నియోజకవర్గాల పునర్విభజన(డెలిమిటేషన్) విషయంలో దక్షిణాది ఎంపీలకు, ‘ముందుగా దక్షిణాది’ వైఖరే ఉండాలి.
“జనాభా స్థిరీకరణలో విజయం సాధించినందుకే ఒక రాష్ట్రం తన రాజకీయ ప్రాభావాన్ని ఎందుకు కోల్పోవాలి?” అని దక్షిణాది ఎంపీలందరూ ఈ ప్రశ్నను తప్పక అడగాలి.
నియోజకవర్గాల పునర్విభజన జరగాలా వద్దా అనేది ఇక ఎంతమాత్రమూ ప్రశ్న కాదు. అసలైన ప్రశ్న ఏమిటంటే ఈ పునర్విభజన ఒక ప్రజాస్వామ్య ప్రక్రియగా నిలుస్తుందా లేదా భారత రాజకీయ సమతుల్యతను తిరగరాసే ఒక ఇనుప పిడికిలిగా మారుతుందా?
ఈ అంశం పార్లమెంట్ ముందుకు వస్తే, దక్షిణ భారతదేశానికి చెందిన ప్రతి పార్లమెంట్ సభ్యుడూ ఎదుర్కోవాల్సిన ప్రశ్న ఇది.
మౌనంగా ఉండటానికి, పార్టీ లెక్కింపులకు లేదా రాజకీయ సౌలభ్యానికి సమయం కాదని దక్షిణాది ఎంపీలు గుర్తించాలి. దక్షిణాది ప్రజలు తమను పార్లమెంటుకు ఎందుకు పంపారో గుర్తుచేసుకోవాల్సిన సమయం ఇది. తమ రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉన్నప్పుడు, పార్టీ అధిష్ఠానాల ఆదేశాల బలిపీఠంపై ప్రాంతీయ ప్రయోజనాలను బలి ఇవ్వకూడదు.
విజయాన్ని శిక్షించడానికి అనుమతిస్తారా?..
దశాబ్దాలుగా దక్షిణాది రాష్ట్రాలకు జనాభా పెరుగుదలను అదుపు చేయాలని చెప్పారు. అవి చేశాయి. అక్షరాస్యత, ప్రజారోగ్యం, మహిళా సంక్షేమం, కుటుంబ నియంత్రణలను మెరుగుపరచాలని చెప్పారు. అవి చేశాయి. తమ ఆర్థిక వ్యవస్థలను ఆధునీకరించి, జాతీయ ప్రగతికి చోదక శక్తులుగా మారాలని కోరారు. దాన్నీ అవి నెరవేర్చాయి.
మరి ఇప్పుడు, ఈ బాధ్యతాయుతమైన పరిపాలనకు లభించే బహుమతి రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోవడమే అయితే? అదే సమయంలో చాలా ఎక్కువ జనాభా పెరుగుదల ఉన్న రాష్ట్రాలు పార్లమెంటులో మరింత ఎక్కువ బలాన్ని పొందుతుంటే, ఈ దేశం ఒక ప్రాథమిక ప్రశ్నకు సమాధానం చెప్పాలి.
“బాధ్యతాయుతమైన పరిపాలనకు బహుమతి ఇవ్వబోతున్నారా లేక శిక్షిస్తారా?”
నియోజకవర్గాల పునర్విభజన అనేది కేవలం నియోజకవర్గాల సరిహద్దులను తిరగరాయడం మాత్రమే కాదు. అది రాజకీయ ఆధిపత్యాన్ని/అధికారాన్ని పునర్విభజించడం.
లోక్సభ స్థానాల సంఖ్యే ప్రభుత్వ ఏర్పాటు, జాతీయ విధాన రూపకల్పన, ఆర్థిక చర్చలు, అభివృద్ధి ప్రాధాన్యతల కేటాయింపుల్లో రాష్ట్రాల రాజకీయ బలాన్ని నిర్ధారిస్తుంది. ఆ సమతుల్యతలో వచ్చే ఏ పెద్ద మార్పునూ కేవలం ఒక సాంకేతిక ప్రక్రియగా కొట్టిపారేయలేము.
కాబట్టి జనాభా స్థిరీకరణలో విజయం సాధించినందుకే ఒక రాష్ట్రం తన రాజకీయ ప్రాభావాన్ని ఎందుకు కోల్పోవాలని దక్షిణాది తప్పక ప్రశ్నించాలి.
తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వచ్చిన జనాభా మార్పు అనేది విద్య, వైద్యం, సామాజిక సంస్కరణలు, కుటుంబ సంక్షేమంపై దశాబ్దాలుగా చేసిన పెట్టుబడుల ఫలితం.
దశాబ్దాల పాటు జనాభాను అదుపు చేయాలని రాష్ట్రాలను కోరిన కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని తిరగరాసేటప్పుడు ఆ సాధించిన విజయాన్ని విస్మరించకూడదు.
ఒకవేళ జనాభాయే రాజకీయ ప్రాతినిధ్యానికి అత్యంత ప్రధానమైన, ప్రశ్నించలేని ప్రాతిపదికగా మారితే, సమాజానికి తిరోగమన సందేశం వెళ్లే అవకాశం ఉంటుంది. “మీ జనాభాను పెంచుకోండి-రాజకీయ బలాన్ని పొందండి, జనాభాను అదుపు చేయండి-బలాన్ని కోల్పోండి” ఇది ఎలాంటి జాతీయ విధాన ప్రోత్సాహకం?
కేవలం జనాభా లెక్కలే ఒక ప్రజాస్వామ్యాన్ని నడపగలవా?..
ఇది ఉత్తర-దక్షిణ వివాదం కాదు. దక్షిణ భారతదేశం ఇతరుల ప్రజాస్వామ్య హక్కులను తగ్గించాలని కోరడం లేదు. ప్రతి భారతీయుడికి ప్రాతినిధ్యం లభించే హక్కు ఉంది. కానీ జనాభా లెక్కలు దేశ సమాఖ్య సమతుల్యతను ప్రాథమికంగా దెబ్బతీసే ప్రమాదం ఉన్నప్పుడు, ప్రజాస్వామ్యాన్ని కేవలం జనాభా లెక్కలకే పరిమితం చేయలేము.
భారతదేశం అనేది రాష్ట్రాల కలయిక. రాజ్యాంగంలో సమాఖ్య విధానం అనేది ఒక అలంకారిక పదం కాదు. అది భారత ప్రజాస్వామ్య నిర్మాణంలో ఒక భాగం.
కాబట్టి, దక్షిణాది ఎంపీలు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులుగా విడిపోయి ఈ చర్చలోకి రాకూడదు. కాంగ్రెస్, బీజేపీ, డీఎంకే, అన్నాడీఎంకే, టీడీపీ, వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఐ(ఎం), జేడీఎస్ లేదా మరేదైనా పార్టీ కావచ్చు – జెండాలు వేరైనా, వారు ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాల ప్రయోజనాలు పార్టీల గీతల వెనుక దాగిపోకూడదు.
పార్టీ రాజకీయాలు రేపైనా కొనసాగవచ్చు. కానీ పునర్విభజన ఫలితాలు దశాబ్దాల పాటు ప్రభావం చూపుతాయి.
బలమైన ఆర్థిక వ్యవస్థలు, బలహీనపడే రాజకీయ గొంతులు..
దక్షిణాది తన ఆర్థిక సహకారాన్ని కూడా కచ్చితంగా చర్చల బల్లపై ఉంచాలి. భారతదేశ తయారీ రంగానికి, సాంకేతికతకు, ఔషధ రంగానికి, సేవా రంగానికి, ఎగుమతులకు, ఉపాధికి దక్షిణాది రాష్ట్రాలే ప్రధాన ఇంజిన్లుగా ఉన్నాయి.
వారి ఆర్థిక వ్యవస్థలు జాతీయ ఖజానాకు అపారమైన తోడ్పాటునందిస్తున్నాయి. అయితే ఈ ప్రాంతం ఆర్థికంగా మరింత బలంగా మారుతూ, రాజకీయంగా మాత్రం బలహీనపడే నిజమైన ప్రమాదం ఉంది. ఆ అసమతుల్యతను అభివృద్ధికి చెల్లించే మూల్యంగా అంగీకరించలేము.
దక్షిణాది భారత ఆర్థిక వ్యవస్థకు భారీగా నిధులు అందిస్తూ, దాని పార్లమెంటరీ బేరసారాల శక్తి తగ్గిపోతే, పన్నులు, నిధుల బదిలీ, మౌలిక సదుపాయాలు, ఉపాధి, సాగునీరు, విద్య, పారిశ్రామిక విధానాలలో దాని ప్రయోజనాలను ఎవరు కాపాడుతారు?
జాతీయ ప్రాధాన్యతలు అన్ని ప్రాంతాల ప్రయోజనాలను ప్రతిబింబించేలా ఎవరు చూస్తారు? ఈ ప్రశ్నలకు పునర్విభజనకు ముందే సమాధానం లభించాలి, ఆ తర్వాత కాదు.
తమ ఎంపీల నుంచి దక్షిణాది ఏం ఆశిస్తోంది..
కాబట్టి దక్షిణాది ఎంపీలు ప్రతిపాదిత ఫార్ములాపై పూర్తి పారదర్శకతను, వివరణాత్మక జనాభా, పార్లమెంటరీ డేటాను, తగినంత పార్లమెంటరీ చర్చను, జనాభా నియంత్రణ విధానాలను విజయవంతంగా అమలు చేసిన రాష్ట్రాలకు రక్షణలను డిమాండ్ చేయాలి.
కార్యవిధాన అత్యవసరత పేరుతో రాజకీయ అధికారంలో భారీ మార్పులు తెచ్చే ప్రయత్నాన్ని వారు తిరస్కరించాలి.
అంతకుమించి, వారు రాజకీయ ధైర్యాన్ని ప్రదర్శించాలి. దక్షిణాది తమను గమనిస్తోందని దక్షిణాది ఎంపీలు గుర్తించాలి.
ఎన్ని ప్రసంగాలు చేశారు లేదా ఏ పార్టీ వైఖరిని సమర్థించారనేదాని ఆధారంగా చరిత్ర మిమ్మల్ని అంచనా వేయదు. మీ ప్రాంత రాజకీయ భవిష్యత్తుపై చర్చ జరుగుతున్నప్పుడు మీరు నిలబడ్డారా లేదా అనే దాని ఆధారంగానే మిమ్మల్ని అంచనా వేస్తుంది.
మీ రాజకీయ జీవితం ముగిసిన తర్వాత కూడా తీవ్ర పరిణామాలు చూపించే ఈ ప్రక్రియలో మౌనంగా ఉండే ప్రయాణికులుగా మారకండి. ఢిల్లీ రాజకీయ లెక్కలు దక్షిణాదికి రాజ్యాంగపరమైన ప్రతికూలతగా మారడానికి అనుమతించకండి.
జనాభా పట్ల చూపిన బాధ్యత రాజకీయ శిక్షగా మారడానికి అనుమతించకండి. ప్రజాస్వామ్య సంస్కరణల భాషలో చుట్టబడిన ఇనుప పిడికిలిగా పునర్విభజన మారడానికి అనుమతించకండి.
వచ్చే మూడు రోజులు పార్లమెంట్ క్యాలెండర్లో కేవలం మూడు రోజులే కావచ్చు. కానీ ఆ మూడు రోజుల్లో జరిగేది ఒక తరానికి సరిపడా దక్షిణ భారతదేశపు రాజకీయ బేరసారాల శక్తిని నిర్ధారించవచ్చు. కాబట్టి, కలిసి నిలబడండి. కలిసి మాట్లాడండి. కలిసి చర్చించండి. అవసరమైతే, కలిసి నిరోధించండి. మనకు, ‘ముందుగా దక్షిణాది’ అనేదే ఉండాలి.
సమాఖ్య సమతుల్యత రక్షణే లక్ష్యం..
మనం భారతదేశాన్ని బలహీనపరచాలని కోరుకుంటున్నందున కాదు. మనం ఉత్తర-దక్షిణ విభజనను కోరుకుంటున్నందున కాదు. ప్రతి ప్రాంతం సహకారం గుర్తించబడి, దాని గొంతు గౌరవించబడి, దాని రాజకీయ భవిష్యత్తు సురక్షితంగా ఉన్నప్పుడు మాత్రమే భారతదేశ ఐక్యత బలంగా ఉండగలదు కాబట్టి.
దక్షిణాది తన తోడ్పాటునందించింది. దక్షిణాది ఫలితాలను సాధించింది. దక్షిణాది బాధ్యతను స్వీకరించింది. ఇప్పుడు దక్షిణాది తనకి దక్కాల్సిన హక్కును డిమాండ్ చేయాలి.
పునర్విభజన అవసరమైతే నియోజకవర్గాలను తిరగరాయనివ్వండి. కానీ అది భారతదేశ సమాఖ్య సమతుల్యతను తిరగరాయకూడదు.
దక్షిణాది ఎంపీలు తమ సమర్థతను నిరూపించుకోవాల్సిన సమయం రేపు కాదు. ఇప్పుడే.
(పీవీ కొండల్ రావు – తెలంగాణలోని వరంగల్కు చెందిన విలేకరి. ది వైర్ ఇంగ్లీష్కు రాసిన వ్యాసానికి తెలుగు అనువాదం.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
