సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఆర్టీసీ కార్మికులు ఈ నెల 22 నుంచి నిరవధిక సమ్మెకు దిగారు.
సమ్మె రెండో రోజు నర్సంపేట డిపో డ్రైవర్ ఆవేశంతో ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం.
ఆ కార్మికుడికి ప్రగాఢ సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతి సర్వత్ర వ్యక్తమవుతున్నది.
ఆ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం, ప్రభుత్వంలో లేదా ఆర్టీసీలో శాశ్వత ప్రాతిపదికన ఒకరికి ఉద్యోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి.
కార్మికుల ఆందోళన, ఆవేశం, ఆగ్రహం అర్థం చేసుకోదగినవే. విస్తృత ప్రజా మద్దతును కూడగట్టి ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాల్సిన స్థితికి నెట్టడానికి అవసరమైన పద్ధతులు అవలంబించాలి.
కార్మికులకు అండగా నిలబడిన వివిధ సంఘాలు..
అంతేతప్ప ఆత్మ బలిదానం సమస్యకు పరిష్కారం కాదని తెలంగాణ ఆర్టీసీ కార్మికులందరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి.
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఒంటరిగా లేరు. ఇప్పటికే వివిధ సంఘాలు, రాజకీయ పార్టీలు తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అండగా నిలబడ్డాయి.
అఖిల భారత కిసాన్ సభ తెలంగాణ రాష్ట్ర మహాసభలు ప్రత్యేకంగా సమ్మెకు మద్దతు తెలియజేస్తూ ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించాయి.
ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సంపూర్ణ మద్దతును ప్రకటించింది.
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె రాష్ట్రం, దేశంలోనే కాక ప్రపంచంలోని వివిధ దేశాలకు కూడా పాకింది.
బ్రిటన్ కమ్యూనిస్టు పార్టీ కూడా సమ్మెకు సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ, కార్మికులు విజయం సాధించాలని కోరుతూ ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్కు ఒక సందేశాన్ని పంపింది.
ప్రపంచంలోని వివిధ కార్మిక సంఘాలు కూడా సమ్మెకు సంఘీభావం తెలియజేస్తున్నాయి.
కార్యాచరణ వైపు అడుగులు వేయాలి..
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు కిరాతక పాలనను భారతదేశ ప్రజలం ఏకోన్ముఖంగా పోరాడి తరిమికొట్టాం.
తెలంగాణ కార్మికులు కూడా మనో నిబ్బరం, ఆత్మ ధైర్యం, పట్టుదలతో ప్రభుత్వాన్ని ఒంటరిపాటు చేసి సమస్యలు పరిష్కరించుకునేందుకు తీసుకోవాల్సిన కార్యాచరణ వైపు ఆలోచన చేయాలి.
సంఘం ఏర్పాటు చేసుకోవడం, వాక్, సభ, పత్రికా స్వాతంత్ర్యం ఎవరి దయ, భిక్షం కాదు. భారతదేశ కార్మిక వర్గం పోరాడి, సంఘం ఏర్పాటును ఒక హక్కుగా సాధించి పెట్టింది.
అదే కార్మిక సంఘాల చట్టం 1926.
భారత రాజ్యాంగం కూడా సంఘం ఏర్పాటు చేసుకునే హక్కును ఆర్టికల్ కింద ప్రాథమిక హక్కుగా గ్యారెంటీ చేసింది.
కానీ చూసి రమ్మంటే కాల్చి వచ్చిన విధంగా మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఒక పోలీస్ అధికారి సమ్మె చేస్తున్న కార్మికులకు టెంట్లు, ఇతరత్రా సదుపాయాలు సరఫరా చేయవద్దని ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆ అధికారిని సస్పెండ్ చేయాలి.
ఉమ్మడి బేరసారాల హక్కు – అంతర్జాతీయ కార్మిక సంస్థ ఆమోదించిన తీర్మానం..
ఈ క్రమంలోనే భారతదేశంలో కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అమల్లోకి వచ్చింది. ఇది చట్టం కాదు, కేవలం పెద్దమనుషుల ఒప్పందం.
యాజమాన్యం, కార్మికుల మధ్య వివాదాల పరిష్కారానికి ఒక వేదిక అవసరం.
అందుకే గుర్తింపు సంఘం ఎన్నికలు అమల్లోకి వచ్చాయి. కానీ 2019 సమ్మె సందర్భంగా నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో, సంఘాలు లేవని, కేవలం వెల్ఫేర్ కమిటీలు మాత్రమే ఉంటాయని ప్రకటించి సంఘాలను నిరాకరించింది.
ప్రమాదకర ఆట ఆడుతున్న అధికార వర్గం..
ఇలాంటి నియంత పోకడలు ప్రమాదకరమని, పరిశ్రమల ఉనికికి భంగం కలిగిస్తాయని చరిత్ర రుజువు చేసింది.
నేటి కాంగ్రెస్ ప్రభుత్వం “మాది ప్రజా ప్రభుత్వం” అని, ప్రగతి భవన్ కంచెలు పగలగొట్టామని బాజాలు వాయించుకుంటున్నది.
నిన్న మంత్రివర్గ సబ్ కమిటీ “కార్మికులు నిరసన తెలియజేయడం వారి హక్కు, దాన్ని గుర్తిస్తున్నాం, అందుకే నిర్బంధం ఉపయోగించలేదని” మీడియా ముందు బహిరంగంగా ప్రకటించింది.
అదే మంత్రివర్గం అదే సమావేశంలో ఆర్టీసీలో “కార్మిక సంఘాలు ఉంటాయి. వాటిని పునరుద్ధరిస్తున్నాం.
గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తాం” అని ప్రకటించి ఉండాల్సింది. ఇందుకు ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు. కానీ మంత్రివర్గం ఆ ప్రకటన చేయలేదు. దీన్నిబట్టి ప్రభుత్వం చెప్పేదానిని శంకించడానికి అవకాశం కలుగుతున్నది.
ఒప్పందానికి సిద్ధం కావాలి..
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికులు ఒక ముఖ్య భూమిక పోషించారని గత టీఆర్ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం మాటల్లో చెబుతున్నాయి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ప్రధానంగా ముందుకు తేబడింది. కానీ నేటి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు నిత్యం అవమానాలు, వేధింపులు, క్రమశిక్షణా చర్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారి మీద జరుగుతున్న వేధింపులు, చీత్కారాలు, విచ్చలవిడిగా తీసుకుంటున్న క్రమశిక్షణా చర్యలు తక్షణం అరికట్టాలి.
ఆర్టీసీ కార్మికులలో ఆకస్మిక మరణాలు ఏ రంగంలో లేనంతగా పెరుగుతున్నాయి. దీనికి కారణం పెరుగుతున్న పని ఒత్తిడి, అధికారుల వేధింపులు తప్ప మరోటి కాదు. దీన్ని తక్షణం అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిది మాత్రమే. పోలీస్ డిపార్ట్మెంట్ సైతం థర్డ్ డిగ్రీ పద్ధతులు సరికాదు, ప్రజలతో సక్రమంగా మెలగాలని శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆర్టీసీలో డిపో మేనేజర్, ఒక కండక్టర్ లేదా శ్రామిక్.. మనమంతా అన్నదమ్ములం, ఒకే కుటుంబ సభ్యులం అనే సహృద్భావ వాతావరణం ఏర్పరచడం ఈ సమ్మె విరమణలో ఒక కీలక అంశంగా ఉండాలి.
ఇతర ఆర్థికపరమైన అంశాలపై ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాలు ఉమ్మడిగా ఒక గౌరవప్రదమైన ఒప్పందానికి రావచ్చు. తక్షణం మంత్రివర్గ ఉపసంఘం మేనమామలు లెక్కపెట్టకుండా కార్మిక సంఘాలతో చర్చించి ఒక గౌరవప్రదమైన ఒప్పందానికి రావాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
