తాము రాజకీయాలకు అతీతులమని ఆర్ఎస్ఎస్ చెప్పుకుంటోంది.
అయితే ప్రియాంక్ ఖర్గే లేఖ మాత్రం ఆ అబద్ధాన్ని బట్టబయలు చేస్తున్నది.
తాము ఒక ‘సాంస్కృతిక సంస్థ’ అని ఆర్ఎస్ఎస్ చేసే వాదన ఆధునిక భారత రాజకీయాల్లో ప్రస్తుతం ఒక పెద్ద చర్చనీయాంశం అయింది.
గత కొన్ని నెలలుగా ఆర్ఎస్ఎస్ అనూహ్యమైన రీతిలో తీవ్ర అంతర్జాతీయ నిఘాను ఎదుర్కొంటోంది.
అమెరికాకు చెందిన ఉభయపక్ష సలహా మండలి అయిన యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ (యూఎస్ సీఐఆర్ఎఫ్), ఆర్ఎస్ఎస్ సంస్థపై ఆస్తుల స్తంభన, ప్రయాణ నిషేధాలు వంటి నిర్దిష్ట ఆంక్షలను విధించాలని అమెరికా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
ఇదే సమయంలో కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్కు లేఖ రాశారు.
ఆ లేఖ వల్ల తలెత్తిన వివాదంతో ఆ సంస్థకు గడ్డు కాలం ఎదురయ్యింది.
ఖర్గే లేఖ న్యాయ, రాజకీయ రంగాలలో ఆర్ఎస్ఎస్పై ఇబ్బందికరమైన ప్రశ్నలను తెరమీదికి తెస్తోంది.
మరొక వైపు రామ మందిర విరాళాల నుంచి రూ 200 కోట్లకు పైగా నిధులను పక్కదారి పట్టించారన్న ఆరోపణలు వచ్చాయి.
దానిపై విచారణ జరిపేందుకు ఐఏఎస్, ఐపీఎస్, ఆర్థిక శాఖల ఉన్నత అధికారులతో కూడిన ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి హిందుత్వ ఉద్యమ సాంస్కృతిక, భావోద్వేగ మూలాలకే సవాలు విసురుతున్నాయి.
ఆర్ఎస్ఎస్ ప్రస్తుతం తన శత వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నది. ఆ సంస్థ అనేక వివాదాలలో చిక్కుకోవడానికి ఇది అత్యంత అనుచితమైన సమయం.
శత వార్షికోత్సవాలు – పారదర్శకత లేమి..
శత వార్షికోత్సవాలు ఘనంగా జరుపుకోవాలనే లక్ష్యంతో గత రెండు సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్లోని దాని అనుబంధ సంస్థలు ఆర్ఎస్ఎస్ను ఆధునిక భారతదేశానికి ఒక పరిణతి చెందిన, విశ్వవ్యాప్తంగా ఆమోదించబడిన సాంస్కృతిక, సంస్కరణవాద పునాదిగా ప్రచారం చేయడం ప్రారంభించాయి.
ఇది హిందువులకు, మెజారిటీ సమాజంలో కలిసిపోవడానికి ఇష్టపడే ఇతర మతాల వారికి సామాజికంగా అనివార్యమైనదిగా, ఐక్యతను చేకూర్చేదిగా కూడా ఉందని ఆర్ఎస్ఎస్ శక్తులు తెలిపాయి.
తన స్వభావంపై ఉన్న అన్ని సందేహాలను, ప్రశ్నలను, అభ్యంతరాలను తొలగించుకోవడానికి శత వార్షికోత్సవ సంవత్సరాన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకోవడానికి బదులుగా, ఆర్ఎస్ఎస్ సంస్థ రిజిస్టర్ కాకపోవడంపై వస్తున్న ఆరోపణలు, చర్చల నుంచి బయటపడేందుకు దారులు వెతుక్కోవాల్సి వస్తోంది.
పౌరులకు, ఎన్జీవోలకు తప్పనిసరిగా వర్తించే నిబంధనల నుంచి తప్పించుకుంటూ, ఈ సంస్థ ఎందుకు పారదర్శకత లేని సంస్థగా పనిచేస్తోందనే ప్రశ్నకు ఆర్ఎస్ఎస్ వద్ద ఇప్పటివరకు సమాధానం లేనట్లు కనిపిస్తోంది.
రామ మందిర ఉద్యమం – నిధుల ఆరోపణలు..
గత పన్నెండేళ్లుగా సంఘ్ పరివార్ను, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని(బీజేపీని) రాజకీయ వెలివేత నుంచి ప్రధాన పాలక పార్టీగా ఎదిగేలా చేయడంలో రామ జన్మభూమి ఆందోళన ప్రధాన సాధనంగా పనిచేసిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
2014లో రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ప్రతి కీలక సందర్భంలోనూ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ హాజరయ్యారు.
ఆ విధంగా పరివార్ రామ మందిర నిర్మాణాన్ని మరింత ముందుకు నడిపించింది.
సంఘ్ పరివార్ నేతృత్వంలో దశాబ్దాలుగా సాగిన ఆధ్యాత్మిక, రాజకీయ పోరాటానికి పరాకాష్టగా భావించబడిన ఈ ఉద్యమం, ఆలయ నిర్మాణం, స్వచ్ఛమైన భక్తికి చిహ్నంగా లక్షలాది సాధారణ పౌరులు తమ కష్టార్జితం, బంగారం, వెండిని విరాళంగా ఇచ్చేలా ప్రేరేపించింది.
నిధుల దుర్వినియోగం, అక్రమ వినియోగం, అసలైన ఆభరణాల స్థానంలో నకిలీవి పెట్టడం వంటి కీలక ఆరోపణలు ఓటర్ల మనోభావాలను దెబ్బతీశాయి.
ఖర్గే లేఖతో బయటపడ్డ ద్వంద్వ వైఖరి..
అచంచలమైన నైతిక విలువలతో ‘అంతిమ విమోచకుడి’ పాత్రను ఆర్ఎస్ఎస్ పోషిస్తున్న నేపథ్యంలో, ఖర్గే లేఖ ఒక విస్మయకరమైన వైరుధ్యాన్ని తెలియజేస్తున్నది.
ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలు ప్రభుత్వ అధికారానికి మద్దతు ఇస్తూ, పౌరులు శాంతిభద్రతల పరిధిలో ఉంటూ తమ పౌర విధులను నిర్వర్తించాలని పిలుపునిస్తున్నాయి.
దీనికి విరుద్ధంగా, సాధారణ పౌరులు, ఎన్జీవోలు, పౌర సమాజ సమూహాలు ఖచ్చితంగా పాటించాలని తాను ఆశించే నియంత్రణ వ్యవస్థలకే తాను దూరంగా ఉండాలని ఆ సంస్థ స్వయంగా ఎంచుకున్నట్లు ఖర్గే లేఖ స్పష్టం చేస్తున్నది.
ఖర్గే లేఖ ఆర్ఎస్ఎస్ ద్వంద్వ వైఖరిని కూడా నొక్కి చెబుతోంది. బహిరంగంగా అందుబాటులో ఉన్న ఆ సంస్థ వార్షిక నివేదికలలో అందుకు ఆధారాలు ఉన్నాయి.
ఆర్ఎస్ఎస్ తన ప్రజా సమీకరణ కార్యక్రమాలతో పాటు, తన బలం, శాఖల సంఖ్య, బహిరంగ సభలు, ఇతర కార్యక్రమాల వివరాలను ఆ నివేదికలలో పేర్కొంటున్నారు.
దేశం నలుమూలలా ఇంత భారీ స్థాయిలో ఉనికి ఉన్నప్పటికీ, ఆర్ఎస్ఎస్ ఇప్పటికీ అధికారికంగా ఉనికిలో లేని సంస్థగానే మిగిలిపోయింది.
ఇటువంటి రిజిస్టర్డ్ కాని సంస్థ, క్షేత్రస్థాయిలో దాని పేరుతో చేపట్టే చర్యలు దాని అగ్ర నాయకత్వాన్ని ప్రత్యక్ష, చట్టపరమైన బాధ్యత నుంచి సమర్థవంతంగా కాపాడుతున్నాయి.
చారిత్రక నేపథ్యం – నిషేధాలు, షరతులు..
స్వాతంత్ర్యానికి పూర్వం కూడా, ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ సామ్రాజ్యవాద వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండేది.
వలస ప్రభుత్వంతో దాని సంబంధం, దాని కార్యకలాపాలను పర్యవేక్షించడం, పరిపాలనాపరంగా అనుకూలత వ్యక్తం చేయడం అనేవి పథకం ప్రకారం ఆడే ఆటగా ఉండేది.
స్వాతంత్ర్యం తర్వాత, మహాత్మా గాంధీ హత్య జరిగిన వెంటనే ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ను నిషేధించింది.
నిషేధాన్ని ఎత్తివేసే విషయాన్ని పరిశీలించే ముందు, ఆర్ఎస్ఎస్పై నిర్మాణాత్మక, చట్టపరమైన స్పష్టత ఉండాలని ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పష్టంగా డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష జోక్యానికి ప్రతిస్పందనగా, ఆర్ఎస్ఎస్ 1949లో తన మొదటి రాతపూర్వక అధికారిక నిబంధనావళిని రూపొందించింది.
ఆ సంస్థ మళ్లీ చట్టబద్ధంగా పనిచేయడానికి కేంద్ర ప్రభుత్వం విధించిన షరతు “భారత రాజ్యాంగం పట్ల తన విధేయతను” కూడా అది స్పష్టంగా పేర్కొంది.
ఆర్థిక పారదర్శకత ఎక్కడ?
చాలా విచిత్రంగా, గురుదక్షిణ సంప్రదాయాన్ని ఎంతగానో ప్రశంసిస్తున్నప్పటికీ, ఆర్ఎస్ఎస్కు ఇప్పటికీ సొంత పేరుతో అఖిల భారత స్థాయిలో బ్యాంకు ఖాతా గానీ, ప్రత్యక్ష ఆస్తి యాజమాన్యం గానీ లేదు.
ఈ సంస్థాగత నిర్ణయం ఆర్ఎస్ఎస్ను ఆర్థికంగా పారదర్శకత లేకుండా చేసింది.
భారత ప్రభుత్వ రెవెన్యూ విభాగాలు ఆర్ఎస్ఎస్ను “డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది”, “చట్టపరంగా ఆర్ఎస్ఎస్ను ఏ విధంగా వర్గీకరించారు” అని నేరుగా ప్రశ్నించింది.
అయినప్పటికీ, విచారకరంగా అలాంటివేవీ లేవనే జవాబు మిగిలింది. అధికారిక పత్రాల విషయంలో ఆర్ఎస్ఎస్ ఒక అదృశ్య రూపంగానే మిగిలిపోయింది.
చాలా స్పష్టంగా, ఆర్ఎస్ఎస్ వేలాది చిన్న, చట్టబద్ధమైన, స్థానికంగా నమోదైన అనుబంధ ట్రస్టుల (పాఠశాలలు, భూములు, కార్యాలయాలు మొదలైనవాటిని నిర్వహించేవి) ద్వారా పనిచేస్తున్నప్పటికీ, దాని ప్రధాన మాతృ సంస్థను ప్రామాణిక ఆర్థిక ఆడిటింగ్ యంత్రాంగాలకు దూరంగా ఉంచింది.
ఫలితంగా రాజకీయ పార్టీలు లేదా ప్రధాన ఎన్జీవోలకు అవసరమైన కఠినమైన, కేంద్రీకృత ఆర్థిక అంశాలు వెల్లడించకుండానే దాని నాయకులు ప్రజా విధానం, రాజకీయాలపై పెద్ద ప్రభావాన్ని చూపగలుగుతున్నారు.
అయినప్పటికీ, 2025లో ఎర్రకోట నుంచి చేసిన తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి మోదీ ఆర్ఎస్ఎస్ను “ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జీవో”గా ప్రకటించారు.
ఖర్గేకు తన తొలి అనధికారిక సమాధానంలో, “హిందూ ధర్మం నమోదు కాలేదు” అని భగవత్ వాదించారు.
కర్ణాటక హోం మంత్రి విమర్శను “రాజకీయ జిమ్మిక్కు” అని కూడా అభివర్ణించారు.
నిస్సందేహంగా, ఆర్ఎస్ఎస్ అధిపతి విశ్వాసులను తప్ప మరెవరినీ మోసగించని ఒక విషయాన్ని నిరూపించడానికే కాకుండా, ఖర్గే లేవనెత్తిన చట్టబద్ధమైన రాజ్యాంగ ప్రశ్నను తప్పించుకోవడానికి కూడా వికేంద్రీకృత మత సంప్రదాయంతో ఒక తప్పుడు సమానత్వాన్ని చూపారు.
బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు..
ఒక పెద్ద, ప్రభావవంతమైన సంస్థను దాని స్వరూపాన్ని, సంస్థాగత వివరాలను బహిరంగపరచమని అడగడం అనేది ఖచ్చితంగా రాజకీయ ఎత్తుగడ కాదు.
తాము సేవ చేస్తామని చెప్పుకునే పౌరుల పట్ల సంస్థలు పాటించాల్సిన పారదర్శకతను సాధించే ప్రయత్నమని కూడా చెప్పాలి.
అకౌంటింగ్, పరిపాలనా వివరాలు అందించడం ‘అనవసరం’ అని ఆర్ఎస్ఎస్ నిరంతరం వాదిస్తూ ఉంటుంది.
దీనికి విరుద్ధంగా, 2014 నుంచి పరిశోధనా సంస్థల నుంచి ప్రజలతో సంబంధం ఉండే సంస్థల వరకు అనేక పౌర సమాజ సంస్థలు నిధుల సేకరణ, వినియోగం విషయంలో కఠినమైన పరీక్షకు గురికావడమే కాకుండా, వాటి పనితీరును కూడా కేంద్ర ప్రభుత్వం అత్యంత కష్టసాధ్యం చేసింది.
ఎన్జీవోలు, మానవ హక్కుల బృందాలు, పరిశోధనా సంస్థలు, స్వతంత్ర డిజిటల్ మీడియా కోసం చట్టాలు, నిబంధనలను (ఉదాహరణకు, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం లేదా ఎఫ్సీఆర్ఏ) కఠినతరం చేయడంతో పాటు, చాలా సంస్థల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం జరిగింది. ఈ చర్యలు ఆ సంస్థల సహజ మరణానికి దారితీశాయి.
సాంప్రదాయ పౌర సమాజ సంస్థలకు ఒకటి, దేశంలోని అత్యంత శక్తివంతమైన సైద్ధాంతిక ఉద్యమానికి మరొకటి – ఈ రెండు రకాల నియమ నిబంధనలను బీజేపీ విశ్వసిస్తుందని చాలా స్పష్టంగా రుజువవుతున్నది.
భారతదేశంపై సంఘ్ పరివార్ రాజకీయ పట్టు సాధించినప్పటి నుంచి దానిని గమనిస్తే, ఆర్ఎస్ఎస్ తన రాజకీయ వ్యవస్థ కోసం చట్టబద్ధత లేని నిర్మాణాన్ని ఎంచుకుందని స్పష్టమవుతున్నది.
ఎందుకంటే దాని నాయకులు మొదటి నుంచీ రాజకీయ జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
1980ల మధ్యలో బజరంగ్ దళ్ను స్థాపించినప్పుడు, రామమందిర ఉద్యమం సందర్భంగా వారు సాగించిన తీవ్రవాద చర్యలకు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్లను కూడా జవాబుదారీగా నిలబెట్టకుండా ఉండేందుకు అది ఒక ఎత్తుగడగా వ్యవహరించారు.
సంఘ్ పరివార్లో, 1950వ దశకం నుంచి క్రమం తప్పకుండా సమన్వయ బైఠక్లు(ఆర్ఎస్ఎస్ నిర్వహించే వార్షిక మూడు రోజుల సదస్సు) నిర్వహించే విధానం సుప్రసిద్ధం.
బీజేపీకి పూర్వ రాజకీయ విభాగం అయిన భారతీయ జనసంఘ్ అటువంటి సమావేశాలకు హాజరయ్యేది.
1980 ఏప్రిల్లో బీజేపీ ఏర్పడిన తర్వాత, ఈ సమావేశాలకు బీజేపీ దూరంగా ఉండేది. 1986లో ఎల్కె అద్వానీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే తిరిగి పాల్గొనడం ప్రారంభించింది. మోదీ హయాంలో కూడా ఇది కొనసాగింది.
అయితే ఇటువంటి సమావేశాల సంఖ్య తగ్గింది. కానీ ఈ కాలంలో అనధికారిక, ముఖాముఖి చర్చలు చాలా ఎక్కువగా జరిగాయి.
రాజకీయాలకు అతీతమా? – వాస్తవమేమిటి?
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సాంఘిక శాస్త్రవేత్త క్రిస్టోఫ్ జాఫ్రెలాట్, భారతదేశం వాస్తవానికి ఒక “చీకటి రాజ్యం”గా మారడంలో ఆర్ఎస్ఎస్ను ఒక కీలక రూపశిల్పిగా అభివర్ణించారు.
ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక లక్ష్యాలు కేవలం దాని సైద్ధాంతిక వారసురాలైన బీజేపీ వల్ల మాత్రమే కాకుండా, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన కీలక వ్యక్తులతో ముడిపడి ఉన్న వ్యవస్థలు, సంస్థల విస్తృతమైన నెట్వర్క్ ప్రయత్నాల వల్ల కూడా నెరవేరుతున్నాయి.
ఆర్ఎస్ఎస్ నియమిత కార్యనిర్వాహకులు లేదా కార్యకర్తల సమన్వయంతో నడిచే తన బహుళ అనుబంధ సంస్థల ద్వారా, ఈ సంస్థ సమాజాన్ని ఏక సంస్కృతిమయం చేస్తోంది.
భారత రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా, దేశ సహజ బహుళత్వాన్ని తొలగించి, దాని స్థానంలో అత్యంత ప్రామాణికమైన, కేంద్రీకృతమైన గుర్తింపు, చరిత్రను ప్రవేశపెట్టే ప్రయత్నాలకు ఆర్ఎస్ఎస్ సారథ్యం వహిస్తోంది.
తాము ఒక ‘సాంస్కృతిక సంస్థ’ అని ఆర్ఎస్ఎస్ చేసుకునే వాదన ఆధునిక భారత రాజకీయాల్లో చాలా ఎక్కువగా చర్చించబడిన అంశాలలో ఒకటి.
దానికి గొప్ప గొప్ప వాదనలు ఉన్నప్పటికీ, ఆర్ఎస్ఎస్ ప్రభావం భారతదేశ రాజకీయ, సామాజిక, విధాన రంగాలలో విస్తరించి ఉంది. దీనివల్ల చాలామంది విశ్లేషకులు దాని వాదనలను తోసిపుచ్చుతున్నారు.
మహాత్మా గాంధీ హత్య తర్వాత ఆర్ఎస్ఎస్పై నిషేధాన్ని ఎత్తివేయడానికి భారత రాజ్యాంగాన్ని ఆమోదించాలనే షరతును అంగీకరించిన అనంతరమే ఆర్ఎస్ఎస్పై నిషేధం ఎత్తివేయబడింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 4 దానికి “రాజకీయాలు లేవు, పూర్తిగా సాంస్కృతిక కార్యకలాపాలకు అంకితమైంది” అని పేర్కొన్నప్పటికీ, ఇది కేవలం ఒక కపట నాటకం అని అందరికీ తెలిసిన విషయమే.
ఆర్ఎస్ఎస్ స్వయంగా ఎన్నికలలో పోటీ చేయదు. రాజకీయ పదవులు చేపట్టదు. అభ్యర్థులను నిలబెట్టదు.
కానీ దాని ప్రచారకులు, స్వయంసేవకులలో చాలామంది నిర్దిష్ట అభ్యర్థుల కోసం, ప్రధానంగా బీజేపీ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తారు. ఆర్ఎస్ఎస్ రాజ్యాంగంలోని అదే విభాగం స్వయంసేవకులను ‘ఏదైనా రాజకీయ పార్టీలో’ చేరడానికి కూడా అనుమతిస్తుంది.
ఆర్ఎస్ఎస్ ఒక పరివార్కు స్పష్టమైన సంస్థాగత పితామహుడిగా ఉంది.
బీజేపీ, భారతీయ మజ్దూర్ సంఘ్, అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ వంటి అనేక ఇతర అనుబంధ సంస్థల ద్వారా కూడా రాజకీయాలు దానిపై ప్రభావం చూపుతాయి.
ఎందుకంటే ఈ సంస్థలు మరింత ప్రత్యక్షంగా ‘రాజకీయాలలో’ ఉన్నాయి.
అయినప్పటికీ, ఆర్ఎస్ఎస్ వైఖరి లెక్కలతో కూడుకున్నది. అది రాజకీయాలను కేవలం ఎన్నికల కోణంలోనే చూస్తుంది. అనేక రాజకీయ పరిణామాలపై ఆర్ఎస్ఎస్కు అభిప్రాయం ఉన్నప్పటికీ, అది తనను తాను రాజకీయాలకు అతీతంగా చిత్రీకరించుకుంటుంది. ఖర్గే లేఖ బట్టబయలు చేయాలనుకుంటున్నది ఇదే.
దాని పనితీరు స్వభావం, పరిధి అటువంటి పరిశీలనను కోరినప్పటికీ, ప్రభుత్వ పర్యవేక్షణకు దూరంగా ఉండటం ద్వారా, ఆర్ఎస్ఎస్ తన ప్రత్యర్థులను మాత్రమే కాకుండా, ఖర్గే లేఖలో వలె స్వతంత్ర, భావజాలం లేని పౌర విమర్శ పనిచేసి, వర్ధిల్లగల మధ్యేమార్గంలో నడిచే వారిని కూడా నిర్వీర్యం చేయగలదు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
