ఈసారి ఇరాన్ ఓ విలక్షణమైన సమరం చేస్తోంది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్ల దృష్టినాకర్షించటం; ఇజ్రాయెల్-అమెరికా, గల్ఫ్లోని అమెరికా మిత్ర దేశాల శక్తి సామర్థ్యాలకు సవాలు విసరటం ఈ యుద్ధంలో ఇరాన్ అనుసరిస్తున్న వ్యూహం.
ఏ రకంగా చూసినా ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ సంపూర్ణ విజయం సాధించటం కల్ల.
నిజానికి ఈ యుద్ధం ఇరాన్ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న యుద్ధమే. కానీ ఈ యుద్ధంలో విజయం అన్న పదానికి మనం కొత్త నిర్వచనం చెప్పుకోవాలి.
దాడి చేస్తున్న దేశాల కంటే ఎక్కువ నష్టాన్ని భరించే సహనం తమకు ఉందని నమ్ముతున్న ఇరాన్, తన శక్తి యుక్తులను జాగ్రత్తగా ప్రయోగిస్తోంది.
పశ్చిమాసియాలో సాగుతున్న యుద్ధం తీసుకుంటున్న మలుపులను గమనిస్తున్న పరిశీలకులు నోళ్లు వెళ్లబెడుతున్నారు.
2025 జూన్లో ఇజ్రాయెల్-అమెరికా ద్వయం సాగించిన ఆకస్మిక దాడులు చూసిన వాళ్లకెవరికైనా- ఆ దేశాలకు ఎదురుగా నిలిచి పోరాడే శక్తి సామర్థ్యాలు ఇరాన్కు లేవు అన్నది సుస్పష్టమే.
ఈ కారణంగానే వెనిజులా తర్వాత ఇరాన్పై గురిపెడితే స్వల్పకాలంలోనే భారీ విజయం సాధించే అవకాశం ఉంటుందని ఇజ్రాయెల్-అమెరికా ద్వయం భావించింది.
ఫిబ్రవరి 28న ఈ అంచనాతోనే ఇరాన్పై దాడులు ప్రారంభించాయి ఇజ్రాయెల్, అమెరికాలు.
కానీ ఈ దాడుల నుంచి బతికి బయటపడటమే లక్ష్యంగా పెట్టుకున్న ఇరాన్, భిన్నమైన యుద్ధ వ్యూహాన్ని రూపొందించుకున్నది. సమ్మిళిత వ్యూహం అది.
ఓ వైపు ఇజ్రాయెల్, అమెరికాలు సాగిస్తున్న దాడుల భీభత్సాన్ని సహిస్తూనే గల్ఫ్ తీరంలోని అమెరికా మిత్ర పక్షాల ఆర్థిక వెన్నెముకను నిర్వీర్యం చేసే లక్ష్యంతో, పరిమిత సామర్థ్యాన్ని ఉపయోగించుకుని దాడులు సాగిస్తోంది ఇరాన్.
గల్ఫ్లోని అమెరికా మిత్రదేశాల సైనిక పాటవాన్ని దెబ్బతీసేలా ఆయా దేశాల రాడార్లను ధ్వంసం చేయటం, హార్ముజ్ జలసంధిని దిగ్బంధనం చేయటం వంటి వ్యూహాత్మక దాడులకు ఇరాన్ పాల్పడుతోంది.
వాణిజ్య నౌకలు, ఒమన్లో ఓడరేవు, చమురు ట్యాంకర్లు తీసుకెళ్లే నౌకలపై, దుబాయ్ విమానాశ్రయ సమీపంలోని ప్రాంతాలపైనా, కువైట్ విమానాశ్రయం, అబుదాబి చమురు శుద్ధి కేంద్రాలపైనా ఎంచుకుని మరీ దాడులు సాగిస్తోంది ఇరాన్.
వ్యూహంలో మొదటి కోణం: వికేంద్రీకరణ
అద్భుతమైన వికేంద్రీకరణ, అమెరికా దాని మిత్ర దేశాలకు, వాటి క్షిపణి ప్రయోగ సామర్థ్యానికి, డ్రోన్లను ధ్వంసం చేయటం, ఆయా దేశాల పరోక్ష పాత్రను కుదించే లక్ష్యం వంటి రూపంలో ఇరాన్ అనుసరిస్తున్న ఈ వ్యూహంలో నాలుగు కోణాలున్నాయి.
మొదటిది, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్, బసిజ్ దళాలను వికేంద్రీకరించింది.
ఈ వికేంద్రీకరణను జాగ్రత్తగా గమనిస్తే ఓ అద్భుత దృశ్య చిత్రంగా కనిపిస్తుంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ మాజీ అధినేత అలీ జాఫ్రీ కాలంలో ఈ నిర్మాణం జరిగింది.
దీంతో సాధారణంగా అన్నిరకాల సైనిక వ్యవస్థల్లో ఉన్నట్లు ఏకశిలా సదృశ్యమైన వ్యవస్థలకు బదులు, మొత్తం ఇరాన్ సైనిక సామర్థ్యాలను, ఆయుధ ప్రయోగ నైపుణ్యాలను 31 భాగాలుగా, అనేక ఉప విభాగాలుగా విభజించింది ఇరాన్.
ఇవన్నీ పైకి చూస్తే దేనికదే స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు, దాడుల ప్రణాళిక రూపొందించుకున్నట్లు కనిపిస్తుంది.
దాంతో ఏదో ఒక నాయకుడిని లేదా సర్వసైన్యాధ్యక్షుడిని హతమార్చితే మొత్తం కీలక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం చచ్చుబడిపోతుందన్న సమస్య తలెత్తలేదు.
ఇరాన్ విదేశాంగ మంత్రి(అబ్బాస్ అరాఘ్చి) తన ఎక్స్ సోషల్ మీడియా వేదికలో చేసిన ఓ పోస్టులో “మా దేశానికి తూర్పు, పశ్చిమ సరిహద్దుల్లో అమెరికా జోక్యం చేసుకున్న సాయుధ ఘర్షణల్లో అమెరికా గత రెండు దశాబ్దాల్లో చవిచూసిన పరాజయాలను లోతుగా అధ్యయనం చేశాము. మా రాజధాని మీద అమెరికా చేసిన దాడులు మా యుద్ధ సామర్థ్యాన్ని ఏమీ నీరుగార్చలేదు. వికేంద్రీకరించబడిన సమ్మిళిత యుద్ధ వ్యూహం ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛనిస్తోంది మాకు” అని హెచ్చరించారు.
అన్ని విభాగాల వద్దా సమగ్ర యుద్ధ తంత్రం అమలు చేయగల శక్తి సామర్థ్యాలు, సాంకేతిక సామర్థ్యం, శాస్త్ర విజ్ఞాన ప్రయోగ సామర్థ్యం, నిఘా సేకరణ సామర్థ్యం ఉన్నాయి.
ఇరాన్ రాజకీయ నాయకత్వాన్ని, సైనిక నాయకత్వాన్ని హతమార్చటం ద్వారా దేశాన్ని నీరుగార్చేందుకు, నిర్వీర్యం చేసేందుకు అమెరికా-ఇజ్రాయెల్లు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని తటస్థీకరించేందుకు రూపొందించినదే అరాఘ్చి చెప్పిన ఈ వికేంద్రీకృత సైనిక వ్యూహం.
ఈ వ్యూహంలో భాగంగానే ఇరాన్ వద్ద ఉన్న కీలకమైన ఆయుధ సామాగ్రిని భారీ నేలమాళిగల్లో దాచి ఉంచింది.
ఈ ఆయుధ సామాగ్రిని ధ్వంసం చేయటానికే ఇజ్రాయెల్, అమెరికాలు ఇరాన్ భూభాగంపై ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తున్నాయి.
అరాఘ్చి మాటల్లో సైనిక సామర్థ్యం క్షీణతను కూడా ఓ వ్యూహంగా ఎంచుకున్న విషయాన్ని గమనించాలి.
ఇరాన్ ప్రతిదాడులు మొదలుపెట్టి ఇజ్రాయెల్, అమెరికా, వాటి మిత్ర దేశాల సామర్థ్యాలను కుంగదీసేలా సాగిస్తున్న ప్రతిదాడులు, ఇరాన్ అనుసరిస్తున్న వికేంద్రీకరణ సైనిక వ్యూహంతో మేళవిస్తున్నాయి.
రెండో కోణం: మిత్ర దేశాలపై దాడులు
ఇరాన్ అనుసరిస్తున్న వ్యూహంలో రెండో కోణం పశ్చిమాసియాలో అమెరికా మిత్ర దేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయటం.
ఈ నిర్ణయం వలన ప్రపంచ చమురు మార్కెట్ అతలాకుతలమైంది. పౌర విమానయానం కుదేలైంది. దాంతో ఆయా దేశాలు అమెరికాపై ఒత్తిడి తెస్తున్నాయి.
ఇప్పటివరకూ ఓడరేవులు ఇరాన్ దాడులకు లక్ష్యంగా మారలేదు. కానీ యుద్ధం కొనసాగితే అవి కూడా దాడులకు లక్ష్యాలుగా మారతాయి.
చమురు పరిశ్రమకు చెందిన మౌలిక సదుపాయాలు కూడా లక్ష్యాలుగా మారితే చమురు సరఫరాయే కాక ఆయా దేశాల ఉత్పత్తి సామర్థ్యాలు కూడా కకావికలమవుతాయి.
భవిష్యత్తులో కొంతకాలం ఆయా దేశాల ఉత్పత్తి సామర్థ్యం కుదేలవుతుంది.
మూడో కోణం: అధునాతన ఆయుధాలు – డ్రోన్లు – సముద్ర దాడులు
సుదూరంలో ఉన్న భారీ లక్ష్యాలపై దాడి చేయటానికి సిద్ధంగా ఉన్న ఖండాంతర క్షిపణులు ఇరాన్ వద్ద సిద్ధంగా ఉన్నాయి.
సాంప్రదాయక క్షిపణి నిరోధక వ్యవస్థలను అధిగమించి లక్ష్యాన్ని ఛేదించగల ఫతాహ్ 1 హైపర్సోనిక్ క్షిపణులు ఇరాన్ వద్ద ఉన్నాయి.
అంతకన్నా సులువుగా లక్ష్యాలు సాధించగల ఫతాహ్ 2 హైపర్సోనిక్ క్షిపణి కూడా ఇరాన్ అమ్ముల పొదిలో ఉంది.
ఫతే 110 సిరీస్లో ఉన్న జల క్షిపణులు 15-20 మీటర్ల నిడివి వ్యత్యాసంతో లక్ష్యాలను ఛేదించే ఆయుధాలున్నాయి.
ఇరాన్ ప్రయోగించే ఆయుధాలను గుర్తించి ఛేదించగల వ్యవస్థలను కళ్లుగప్పటానికి అత్యధిక ప్రమాణాలు కలిగిన క్లస్టర్ పేలుడు పదార్థాలు ఇరాన్ వద్ద గణనీయంగా ఉన్నాయి.
భారీ లక్ష్యాల విషయంలో ఈ ఆయుధాలు ఎంత సమర్థవంతంగా పనిచేస్తాయన్నది ప్రశ్నార్థకమే అయినా, వాటి ప్రయోగాన్ని గుర్తించి నిలువరించే వ్యవస్థలను మాత్రం అమెరికా, ఇజ్రాయెల్లు తయారు చేసుకోలేదు.
ఇరాన్ అనుసరిస్తున్న మిశ్రమ యుద్ధ వ్యూహంలో మరో శ్రేణి కీలక ఆయుధాలు షహేద్ 136, షహేద్ 236 డ్రోన్లు.
ఈ డ్రోన్లు సమర్థవంతంగా గల్ఫ్ దేశాల్లోని లక్ష్యాలపై దాడి చేశాయి.
నిదానంగానే అయినా ఇరాన్ ఈ డ్రోన్లను పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేసింది.
సాధారణంగా చూసినప్పుడు అంత సమర్థవంతమైనవి కాకపోయినా, సమూహంగా దాడిలో భాగంగా ఉపయోగించినప్పుడు అత్యాధునిక భారీ సామర్థ్యం కలిగిన లక్ష్యాలను కూడా తృటిలో నాశనం చేయగలుగుతాయి.
కొన్ని డ్రోన్లను రష్యా నుంచి దిగుమతి చేసుకుంది ఇరాన్. ఈ డ్రోన్లలో సిగ్నల్ నిస్తేజం కాకుండా చూసే కోమెట్-ఎం సాంకేతిక సామర్థ్యాన్ని సమకూర్చింది రష్యా.
పావేహ్, సోమౌర్, యా అలీ వంటి వాటితో పాటు ఉపరితల లక్ష్యాలను ఛేదించేందుకు, భారీ ఓడలను బద్దలు కొట్టేందుకు ఉపయోగపడే క్షిపణులు కూడా ఉన్నాయి.
ఈ క్షిపణులు తక్కువ ఎత్తులో ప్రయోగించబడతాయి. ఇక్కడ కీలకమైనదేమిటంటే ఈ మూడు రకాల ఆయుధాలను మూకుమ్మడిగా ప్రయోగించటం ద్వారా శత్రువును గందరగోళపరచటంలోనే వ్యూహ నైపుణ్యం దాగి ఉండటం.
వీటిని చైనా ప్రయోగించిన బీదౌ 3 ఉపగ్రహంతో అనుసంధానించటంతో ప్రయోగ దశలో వీటి సామర్థ్యం మరింత స్పష్టతను సంతరించుకుంటుంది.
ఇరాన్కు చెందిన ఓడను సముద్రంలో ముంచేశామని అమెరికా చెప్తోంది. భారీ ఓడల విషయంలో ఇది నిజమే కావచ్చు కానీ, వేగంగా దాడి చేయగల చిన్న చిన్న ఓడలు ఇరాన్ వద్ద చాలా ఉన్నాయి.
28-30 సముద్ర జలాంతర్గాములు, పేరు తెలీని సముద్ర గర్భంలో ప్రయోగించే సాధనాలు కూడా ఉన్నాయి. సముద్రంలో మందుపాతరలు పెట్టే సాధనాలు, పద్ధతులు కూడా ఇరాన్ వద్ద ఉన్నాయి. కిలో శ్రేణికి చెందిన మూడు సబ్మెరైన్లు, గణనీయమైన సంఖ్యలో మధ్యశ్రేణి సబ్మెరైన్లు, చిన్నవైన గాధిర్ శ్రేణి సబ్మెరైన్లు, సముద్రతీరంలో ప్రయోగించే చిన్న సబ్మెరైన్లు గణనీయంగా ఉన్నాయి.
ఇవి భారీ మైన్లు, టోర్పిడోలు, ఓడలను ధ్వంసం చేసే క్షిపణులతో నిరంతరం సన్నద్ధంగా ఉంటాయి. వేగంగా ప్రయాణించే పడవలు కూడా గణనీయంగా ఉన్నాయి. మనుషులు లేకుండా ప్రయాణించే పడవలు ఎలా ప్రయోగించాలో దాదాపు రెండేళ్ల పాటు పరిశోధనలు జరిపింది ఇరాన్.
ఈ విధంగా సముద్ర జలాల్లో కూడా వీటన్నిటినీ ఉపయోగించి మూకుమ్మడిగా ప్రయోగించేందుకు వీలుగా ఇరాన్ తయారుగా ఉంది.
నాల్గో కోణం: ప్రాక్సీ దళాల రంగప్రవేశం
ఇరాన్ ప్రయోగిస్తున్న యుద్ధ వ్యూహంలో నాల్గో కోణం ఇరాన్ తరఫున యుద్ధరంగంలోకి దిగే బినామీలు (ప్రాక్సీలు). ప్రతిఘటనా కూటమిగా పిలిచే ఈ బినామీల్లో హౌతీలు, హమాస్, పాలస్తీనా కేంద్రంగా పనిచేసే సాయుధ బలగాలు, ఇరాక్కు చెందిన సాయుధ బలగాలు ఉన్నాయి. ఈ శక్తులన్నీ కలిపి సమర్థవంతంగానూ, ఫలవంతంగానూ ఇరాన్ అమలు చేస్తున్న మూకుమ్మడి బహుముఖ దాడులను కొనసాగించటంలో కీలక పాత్రధారులుగా ఉన్నాయి.
అక్టోబరు 2023లో హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసిన నేపథ్యంలో, ఇజ్రాయెల్ సాగిస్తున్న ఎదురుదాడుల్లో ఈ సంస్థలు బాగా బలహీనపడ్డాయి.
ప్రస్తుతం హిజ్బుల్లా లెబనాన్లో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా రెండో యుద్ధ శిబిరాన్ని ప్రారంభించటం ద్వారా ఇరాన్కు సహకరించేందుకు సిద్ధమవుతోంది. తద్వారా ఇజ్రాయెల్ సైనిక వనరులను, ఆర్థిక వనరులను బలహీనపరిచేందుకు పావులు కదుపుతున్నాయి.
హిజ్బుల్లాకు చెందిన అత్యున్నత సాయుధ బలగం రద్వాన్ దళాలను ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుల్లో మోహరింపజేశారని, తద్వారా ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల నుంచి ఇరాన్పై దాడులు చేయకుండా నిలువరించేందుకు సిద్ధమవుతున్నారని రాయిటర్స్ వార్తా సంస్థ మంగళవారం ఓ కథనాన్ని ప్రచురించింది.
ఇప్పటి వరకూ హౌతీలు కదనరంగంలోకి కాలుపెట్టలేదు. యుద్ధం కొనసాగితే ఈ దళాలు కూడా రంగప్రవేశం చేస్తాయి.
అదే జరిగితే ఎర్ర సముద్రం మీదుగా ఇజ్రాయెల్పై భారీ దాడులు చేయటానికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతాయి.
జలసంధి దిగ్బంధనం – ఆయుధాల పొదుపు
మార్చి 13న ఇరాన్ ఓ ప్రకటన జారీ చేసింది. దాని ప్రకారం ఇరాన్ ఇప్పటి వరకూ 800 ఖండాంతర క్షిపణులు, ఓడలను ధ్వంసం చేసే క్షిపణులు ప్రయోగించింది.
2400 డ్రోన్లు ప్రయోగిస్తే 40 శాతం ఇజ్రాయెల్ సైనిక లక్ష్యాలపైనా, మిగిలిన 60 శాతం పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపైనా ప్రయోగించింది.
ఇరాన్కు చెందిన క్షిపణి ప్రయోగ కేంద్రాల్లో 60 శాతం కేంద్రాలు ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో ధ్వంసం అయ్యాయని అంచనా. ఇదే మోతాదులో ఇజ్రాయెల్ కూడా క్షిపణి సామర్థ్యం నష్టపోయింది.
మార్చి రెండో వారానికి వచ్చే సరికి ఇరాన్ ప్రయోగించే డ్రోన్లు, క్షిపణుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇది వ్యూహాత్మకం కూడా అయి ఉండొచ్చు. డ్రోన్లు, క్షిపణుల ప్రయోగం తగ్గినంత మాత్రాన ఆ మేరకు ఇరాన్ ఆయుధ సంపత్తి కరిగిపోయిందని భావించటానికి వీల్లేదు.
ప్రస్తుతానికి మధ్యంతర శ్రేణి షహేద్ క్షిపణులు ప్రయోగిస్తూ మిగిలిన వాటిని రేపటి కోసం పొదుపు చేస్తూ ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ హార్ముజ్ జలసంధిలో గుండా ఏ నౌకలు వెళ్లాలి, ఏవి వెళ్లకూడదు అన్నది శాసిస్తోంది ఇరాన్ మాత్రమే.
హార్ముజ్ జలసంధిని నియంత్రించటం అన్నదే యుద్ధంలో తదుపరి దశ. ప్రపంచ చమురు మార్కెట్ అవసరాల్లో 20 శాతం చమురు రవాణా అయ్యే ఈ మార్గాన్ని ఇరాన్ మూసేసింది. ఈ ప్రాంతంలోని చిన్న చిన్న దీవులైన హార్ముజ్, అబు మూసా, కేశ్మ్, లారాక్, హెంగామ్ వంటి ద్వీపాలను ఆక్రమించుకోవడానికి వీలుగా అమెరికా నావికాదళం అరేబియన్ గల్ఫ్ వైపు మోహరిస్తోంది.
హార్ముజ్ జలసంధి ప్రారంభంలోనే ఇరాన్కు వ్యూహాత్మకంగా కీలకమైన బందర్ అబ్బాస్ ఓడరేవు ఉన్నది. ఈ దీవులను ఆక్రమించుకోవటం ద్వారా జలసంధిపై ఇరాన్ పెత్తనానికి సవాలు విసిరేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
ఇరాన్ నుంచి ఎగుమతి అయ్యే చమురుపై అమెరికా ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అదే జరిగితే గల్ఫ్ దేశాల నుండి ఎగుమతి అయ్యే చమురును కూడా ఇరాన్ అడ్డుకుంటుంది. కానీ ఈ జలసంధి మార్గాలన్నీ ఇరుకైనవి కావటంతో ఇరాన్ అనుసరిస్తున్న బహుముఖ సమ్మిళిత దాడి వ్యూహంతో, జలసంధిపై పెత్తనం కోసం తెగబడుతున్న అమెరికాపై మూకుమ్మడి దాడులు చేసే అవకాశం కూడా లేకపోలేదు. ముందు ముందు పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి.
వ్యాస రచయిత ఢిల్లీ కేంద్రంగా పని చేసే అబ్సర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్లో డిస్టింగ్విష్డ్ ఫెలోగా ఉన్నారు.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.

