జోహ్రాన్ మమ్దానీ మరియు ఆయన మద్దతు తెలిపిన మిత్రపక్షాలు దేశానికి ఒక సందేశం ఇస్తున్నాయని ఆయన చెప్పారు.
ప్రాథమిక ఎన్నికలలో (ప్రైమరీస్) విజయం సాధించిన ప్రగతిశీల సహచరులు అమెరికన్లతో ‘ ఈ చివర నుండి ఆ చివర వరకు’ మాట్లాడుతున్నారని, మేయర్ చెప్పారు.
న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ జూన్ 28 న మీడియా తో మాట్లాడుతూ, ఇటీవల జరిగిన ప్రాథమిక ఎన్నికలలో విజయం సాధించిన తాను, తన డెమోక్రటిక్ సోషలిస్ట్ మిత్రపక్షాల బృందం ఒక కొత్త రకమైన రాజకీయం కోసం ఎదురు చూస్తున్న, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న శ్రామిక అమెరికన్ల వద్దకు “ఒక మూల నుండి మరో మూల వరకు” ఒక “జాతీయ సందేశాన్ని” తీసుకెళ్తున్నామని చెప్పారు. మూడు న్యూయార్క్ కాంగ్రెస్ స్థానాల కోసం జరిగిన పోటీలలో, అలాగే అల్బానీలోని ఐదు రాష్ట్ర శాసనసభ స్థానాలలో తాను మద్దతు ఇచ్చిన అభ్యర్థులు డెమోక్రటిక్ నామినేషన్లను గెలుచుకున్న ఐదు రోజుల తర్వాత, ఎబిసి న్యూస్ నిర్వహించే ‘దిస్ వీక్’ కార్యక్రమంలో మమ్దానీ ఈ పిలుపునిచ్చారు. ఈ క్లీన్ స్వీప్ డెమోక్రటిక్ రాజకీయాల్లో ఒక నాటకీయ మార్పును సూచిస్తోందనే తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది ఆయన జనవరి నుండి నాయకత్వం వహిస్తున్న న్యూయార్క్లోనే కాకుండా, అమెరికా అంతటా కనిపిస్తోంది.
డెమోక్రటిక్ రాజకీయాలకు సంబంధించిన ఒక “న్యూ డీల్ అవగాహనను” తాము సంయుక్తంగా కాంగ్రెస్కు, “జాతీయ వేదికపైకి” తీసుకెళ్తున్నామని ఆయన చెప్పారు. “ప్రతి ఒక్క రోజు” జీవనం సాగించడానికి పోరాడుతూ అలసిపోయినట్లు భావిస్తున్న అమెరికన్లతో మాట్లాడుతున్నామని ఆయన అన్నారు.
“మనం ఆ సందేశాన్ని జాతీయం చేయనవసరం లేదు,” అని మమ్దానీ వ్యాఖ్యానించారు. “అదే ఒక జాతీయ సందేశం – మనమున్నది ఒక జాతీయ సంక్షోభం.” అన్నారు.
గత మంగళవారం నాటి విజయాలను దేశవ్యాప్త ప్రాముఖ్యత కలిగిన రాజకీయ ప్రకంపనగా మమ్దానీ అభివర్ణించారు.
డెమోక్రటిక్ పార్టీ యొక్క పాత నాయకత్వానికి ఈ ఫలితాలు ఒక సవాలు విసురుతోందని ఆయన అన్నారు.
న్యూయార్క్ మేయర్ తన డెమోక్రటిక్ సోషలిజం బ్రాండ్ను అమెరికాలోని అతిపెద్ద, అత్యంత ధనిక నగరానికే పరిమితం చేయడం ఒక ఎత్తు. దానిని ఆయన వాషింగ్టన్లోకి తీసుకెళ్లడం సరిగ్గా మరొక ఎత్తు.
తమను తాము “మితవాదులు” గా మమ్దానీని “తీవ్రవాది” గా ముద్ర వేసుకున్న డెమోక్రాట్లు, ఆయన వేగంగా ఎదుగుతున్న రాజకీయ ఉద్యమంపై దాడి చేయడానికి వెనకాడలేదు. కనెక్టికట్ నుండి డెమోక్రటిక్ సెనేటర్ అయిన రిచర్డ్ బ్లూమెంటల్ “న్యూయార్క్ను జాతీయం చేసే ప్రయత్నం విఫలం కాబోతోంది. నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికల సమయానికి న్యూయార్క్లో జరగబోయేది అంచనా వేస్తే ఇది నిజంగా అసంబద్ధం అవుతుంది.” అని వ్యాఖ్యానించారు.
యుఎస్ హౌస్లోని పదిహేను మంది తమను తాము “మితవాదులు” అని పిలుచుకునే డెమోక్రాట్లు ఒక బహిరంగ లేఖపై సంతకం చేశారు. అది మమ్దానీ లేదా ఆయన మద్దతు ఇచ్చిన మిత్రపక్షాలను ప్రస్తావించనప్పటికీ, స్పష్టంగా వారిని లక్ష్యంగా చేసుకుంది. “మేము పెట్టుబడిదారులం, సోషలిస్టులం కాదు,” అని వారు చెప్పారు. “మేము ప్రధాన స్రవంతికి చెందినవాళ్లం, తీవ్రవాదులం కాదు. మేము అమెరికా పట్ల గర్విస్తున్నాము, సిగ్గుపడటం లేదు.” అని ఆ లేఖ లో ప్రస్తావించారు.
తనపై విమర్శకులు ఒక మేనిఫెస్టోను విడుదల చేయడం గురించి మీ అభిప్రాయం ఏమిటని ‘దిస్ వీక్’ ప్రశ్నించినప్పుడు, మమ్దానీ ఇలా సరదాగా వ్యాఖ్యానించారు: “ఇది నాకు చాలా సోషలిస్ట్గా అనిపిస్తోంది.”
ఆయన ఇంకాఇలా అన్నారు. “నాకు మేనిఫెస్టో రాయడంపై లేదా నిజం చెప్పాలంటే దానిని చదవడంపై ఆసక్తి లేదు. ఫలితాలను అందించడంపైనే నాకు ఆసక్తి ఉంది.”
పాత డెమోక్రాట్లకు మమ్దానీ తెచ్చి పెట్టే ముప్పు లో ఒక భాగం ఏమిటంటే శ్రామిక అమెరికన్లకు మరింత ఎక్కువ అందించాలనే తన వాదనను ఇప్పుడు ఆయన తన స్వంత నిర్దిష్ట విజయాలను చూపించడం ద్వారా నిరూపించగలరు. గత వారం, న్యూయార్క్ రెంట్ గైడ్లైన్స్ బోర్డు సుమారు 1 మిలియన్ అపార్ట్మెంట్ల అద్దెలను పెంచకుండా ఉంచడానికి ఓటు వేసింది.
“న్యూయార్క్ చరిత్రలోనే మొదటిసారిగా మేము రెండేళ్ల పిల్లలకు ఉచిత పిల్లల సంరక్షణను (చైల్డ్ కేర్) అందించాము,” అని మమ్దానీ ఎబిసి న్యూస్తో చెప్పారు. అంతేకాకుండా తాము 165,000 గుంతలను కూడా బాగు చేశామని అదనంగా చెప్పారు.
ఇలాంటి రికార్డు డెమోక్రటిక్ సోషలిజం అంతర్గతంగా ఆచరణాత్మకమైనదని చూపిస్తుందని ఆయన అన్నారు – “ఎందుకంటే మనం శ్రామిక ప్రజల కోసం ఫలితాలను అందించలేకపోతే, ఇక దాని వల్ల ఉపయోగం ఏమిటి?”
మమ్దానీ తన పార్టీ యొక్క పాత నాయకత్వంపై కూడా పదునైన విమర్శలు గుప్పించారు. “మనం చాలా సంవత్సరాలుగా చూస్తున్నది ఏమిటంటే, యథాతథ స్థితిని సమర్థించడమే కాకుండా, నిజం చెప్పాలంటే, ఆ యథాతథ స్థితి నుండి ప్రయోజనం పొందాలని చూడటం కూడా,” అని ఆయన అన్నారు. ” శ్రామిక ప్రజలు మన పార్టీ నుండి కోరుకుంటున్నది అది కాదు.”
సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించడంలో కేవలం డొనాల్డ్ ట్రంప్ను విమర్శిస్తే సరిపోతుందని భావించడంలో పార్టీ శ్రేణుల వైఫల్యాన్ని ఆయన నిందించారు. “మీరు కేవలం అధ్యక్షుడికి వ్యతిరేకంగా మాత్రమే ఉండలేరు” అని అడిగినప్పుడు, మమ్దానీ స్పందిస్తూ, “మీరు కేవలం దేనికైనా మద్దతుగా నిలబడటమే కాకుండా, ఇది శ్రామిక ప్రజలకు సంబంధించి ఎలా ఉందో వివరించడానికి కూడా సిద్ధంగా ఉండాలి,” అని అన్నారు.
“నేను ప్రపంచ చరిత్రలోనే అత్యంత సంపన్నమైన దేశంలోని అత్యంత సంపన్న నగరానికి నాయకత్వం వహిస్తున్నాను,” అని మమ్దానీ చెప్పారు. “కానీ ఇది నలుగురిలో ఒకరు పేదరికంలో జీవిస్తున్న నగరం కూడా. చాలా మంది అమెరికన్లకు, ఆ వైరుధ్యాలు వారి రోజువారీ జీవితంగా మారిపోయాయి.”
న్యూయార్క్లో మంగళవారం నాటి ప్రాథమిక ఎన్నికల ఫలితాలు ప్రత్యేకంగా హృదయ విదారకంగా ఉన్నాయి. ఎందుకంటే మమ్దానీ మిత్రపక్షాలు ఇద్దరు ప్రస్తుత డెమోక్రటిక్ ప్రతినిధులను ఓడించారు. డాన్ గోల్డ్మన్ను బ్రాడ్ లాండర్ ఓడించగా, అడ్రియానో ఎస్పైలాట్ను దరియాలిజా అవిలా చేవాలియర్ ఓడించారు.
పాత ఎంపిక అయిన ఆంటోనియో రేనోసోపై క్లైర్ వాల్డెజ్ కూడా పార్టీ నామినేషన్ను దక్కించుకున్నారు.
చేవాలియర్ తన రాజకీయ అభిప్రాయాలపై ప్రత్యేక దృష్టిని ఆకర్షించారు, అందులో ఆమె తనను తాను “జైళ్ల నిర్మూలన వాది” గా అభివర్ణించుకున్నారు. తన ఎబిసి న్యూస్ ఇంటర్వ్యూలో, మమ్దానీ ఆ ఫ్రేమింగ్లోకి వెళ్ళడానికి నిరాకరించారు.
ఆయన మాట్లాడుతూ, “జైళ్లు ఉన్నాయి. మరియు మేము ఈ నగరంలో చూపిస్తున్నది ఏమిటంటే, భద్రత అనేది చర్చించదగిన విషయం కాదు – ఇది మేము వాస్తవంగా అందిస్తున్నది. న్యూయార్క్ సిటీ చరిత్రలోనే ప్రస్తుతం అత్యల్ప సంఖ్యలో హత్యలు మరియు కాల్పుల రికార్డును నమోదు చేసిన నగరానికి మేయర్గా ఉన్నందుకు నేను గర్విస్తున్నాను.”
పార్టీలో మమ్దానీకి వేగంగా పెరుగుతున్న ఆదరణ చూసి ప్రస్తుత డెమోక్రటిక్ రాజకీయ నాయకులు కొందరు బహిరంగంగా భయపడుతున్నప్పటికీ, మరికొందరు చర్చలకు తలుపులు తెరిచే ఉంచుతున్నారు. కనెక్టికట్ యొక్క మరొక డెమోక్రటిక్ సెనేటర్ క్రిస్ మర్ఫీ ఎన్బిసి యొక్క ‘మీట్ ది ప్రెస్’ తో మాట్లాడుతూ పార్టీ అనేది ఒక పెద్ద గుడారం (అందరికీ చోటుండేది) అని చెప్పారు.
డెమోక్రాట్లు సోషలిజాన్ని స్వీకరించడం తనకు ఇష్టం లేదని ఆయన చెప్పారు. “కానీ పెట్టుబడిదారీ విధానం యొక్క ఈ వెర్షన్ పని చేయలేదని ప్రజలు నమ్ముతున్నారని మనం అర్థం చేసుకోవాలి,” అని మర్ఫీ అన్నారు. ” నిజం చెప్పాలంటే, అది పని చేయలేదు.”
నవంబర్లో సెనేట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న తన తోటి జార్జియా డెమోక్రాట్ జాన్ ఒసాఫ్ను కలిగిన యుఎస్ సెనేటర్ రాఫెల్ వార్నాక్ సిఎన్ఎన్ యొక్క ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ తో మాట్లాడుతూ: “పోలీసులను రద్దు చేయాలని నేను నమ్మను. సరిహద్దులు లేని దేశం ఉండదు.” అని చెప్పారు.
కానీ ఆయన “ప్రస్తుతం తమ జీవితాలను గడపడానికి ఆర్థికంగా స్తోమత లేని సామాన్య ప్రజలకు ఏమి జరుగుతుందో అని నేను ఆందోళన చెందుతున్నాను. రెండు పార్టీలు కూడా ఈ తీవ్రమవుతున్న అమెరికన్ సంక్షోభానికి తగినట్లుగా స్పందించలేదు.” అని కూడా అన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
