“బొద్దింక జనతా పార్టీకి అకస్మాత్తుగా ప్రజాదరణ లభించడం కేవలం ఆన్లైన్ దృగ్విషయం లేదా యువతరం చేసే పరాచకం మాత్రమే కాదు, భారతదేశంలోని యువతలో ఉన్న గాఢమైన నిరాశకు ఇది రాజకీయ వ్యక్తీకరణ” అని బీ రాజీవన్ భావిస్తున్నారు.
డిజిటల్-యుగ నిరసన ఉద్యమాలు, ప్రపంచ ప్రజాస్వామ్య తిరుగుబాట్లు, సమకాలీన భారత రాజకీయాల మధ్య సంబంధాలను ఏర్పరుస్తూ- కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష శక్తులు ఈ అభివృద్ధి చెందుతున్న యువ శక్తిని తాత్కాలిక ధోరణిగా కొట్టిపారేయకుండా, పరివర్తనాత్మక ప్రజాస్వామ్య శక్తిగా గుర్తించాలి.
భారత యువత గురించి ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన అవమానకరమైన వ్యాఖ్యకు నిరసనగా ఏర్పడిన బొద్దింక జనతా పార్టీలోకి యువత పెద్ద సంఖ్యలో తరలిరావడం అధికార పీఠాన్ని అక్షరాలా కదిలించింది.
మనుగడలోకి వచ్చిన వారం రోజుల్లోనే- బీజేపీ ఇన్స్టాగ్రామ్ ఖాతా చందాదారులను సీజేపీ అధిగమించింది. ఈ విషయం ప్రకటించిన వెంటనే కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం సీజేపీ ఖాతాను స్తంభింపజేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే, “బొద్దింకలు తిరిగి వచ్చాయి” అనే పేరుతో ఎక్స్లో ఒక కొత్త ఖాతా కనిపించింది. అందులో “బొద్దింకలు చావవు” అనే ప్రకటన ఉంది.
మానసిక నిరాశ స్థితికి ప్రతిరూపం..
చాలా మంది అనుకుంటున్నట్లుగా, ఈ పెరుగుదల కేవలం రాజకీయ భావజాలం లేని అపరిపక్వ యువ మనస్సుల పని మాత్రమేనా? ఖచ్చితంగా కాదు. పాతకాలపు భావజాల ప్రతినిధుల నేతృత్వంలోని నేటి భారతదేశాన్ని పరిపాలిస్తున్న పాలన, కొత్త భారతీయ యువత జీవన ప్రపంచం, ఊహలతో మాట్లాడటంలో విఫలమైంది.
ఆ వైఫల్యం వల్ల ఏర్పడిన శూన్యం, ఉపాధి నిరాకరణ, కుల వివక్ష, విద్యా రంగం నాశనంతో కలిసి- భారతదేశ విద్యార్థులు, యువతలో భరించలేని మానసిక నిరాశ స్థితిని సృష్టించింది.
ఈ నిరాశ ఇప్పటికే జరుగుతున్న ఆత్మహత్యలు, తిరుగుబాట్ల ద్వారా బయటపడుతున్నప్పటికీ కనపడకుండా అణచి వేయబడింది. ఇప్పుడు అది ప్రభుత్వ వ్యతిరేకతగా గట్లను బద్దలు కొట్టడం ప్రారంభించింది.
అయినప్పటికీ ఈ యువత తిరుగుబాటును కేవలం యువత నిరాశకు మాత్రమే పరిమితం చేయలేము, తగ్గించలేము. అటువంటి నిరాశ వ్యక్తీకరణలుగా ప్రారంభమై, ఆపై ప్రపంచాన్ని మార్చిన విద్యార్థి, యువత తిరుగుబాట్ల చరిత్ర ప్రస్తుత ప్రభుత్వ వ్యతిరేకతగా మనల్ని హెచ్చరిస్తుంది.
క్షణక్షణానికీ లక్షలాది మంది సమీకృతమవుతున్న ఈ యువ తిరుగుబాటు, భారతదేశపు ప్రగాఢ చారిత్రక నిరాశకు ఒక ప్రతిరూపం కావచ్చు. బహుశా, ఎగురుతున్న ఈ బొద్దింకలు మనకు చెబుతున్నది అదేనేమో.
అందువల్ల చాలామంది భావజాలపరంగా శూన్య మైనదిగా, కేవలం తాత్కాలిక మైనదిగా కొట్టిపారేసే ఈ దృగ్విషయం అస్తిత్వం, శక్తి, రాజకీయ ప్రాముఖ్యతలను మనం గుర్తించాలి.
స్వయం-ప్రవాస జీవుల విప్లవం..
వారు ప్రధాన న్యాయమూర్తి చేసిన “బొద్దింక” అనే అవమానాన్ని అందిపుచ్చుకుని, దానిని తమ సొంత గుర్తింపుగా మార్చుకున్నారు.
వ్యంగ్యం, విపరీతార్థం, దాదాపు పండుగలాంటి ఒక విలోమ చర్య ద్వారా, వారిపై రుద్దబడిన ముద్రను వారు తిప్పి కొడతారు. అలా చేయడం ద్వారా, ఆధునిక రాజ్యాధికారం అభేద్యత అనే భావనపై ఆధారపడిన అధికార సంబంధాలు, ఆచారాల గణతంత్రం నుండి వారు బయటకు అడుగుపెడతారు. వారు బొద్దింకలుగా, స్వయం-ప్రవాస జీవులుగా మారిపోతారు.
ఈ కారణంగా, ఇప్పుడు భారత రాజకీయ ఆకాశంలోకి ఎగురుతున్న బొద్దింకలను ఒక ఉత్తర-ఆధునిక రాజకీయ విప్లవానికి ప్రతీకలుగా అర్థం చేసుకోవచ్చు. ఈ విప్లవం ఆధునిక ప్రభుత్వ క్రమశిక్షణా భయయంత్రాలను, వ్యూహాలను, వాటితో పాటు ప్రభుత్వ స్వరూపంలో రూపుదిద్దుకున్న పాత రాజకీయ పార్టీలను కూడా పక్కకు నెట్టివేస్తుంది.
ఈ విధంగా, సార్వ భౌమాధికార-కేంద్రీకృత ఆధునిక రాజకీయాల కోటలకు వెలుపల, ఈ శతాబ్దం ప్రారంభం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆవిర్భవించిన బహుళ-ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయ శక్తి భారతీయ రూపంగా ఈ రాజకీయ విషయంగా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
సామూహిక తిరుగుబాటుకు సరికొత్త రూపం..
“నాయకత్వం లేని పోరాటం”, “ఆక్రమణ పోరాటం” వంటి పేర్లతో అధికారిక, గౌరవనీయమైన పౌర సమాజాన్ని దాటి ఉద్భవించిన ఈ బహుళ రాజకీయ రూపం, ఇప్పుడు సరిహద్దులు లేకుండా భూమంతటా విస్తరించే ఒక డిజిటల్ సంస్థాగత రూపంలోకి తన రెక్కలను విప్పింది. దీని ద్వారా రాజ్యాధికార రాజకీయ వర్గాల ఇనుప పంజరాలలో దీర్ఘకాలంగా బంధించబడిన ప్రజాస్వామ్యం, పంజరాలను బద్దలుకొట్టి డిజిటల్ బహుళత్వపు ఆకాశంలోకి ఎగిరింది.
ఆ కోణంలో చూస్తే, ఇప్పుడు యువతలో కార్చిచ్చులా వ్యాపిస్తున్న ఈ బొద్దింక జనతా విప్లవం, ప్రజలు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి నియంతలను వారి రాజభవనాల నుంచి పారిపోయేలా చేసిన సామూహిక తిరుగుబాట్లకు భారతదేశంలో సరికొత్త రూపం.
ఇటీవలి కాలంలో, మన పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో దీనిని చూశాం. అక్కడ ప్రజలు భారీ సంఖ్యలో నేరుగా తరలివచ్చి, ఉదార ప్రజాస్వామ్యం ముసుగులో పరిపాలిస్తున్న నియంతలను ప్రాణభయంతో పారిపోయేలా చేశారు. ఇప్పుడు ఆ శక్తి భారతదేశానికి కూడా చేరుకుంది.
ఉదార ప్రజాస్వామ్యం లాంఛనప్రాయమైన తంత్రాల ద్వారా అధికారంలోకి వచ్చి, నేడు మన దేశాన్ని పాలిస్తున్న నియంతల గుండెల్లో ఇది ఇప్పటికే నిప్పు రగిలించి ఉంటుందనడంలో సందేహం లేదు.
దేశంలోని ప్రధాన పరీక్షలలో జరిగిన అవకతవకలకు నిరసనగా, 2026 జూన్ 6న న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రదర్శనలో బొద్దింక జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పాల్గొన్నారు.
ఫాసిస్ట్ పాలనా పద్ధతులను బహిర్గతం చేసి, సవాలు చేస్తోన్న సీజేపీ..
లక్షలాది మంది అనుచరుల ద్వారా దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్న ఈ ఆందోళన, ఆలస్యం చేయకుండా నెరవేర్చాల్సిన కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. నిజానికి, ఈ డిమాండ్లు నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రజాస్వామ్య ముసుగును తొలగించేంత శక్తివంతమైనవి.
ఇటీవలి భారత రాజకీయాల్లో ప్రతిపక్షం సాపేక్షంగా బలహీనంగా పునరావృతం చేసిన ఆరోపణలకు ఇవి తీవ్రమైన, ఉన్నతమైన వ్యక్తీకరణ కూడా. ఈ బొద్దింకల ప్రణాళిక, ఎన్నికల విధ్వంసం, మీడియా దుర్వినియోగం, న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేయడం వంటి ఫాసిస్ట్ పాలనా పద్ధతులను బహిర్గతం చేసి, సవాలు చేస్తుంది.
అందువల్ల, వీలైనంత క్లుప్తంగా చెప్పాలంటే, ప్రపంచ కార్పొరేట్ పెట్టుబడిదారీ మార్కెట్లో భారతదేశాన్ని అమ్మకానికి పెట్టిన నయా-ఫాసిస్ట్ దళారీ పాలనకు వ్యతిరేకంగా, భారతదేశపు అట్టడుగు వర్గాల ఆధారిత ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్య రాజకీయాలకు నేడు ఆవిర్భవించిన ప్రజా ఉద్యమం సరికొత్త రూపం.
చారిత్రక మార్పుకు సంకేతం..
ప్రజాస్వామ్య హక్కులు, మైనారిటీ హక్కుల కోసం భారతదేశంలో విద్యార్థులు, దళితులు, రైతులు, మహిళలు, కాంట్రాక్టు కార్మికులు తదితరులు నడిపిన శక్తివంతమైన పోరాటాలకు, నేడు యువత ద్వారా వెల్లువెత్తుతున్న ఈ నూతన డిజిటల్ బహుళ-ప్రజాస్వామ్య ఉద్యమం ఒక నూతన కొనసాగింపు, ఉన్నత దశ కూడా.
ఈ విధంగా చూసినప్పుడు, ఈ కొత్త ఉద్యమంలో ఒక చారిత్రక మార్పుకు సంకేతం కనిపిస్తోంది. భారతదేశంలోని అణగారిన వర్గాలు పాత ప్రభుత్వ-ఆధారిత రాజకీయ రూపాల నుంచి దూరమై, డిజిటల్, బహుళ-ఆధారిత ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్య రాజకీయాల వైపు మళ్లుతున్న ప్రతిఘటన.
ఈ శతాబ్దం ప్రారంభం నుండి బహుళ-ప్రజాస్వామ్య ఉద్యమాలు నియంతలను ప్రాణభయంతో పారిపోయేలా చేయడంలో నిజంగానే విజయం సాధించాయి. కానీ ప్రభుత్వ సార్వభౌమాధికార క్రమానికి బదులుగా ప్రత్యామ్నాయ మైనారిటీ-ఆధారిత జీవ-అధికార నిర్మాణాన్ని పెంచడంలో అవి ఇంకా విజయం సాధించలేదు.
మరో మాటలో చెప్పాలంటే, విధించబడిన అతీత సార్వభౌమాధికారం స్థానంలో, అంతర్గత జీవ-అధికారం రాజకీయ నిర్మాణం, సంస్థలు ఇంకా రూపు తీసుకోలేదు.
ఈ శూన్యంలోకి ప్రవేశించి, దానిలో పనిచేయడం ద్వారానే విద్రోహ శక్తులు ఈ బహుళ-ప్రజాస్వామ్య ఉద్యమాలను స్వాధీనం చేసుకుంటాయి. అణచివేస్తాయి లేదా వెనక్కి తరిమివేస్తాయి. అయినప్పటికీ, ఈ సరళికి విరుద్ధంగా, ఈ శూన్యాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తున్న బహుళ-ఆధారిత ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్య రాజకీయాలకు ఒక ఉదాహరణ మన పొరుగు దేశం, శ్రీలంక.
శ్రీలంకలో ఏం జరిగింది?
రాజపక్స ప్రభుత్వం శ్రీలంక మొత్తాన్ని కార్పొరేట్ దోపిడీకి తెరిచింది.
ఫలితంగా ప్రపంచ స్థాయి విమానాశ్రయాలు, ఓడరేవులు ఏర్పడ్డాయి. కానీ ప్రజలు తీవ్ర పేదరికంలోకి, నిరాశలోకి కూరుకు పోయారు. ప్రజలు ఆహారం, పెట్రోల్, నీటి కోసం కూడా క్యూలలో నిలబడాల్సి వచ్చింది. ఆ క్యూలలోనే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ పరిస్థితికి వ్యతిరేకంగా, విద్యార్థులు, కార్మికులు, ఇతర వర్గాల ప్రజలు వేల సంఖ్యలో గుమిగూడారు. సైన్యం ప్రేక్షకునిగా నిలబడగా, వారు బహిరంగ ప్రదేశాలను ఆక్రమించి, రాజపక్స కుటుంబ పాలన ముగిసి వారు పారిపోయేవరకు నెలల తరబడి పోరాటాన్ని కొనసాగించారు. తదనంతరం జరిగిన ఎన్నికల్లో, 27 పార్టీల నేషనల్ పీపుల్స్ పవర్ కూటమి, దీనికి నాయకత్వం వహించింది.
మార్క్సిస్ట్-లెనినిస్ట్ పార్టీ జనతా విముక్తి పెరమున, పార్లమెంటులో కేవలం మూడు స్థానాలకు కుదించబడినది. ఒక్క దెబ్బతో 159 స్థానాలకు ఎగబాకి అధికారంలోకి వచ్చింది. ఈ ఎగబాకడం జనతా విముక్తి పెరమున విప్లవాత్మక రాజకీయ వ్యూహ విజయం ఫలితమని వారు కూడా చెప్పుకోరు. అక్కడ జరిగింది వేరే.
జనతా విముక్తి పెరమున, ఆ సమయంలో చాలా బలహీనంగా ఉన్నప్పటికీ, దేశాన్ని పాలిస్తున్న దుష్ట శక్తులపై ప్రజ్వరిల్లిన ప్రజా ఆగ్రహాన్ని గుర్తించడానికి, స్వీకరించడానికి, దానికి నిర్దిష్ట రాజకీయ రూపాన్ని ఇవ్వడానికి ధైర్యం చూపింది.
అదేవిధంగా, ఈ శతాబ్దం ప్రారంభంలో నయా ఉదారవాద ఆర్థిక, రాజకీయ వ్యవస్థకు తొలి ప్రయోగ శాలలుగా అమెరికా ఎంచుకున్న లాటిన్ అమెరికా దేశాలలో, అక్కడ తలెత్తిన కొత్త ప్రజా తిరుగుబాట్ల కారణంగానే విస్ఫోటనాలు సంభవించాయి.
ఆ ప్రదేశాలన్నింటిలోనూ, సాంప్రదాయ వామపక్ష పార్టీలు తమ పాత విప్లవ సూత్రాలను విడిచిపెట్టి, ఈ తిరుగుబాట్ల ద్వారా నూతన ప్రజాస్వామ్య ఉద్యమాలుగా తమ రెక్కలను విప్పాయి.
అందువల్ల, మరోసారి బానిసత్వంలోకి జారిపోయిన భారతదేశ విముక్తి కలలకు, ఇప్పుడు తమ ముందున్న ఈ అవకాశాన్ని భారత ప్రజలు చేజార్చుకోవడం ఒక గొప్ప విషాదం అవుతుంది.
సామూహిక పిలుపును విని మేల్కొనాలి..
ప్రపంచ కార్పొరేట్ పాలన పాత ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని తన ఫాసిస్ట్ దళారులకు రక్షణ కవచంగా మార్చివేసిన ఈ యుగంలోనూ, పాత విప్లవాత్మక రాజకీయ ఉద్యమాలు కాలం చెల్లినవిగా మారిన లేదా పెట్టుబడిదారీ అభివృద్ధి అనే విప్లవాత్మక వ్యూహంతో అణచివేయబడిన ఈ తరుణంలో ఇది మరింత నిజం.
అందుకే, విమోచన రాజకీయాల బొద్దింకలు ఎగిరిపోతున్న ఈ తరుణం రాజకీయ ప్రాముఖ్యతను భారతదేశంలోని ప్రతిపక్ష పార్టీలు గుర్తించి, సృజనాత్మక శక్తులుగా ఎదగాలి.
చారిత్రాత్మకంగా నిర్ణయాత్మకమైన ఈ బాధ్యతను ముందుండి చేపట్టవలసిన పార్టీ, ప్రతిపక్షానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్.
ఎందుకంటే నేటి కాంగ్రెస్, భారతదేశ పాలక వర్గాల పార్టీగా ఉన్న పాత కాంగ్రెస్ కాదు. అది ఒకప్పుడు జాతీయ పెట్టుబడిదారీ పాత శక్తుల పార్టీ కూడా కాదు. భారత జాతీయ పెట్టుబడిదారీ వ్యవస్థ, ప్రపంచ కార్పొరేట్ పెట్టుబడి వ్యవస్థలో విలీనమవుతుండటంతో, దానికి మధ్యవర్తులుగా ఒక కొత్త వర్గం ఆవిర్భవిస్తుండటంతో, స్వాతంత్ర్య పోరాట సమయంలో జరిగినట్లే, నేటి కాంగ్రెస్ కూడా లక్షలాది మంది స్వేచ్ఛా ఆకాంక్షల పార్టీగా రూపాంతరం చెందుతోంది.
ఆ కారణంగా, భారతదేశపు రెండవ స్వాతంత్ర్య పోరాటపు ఉదయ ఘోషలా ప్రతిధ్వనించే, ఎగిరే ఈ బొద్దింకల దండకాల సామూహిక వేణుగానాన్ని కాంగ్రెస్ తప్పక వినాలి.
ప్రతిపక్షంలోని వామపక్ష, సోషలిస్ట్ పార్టీలు కూడా ఈ సామూహిక పిలుపును విని మేల్కొనాలి.
అందువల్ల, ప్రపంచ పెట్టుబడి అనే బృహత్ శక్తుల చేతుల్లో అనాథగా లేదా నిష్ఫలంగా మిగిలిపోయే ఈ యువశక్తిని కాంగ్రెస్ చిత్తశుద్ధితో స్వీకరించి, దానిని రాజకీయ పోరాటంలో వినియోగించే శక్తిగా మార్చాలి.
నిస్సందేహంగా, కాంగ్రెస్ ఇంకా పాత రాజకీయ పతనపు అవశేషాల పట్టు నుండి పూర్తిగా విముక్తి పొందలేదు. కానీ కాంగ్రెస్ ఈ అమూల్యమైన సువర్ణావకాశాన్ని చేజార్చుకుంటే, అది కార్పొరేట్-ఫాసిస్ట్ కూటమి క్రూరమైన దోపిడీకి భారతదేశాన్ని అప్పగించిన క్షమించరాని చారిత్రక నేరంగా మిగిలిపోతుంది.
దీనికి విరుద్ధంగా, ఒకవేళ కాంగ్రెస్ ఈ తరుణంలో పుంజుకుంటే, రాజకీయ సృజనాత్మకత లేకపోవడం అనే భారంతో ఇప్పుడు విచ్ఛిన్నమవుతున్న ప్రతిపక్ష పార్టీల ఐక్యత ఒక గొప్ప శక్తిగా మేల్కొంటుంది.
అప్పుడు కాంగ్రెస్, గాంధీ ఒకప్పుడు చెప్పినట్లుగా, పార్లమెంటరీ స్వరాజ్య శక్తి నుండి భారతదేశాన్ని పూర్ణ స్వరాజ్యం, అంటే సంపూర్ణ స్వీయ-పరిపాలన వైపు నడిపించగల ఒక నూతన విప్లవ శక్తిగా రూపాంతరం చెందుతుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
