భగవత్ ప్రధాన లక్ష్యం విశ్వ ఏకత్వాన్ని ప్రోత్సహించడం కాదని, భారతదేశంలో సంఘ్ పరివార్ చేసిన ఘోరమైన చర్యలను కప్పిపుచ్చడమేనని అనిపిస్తోంది.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్(చీఫ్) మోహన్ భగవత్ విదేశాల్లో మూడు దేశాల పర్యటన చేపట్టారు.
ఈ వరుసలో మొదటిది అమెరికా. అక్కడ కొన్ని ఇతర కార్యక్రమాలతో పాటు, న్యూయార్క్లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో సభను ఉద్దేశించి ప్రసంగించడం ఆయన ప్రధాన కార్యక్రమం. దీనికి 5,000 మందికి పైగా హాజరవుతారని భావించారు.
ఆర్ఎస్ఎస్ గురించిన అపోహలను తొలగించడం, సంభాషణలు జరపడం, విశ్వ ఏకత్వ సందేశాన్ని వ్యాప్తి చేయడం ఈ పర్యటన ప్రకటించిన ఉద్దేశం.
ఈ ప్రతిపాదిత సమావేశానికి ముందు, దాదాపు 61 మానవ హక్కుల సంఘాలు భారీ నిరసనలు చేపట్టాయి. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘ్ పరివార్ ద్వేషపూరిత రాజకీయాలను వారు ఎత్తిచూపారు.
యూదుల మారణహోమానికి అడాల్ఫ్ హిట్లర్ను కీర్తిస్తూ, హిందూ జాతీయవాదులకు ఇదే తరహా దేశ నిర్మాణ పద్ధతిని సిఫార్సు చేసిన ఆర్ఎస్ఎస్ వర్గాల రాతలను నిరసనకారులు ప్రముఖంగా ప్రస్తావించారు.
మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ చంపిందనే బ్యానర్లను కూడా నిరసనకారులు ప్రదర్శించారు. భారత సంతతికి చెందిన న్యూయార్క్ నగర మేయర్ జోరాన్ మమ్దానీ కూడా ఆర్ఎస్ఎస్ను విమర్శించారు.
ఆర్ఎస్ఎస్ కార్యక్రమం పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే, ఆ కార్యక్రమాన్ని తాను ఆపలేకపోతున్నానని ఆయన తన అసహాయతను వ్యక్తం చేశారు.
తాను పెరిగిన భారతదేశం(ఆయన భారతదేశానికి చెందిన ప్రముఖ చలనచిత్ర దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు) వైవిధ్యాన్ని గౌరవించిందని, కానీ నేటి భారతదేశం అసహన రాజ్యంగా మారిపోయిందని కూడా ఆయన అన్నారు.
భగవత్కు వ్యతిరేకంగా జరిగిన ఈ నిరసనలలో అనేక హిందూ సంఘాలతో పాటు మానవ హక్కులను గౌరవించే ఇతరులు కూడా పాల్గొన్నారు.
ఉదారవాద ముసుగులో వెలివేత రాజకీయాలు..
భగవత్ సమావేశాన్ని ప్రధానంగా ఐడెంటిటీ సమస్యల కోసం పనిచేసే 200లకు పైగా సంస్థలు నిర్వహించాయి.
ఈ సమావేశంలో, తన వెలివేత రాజకీయాలను దాచిపెడుతూ, భగవత్ ఒక ఉదారవాదిగా నటించే ప్రయత్నం చేశారు.
వైవిధ్యం అనేది మన సహజమైన ఐక్యతకు ఒక అలంకారం లాంటిదని, ముస్లింలను భారతదేశం నుంచి పంపించేయాలని కోరుకునే హిందువులు అసలు హిందువులే కారని ఆయన వ్యాఖ్యానించారు.
ఒక సంస్థను మాటలతో కాదు, చేతలతో అంచనా వేయాలి..
గొప్ప మాటలు. ఒక వ్యక్తిని లేదా సంస్థను మనం ఎలా అంచనా వేస్తాం? వారి మాటల ద్వారా వారా? లేదా వారి చేతల ద్వారా వారా?
భిన్నత్వంలో ఏకత్వం, సమన్వయం, మతంతో సంబంధం లేకుండా ప్రజల లోతైన ఏకీకరణ అనేది భారతదేశపు గత చరిత్రకు గీటురాయి.
స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో, భగత్ సింగ్ ఆదర్శాలతో, అంబేద్కర్ విలువల తో, గాంధీ సోదరభావంతో, బ్రిటిష్ బానిసత్వం నుంచి స్వాతంత్ర్యం కోసం ప్రజలు పోరాడారు.
ఒకవైపు ఆర్ఎస్ఎస్-హిందూ మహాసభ, మరోవైపు ముస్లిం లీగ్ ఈ ఏకీకృత ప్రక్రియకు దూరంగా ఉండిపోయాయి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పునాదులపై ఆధారపడినదే ఈ జాతీయ స్వాతంత్ర్య ఉద్యమం.
ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ భారత దేశ నిర్మాణ ప్రక్రియకు దూరంగా ఉండటమే కాకుండా, ముస్లింలకు వ్యతిరేకంగా (ఆ తర్వాత క్రైస్తవులకు వ్యతిరేకంగా కూడా) ద్వేషాన్ని వ్యాప్తి చేయడంలో చురుకుగా పాల్గొంది.
అంతేకాక బ్రిటిష్ పాలకులకు వివిధ మార్గాల్లో సహాయం చేసింది. తన శాఖలు, పాఠశాలలు, మీడియా, ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా అది వ్యాప్తి చేసిన ద్వేషం మతపరమైన అల్లర్లకు దారితీసింది.
ఇందులో ప్రధాన బాధితులు ముస్లింలే. బ్రిటిష్ పాలనలో ముస్లిం, హిందూ మతతత్వం సమానంగా పోటీ పడగా, స్వాతంత్ర్యం తరువాత ఆర్ఎస్ఎస్ మతతత్వం ఆధిపత్యం చెలాయించింది. ఇది రెండు ప్రధాన వర్గాల మధ్య తీవ్రమైన అగాధాన్ని సృష్టించడానికి దారితీసింది.
1993 ముంబై, 2002 గుజరాత్, 2013 ముజఫర్నగర్, 2020 ఢిల్లీలో ముస్లింలపై జరిగిన మారణహోమాలకు కారణం ఈ ద్వేషమే.
గుజరాత్ కూడా తన రాజకీయాల నిజ స్వరూపాన్ని చూపించింది, ఇక్కడ బిల్కిస్ బానో ఒకే ఒక్క కేసు వాటన్నింటినీ బట్టబయలు చేస్తుంది.
ఒక గర్భిణీ ముస్లిం మహిళపై సామూహిక అత్యాచారం జరిగితే, దోషులు కొంతకాలం జైలులో గడిపిన తర్వాత విడుదలయ్యారు. మహిళల పట్ల వారికి ఉన్న గౌరవం ఇదే.
ఇది పవిత్రమైన ఆవు అనే అంశాన్ని కూడా తెరపైకి తెచ్చింది, ఇది అఖ్లాక్, రక్బర్ ఖాన్ వంటి అనేక మంది ముస్లింలు, దళితుల మూక హత్యలకు దారితీసింది. ఉనాలో దళిత పురుషులను కొరడాతో కొట్టిన ఘటన, దళితుల పట్ల ఆర్ఎస్ఎస్ వైఖరికి ఒక పెద్ద ఉదాహరణగా నిలిచిపోయింది.
క్రైస్తవులు, ముస్లింలపై కొనసాగుతున్న దాడులు..
1980ల దశాబ్దం నుంచి, క్రైస్తవులు కూడా సంఘ్ బహిరంగ దాడులకు గురయ్యారు. పాస్టర్ స్టెయిన్స్ను ఆయన ఇద్దరు మైనర్ కుమారులతో సహా సజీవ దహనం చేసిన ఘటనను అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ కెఆర్ నారాయణన్ ‘మానవత్వం సిగ్గుపడే చీకటి చేష్టల జాబితా’కు చెందినదిగా సముచితంగా అభివర్ణించగా, ‘క్రైస్తవం ఒక విదేశీ మతం’ అనే నినాదాన్ని అది చురుకుగా ప్రచారం చేసిందని కంధమాల్ హింస మరింత స్పష్టంగా చూపించింది.
ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగం కేంద్రంలో 12 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న గత దశాబ్ద కాలంలో ముస్లింలు, క్రైస్తవులకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సందేశం మరింత తీవ్రమైంది.
ఇటీవల ప్రార్థనా సమావేశాలపై దాని దాడుల తీవ్రత పెరిగింది. ముస్లింలు పూర్తిగా అట్టడుగుకు నెట్టబడ్డారు. ఆర్ఎస్ఎస్ రాజకీయ సంతానమైన బీజేపీకి నేడు మొత్తం 1,000 మందికి పైగా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటే, వారిలో ఒక్కరు కూడా ముస్లిం లేకపోవడం గమనించదగ్గ ఆసక్తికరమైన విషయం. భారతదేశంలో ముస్లింల పట్ల భగవత్ వ్యవహరించే తీరుకు ఇదే నిదర్శనం.
విదేశాల్లో మత స్వేచ్ఛను పర్యవేక్షించడానికి, అమెరికా ప్రభుత్వానికి సిఫార్సులు చేయడానికి యూఎస్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన స్వతంత్ర, ద్విపక్ష ఫెడరల్ కమిషన్ అయిన ‘యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్'(యూఎస్సీఐఆర్ఎఫ్), 2025లో భారతదేశాన్ని “ప్రత్యేక ఆందోళన కలిగించే దేశం”గా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరింది.
ఆర్ఎస్ఎస్తో సహా వ్యక్తులు, సంస్థలపై లక్ష్యిత ఆంక్షలు విధించాలని కూడా యూఎస్సీఐఆర్ఎఫ్ సిఫార్సు చేసింది.
సూచించిన చర్యల్లో వారి ఆస్తులను స్తంభింపజేయడం, దేశంలోకి వారి ప్రవేశాన్ని పరిమితం చేయడం వంటివి ఉన్నాయి.
ఇటీవల భగవత్, ఇతర ఆర్ఎస్ఎస్ నాయకులకు ఉన్నత స్థాయి సమావేశాలు, దౌత్యపరమైన మర్యాదలు కల్పించవద్దని యూఎస్సీఐఆర్ఎఫ్ అధికారులు హెచ్చరించారు. భగవత్ అమెరికా వీసాను నిరాకరించాలని లేదా రద్దు చేయాలని పలు మానవ హక్కులు, న్యాయవాద సంస్థలు సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియోను కోరాయి.
వైవిధ్యాన్ని గౌరవిస్తామన్న వాదనలు వమ్ము..
వైవిధ్యాన్ని గౌరవిస్తామన్న వాదనలను ఆర్ఎస్ఎస్ చర్యలు పూర్తిగా వమ్ము చేస్తున్నప్పటికీ, ఆర్ఎస్ఎస్ వాస్తవికతను దాచడంలో భగవత్ ఎంత తెలివైనవారో ఇది చూపిస్తుంది. వైవిధ్యం అనే ముసుగు ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించడానికి వేసిన ఒక ఎర.
అయితే ఇంటర్నెట్, మానవ హక్కుల పట్ల తపన ఉన్న ఈ యుగంలో ప్రపంచం తప్పుదోవ పడుతుందా? కారవాన్ మ్యాగజైన్ చేస్తున్న అధ్యయనం ప్రకారం ఆర్ఎస్ఎస్కు విదేశాల్లో 2,500కి పైగా అనుబంధ సంస్థలు ఉన్నప్పటికీ, ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, మహిళలు, ఆదివాసీలు, కార్మికుల పట్ల భారతదేశ పరిస్థితిని, వాస్తవాన్ని చెబుతున్న అంతర్జాతీయ పండితులు, కార్యకర్తలు కూడా ఉన్నారు.
భగవత్ ప్రధాన లక్ష్యం విశ్వ ఏకత్వాన్ని ప్రోత్సహించడం కాదని, భారతదేశంలో సంఘ్ పరివార్ చేసిన ఘోరమైన చర్యలను కప్పిపుచ్చడమేనని అనిపిస్తోంది.
మత స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ, ఆకలి సూచీ, సంతోష సూచీ వంటి అంతర్జాతీయ సూచీలలో భారతదేశం ర్యాంకింగ్ పడిపోవడం, ఆర్ఎస్ఎస్-బీజేపీ పాలన పెరుగుదలతో సమాంతరంగా నడుస్తోంది.
హిందూ జాతీయవాద రాజకీయాల ప్రత్యక్ష పర్యవసానమైన ద్వేష రాజకీయాలను దాచిపెట్టడంలో భగవత్ ‘తెలివితేటలకు’ ప్రశంసలు దక్కాలి.
తాను ఎంతో సులువుగా ధరించానని భావిస్తున్న ఈ వైవిధ్య ముసుగు ద్వారా అమెరికా, విదేశాల్లో హిందూ లాబీని బలోపేతం చేయడం కూడా ఆయన లక్ష్యం కావచ్చు.
భారతదేశంలో శాంతి కోసం, మనం భారత రాజ్యాంగాన్ని అనుసరించాలి, దీనిని ఆర్ఎస్ఎస్ కూటమి వ్యతిరేకిస్తుంది.
ప్రపంచ ఏకత్వానికి, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల చార్టర్ అత్యుత్తమ ఎంపిక. గ్లోబల్ విలేజ్ (ప్రపంచ కుగ్రామం) యుగంలో పురాణ గ్రంథాలను ఉదహరించడం అనేది పూర్తిగా అసంబద్ధం, ఇది హిందూ ఆధిపత్యం అసలు ఉద్దేశ్యాన్ని చూపుతుంది.
వ్యాస రచయిత రామ్ పునియాని ‘సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సొసైటీ అండ్ సెక్యులరిజం’ అధ్యక్షుడిగా ఉన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
