేతకు కుట్రలు – ఐక్యత..
మార్చ్కు కొద్ది రోజుల ముందు వేగంగా, రహస్యంగా కొత్త పోలీసు చీఫ్ను నియమించినప్పటికీ, మన కేంద్ర హోంమంత్రి భయంకరమైన సామర్థ్యం గురించి ఆందోళనకరమైన గుసగుసలు ఉన్నప్పటికీ, జూలై 20న ఢిల్లీని ముంచెత్తిన సునామీ తీవ్రతను పోలీసులు, హోం మంత్రిత్వ శాఖ రెండూ అంచనా వేయడంలో పూర్తిగా విఫలమయ్యాయి. వారు దీన్ని నిలువరించడానికి అన్ని విధాలా ప్రయత్నించారు.
బస్సులు, రోడ్లు, మెట్రో స్టేషన్లను దిగ్బంధించారు. అవేమీ పనిచేయలేదు. ఇంటర్నెట్ను జామ్ చేయడానికి ప్రయత్నించారు.
కానీ ఇంటర్నెట్ జీవులైన యువ బొద్దింకలు ఒకేసారి నవ్వించే, ఏడిపించే మీమ్స్, వీడియోల ప్రవాహంతో ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టాయి.
ప్రపంచంలోనే అన్ని చోట్ల కంటే ఢిల్లీలో, ఈ నిరసనలో పాల్గొన్న యువతులు తాము గుంపులో సురక్షితంగా ఉన్నామని చెప్పారు – పోలీసులు తమను అసభ్యంగా తాకారనే కొందరి ఫిర్యాదులు ఉన్నప్పటికీ. పోలీసులు ఎదుర్కొంటున్నప్పుడు ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, ప్రతి కులానికి, వర్గానికి చెందిన ప్రజలు ఒకటవుతూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, రక్షణగా నిలవడం మనం చూశాం.
మనకు ఉపన్యాసాలు ఇవ్వడానికి బదులుగా, లేదా గొప్ప ప్రసంగాలు దంచడానికి బదులుగా, వారు మనం కలలు కంటున్న సుందరమైన, సుసాధ్యమయ్యే భారతాన్ని మనకు రూపుకట్టి చూపించారు.
ప్రభుత్వ బలప్రయోగం – అణచివేత చర్యలు..
ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి, పోలీసులు తమ పసుపు రంగు లోహపు బారికేడ్లను వెల్డింగ్ చేసి, తమ పాత ట్రిక్కులకు పని పెట్టారు.
రాళ్లతో నిండిన ట్రక్కులు, ముందే దెబ్బతిన్న వాహనాలు, విద్యార్థులే హింసకు పాల్పడ్డారని, పోలీసులు ఆత్మరక్షణ కోసమే చర్యలు తీసుకున్నారని చిత్రీకరించడానికి ప్రయత్నించారు.
లాఠీలు, కర్రలతో ఆయుధాలు ధరించిన సాదాసీదా దుస్తుల గూండాల సైన్యాన్ని రంగంలోకి దించారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) తమ యూనిఫారమ్ల నుంచి నేమ్ట్యాగ్లను తొలగించింది.
విశ్వసనీయమైన మెయిన్స్ట్రీమ్ టీవీ ఛానెళ్లు అబద్ధాలను రిపోర్ట్ చేయడానికి సిద్ధంగా వరుసలో నిలబడ్డాయి. (కొన్ని ఛానెళ్లు తొందరపడి ఇంకా జరగని విషయాలను కూడా రిపోర్ట్ చేయడం ప్రారంభించాయి. భారతదేశంలో వార్తలు ప్రస్తుతాని కంటే భవిష్యత్తు గురించి ఎక్కువ ఉంటాయి).
పోరాట పటిమ – పాలకుల భయం..
ఏదీ పనిచేయలేదు. పోలీసులు, ఆర్ఏఎఫ్ తమ లాఠీలను విచక్షణారహితంగా ఝుళిపించి, పిల్లల తలలు పగలగొట్టారు, కాళ్లు చేతులు విరగ్గొట్టారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు.
కానీ యువత ముందుకు సాగుతూనే ఉన్నారు. నేరుగా పార్లమెంట్ వైపు.
తాము వెళ్తామని చెప్పిన ప్రదేశానికే నేరుగా వెళ్లారు. వారు సమీపిస్తుండగా, భద్రతా దళాలు నిరాయుధులైన విద్యార్థులపై తమ ఏకే 47 తుపాకులను గురిపెట్టి పొజిషన్ తీసుకున్నాయి.
అయినా బొద్దింకలు కవాతు చేస్తూనే ఉన్నాయి.
వారు ముందుకు సాగుతుండగా, ప్రభుత్వం ఇనుప పిడికిలిని కప్పి ఉంచిన వెల్వెట్ తొడుగు రాలిపోయి, ప్రస్తుత పాలన ఏమిటో, అది ఎప్పుడూ ఎలా వ్యవహరిస్తుందో బట్టబయలయిపోయింది.
పాలకుల పలాయనవాదం..
కవాతు చేసేవారు సమీపిస్తున్న కొద్దీ, మన ధైర్యవంతుడు, గొప్పలు చెప్పుకునే ప్రధానిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
రాజ్యాంగాన్ని రోజూ దెబ్బతీయడమే ప్రధాన ఉద్దేశంగా కనిపించే కొత్త ‘సంవిధాన్ సంసద్’ భవనం నుంచి పార్లమెంట్ సభ్యులు బయటకు రాకుండా లోపలే బంధించారు.
రాత్రికి పోలీసులు నిరసన వేదిక వద్ద ఉన్న ప్రధాన స్టేజ్ను విరగ్గొట్టారు. రాత్రికి రాత్రే ప్రజలు దానిని మళ్లీ స్వాధీనం చేసుకున్నారు. రాత్రికి పోలీసులు వెనక్కి తగ్గుతుండగా, బొద్దింకలు నిలబడి చప్పట్లు చరిచి వారికి నీరాజనాలు అర్పించాయి. దేనికి, పిల్లలను కొట్టినందుకా? వాహ్ మోదీ జీ! వాహ్!
చారిత్రక ఉద్యమాల పోలిక – ఆశాజనక దృక్పథం..
దీని నుంచి పెద్ద రాజకీయ మార్పు వస్తుందని ఆశించడం మూర్ఖత్వం. కానీ దీనిని ఒక చిన్న క్షణికమైన విషయంగా కొట్టిపారేయడం కూడా మూర్ఖత్వమే అవుతుంది.
విదేశీ నిధులు, సీఐఏ కుట్రల గురించి లైవ్-స్ట్రీమింగ్ టీవీ ఛానెళ్లు, ప్రసారాలు పుకార్లు, కుట్ర సిద్ధాంతాలతో ఊగిపోవడంలో ఆశ్చర్యం లేదు.
ఒక గర్వకారణమైన ‘ఆందోళనజీవి’గా (నాలాంటి వారిని అవమానించడానికి మోదీ ఉపయోగించిన పేరు) మాట్లాడుతున్నాను, ఇదంతా ప్రారంభమైనప్పుడు నేను కూడా అనుమానించానని ఒప్పుకుంటున్నాను.
మనం మరో అన్నా హజారే ఉద్యమం వైపు వెళ్తున్నామేమో అని భయపడ్డాను — 2011 నాటి ఆ అవినీతి వ్యతిరేక ప్రజల ఉద్యమం, దాని ప్రారంభ ఉద్దేశాలు ఏవైనప్పటికీ, చివరికి ఈ దేశంలోని ప్రతి వ్యవస్థను నాశనం చేసిన ఒక రాజకీయ పార్టీ మనల్ని మూడు పర్యాయాలు పాలించేలా చేసింది.
ఆ పార్టీ తన్ను తాను ఒక రాజకీయ పార్టీగా, భారత ప్రభుత్వంగా వేర్వేరుగా చూడదు, దేశాన్ని గానీ దాని పౌరులను గానీ గౌరవించదు, అంతర్జాతీయంగా మనల్ని సిగ్గుపడేలా చేసి భారతదేశాన్ని మోకాళ్లపై నిలబెట్టింది.
సామాజిక వాస్తవికత – నిష్పక్షపాత వైఖరి..
కానీ కాక్రోచ్ జనతా పార్టీపై మెయిన్స్ట్రీమ్ మీడియా చూపిస్తున్న శత్రుత్వాన్ని చూసినప్పుడు నా అనుమానాలు పటాపంచలయ్యాయి.
నాకది తొలి, అత్యంత ఆశాజనకమైన సంకేతం. అభిజీత్ దీప్కే ఒక దళిత వర్గానికి చెందినవాడు కావడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది, దానికంటే ఎక్కువ సంతోషం ఏమిటంటే ఎవరూ ఆ విషయంపై దృష్టి పెట్టకపోవడం.
“నా పేరు ఖలీద్ అయి ఉంటే, లేదా నేను ముస్లిం అయి ఉంటే, నేను ఇప్పటికీ జైలులో ఉండేవాడిని” అని అతను చెప్పడం విన్నప్పుడు అతని మీద నా అభిప్రాయం మరింత దృఢపడింది. భారతదేశంలో విషయాలు నిజానికి ఎలా నడుస్తున్నాయో — మన దేశంలో ప్రతిదీ(ముఖ్యంగా చట్టం) అందరికీ సమానంగా వర్తించదనే సత్యాన్ని — ఆ అసభ్యతను బహిర్గతం చేసే ధైర్యం అతనికి ఉంది.
ప్రతిదీ మీ మతం, కులం, వర్గం, జాతి, లింగ భేదంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.
ఇది చాలా సరళంగా చెప్పబడిన ఒక లోతైన పరిశీలన.
“హిందూ వ్యతిరేకత” వస్తుందేమోననే భయంతో ప్రతిపక్ష నాయకులు కూడా “ముస్లిం” అనడానికి బదులుగా “మైనారిటీ వర్గం” అని మాత్రమే అంటున్న సమయంలో, దీప్కే దీనిని బహిరంగంగా చెప్పడం నన్ను వెంటనే జంతర్ మంతర్ వైపు నడిపించింది.
దీప్కే “ఖలీద్” పేరును ఎంచుకున్నప్పుడు, జేఎన్యూ స్కాలర్ ఉమర్ ఖలీద్ గురించి మాట్లాడి ఉండవచ్చని నేను ఊహించాను.
ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్ తదితరులతో కలిసి దాదాపు ఆరేళ్లుగా విచారణ లేకుండా జైలులో ఉన్నారు. ఉమర్ చేసిన నేరం ఏమిటి?
2020లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల సమయంలో, హిందూ గూండాలు ప్రేరేపించిన దహనకాండలు, హత్యలు, మసీదుల దహనంతో ఢిల్లీ వణికిపోతున్నప్పటికీ, నిరసనకారులను అహింసను పాటించాలని కోరడమే అతను చేసిన నేరం.
నిజానికి ఆ మత హింస పట్ల పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు, కొన్నిసార్లు సహకరించారు కూడా.
తప్పును సరిదిద్దడానికి, న్యాయబద్ధంగా వ్యవహరించడానికి కూడా ధైర్యం సరిపోనట్లుగా కనిపిస్తున్న న్యాయమూర్తులు బెయిల్ కోసం చేసిన ప్రతి అభ్యర్థనను తిరస్కరించారు.
అణచివేత భయాలు – రాజకీయ నిశ్శబ్దం..
బొద్దింకలు కవాతు చేస్తున్నప్పుడు, వారి సంఖ్య పెరుగుతున్న కొద్దీ, నేను ఆలోచించడం మొదలుపెట్టాను: అదృష్టవశాత్తూ వీరిలో ఎక్కువమంది ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, ఆదివాసీలు కారు. అయి ఉంటే వారిని తొక్కేసేవారు, చంపేవారు, కాల్చివేసేవారు, జైలులో పెట్టేవారు.
దేవుడి దయ వల్ల వారు కశ్మీరీలు కారు. అయి ఉంటే వారికి గుడ్డితనం వచ్చేది (కొందరికి పెల్లెట్ తరహా గాయాలు అయినప్పటికీ). మంచిదే, వారిలో ఎక్కువమంది హిందువులు. భారతదేశంలో ఈ క్షణం ఎంత దయనీయంగా ఉందో ఇది సూచిస్తుంది.
అయితే, నిమిషంలో పరిస్థితులు మారవచ్చు. మనం పరిస్థితులు పక్వమవుతున్న దశలో ఉన్నాం. ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది పారామిలటరీ బలగాలను విమానాల్లో రప్పిస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఏమవుతుందో మనకు తెలియదు.
ఇదంతా మనల్ని ఎక్కడికి తీసుకెళుతుంది? వందలాది కార్పొరేట్ టీవీ ఛానెళ్లలో వారాల తరబడి తీవ్ర ప్రచారం పొందిన అన్నా హజారే ఉద్యమంలా కాకుండా, కాక్రోచ్ జనతా పార్టీకి తనూ, ఇంటర్నెట్ మాత్రమే ఆధారాలు.
అన్నా ఉద్యమంలోకి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చొరబడి దానిని స్వాధీనం చేసుకుంది; మోదీ నేతృత్వంలోని బీజేపీ గేట్ల వద్ద కాచుకుని కూర్చుని టీవీల ద్వారా వచ్చిన ఉద్యమాన్ని ఎన్నికల్లో ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉంది. కానీ బొద్దింకలు లేవనెత్తిన అంశాలను ముందుకు తీసుకెళ్లడానికి ఏ వ్యవస్థీకృత ప్రతిపక్ష పార్టీలు లేవు.
మనం చూస్తున్న ఈ స్వచ్ఛంద ఆగ్రహం ఏదైనా నిజమైన రాజకీయ కృషి జరిగితే తప్ప చల్లారిపోతుంది. పెద్దలు, ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ స్వార్థాలను, చిన్న చిన్న గొడవలను ఆపి కొంత ఐక్యతను ప్రదర్శించాలి.
ఇది జరిగే అవకాశం లేదని ప్రభుత్వానికి తెలుసు. వేచి చూడటమే తను చేయాల్సిన పని అని భావించడం వల్ల ప్రభుత్వం ఏమాత్రం చలించడం లేదు. ప్రభుత్వాలకు వేచి చూసే శక్తి ఉంటుంది. ప్రజలకు ఉండదు.
దేశవ్యాప్త అసంతృప్తి – ప్రజా సమస్యలు..
ఈ క్షణంలో బొద్దింకల తిరుగుబాటు భారతదేశం అంతటా జరుగుతున్న అనేక నిరసనలలో ఒకటి మాత్రమే. మధ్యప్రదేశ్లోని ఆదివాసీలు కేన్-బెట్వా నదుల అనుసంధానం ప్రాజెక్టును నిరసిస్తున్నారు.
ఉత్తరాఖండ్లోని గ్రామస్థులు భారీగా చెట్లను నరకడాన్ని నిరసిస్తున్నారు. గ్రేటర్ నికోబార్ దీవుల పర్యావరణ వినాశనాన్ని ప్రజలు నిరసిస్తున్నారు.
మణిపూర్ మండిపోతోంది. ఉద్యోగాలు మాయమవుతున్నాయి. ధరలు మండిపోతున్నాయి. ఆగ్రహం పెరుగుతోంది.
బీజేపీ-ఆర్ఎస్ఎస్ల ‘దేవుడి’ ఆట మొదటి నుంచి ఉన్నట్లే బయటపడుతోంది. ఒక మోసం. గ్యాంగ్స్టర్లు నడిపే బంగారం దోపిడీ.
అయోధ్యలోని రామ్ మందిర్ దోపిడీ మన కళ్లముందు ఒక చెడు బాలీవుడ్ స్క్రిప్ట్లా నడుస్తోంది: పేదలు, అమాయకుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని విలాసవంతమైన బాబాలు, అవినీతి రాజకీయ నాయకులు హోటళ్లు నిర్మించడం, రియల్ ఎస్టేట్ కూడబెట్టడం, ఎస్యూవీలలో తిరగడం చేస్తున్నారు. అవినీతి, పగటిపూట దోపిడీల మూలాలు నేరుగా అగ్రస్థానం వరకు విస్తరించాయి.
చారిత్రక నేపథ్యం – హక్కుల పోరాటం..
కాక్రోచ్ శక్తులు మనల్ని ఈ గోతి నుంచి బయటపడేయగలవా? అది అంత సులభం కాదు. భారతదేశంలో ప్రజల ఉద్యమాల ఫలితాలను ఒక్కసారి చూస్తే ఆ ఆశలు కలగవు. ఇది కృశించిన ఆశయాలు, భగ్నమైన కలల చరిత్ర. అరవైలు, డెబ్బైలలో నక్సలైట్ల సాయుధ తిరుగుబాటుతో సహా వివిధ ఉద్యమాలు రైతులకు సంపద, భూమి పంపిణీ డిమాండ్ చేశాయి. అవి అణచివేయబడ్డాయి. ఎనభైలు, తొంబైలలో సామాజిక ఉద్యమాలు నమ్రతగా మారాయి.
నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్(ఉపాధి హామీ పథకం) వచ్చినందుకు కృతజ్ఞతతో సరిపెట్టుకున్నాయి. కనీస వేతనంతో మూడు నెలల ఉపాధి పొందే హక్కు— ఈ మొత్తంతో నగరంలోని ఒక ఖరీదైన రెస్టారెంట్లో ఒక పూట మంచి భోజనం మాత్రమే వస్తుంది. దానిని కూడా ఈ పాలన భ్రష్టు పట్టిస్తుంది. దానికి బదులుగా బ్రతకడానికి సరిపడే రేషన్ సంచులపై మోదీ ముఖం ముద్రించి, కదులుతున్న కార్లలో నుంచి భిక్షగాళ్లకు భిక్షం వేసినట్లు, కృతజ్ఞత కోసం, ఓట్ల కోసం ప్రజలపై విసిరేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుండటంతో ఇది కూడా ప్రమాదంలో పడింది.
పౌరసత్వ చట్టాలు – ప్రజా ఆందోళన..
ఈ రోజు, 2026లో, మనం ఓటు వేసే హక్కు, మన పౌరసత్వం కోసం పోరాడే స్థితికి దిగజారిపోయాం. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్(ఎన్ఆర్సీ)తో కూడిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సీఏఏ) అనేది నాజీ జర్మనీ 1935 న్యూరెంబర్గ్ చట్టాల హిందూ రాష్ట్ర రూపాంతరం.
దాని ద్వారా జర్మన్ పౌరులకు వారి “వంశపారంపర్య పత్రాల” ఆధారంగా థర్డ్ రీచ్ పౌరసత్వాన్ని మంజూరు చేసింది. (భారతదేశంలో ఎంతమంది వద్ద ఈ పత్రాలు ఉన్నాయి?) భారీ నిరసనల తర్వాత నిరసనకారుల హత్యలు, కార్యకర్తల నిర్బంధానికి దారితీసిన తరువాత సీఏఏ-ఎన్ఆర్సీ వ్యతిరేక ఉద్యమం మరుగున పడింది. కానీ నిరసనల వల్ల ప్రభుత్వం ఆ కొత్త చట్టాల అమలును నెమ్మదింపజేసింది.
అయితే ఇప్పుడు, సీఏఏ-ఎన్ఆర్సీ(ఇది ఎక్కువగా ముస్లింలను లక్ష్యంగా చేసుకుందని చాలామంది సరిగ్గా భావించారు) ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) రూపంలో తిరిగి వచ్చింది. మన పాస్పోర్ట్లు కూడా పౌరసత్వానికి రుజువు కావని మనకు ఉదాసీనంగా సమాచారం అందించబడింది.
లక్షలాది మంది పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించబడుతున్నాయి. దేశమంతా “వంశపారంపర్య పత్రాల” కోసం నిరాశగా వెతుకుతోంది.
మనం ఎక్కడ ఉన్నామో మనకే తెలియడం లేదు. మనం చట్టబద్ధమైన వారమా? అక్రమమైన వారమా? మనకు హక్కులు ఉన్నాయా? “అనుమానాస్పద పౌరుల” కోసం నిర్మిస్తున్న భారీ నిర్బంధ కేంద్రాలలో మనలో ఎవరు ఉంటారు? మనం ట్రైబ్యునల్ నుండి ట్రైబ్యునల్కు పరుగులు తీస్తూ రోజులు గడుపుతామా? ఫాసిస్టులు గందరగోళాన్ని, అయోమయాన్ని ఇష్టపడతారు.
భిన్నమైన ఉద్యమం – భవిష్యత్తు సవాళ్లు..
మన భయం, వేదన బొద్దింకల తిరుగుబాటుపై ఎక్కువ ఆశలు పెట్టుకునేలా చేయవచ్చు.
కొందరు ఇప్పటికే దీనిని బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకలో ప్రభుత్వ మార్పుకు దారితీసిన యువత తిరుగుబాటుతో పోల్చారు.
కానీ భారతదేశం వంటి పెద్ద దేశంలో అలా జరగడానికి ఆస్కారం తక్కువ. మరికొందరు దీనిని 1977లో ఇందిరా గాంధీని దించిన జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలోని ఉద్యమంతో పోల్చారు.
ఈ పోలికలు ఉపయోగపడవు. కాక్రోచ్ జనతా పార్టీ వీటిలో ఏదీ కాదు. ఇది దానికి అదే సొంతమైనది.
కాలం కన్న ఒక ప్రత్యేకమైన ఉత్పత్తి. తనను వ్యతిరేకించే వారి పట్ల దయాదాక్షిణ్యాలు లేవని నిరూపించుకున్న ఒక దారుణమైన, పగబట్టే ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలబడిన బలహీనమైన యువకులు వీరు.
పగ తీర్చుకోవడానికి ప్రణాళికలు జరుగుతుండటం ఖాయం, ప్రధాన సూత్రధారులుగా భావించే వారిపై వేటు పడుతుంది.
ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు..
తీవ్రంగా ప్రజాదరణ కోల్పోతున్న ఒక పాలనకు, తమకు ఓటేసిన ప్రజలకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వకుండా ఉండే ధైర్యం ఎలా వస్తుంది? ఎందుకంటే ఎన్నికల వ్యాపారాన్ని తాను విజయవంతంగా హస్తగతం చేసుకున్నానని అది భావిస్తోంది. అది యంత్రాంగాన్ని చేజిక్కించుకుంది.
ఎన్నికల సంఘం దాని నిర్మాణంలోనే లోపభూయిష్టంగా ఉంది. అది తటస్థంగా ఉంటుందని ఇకపై నమ్మలేము.
ఈవీఎంలను మేనేజ్ చేస్తున్నారు. ఓటర్ల జాబితాలలో ఇప్పుడు లక్షలాది మంది నిజమైన ప్రజలను మినహాయించారు, లక్షలాది మంది నకిలీ పేర్లను చొప్పించారు.
ఎన్నికలను పర్యవేక్షించే బ్యూరోక్రసీ మోదీ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తున్నట్లు నిరూపించుకుంది, దారుణమైన అవకతవకలను పరిష్కరించడంలో కోర్టులు మితిమీరిన ఆలస్యం చేస్తాయి లేదా కళ్లు మూసుకుంటాయి.
తటస్థత అంటే ఏమిటో పోలీసులకు తెలియదు. అధికారంలో ఉన్నవారి వేలు చిటికె వేసిన ప్రతిసారీ పత్రికలు మోకరిల్లుతాయి.
అధికార బలం – ప్రజా చైతన్యం..
ఇక ఎప్పటికీ బీజేపీకే ప్రయోజనం చేకూరేలా నియోజకవర్గాలను పునర్విభజన చేయబోతున్నారు.
అధికార పార్టీకి ఇంకా ఎవరికైనా భయపడాల్సిన అవసరం ఏముంది? అది ఎవరి మాటైనా ఎందుకు వినాలి?
ఇది ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన రాజకీయ పార్టీ, ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన పారిశ్రామికవేత్తల మద్దతు దీనికి ఉంది.
అది దేనినైనా కొనగలదు. ఎవరినైనా కొనగలదు. ప్రస్తుతానికి దాని నమ్మకం అదీ.
రైతుల పోరాటం – ప్రజా చైతన్యం..
కానీ ఈ ఆట శాశ్వతంగా సాగుతుందా? ప్రజలందరినీ ఎల్లప్పుడూ మోసం చేయగలరా? బిలియన్న జనాభా ఉన్న దేశాన్ని శాశ్వతంగా ఒక శవంలా ఈడ్చుకెళ్లగలరా? అది సాధ్యం కాదు.
బొద్దింకలు బయటకు వచ్చాయి. రైతులు మరోసారి ఢిల్లీకి పాదయాత్ర ప్రారంభించారు, ఈసారి ఇండో-యూఎస్ వర్తక ఒప్పందాన్ని నిరసిస్తూ — భారత ప్రభుత్వం వారి తరఫున గుడ్డిగా సంతకం చేయడానికి అంగీకరించిన మరణ శాసనం ఇది.
నగరం సరిహద్దులు మూసివేయబడ్డాయి కానీ అది వారిని ఆపేలా లేదు. బహుశా మనందరం కొంచెం ప్రమాదకరంగా ఎలా మారాల్లో మన రైతులు, మన బొద్దింకల నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు. యువత మనకు ఒక కానుకను ఇచ్చారు. వారు చేసిన కృషికి విలువ జోడించడం మనందరి, మనలో ప్రతి ఒక్కరి బాధ్యత.
ఒకసారి ప్రధాని భౌతికంగా పారిపోయాక, ఆయన రాజకీయంగా పారిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. కానీ ఈ పాలన అంత సులభంగా పోదు. రాజధాని వీధుల్లో అవమానించబడటాన్ని అది సహించదు. మనం రక్తపుటేరులను చూసే అవకాశం ఉంది.
యువత సహనం నశిస్తోంది. ఉద్వేగంతో ఉన్న ఆ యువ సమూహంలో ఎవరో ఒకరు సహనం కోల్పోయి, పోలీసులకు కాల్పులు జరపడానికి ఒక నెపం దొరికే దానికి ఎంత సమయం పడుతుంది? మనల్ని విడదీయడానికి వారు చేయగలిగినదంతా చేస్తారు. వారిని ఆపడానికి మనం చేయగలిగినదంతా చేయాలి.
అనువాదం: కె సత్యరంజన్
(అరుంధతి రాయ్ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త )
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
