గతంలో ఎన్నడూ లేనంతగా ఇజ్రాయెల్ సైనిక సామర్థ్యం తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. ఇరాన్పై జరుపుతోన్న యుద్ధం ఇదే తరహాలో జరిగితే విజయం ఇజ్రాయెల్కు కనుచూపు మేరలో కనిపించడం లేదు. దీంతో అణ్వస్త్ర ప్రయోగంతోనైనా ఇరాన్పై విజయం సాధించాలని ఇజ్రాయెల్ ఆలోచిస్తోంది.
చైనా- రష్యాలు ఒకవేళ జోక్యం చేసుకోకపోతే, ప్రపంచం అణు మారణహోమానికి చేరువయ్యే ప్రమాదం ఉంది.
మార్చి 8న ఉదయం ఇజ్రాయెల్- అమెరికాలు ఇరాన్పై ప్రారంభించిన యుద్ధం ప్రమాదకరమైన కొత్త మలుపు తీసుకుంటోంది.
దేశ రాజధాని టెహ్రాన్ చుట్టూ ఉన్న ఇరాన్ చమురు శుద్ధి కేంద్రాలు, అణుబంధ పరిశ్రమలపైనా; టెహ్రాన్కు పొరుగున ఉన్న కరాజ్ నగరంపైనా అమెరికా బాంబు దాడులకు దిగడంతో ఈ ప్రాంతంలో కాలుష్యం విషమ స్థితికి చేరింది.
దీంతో మాస్కులు ధరించాలని, ఆహారాన్ని ఫ్రిజ్లలో భద్రపరుచుకోవాలని, తాగునీటి సరఫరాకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని(ఫిల్టర్స్ మార్చుకోవాలని) ఇరాన్ ప్రభుత్వం ప్రజలను కోరింది.
అనంతరం, గల్ఫ్ ప్రాంతంలోని అరబ్ దేశాలలో ఉన్న చమురు నిల్వలు, శుద్ధి కర్మాగారాలవంటి వాటిపై నాలుగు గంటల్లో దాడి చేయనున్నట్టు ఇరాన్ ప్రకటించింది.
ఇజ్రాయెల్కు చమురు సరఫరా చేసే హైఫా బే ప్రాంతంపై ఇరాన్ భారీ ఎత్తున దాడి చేసింది.
ఇజ్రాయెల్ వెన్నుముక మీద ఇరాన్ దాడి..
ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థకు, సైనిక సామర్థ్యానికి హైఫా బే(హైఫా జలసంధి) వెన్నుముక.
ఈ మార్గంలో దేశానికి వచ్చే చమురు నిల్వల ద్వారానే ఇజ్రాయెల్ చమురు అవసరాలలో సగానికి సగం తీరుతాయి.
ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా ఉన్న హైఫా బే పై ఇరాన్ భీకర దాడికి పాల్పడింది.
దీంతో ఇజ్రాయెల్- అమెరికాలు ఇరాన్పై ప్రారంభించిన యుద్ధం చెదురుమదురు దాడుల దశ దాటి పూర్తి స్థాయి యుద్ధం దశకు చేరింది.
పరిస్థితి విషమించి, ఈ యుద్ధం మరో మలుపు తిరిగి అణుయుద్ధంగా మారితే మిగిలేది ప్రపంచ వినాశనమే.
నాకు ఈ ఆందోళన కలగడానికి రెండు కారణాలు ఉన్నాయి: పన్నెండు రోజుల యుద్ధం కంటే ముందు, ఇజ్రాయెల్ సైన్యానికి ఇప్పుడు జరిగినంత నష్టం ఎన్నడూ జరగలేదు.
“ఇనుప కవచం”గా పిలవబడే ఇజ్రాయెల్ వద్ద ఉన్న క్షిపణి విధ్వంసక పరిజ్ఞానాన్ని ఛేదించి ఇజ్రాయెల్పై దాడి చేయగల సామర్థ్యం ఉన్న ఆధునిక క్షిపణి ఆయుధాలు ఇరాన్ వద్ద ఉన్నాయ అన్న విషయాన్ని ఇజ్రాయెల్ ఆలస్యంగా గ్రహించింది.
పన్నెండు రోజుల యుద్ధంలో ఇరాన్ ఎదురు దాడుల్లో ఇజ్రాయెల్ ఎంత మేరకు నష్టపోయింది అన్న విషయంపై ప్రభుత్వం ఇంత వరకు అధికారికంగా స్పందించలేదు.
కానీ అనధికారిక అంచనాల ప్రకారం, ఇరాన్ ఎదురు దాడుల్లో 33 లేదా 34 మంది మరణించారు, 3,500 మందికి పైగా గాయపడ్డారు.
తాజా యుద్ధంలో ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణులు గత సంవత్సరం జూన్లో ప్రయోగించిన క్షిపణుల కంటే, ఎక్కువ విధ్వంసకర సామర్థ్యం కలిగినవి.
హైఫా బే రిఫైనరిపై ఇరాన్ ప్రయోగించిన ఆయుధం ఇంధన రాకెట్- ఖేబర్ షేకన్ పేరుతో పదకొండు మీటర్ల పొడవున్న రాకెట్ అరటన్ను పేలుడు సామాగ్రిని మోసుకు పోగలదు.
ఇరాన్ అమ్ముల పొది నుంచి అధునాతన ఆయుధాలు..
ఇరాన్ ప్రయోగించిన హైపర్ సోనిక్ క్షిపణులు ఇజ్రాయెల్ నిర్మించుకున్న రక్షణ కవచాలను ఛేదించి టెల్ అవీవ్(ఇజ్రాయెల్ రాజధాని)పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయని అల్ జజీరా వార్తా సంస్థ విడుదల చేసిన వీడియోలు వెల్లడిస్తున్నాయి.
ఈ హైపర్ సోనిక్ క్షిపణులు స్వతంత్రంగా ప్రయాణించే సామర్థ్యం కలిగినవి మాత్రమేకాక ఏక కాలంలో పలు దిక్కులలో ఆయుధాలు ప్రయోగించే సామర్థ్యం కలిగిన “క్లస్టర్” ఆయుధాలు.
ఈ క్షిపణులు పేలిపోతే, సాధారణ ప్రజానికానికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
ఆరు రోజులుగా జరుగుతోన్న యుద్ధంలో ఇజ్రాయెల్ రక్షణ కవచాలను ఛేదిస్తున్న ఇరాన్ క్షిపణుల మోతాదు 10% నుంచి 35 శాతానికి పెరిగాయని అమెరికా సైనిక విశ్లేషకుల అంచనా.
ఇజ్రాయెల్పై ఇరాన్ వేస్తున్న ఆయుధాలను గమనిస్తే, సాంప్రదాయక ఆయుధ నిల్వలు తగ్గిపోయినందు వలనే హైపర్ సోనిక్వంటి ఆధునిక యుద్ద సాధనాలను ఇరాన్ బయటకు తీసిందని అంచనా వేస్తున్నారు.
ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలను ధ్వంసం చేయాలన్న ఇజ్రాయెల్- అమెరికా ప్రయత్నాలు పాక్షిక ఫలితాన్ని మాత్రమే సాధిస్తున్నాయి. దీనికి కారణం ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలన్నీ భూగర్భంలో దాగి ఉండడమే.
క్షిపణులు ప్రయోగించేంత వరకు ఏ ప్రాంతం నుంచి ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తుందో ఇజ్రాయెల్- అమెరికాలకు అంతుచిక్కని పరిస్థితి ఉన్నది.
ఒకసారి మాత్రమే ప్రయోగించగలిగిన ఈ క్షిపణులు- ప్రయోగించిన తర్వాత పరిసర ప్రాంతాలలో ఏర్పడే ధూళి మేఘాలను గుర్తించిన తర్వాత మాత్రమే ఫలానా చోట నుంచి క్షిపణి ప్రయోగం జరిగిందని తెలుస్తుంది.
భూగర్భ క్షిపణి ప్రయోగ క్షేత్రాలు ఇరాన్ దేశమంతటా విస్తరించి ఉన్నాయి. పొరపాటున వాటంతట అవి పేలితే తప్పా ఫలానా చోట క్షిపణులు ఉన్నాయని తెలియడం లేదు.
ఏరోజుకారోజు ఇరాన్ ఇటువంటి క్షిపణి ప్రయోగ క్షేత్రాలను తయారు చేసుకుంటోంది. ఇప్పటి వరకు దేశంలో ఎన్ని ఉన్నాయో తెలియదు. వేల సంఖ్యలో ఉన్నాయని మాత్రం అంచనా.
పూర్తిగా తారుమారైన పరిస్థితులు..
గత కొంతకాలంగా అమెరికా చేస్తున్న దాడులతో ఇరాన్లో గందరగోళం, తిరుగుబాటు, ప్రభుత్వ మార్పిడికి బదులుగా ప్రజలు ఇరాన్ ప్రభుత్వాన్ని మరింతగా బలపరుస్తున్నారు.
ఇరాన్ రాజకీయ నాయకత్వం కూడా ఇజ్రాయెల్- అమెరికా జంట దాడులకు గట్టిగా సమాధానం ఇవ్వాలని పట్టుదలతో ఉంది. గత కొన్ని నెలలుగా ఇరాన్ రూపొందించుకున్న వ్యూహం ఇప్పుడు అమలులోకి వస్తోందని అర్థమవుతోంది.
ఇరాన్ తొలుత గల్ఫ్ ఎమిరేట్స్లోని అమెరికా సైనిక స్థావరం మీద దాడి చేసింది. తర్వాత అమెరికా సైన్యం నివసిస్తోన్న హోటల్లపై గురి పెట్టింది.
హౌతీల సహకారంతో హార్మూజ్ జల సంధిని దిగ్బంధనం చేస్తోంది. ఈ జలసంధి ద్వారానే రోజుకు 20 బిలియన్ బ్యారెల్ల చమురు వాణిజ్యం జరుగుతోంది.
ఇరాన్ ప్రతిఘటన మరికొంతకాలం ఇదే స్థాయిలో కొనసాగితే, బెంజిమెన్ నెతన్యాహూ నేతృత్వంలోని ఇజ్రాయెల్ ప్రభుత్వం తీవ్రమైన ఆందోళనకు లోనుకాక తప్పదు.
వెన్నులో వణుకు పుట్టించిన ఇరాన్
ఇప్పటి వరకు- ఇజ్రాయెల్ ప్రజలు తమ రక్షణపై పూర్తి భరోసాతో ఉన్నారు. అంతేకాకుండా, ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్మించిన ఇనుప కవచం పట్ల అపరిమితమైన భరోసాతో ఉన్నారు. కానీ తాజా దాడులతో ఇజ్రాయెల్ ప్రజలు నేతన్యాహూ ప్రభుత్వంపై నమ్మకం కోల్పోతున్నారు.
దాదాపు 30, 40 సంవత్సరాలలో చూడని విధంగా గత జూన్లో తమ సైనిక సామర్థ్యం రక్షణ వ్యవస్థపై పెను దాడిని ఇజ్రాయెల్ వాసులు గుర్తించారు. ఈ దాడుల్లో భారీ సంఖ్యలో ప్రజలు గాయాలపాలైయ్యారు.
ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ మొసాద్ ప్రధాన కార్యాలయం పాక్షికంగా ధ్వంసమైంది. హైఫా విమానాశ్రయంపై కూడా దాడి జరిగింది. ఇజ్రాయెల్ భూభాగంలో ఈ స్థాయి విధ్వంసం జరగడం ఇదే మొదటిసారి.
చాలా కాలంపాటు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ దాడులలో జరిగిన నష్టాన్ని వెల్లడించలేదు. కానీ రాత్రి పూట పెరిగిన ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రజలు రక్షణ కోసం పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బేస్మెంట్లలోనూ, బంకర్లలోనూ తల దాచుకుంటున్నారు. ఈ దాడులలో జరిగిన ధన, ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి వివరాలు ప్రకటించడం లేదు.
ఏతావాతా ఈ దాడులు ఇజ్రాయెల్ పౌరులకు ప్రాణ భయం కల్పించాయన్నది మాత్రం వాస్తవం.
ఇజ్రాయెల్ చుట్టు పక్కల ఉన్న గాజా, వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరుసలేం పరిసర ప్రాంతాలలోని ప్రజలు గత కొన్ని దశాబ్దులుగా ప్రాణాలు అరచేత పట్టుకోని జీవిస్తున్నట్టే, ప్రస్తుతం ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రజలు మొదటి సారి ప్రాణాలు అరచేత పట్టుకుని ఉన్నారు. అంటే ఇరాన్ ఇజ్రాయెల్కు భయాన్ని పరిచయం చేసింది. ఎప్పుడు పడుకుంటారో, ఎప్పుడు ఏ పని చేయాల్సి వస్తుందో, తలదాచుకోవడానికి ఎప్పుడు ఎక్కడికి పరిగెత్తాల్సి వస్తుందో తెలియని స్థితి. పిల్లలు బడికి వెళ్తారో లేదో, వెళ్లిన పిల్లలు తిరిగి వస్తారో లేదో అని తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇరాక్, లిబియా, సిరియా, యెమెన్లలో లక్షలాది మంది అరబ్ కుటుంబాలు సరిగ్గా ఇజ్రాయెల్ వల్ల ఇదే భయంతో జీవిస్తున్నాయి. 2003 నుంచి నేటి వరకు ఇజ్రాయెల్- అమెరికా ద్వయం పశ్చిమాసియాలో సాగిస్తున్న యుద్ధాల కారణంగా అరబ్ ప్రజలు ఎదుర్కొంటున్న దైనందిన ప్రాణభయం ఇది.
ఇజ్రాయెల్ దుర్బేధ్యమైన దేశం అంటూ నేతన్యాహూ చేసుకున్న ప్రచారం గత జూన్ నెలలో జరిగిన దాడులతో ప్రశ్నార్థకమైంది.
విశ్వాస- అవిశ్వాసల లెక్కలు.. గాజా ఊచకోత..
2024 మేనాటికి ప్యూ సంస్థ నిర్వహించిన సర్వేలో 58% ప్రజలు నేతన్యాహూ విధానాలను, మితవాద సంకీర్ణ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. 38% మంది మాత్రమే సమర్థిస్తున్నారు.
పన్నెండు రోజుల యుద్దం జరిగిన రెండు నెలల తర్వాత హిబ్రూ పత్రిక నిర్వహించిన సర్వేలో- ఎన్నికలు జరిగితే, 120 స్థానాలు ఉన్న పార్లమెంటులో 62 స్థానాలు ప్రతిపక్ష పార్టీలు గెలిచే అవకాశం ఉందని; దీంతో పార్లమెంట్లో మెజారిటీ తారుమారయ్యే పరిస్థితి ఉంది.
కేవలం 27% ఇజ్రాయెలీలు మాత్రమే నెతన్యాహూ ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి నెతన్యాహూ ప్రభుత్వం నిస్సహాయులైన వెస్ట్బ్యాంక్, గాజాలోని పాలస్తీనా వాసులను ఊచకోత కోస్తుంది.
2025 అక్టోబరు 10 నుంచి 2026 ఫిబ్రవరి 10 వరకు- 120 రోజులలో ఇజ్రాయెల్ సేనలు ట్రంప్ కుదిర్చిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని 1620 సార్లు ఉల్లంఘించాయి.
ఈ కాలంలోనే 520 మంది పాలస్తీనా పౌరులను కాల్చివేయడమే కాక 79 సార్లు రక్షణ రేఖ దాటి పాలస్తీనియుల నివాసాలపై ఇజ్రాయెల్ సేనలు సాయుధ దాడికి పాల్పడ్డాయి. గాజాపై 749 సార్లు బాంబు దాడులకు పాల్పడ్డాయి.
232 దాడులలో పౌర నివాసాలు ధ్వంసమైయ్యాయి. 50 మంది పాలస్తీనా వాసులను గాజా నుంచి ఇజ్రాయెల్ అపహరించుకుపోయింది.
గాజా ప్రాంతంలో పౌర నివాసాలపై దాడి చేయడమే కాక యుద్దంలో గాయపడిన వారికి అంతర్జాతీయ సంస్థలు అందిస్తున్న సహాయాన్ని కూడా చేరనీయకుండా ఇజ్రాయెల్ నిలిపివేసింది.
ఈ వివరాలను పరిశీలించినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అఖండ ఇజ్రాయెల్ను నిర్మించే ప్రయత్నానికి నేతన్యాహు ఒడిగట్టాడని అర్థమవుతోంది. యుద్ధ రూపాన్ని ఈ ఇతర మార్గాలే తీసుకున్నాయి.
తన చివరి అస్త్రాన్ని ఇజ్రాయెల్ ప్రయోగిస్తుందా?
అమెరికా ఎంతగా అత్యాధునిక సాయుధ సహకారాన్ని అందించినా ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలుపు అసాధ్యమని ప్రజలు క్రమక్రమంగా అర్థం చేసుకుంటున్నారు.
ఇక నెతన్యాహూ ముందు చివరి అస్త్రం ఏంటి? అణుబాంబు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ వద్ద ఎన్ని అణుబాంబులు ఉన్నాయనే విషయం ఎవరికీ తెలియదు.
2009లో అల్జజీరా వెల్లడించిన వివరాల ప్రకారం, ఇజ్రాయెల్ 118 అణుబాంబులు ఉన్నాయి.
అణుబాంబు ప్రమాద తీవ్రత ఎంత ఉంటుందో అర్థం కాని ఈ తరానికి అర్థం కావడం కోసం “ఓ చిన్న” వివరణ, 1945 ఆగస్టు 6న హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబు బరువు 15,000 టన్నులు. ఈ దాడిలో పరిసర ప్రాంతాలలో 70% భవనాలు నేలమట్టం అయ్యాయి.
బాంబు వెదజిమ్మిన విష వాయువులతో 1945 చివరి నాటికి లక్షా నలభై మంది ప్రజలు చనిపోయారు.
మూడు రోజుల తరువాత నాగసాకిపై ప్రయోగించిన ప్లూటోనియం బాంబు నగరంలో 6.7 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ధ్వంసం చేసింది. 74వేల మంది ప్రాణాలు తీసింది.
ఈ బాంబు దాడుల తర్వాత, ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత నాలుగు వేల డిగ్రీలకు పెరిగింది. రెండు నగరాలు అణు ధార్మిక వానలతో తడిచిపోయాయి.
కించిత్తు కూడా పశ్చత్తాపపడని నేతన్యాహూ..
సాధారణ పరిస్థితుల్లో అటువంటి ప్రమాదకరమైన ఆయుధాల ప్రయోగం గురించిన ఆలోచన చేయడానికి కూడా సాహసించము. కానీ, నేతన్యాహూ నాయకత్వంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇటువంటి సాధారణ స్థితికి మినహాయింపు కావచ్చు.
తాను ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా దిగిపోయిన మరుక్షణం తనపై ఉన్న అవినీతి ఆరోపణలకు జైలు శిక్ష అనుభవించాలి. తను జైలులో పడకుండా ఉండడానికి పాలస్తీనా నుంచి చివరి అరబ్ పౌరుడిని కూడా హతమార్చడం ఒకటే మార్గం అని నేతన్యాహు భావిస్తున్నాడు.
తద్వారానే అఖండ ఇజ్రాయెల్ నిర్మాణం సాధ్యమని నమ్ముతున్నాడు. అందువల్లనే 2023 అక్టోబరు 7 నుంచి 2026 ఫిబ్రవరి 21 మధ్య కాలంలో 75,227 మంది పాలస్తీనా పౌరులను ఊచకోత కోసినా కించిత్తు పశ్చత్తాపం కూడా నేతన్యాహూకు లేదు.
అంతర్జాతీయ సమాజం, అమెరికా ఒత్తిడి మేరకు నేతన్యాహూ హమస్తో రాజీ కుదుర్చుకోవాల్సి వచ్చింది. దీంతో తన యుద్ధ దాహాన్ని తీర్చుకోవడానికి ఇజ్రాయెల్కు కొత్త శత్రువు అవసరమైంది. ఆ శత్రువు ఇజ్రాయెల్ ఉనికికి సవాలు విసిరే శత్రువు కావాలి- అప్పుడు మాత్రమే తాను దేశ రక్షణ సాకుతో అధికారంలో కొనసాగవచ్చు.
అందువల్లనే ఇజ్రాయెల్- అమెరికాల మనుగడకు ఇరాన్ ప్రధాన శత్రువని గుర్తించాడు. తన లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లి మూర్ఖుడి రూపంలో డొనాల్డ్ ట్రంప్ దొరికాడు.
ఒక దేశాధినేత సాధారణంగా అమెరికా పర్యటించాలంటే ఒకటి లేదా రెండేళ్లపాటు సన్నాహాలు జరగాలి. 2025లో ట్రంప్ ఇరాన్లో యురేనియం శుద్ధి కార్యకలాపాలను నియంత్రించే విషయంలో ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకోవడం గురించి ప్రస్తావించిన అన్ని సందర్భాలలోనూ మరునాడే నేతన్యాహూ అమెరికా అధ్యక్ష భవనంలో ప్రత్యక్షమయ్యేవాడు.
2025- 26 మధ్య కాలంలో నేతన్యాహూ ఆరు సార్లు ట్రంపును కలిశాడు.
ట్రంప్ కూడా ఆరుసార్లు ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకుంటామని వెనక్కి తగ్గాడు. కొత్త కొత్త డిమాండ్లు ముందుకు తెచ్చాడు.
ప్రస్తుతం ఇజ్రాయెల్- అమెరికాలు ఆశించినట్టుగా ఇరాన్పై యుద్ధం విజయం వైపు సాగడం లేదు.
అటువంటప్పుడు నేతన్యాహూ ముందున్న మార్గం ఒకటే, ఇరాన్కు వ్యతిరేకంగా అణ్వస్త్ర ప్రయోగం.
అనధికార సమాచారం ప్రకారం, ఇజ్రాయెల్ తన అణ్వస్త్రాలను సముద్రంలోని సబ్మెరైన్లలోకి తరలించింది.
ఇరాన్పై అణ్వాయుధ దాడికి పాల్పడితే ఉపేక్షించేది లేదని రష్యా- చైనాలు తీవ్రమైన హెచ్చరిక చేయడం ద్వారా మాత్రమే ప్రపంచం ముందున్న అణుయుద్ధ ప్రమాదాన్ని నిలువరించగలము.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.


