తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలలో శనగ ఒక వాణిజ్య పంటగా మారింది.
నల్లబర్లీ పొగాకు, పత్తి, మిర్చి, మొక్కజొన్నవంటి పంటలకు ప్రత్యామ్నాయంగా రైతులు శనగ వైపు మొగ్గు చూపారు.
సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం వల్ల పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయారు.
ఏ పంట వేయాలో తెలియక, ప్రత్యామ్నాయ పంటలు లేక రైతులు అయోమయంలో ఉన్నారు. నల్లబర్లీ పొగాకు నిషేధం నేపథ్యంలో అత్యధికంగా రైతులు శనగ పంటను సాగు చేశారు.
ధరల పతనం- దిగుమతి సుంకాల దెబ్బ
క్వింటాలు శనగలకు రూ 5,875 కనీస మద్దతు ధరకు మార్క్ ఫెడ్ ద్వారా రైతు సేవా కేంద్రాలలో కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
శనగలను కొంటామన్న నిర్ణయం సంతోషాన్ని కలిగించింది.
అయితే ఎన్ని శనగలు కొంటారు? కోల్డ్ స్టోరేజ్లో వున్న శనగల మాటేమిటి ? మొత్తంగా కొంటారా? లేక దళారుల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తారా?
విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తున్న రైతులకు నగదు ప్రోత్సాహకాల సంగతేమిటి? విదేశీ శనగల దిగుమతులను ఆపేసి వ్యవసాయాన్ని, రైతు రక్షణకు తీసుకునే చర్యలు చాలా అవసరం. వ్యవసాయ రక్షణకు తీసుకునే చర్యలపై దీర్ఘకాలిక ప్రణాలిక కావాలి.
పోషకాహార లోపం-పంపిణీ వైఫల్యం
పప్పు ధాన్యాలలో శనగ అతి ముఖ్యమైన పంట. ఒకప్పుడు లాభాలను కురిపించిన శనగలు ఇప్పుడు ధర లేక రైతులను దివాళా తీయిస్తున్నాయి. రైతులను కష్టాల పాలు చేస్తున్నాయి.
ఆహారంలో పప్పు ధాన్యాల అవసరం ఎక్కువగానే ఉన్నది. శరీర నిర్మాణంలో ప్రొటీన్ అవసరం గురించి డాక్టర్లు నొక్కి చెప్తున్నారు.
రైతులు కష్టపడి కావల్సినంత పండిస్తున్నారు. పప్పు ధాన్యాల పంపిణీ సరిగ్గా లేనందున అందరికీ అందనందున దశలో “ప్రొటీన్ కాలరీ మాలిన్యూట్రిషన్” దాపురిస్తున్నది.
ఒకపక్క గోడౌన్లలో శనగలు కుళ్లిపోతుంటే మరోపక్క పేద వారికి పప్పు ధాన్యాలు అందటంలేదు.
రేషన్ షాపుల ద్వారా శనగలను పంపిణీ చేస్తే ఇటు రైతులకు అటు పేద ప్రజలకు మేలు జరుగుతుంది.
దేశీయ ఉత్పత్తి సరిపోయినంత ఉంది. కానీ విదేశీ ప్రభుత్వాలను తృప్తి పరచటానికి విదేశీ శనగలను దిగుమతి చేస్తున్నారు.
ఇక్కడ పండే పంటలు అమ్ముడవటంలేదు. రేటు రావటం లేదు. రైతులు అప్పులు పాలవుతున్నారు.
పెరుగుతున్న ఖర్చులు- తగ్గుతున్న ధరలు
ఆంధ్రప్రదేశ్తో పాటుగా, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో విస్తారంగా శనగ పంటను సాగు చేస్తున్నారు. మిగతా పంటలతో పోలిస్తే శనగ సాగు కాస్త సులభంగానే జరుగుతుంది.
శనగలకు ఉత్తరాదిన డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మన రాష్ట్రంలో 2.8లక్షల హెక్టార్లలో శనగ పంట సాగవుతున్నది. దాదాపు 4 లక్షల టన్నుల శనగల ఉత్పత్తి జరుగుతోంది .
దేశం మొత్తం మీద 115 నుంచి 120 లక్షల టన్నుల వరకు ఉత్పత్తి అవుతున్నదని అంచనా.
మన దేశ ప్రజల అవసరాలకు 120 లక్షల టన్నుల శనగలు సరిపోతాయంటున్నారు.
అయితే అవసరానికి మించి నిల్వలు ఉన్నాయి. శనగలు అమ్ముడు పోక కోల్డ్ స్టోరేజీలలో(శీతల గిడ్డంగులలో) ఉన్న శనగలు ఎన్ని ఉన్నాయో లెక్కేలేదు.
కోల్డ్ స్టోరేజీలలో వున్న శనగల లెక్క ప్రభుత్వం బయటకు తీయాలి. వాటిని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఒక పక్క గిడ్డంగుల్లో నిల్వలు ఎక్కువ ఉన్నాయి. మరోపక్క దిగుమతి సుంకాన్ని తగ్గించి, విదేశీ దిగుమతులను ప్రోత్సహిస్తున్నారు.
భూసారం క్షీణించడం, వాతావరణంలో మార్పుల వలన దిగుబడులు తగ్గిపోతున్నాయి. వ్యవసాయ ఖర్చులు పెరిగిపోతున్నాయి. రైతులు దివాళా తీస్తున్నారు. ప్రభుత్వాలు విదేశీ రైతుల క్షేమాలను గమనించి విదేశీ శనగల దిగుమతులకు అనుమతులనిస్తున్నది.
విదేశాల నుంచి కూడా అధికంగా దిగుమతులు చేయటంతో శనగ రైతుల కష్టాలు పెరుగుతున్నాయి. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చు, కౌలుతో సహా వ్యవసాయ ఖర్చులు అన్నీ పెరిగిపోతున్నాయి. ఎకరానికి దిగుబడి 10 కింటాళ్ళ నుంచి ఆరేడు కింటాళ్ళకు పడిపోయింది.
గత సంవత్సరం ఎర్ర శనగలు క్వింటాలు రేటు 7,200 రూపాయలు ఉంటే ఇప్పుడు దళారులు 5000 రూపాయల కన్నా తక్కువకు అడుగుతున్నారు. తెల్ల శనగలు పోయిన సంవత్సరం రూ 10,200 వుంటే ఇప్పుడు రూ 5,600కు అడుగుతున్నారు. బోల్టు శనగలు గత ఏడాది రూ 15000 ఉంటే ఇప్పుడు అడిగేవారే లేరు.
సుంకాల రద్దు- రైతుకు ఉరి..
2017-18 సంవత్సరాలలో శనగ దిగుమతులపై 40 శాతం ఉన్న దిగుమతి సుంకం 10 శాతానికి తగ్గిస్తూ వచ్చారు. ఫలితంగా దేశీయ శనగల ఉత్పత్తి తగ్గిపోవడం వలన, 2024 మే నుంచి 2025 మార్చి వరకు పూర్తిగా దిగుమతి సుంకాలను రద్దు చేశారు.
ఉత్పత్తి పుంజుకున్న తర్వాత మళ్లీ 2025 ఏప్రిల్ నుంచి 10 శాతం సుంకాలను మరల అమలులోకి తెచ్చారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో, రికార్డు స్థాయిలో 15 లక్షల టన్నుల శనగలను దిగుమతి చేసుకున్నారు. విదేశాలలో రైతులకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు కూడా ఎక్కువగా వుండటం వలన ఉత్పత్తి ధర తక్కువగా ఉంటుంది.
మన రైతులకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు లేవు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. అప్పులు పెరిగిపోతున్నాయి. వ్యవసాయ ఖర్చులు పెరిగిపోవడం వల్ల మన రైతులకు అప్పులు, వడ్డీలు పెరిగిపోతున్నాయి.
ఏళ్ల తరబడి కోల్డ్ స్టోరేజ్లో నిల్వలు వుంచటం వలన క్వింటాలుకు రూ 150 కడుతూ ఉండాలి. బయట గోడౌన్లలో పెడదామంటే శనగలు పుచ్చిపోతున్నాయి. శీతల గిడ్డంగులలో ఖాళీ లేదు.
సందిగ్ధావస్థలో రైతులు
ఒకపక్క పేరుకు పోతున్న శనగలు. మరో పక్క అప్పులు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు దివాలా తీస్తున్న తరుణంలో ఏ పంట వేయాలో తెలియనటువంటి పరిస్థితులలో, కొంచెం డబ్బులు వస్తాయనే ఆశతో నల్లబర్లీ పొగాకును సాగు చేశారు.
నల్లబర్లీ పొగాకు 15 -18 వేల రూపాయల వరకు ధర వచ్చింది. పొగాకు కంపెనీలు , ప్రభుత్వం కలిసి క్వింటాల్ నల్లబర్లీ పొగాకు రేట్లను 12000 – 9000- 6000 రూపాయలుగా తగ్గించి నిర్ణయించి రైతులకు అన్యాయం చేశారు. ఈ సంవత్సరం అసలు నల్లబర్లీ పొగాకు సాగు చేయడాన్ని నిషేధించారు .
పత్తికి ధర లేదు. విదేశాల నుంచి ఎటువంటి అడ్డంకులు లేకుండా పత్తిని దిగుమతి చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంట ఏమిటో ప్రభుత్వం చెప్పదు. ధైర్యం చేసి పంట పండించే సమయానికి అమెరికా నుంచి దిగుమతులు వెల్లువలా వచ్చి పడతాయి.
రెండు సంవత్సరాల నుంచి ఏ పంటకూ సరైన ధర లేదు. కోల్డ్ స్టోరేజ్లో దాచిపెట్టటానికి ఖాళీలు లేవు. దిగుబడి కూడా తగ్గిపోయింది.
2024-25 సంవత్సరములో 15 లక్షల టన్నుల శనగలను దిగుమతి చేసుకున్నారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 15 లక్షల క్వింటాళ్ల శనగలు కోల్డ్ స్టోరేజ్లో స్టాక్ నిండుగా ఉన్నా విదేశీ శనగలను దిగుమతి చేశారు. పంట దిగుబడి 10 క్వింటాళ్ల నుంచి 6-7 ఆరు ఏడు క్వింటాళ్లకు తగ్గింది.
విదేశీ దిగుమతులపై 2017- 18 సంవత్సరాలలో 45శాతం సుంకాలను విధించేవారు. 2024-25లో పూర్తిగా రద్దు చేశారు. 2025 సంవత్సరంలో దిగుమతి సుంకాన్ని 10శాతం వరకు విధించారు.
ఒకప్పుడు లాభాలను కురిపించిన శనగ సాగు ఇప్పుడు కళ్ళ నీళ్లు తెప్పిస్తున్నది. బయట తెచ్చినటువంటి అప్పుల వడ్డీ పెరిగిపోతుంది. వ్యవసాయ ఖర్చులకు , ఇంటి ఖర్చులకు చేతిలో డబ్బులు లేవు.
బ్యాంకర్స్, అప్పులవాళ్ళు అప్పులు ఇవ్వడం మానేశారు. ప్రభుత్వం సహాయం చేస్తే బయటపడవచ్చు.
ఇప్పుడు ఏం చేయాలంటే
1. రైతుల దగ్గర ఉన్నటువంటి సరుకు మొత్తాన్ని; రైతులు అమ్మకానికి తెచ్చిన శనగలకు ఆంక్షలు విధించకుండా ప్రభుత్వం కొనాలి. నిబంధనలను సడలించాలి.
2. కనీస మద్దతు ధర అంటే స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసినట్టుగా ఖర్చులకు 50 శాతం కలిపి చెల్లించాలి.
3. ఇదివరకులా విదేశీ దిగుమతుల పైన 40 శాతం దిగుమతి సుంకాన్ని విధించాలి. అలా చేస్తేనే దేశంలో ఉత్పత్తి అయిన శనగకు డిమాండ్ ఉంటుంది.
4. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తున్న రైతులకు అమెరికాలోలా నగదు ప్రోత్సాహకాలను ఇవ్వాలి.
5. విదేశీ శనగల దిగుమతులను ఆపేయాలి.
6. వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడానికి, రైతు రక్షణ కు తీసుకునే చర్యలను ప్రకటించి అమలు పరచాలి. రైతు రక్షణ చర్యల అమలుకు రైతులు సమైక్యంగా ఉద్యమించాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.

