భారత స్వాతంత్య్ర సంగ్రామం లెక్కలేనన్ని ధైర్యసాహసాలు, ప్రతిఘటన, త్యాగాల గాథలతో నిండి ఉంది.
వీటిలో అత్యంత స్ఫూర్తిదాయకమైనవి, మరపురానివి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల కథలు. ఈ ముగ్గురు యువ విప్లవకారులు దేశ స్వాతంత్య్రం కోసం చిరునవ్వుతో మృత్యువును ఆహ్వానించారు.
1931 మార్చి 23న వారు పొందిన వీరమరణం, బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అత్యున్నత త్యాగానికి చిహ్నంగా నిలిచింది.
వారి బలిదానాన్ని గుర్తు చేసుకుంటూ మార్చి 23న ‘షహీద్ దివస్'(అమరవీరుల దినోత్సవం)గా మనం జరుపుకుంటున్నాము.
వారి జీవితాలు కేవలం తిరుగుబాటుకు మాత్రమే పరిమితం కాలేదు. అవి దేశభక్తి, ధైర్యం, సామ్రాజ్యవాద దురాగతాలకు, అన్యాయానికి వ్యతిరేకమైన శక్తివంతమైన సోషలిస్ట్ సిద్ధాంతాలకు ప్రతిరూపాలు.
విప్లవ భావాల ఆవిర్భావం
20వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ వలస పాలనలో రాజకీయ అణచివేత, ఆర్థిక దోపిడీ, పౌర హక్కుల హననానికి భారతదేశం గురైంది.
అప్పట్లో చాలా మంది యువతీ యువకులు మితవాద పద్ధతులపై నమ్మకం కోల్పోయి, విప్లవాత్మక జాతీయవాదం వైపు మొగ్గు చూపారు.
ప్రపంచ విప్లవ ఉద్యమాలు, సోషలిస్టు భావజాలంతో ప్రభావితమైన భగత్ సింగ్- స్వేచ్ఛ అంటే కేవలం రాజకీయ మార్పు మాత్రమే కాదని ఆర్థిక, సామాజిక మార్పు కూడా అని నమ్మారు.
సుఖ్దేవ్, రాజ్గురులతో కలిసి ‘హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్’లో భగత్ సింగ్ భాగమయ్యారు.
ఈ సంస్థ విప్లవాత్మక మార్గాల ద్వారా బ్రిటిష్ పాలనను అంతం చేయడానికి కట్టుబడి ఉంది.
మలుపు తిప్పిన సంఘటన – సాండర్స్ వధ
వారి విప్లవ మార్గాన్ని మలుపు తిప్పిన సంఘటన 1928లో లాలా లజపతి రాయ్ మరణం.
సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న సమయంలో, బ్రిటిష్ పోలీసుల లాఠీఛార్జ్ వల్ల రాయ్ తీవ్రంగా గాయపడి చనిపోయారు.
ఈ మరణానికి బ్రిటిష్ అధికారి జేమ్స్ స్కాట్ కారణమని భావించిన ఈ ముగ్గురు, దానికి ప్రతీకారంగా 1928 డిసెంబరులో పొరపాటున బ్రిటిష్ పోలీస్ అధికారి జాన్ సాండర్స్ను కాల్చి చంపారు.
ఇది కేవలం ప్రతీకారం మాత్రమే కాదు— అణచివేతను సహించబోమని చాటిచెప్పిన సాహసోపేతమైన ప్రకటన.
అసెంబ్లీలో బాంబుల దాడి
1929 ఏప్రిల్ 8న ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ప్రాణహాని లేని బాంబులను భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్ విసిరారు.
బ్రిటిష్ ప్రభుత్వం పబ్లిక్ సేఫ్టీ బిల్ పేరుతో తెచ్చిన నిర్బంధ చట్టానికి, ట్రేడ్ డిస్ప్యూట్ బిల్లుకు నిరసన తెలియజేస్తూ పొగ బాంబులు విసిరారు.
ఎవరినీ చంపడం వారి ఉద్దేశ్యం కాదు, కేవలం “చెవిటివారికి వినిపించేలా చేయడం” మాత్రమే వారి లక్ష్యం.
వారు ఉద్దేశపూర్వకంగానే అరెస్టు అయ్యారు. విప్లవ భావాలను వ్యాప్తి చేయడానికి కోర్టును ఒక వేదికగా ఉపయోగించుకున్నారు.
ఈ చర్య భగత్ సింగ్ను నిజమైన దేశభక్తుడిగా, విప్లవ వీరుడిగా మార్చింది. భారత స్వాతంత్య్ర పోరాటంపై ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
చారిత్రాత్మక నిరాహార దీక్ష
జైలులో ఉన్నప్పుడు, భారతీయ ఖైదీల పట్ల గౌరవప్రదమైన ప్రవర్తన కోరుతూ భగత్ సింగ్, తన సహచరులు చారిత్రాత్మక నిరాహార దీక్ష చేపట్టారు.
బ్రిటిష్ ఖైదీలతో పోలిస్తే భారతీయ రాజకీయ ఖైదీల పట్ల చూపుతున్న వివక్ష, అధ్వాన్నమైన పరిస్థితులకు వ్యతిరేకంగా వారు పోరాడారు.
వారాల తరబడి సాగిన ఈ నిరసన దేశవ్యాప్త మద్దతును పొందింది. ఇది వారి శారీరక ధైర్యాన్నే కాకుండా, న్యాయం, సమానత్వం పట్ల వారి నిబద్ధతను చాటిచెప్పింది.
కిరాతకమైన ఉరిశిక్ష
బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లపై అభియోగాలు మోపింది.
దేశవ్యాప్తంగా నిరసనలు, విజ్ఞప్తులు వచ్చింది. అయినప్పటికీ లెక్కచేయక బ్రిటిష్ ప్రభుత్వం అత్యంత కిరాతకంగా వారికి మరణ శిక్ష విధించింది.
ప్రజా ఆగ్రహానికి భయపడిన బ్రిటిష్ వారు, నిర్ణీత సమయం కంటే ముందే రహస్యంగా 1931 మార్చి 23న సాయంత్రం లాహోర్ జైలులో ముగ్గురినీ ఉరితీశారు.
తర్వాత వారి మృతదేహాలను కూడా రహస్యంగా దహనం చేసి, వారికి సరైన వీడ్కోలు లభించకుండా చేశారు.
వీరమరణం – నిర్భయత్వం
వారి త్యాగాన్ని అసాధారణమైనదిగా చేసేది వారి మరణం మాత్రమే కాదు, మరణాన్ని వారు నిర్భయంగా స్వీకరించిన తీరు. ఉరిశిక్ష పడే సమయానికి భగత్ సింగ్ వయస్సు కేవలం 23 ఏళ్లు.
ముగ్గురు విప్లవకారులు చిరునవ్వుతో ఉరికొయ్యల వైపు నడిచారు, “ఇంక్విలాబ్ జిందాబాద్”(విప్లవం వర్ధిల్లాలి) అంటూ నినదించారు. వారు క్షమాభిక్ష కోరడానికి నిరాకరించి, లొంగుబాటు కంటే అమరత్వాన్ని ఎంచుకున్నారు.
భారత స్వాతంత్య్ర పోరాటంపై ప్రభావం
వీరి అమరత్వం సుదూర ప్రభావాలను చూపింది: వారి త్యాగం దేశవ్యాప్తంగా దేశభక్తిని రగిలించింది. విద్యార్థులు, కార్మికులు, సామాన్య ప్రజలు స్వాతంత్య్ర పోరాటంలో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించారు.
యువతకు ధైర్యానికి, ఆదర్శవాదానికి వారు చిహ్నాలుగా మారారు. నేటికీ వారు నిర్భయ పోరాటానికి నిదర్శనంగా నిలుస్తున్నారు.
వారి చర్యలు విప్లవ గ్రూపులకు ఊపునిచ్చాయి. బ్రిటిష్ వ్యతిరేక భావజాలాన్ని తీవ్రతరం చేశాయి.
ప్రతి సంవత్సరం మార్చి 23న వారి త్యాగానికి గుర్తుగా ‘షహీద్ దివస్’గా జరుపుకుంటున్నాము. హుస్సేనీవాలా జాతీయ అమరవీరుల స్మారక చిహ్నం వంటివి వారి ధైర్యసాహసాలను నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటాయి. వారి రచనలు, ప్రసంగాలు నేటికీ తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి.
భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల త్యాగాలు దేశభక్తికి పరాకాష్ట. వారు కేవలం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడలేదు; ఒక న్యాయమైన, సమానమైన, స్వతంత్ర భారతదేశం కోసం పోరాడారు.
వారి అమరత్వం ఒక ముగింపు కాదు. అది ఒక ఆరంభం. భారత స్వాతంత్య్ర ఉద్యమ చివరి ఘట్టానికి అది ఒక నిప్పుకణికలా పనిచేసింది. “వ్యక్తులను చంపవచ్చు కానీ, భావాలను చంపలేరు” అన్న వారి మాటలు శాశ్వతంగా నిలిచిపోతాయి.
స్ఫూర్తిదాయకమైన ఆలోచనలు, రచనలు
భగత్ సింగ్ కేవలం తుపాకీ పట్టిన విప్లవకారుడు మాత్రమే కాదు. తనొక గొప్ప ఆలోచనాపరుడు, రచయిత. జైలులో ఉన్న సమయంలో తను రాసిన లేఖలు నేటికీ స్ఫూర్తినిస్తాయి.
తండ్రి కిషన్ సింగ్కు రాసిన లేఖ: మరణశిక్ష ఖరారైన తర్వాత, తన తండ్రి తనను రక్షించమని బ్రిటిష్ ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారని తెలిసి భగత్ సింగ్ చాలా కలత చెందారు.
అప్పుడు తను తన తండ్రికి, “నా జీవితం అంత విలువైనది కాదు. ఒక గొప్ప ఆశయం కోసం నా జీవితాన్ని త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా తండ్రిగా మీరు నా గౌరవాన్ని కాపాడతారని నేను ఆశిస్తున్నాను”అని రాశారు.
“నేను ఎందుకు నాస్తికుడిని?”
జైలులో ఉన్నప్పుడు తను రాసిన అత్యంత ప్రసిద్ధ వ్యాసం ఇది. అందులోని ఒక ముఖ్యమైన వాక్యం: “విమర్శ, స్వతంత్ర ఆలోచన అనేవి విప్లవకారుడికి ఉండవలసిన రెండు ముఖ్యమైన లక్షణాలు.”
జైలు నుంచే దేశ యువతకు సందేశం: భగత్ సింగ్ ఎప్పుడూ యువతపైనే నమ్మకం ఉంచేవారు. తను తన చివరి రోజుల్లో, “బాంబులు, తుపాకులు విప్లవాన్ని తీసుకురావు. విప్లవం అనే కత్తికి విచక్షణ అనే సానరాయిపై పదును పెట్టాలి”అని అన్నారు.
భగత్ సింగ్ ప్రసిద్ధ సూక్తులు..
♦ “విప్లవం అనేది మానవాళికి విడదీయలేని హక్కు. స్వేచ్ఛ అనేది అందరి పుట్టుకతో వచ్చిన హక్కు.”
♦ “కనికరం లేని విమర్శ, స్వతంత్ర ఆలోచన విప్లవాత్మక ఆలోచనా విధానానికి అవసరమైన రెండు లక్షణాలు.”
♦ “శ్రమయే సమాజానికి నిజమైన ఆధారం.”
భగత్ సింగ్ తన సహచరులకు రాసిన లేఖల్లో, మరణం పట్ల తనకున్న నిర్భయత్వం స్పష్టంగా కనిపిస్తుంది.
ఉరిశిక్షకు ముందు రోజు, “దేశం కోసం ప్రాణత్యాగం చేయాలనే కోరిక తప్ప నాలో ఇప్పుడు మరే ఇతర కోరికా లేదు. నేను చిరునవ్వుతో ఉరికొయ్యను ఎక్కుతాను. దీంతో భారతీయ తల్లులు తమ బిడ్డలు భగత్ సింగ్లాగా ఉండాలని కోరుకుంటారు”అని భగత్ సింగ్ రాశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
