బెంగాల్, బిహార్లలో చేపట్టిన ప్రత్యేక ముసాయిదా సవరణల (SIR) పై ప్రతిపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి పూర్తిగా దెబ్బతిందని వారు తమ లేఖలో పేర్కొన్నారు.
ప్రమాదంలో ప్రజాస్వామ్యం:
ఎన్నికల్లో అక్రమాలు, ఎన్నికల సంఘం ఏకపక్ష వైఖరి, మరియు ప్రతిపక్ష పార్టీలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని నిరసిస్తూ ‘ఇండియా’ కూటమి నాయకులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్కు ఉమ్మడి వినతిపత్రం సమర్పించారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనే నమ్మకంతోనే తాము ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
‘మేనేజ్’ చేసిన ఎన్నికలు:
జూన్ 28న రాసిన ఈ లేఖను ప్రతిపక్షాలు శుక్రవారం మీడియాకు విడుదల చేశాయి. 23 ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ కూడా దీనిపై సంతకం చేశారు. పశ్చిమ బెంగాల్, బిహార్లలో చేపట్టిన ప్రత్యేక ముసాయిదా సవరణల పై వారు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అలాగే, ఇటీవల ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్రలలో జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
కనుమరుగైన ఈసీ స్వతంత్రత:
2014 కంటే ముందు ఎన్నికల కమిషనర్ల నియామకాల్లో పారదర్శకత ఉండేదని, కానీ 2014 తర్వాత ప్రభుత్వం తనకు నచ్చిన వారిని, ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే వారినే ఆయా పదవుల్లో కూర్చోబెడుతోందని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ కను సన్నల్లోనే ఎన్నికల ఫలితాలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
పక్షపాత వైఖరి:
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పూర్తిగా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, ఎన్నికల ప్రక్రియ అంతటా ఆయన బీజేపీకి బహిరంగంగా మద్దతు ఇస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించారు. అధికార పార్టీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా, కేవలం ప్రతిపక్షాలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు.
బంగ్లాదేశీయుల చొరబాటు అంశం:
బిహార్ ఓటర్ల జాబితాలో బంగ్లాదేశీయుల చొరబాట్లు జరిగాయనే నెపంతోనే ఈ ప్రత్యేక సవరణలు (SIR) చేపట్టారని, అయితే బిహార్ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా అలాంటి చొరబాట్లకు సంబంధించి ఎన్నికల సంఘం వద్ద ఎలాంటి అధికారిక సమాచారం లేదని లేఖలో స్పష్టం చేశారు.
న్యాయవ్యవస్థపై నమ్మకం:
“న్యాయమూర్తులు గాలిలో తెలియాడటం లేదు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో వారికి బాగా తెలుసు. ప్రధాన స్రవంతి మీడియా దాదాపు లొంగిపోయినా, కొన్ని స్వతంత్ర వేదికలు ఇంకా నిజాన్ని ధైర్యంగా మాట్లాడుతున్నాయి” అని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. తాము న్యాయవ్యవస్థను ప్రశ్నించడం లేదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాత్రమే కోరుతున్నామని స్పష్టం చేశాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
