క్లుప్తంగా సమస్య ఈ క్రింది విధంగా ఉంది: సరళమైన విలువ నియమం సరుకులు వాటి విలువకు మార్పిడి జరుగుతాయని చెబుతున్నది. వివిధ పరిశ్రమలలో, మూలధన వివిధ సజీవ కూర్పులతోనూ, అదనపు విలువ ఏకరీతి రేటుతోనూ, ఇది వివిధ పరిశ్రమలలో వివిధ లాభాల రేట్లను సూచిస్తుంది. కానీ పెట్టుబడుల మధ్య పోటీ పరిశ్రమలలో లాభాల రేటును సమానం చేస్తుంది.
అదనపు విలువ ఏకరీతి రేటు అనే ఊహను తిరస్కరించడం ద్వారా బహుశా సమస్యను పరిష్కరించుకోవచ్చునని కొందరు అనుకోవచ్చు. ఈ ఊహను వదిలివేసిన క్షణమే, పెట్టుబడిదారీ సంబంధాల విశ్లేషణలో సరళరూపంలోని విలువనియమం మనకు ఇచ్చిన భావ బంధాలన్నిటినీ కోల్పోతాము. అంతేకాక, ఆ ఊహ ఏమీ ఏకపక్షమైనది కాదు. కానీ సైద్ధాంతిక స్థాయిలో పెట్టుబడిదారీ సమాజంలో ప్రతిబింబించే నిజమైన ప్రక్రియ.
ఈ ఊహను ధృవీకరిస్తున్న ‘ఆడం స్మిత్’ రచనను ఉదాహరించిన తరువాత మార్క్స్ ఈ విధంగా చెప్పాడు: ఉత్పత్తి వివిధ రంగాలలో, వేతనాలనూ, పనిదినాలనూ తద్వారా అదనపు విలువ రేట్లను సమం చేసినప్పటికీ; అన్ని రకాల స్థానిక అడ్డంకులచే తనిఖీ చేయబడినప్పటికీ;పెట్టుబడిదారీ ఉత్పత్తి పురోగతితోనూ, ఈ ఉత్పత్తి విధానానికి మొత్తం ఆర్ధిక పరిస్థితులను దీని ఆధీనంలో ఉంచడంతో, ఇది మరింత ఎక్కువగా జరుగుతున్నది. వేతనాలపై ఏ ప్రత్యేకమైన రచనకైనా అటువంటి ఘర్షణల అధ్యయనం ముఖ్యమే అయినప్పటికీ; పెట్టుబడిదారీ ఉత్పత్తి సాధారణ విశ్లేషణలో, యాదృచ్ఛికమూ, అసంబద్ధమైనదానిగా వదిలివేయవచ్చు.
పెట్టుబడిదారీ ఉత్పత్తి విధాన సారాంశ సైద్ధాంతిక అధ్యయనంలో(అందువలన తప్పని సరిగా నైరూప్యం అయిన) ఆర్ధికరంగంలోని వివిధ రంగాలలోని అదనపు విలువ రేట్లలో తేడాలను నియమబద్ధంగా విస్మరించవచ్చు. పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థలోని అవసరమైన అంశాలను(ద్వితీయ అంశాలకు వ్యతిరేకంగా) పరిష్కరించడానికి మనకు వీలు కల్పించడానికి వాస్తవానికి అదనపు విలువ ఏకరూపత అవసరమైన సంగ్రహణ.
మార్క్స్ చూపిన పరిష్కారమేంటంటే, పెట్టుబడి సంపుటి 1లో వినియోగించిన సరళమైన విలువ నియమానికీ, పెట్టుబడిదారీ విధానంలో ధర ఏర్పడటానికి అవసరమైన సంక్లిష్ట అవసరాలకూ మధ్య వైరుధ్యాన్ని గురించి మార్క్స్కు సంపూర్ణ అవగాహన ఉన్నదని పైన చప్పినదాని నుంచి స్పష్టమవుతున్నది. ఏమైనప్పటికీ, అతని విలువ సిద్ధాంతాన్ని వదిలివేయవలసిన అవసరం లేదని అతను భావించాడు. అందుకు బదులుగా, అతని ప్రాథమిక విలువ(ఫ్రేంవర్క్) రూపురేఖలోకి సరుకుల ధరల మరింత క్లిష్టమైన నిర్ణయాలను చేర్చాడు.
మార్క్స్ ఉత్పత్తి ధరల సిద్ధాంత రూపురేఖల సంక్షిప్త వివరణ..
ద్రవ్య- మూలధనం Mతో వ్యక్తిగత పెట్టుబడిదారుడు ఉత్పత్తి సాధనాలను, శ్రమ శక్తినీ కొంటాడు. ప్రస్తుతానికి ఉత్పత్తి సాధనాలన్నీ ఉత్పత్తి ఓకే కాలంలో వినియోగమయ్యాయని ఊహించుకోండి. ముందస్తుగా పెట్టుబడి పెట్టిన మూలధన భాగం విలువ C అనుకుందాం. అదే ఉత్పత్తి సమయంలో అస్థిర పెట్టుబడిగా వెచ్చించిన మూలధన విలువ V అనుకుందాము. కాబట్టి పెట్టుబడిదారుడు వ్యయం చేసింది C + V. ఈ సమయంలో S’ = దోపిడీ లేదా అదనపు విలువ రేటు అయినప్పుడు, ఉత్పత్తి చేసిన సరుకు విలువ C+V+S’ X V. C+Vని మార్క్స్ ఖర్చు-ధర సరుకు అని పిలిచాడు.
ఖర్చు- ధర పెట్టుబడిదారునికి అయ్యే సరుకు ఖర్చులు.పెట్టుబడిదారుడు కార్మికునికి అతని శ్రమ శక్తి విలువనే చెల్లిస్తాడని, కొంత మొత్తంలో అదనపు విలువను ఉచితంగా పొందుతాడని మనకు తెలుసు. మరొక వైపున సరుకు విలువ సరుకు కోసం సమాజం వెచ్చించే ఖర్చు, అంటే సమాజం దాని ఉత్పత్తిలో వెచ్చించే శ్రమ సమయం. ఇప్పుడు లాభం ముందుగా వెచ్చించిన మూలధనం మొత్తంపై అంటే C+V లెక్కించబడుతుంది.
R లాభాల రేటు అయితే, అప్పుడు R(C+V) అతని మొత్తం వ్యయం C+Vపై వచ్చిన లాభం. పెట్టుబడిదారునికి ఈ లాభం ఉండేలా చూసుకోవడానికి సరుకు ధర తప్పనిసరిగా (C+V)+R(C+V)గా ఉండాలి. ఈ ధరే– అంటే అతని మూలధన వ్యయంపై అధికారిక లాభాల రేటును అందించేటటువంటి ధర– దీనిని మార్క్స్ ఉత్పత్తి ధర అని పిలుస్తాడు. మరొక మాటలో చెప్పాలంటే ఉత్పత్తి ధర ఖర్చు- ధర, లాభంలో మొత్తం.
లాభాల రేటు Rను ఏది నిర్ణయిస్తుంది? అన్న ప్రశ్న వస్తుంది. దీనికి జవాబు చెప్పడానికి మనం సంఖ్యా ఉదాహరణను ఆశ్రయిద్దాము. ఒక ఆర్ధికవ్యవస్థ సజీవ కూర్పు కలిగిన మూడు పరిశ్రమలు– A, B, Cలను కలిగి ఉన్నదని అనుకుందాము:
సరళత కోసం మొత్తం సామాజిక మూలధనాన్ని మూడు పరిశ్రమలలో సమానంగా పంపిణీ చేయడాన్ని పరిశీలిద్దాము. దీంతో ప్రతి పరిశ్రమలో వ్యయం 100గా లెక్కించడానికి వీలుగా, కొలతల యూనిట్లను ఎంపికచేద్దాము. దోపిడీ రేటు 100 శాతంగా ఉంటుందని అనుకుందాము. ఈ దిగువ టేబుల్ ఉత్పత్తి లెక్కల విలువ, ధరను చూపుతుంది.
మనం ఉత్పత్తి ధరను నిర్ణయించడానికి(చివరి గడి), మనం 40 శాతం ఏకరీతి లాభాలరేటును ఉపయోగించామన్నది స్పష్టమే. మనం దీనిని ఎలా పొందాము? మొత్తాల దిగువ వరుస నుంచి సమాధానం స్పష్టంగా ఉంది. మనం ఈ దిగువ విధంగా కొనసాగాము. ఆర్ధిక వ్యవస్థను పెట్టుబడిదారులందరి ‘ఉమ్మడి–స్టాక్ సంస్థగా’ పరిగణించండి. ఈ సంస్థ మొత్తం మూలధనం, మొత్తం సామాజిక మూలధనం 300కి సమానం.
పెట్టుబడిదారీ వర్గ దోపిడీ కొరకు మొత్తం అదనపు విలువ 120ని, ఈ సంస్థ సమిష్టిగా కార్మికవర్గం నుంచి సేకరిస్తుంది. అందుచేత ఈ సంస్థ లాభాల రేటు 120 / 300= 40 శాతం. కార్మిక వర్గం నుంచి కొల్లగొట్టిన మొత్తాన్ని ఇప్పుడు ఉత్పత్తిలో పాలుపంచుకున్న పెట్టుబడిదారీ వర్గ సభ్యులకు వారిలో ప్రతి ఒక్కరూ ముందుగా వెచ్చించిన సామాజిక మూలధనంలోని వారి వాటా ప్రకారం వారి మధ్య విభజించబడుతుంది. మన ఉదాహరణలో ముగ్గురు పారిశ్రామిక వేత్తలూ సమంగా వెచ్చించినందున వారిలో ప్రతి ఒక్కరూ మొత్తం లాభంలో మూడవ వంతు పొందుతారు.
సమస్యలు
‘విలువల’ నుంచి ‘ఉత్పత్తి ధరలు పొందే రహస్యం’ ఆ విధంగా ఏమంత రహస్యమైనది కాదు. ఏమైనప్పటికీ, అనేక అర్హమైన విషయాలను చెప్పవలసి ఉంది: మనం సాధ్యమైనంత సరళమైన ఉదాహరణను ఎంపిక చేసుకున్నాము. ఆర్ధిక వ్యవస్థ మొత్తం మూలధనంలో పరిశ్రమల సాపేక్ష వాటాలను మార్చడం ద్వారా మనం విషయాన్నీ క్లిష్టతరం చేయవచ్చు. కానీ, ఉత్పత్తి ధరలను మనకు ఇవ్వడానికి పైన చెప్పిన విధానమే పనిచేస్తుంది.(అది ఇప్పుడు పరిశ్రమల మధ్య సంఖ్యా పరంగా భిన్నంగా ఉంటుంది).
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 44వ భాగం, 43వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
