ఈశాన్య రాష్ట్రాల ముగ్గురు ముఖ్యమంత్రులు ఢిల్లీలోని మాలవీయ్ నగర్లో అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ముగ్గురు మహిళలపై జరిగిన జాతి వివక్ష దాడిని తీవ్రంగా ఖండించారు.
దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈశాన్య ప్రజల పట్ల వివక్షను తక్షణమే ఆపాలని, వారు కూడా భారతీయ పౌరులేనని స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని మాలవీయ్ నగర్లో అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ముగ్గురు మహిళల పట్ల స్థానికులు జాతి వివక్షతో, అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది.
ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఈశాన్య రాష్ట్రాల ముగ్గురు ముఖ్యమంత్రులు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈశాన్య రాష్ట్రాల ప్రజలు కూడా భారత పౌరులేనని, వారి పట్ల వివక్షను ఇకనైనా ఆపాలని వారు పేర్కొన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్పందన
ఈ ఘటన జరిగి చాలా రోజులు గడిచిన తర్వాత, ఫిబ్రవరి 25న ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు.
ఆ వీడియోలో, “ఢిల్లీ అందరిదీ” అని పేర్కొంటూ, ఈ విషయంలో దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖాండూ ఆగ్రహం
కథనం ప్రకారం, “దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్లో నివసిస్తున్న అరుణాచల్ ప్రదేశ్కు చెందిన మా యువ ఆడపడుచుల పట్ల జాతి వివక్షతో కూడిన అసభ్య ప్రవర్తనకు సంబంధించిన ఈ సిగ్గుచేటు ఘటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇటువంటి వ్యవహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోము. మన సమాజంలో ఇటువంటి వాటికి తావు లేదు” అని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖాండూ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
“నాకు ఈ విషయం తెలిసిన వెంటనే, నేను ఢిల్లీ పోలీసు కమీషనర్తో మాట్లాడాను. తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాను. పోలీసు కమీషనర్ స్వయంగా నాతో సంప్రదింపుల్లో ఉన్నారు. నిందితులను త్వరలో అదుపులోకి తీసుకుంటామని, చట్ట ప్రకారం శిక్షిస్తామని తను నాకు హామీ ఇచ్చారు”అని అన్నారు.
“మేము మా ముగ్గురు సోదరీమణులకు అండగా నిలుస్తాము. వారి రక్షణ, గౌరవం, న్యాయం మాకు అత్యంత ప్రాధాన్యత కలిగినవి” అని ఖాండూ నొక్కి చెప్పారు.
మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా విజ్ఞప్తి
దీనికంటే ముందు, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా స్పందిస్తూ, ఈశాన్య రాష్ట్ర ప్రజల పట్ల వివక్షను తక్షణమే ఆపాలని కోరారు.
తన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో, ఈశాన్య రాష్ట్రాల ప్రజల పట్ల వివక్షను ఆపాలని విజ్ఞప్తి చేశారు.
మరో పోస్టులో సంగ్మా కేవలం ఢిల్లీ ఘటనే కాకుండా, గోరఖ్పూర్లోని ఎయిమ్స్లో నాగాలాండ్కు చెందిన రెసిడెంట్ డాక్టర్పై జరిగిన జాతి వివక్ష, లైంగిక వేధింపుల గురించి కూడా ప్రస్తావించారు.
“మహిళలను అవమానించడాన్ని ఒక నాగరిక దేశంలో సహించలేము. వారు కూడా మీ సోదరీమణులు, కూతుళ్లు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను అధికారులను కోరుతున్నాను” అని అన్నారు.
అంతేకాకుండా, ఇటువంటి ఘటనలు కేవలం వార్తా ముఖ్యాంశాలుగా మారి మర్చిపోకూడదని స్పష్టం చేశారు.
సిక్కిం ముఖ్యమంత్రి పేమ్ సింగ్ తమాంగ్ స్పందన
ఈ ఘటనను “బాధాకరమైనది, దురదృష్టకరమైనది”గా సిక్కిం ముఖ్యమంత్రి పేమ్ సింగ్ తమాంగ్ వర్ణించారు.
“ఇటువంటి ఘటనలు పరస్పర గౌరవం గురించి మనం గుర్తుచేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. ఈశాన్య ప్రాంతం మన దేశంలో విడదీయరాని భాగం. ప్రతి పౌరుడికి గౌరవం, సమానత్వం, భద్రత లభించాలి” అని ఆయన అన్నారు.
ఘటన నేపథ్యం: సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
దక్షిణ ఢిల్లీలోని మాలవీయ్ నగర్లో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ముగ్గురు యువతులు(వారిలో ఒకరు ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి కూడా ఉన్నారు) ఎదుర్కొన్న జాతి వివక్ష, బెదిరింపు ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైన తర్వాత ఈ వివాదం తీవ్రమైంది.
పోలీసుల సమాచారం ప్రకారం, ఈ ఘటన ఫిబ్రవరి 22న జరిగింది.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, తమ అద్దె ఇంట్లో విద్యుత్ పనులు చేయిస్తున్న సమయంలో రేగిన దుమ్ము కారణంగా కింది అంతస్తులో ఉండే జంటతో వివాదం మొదలైంది.
ఈ నేపథ్యంలో వారు తమను బెదిరించారని, జాతి వివక్షతో అసభ్యకరమైన భాషను ఉపయోగించారని బాధితులు ఆరోపించారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో- ఒక మహిళ ఆ ముగ్గురు అమ్మాయిలపై అవమానకరమైన, జాతిపరమైన దూషణలు చేస్తూ కనిపిస్తుంది.
“నాతో పెట్టుకోవద్దు” అని హెచ్చరిస్తూ, తన భర్త ఒక “అధికారి” కొడుకు అని ఆమె గొప్పలు పోయింది. ఆ తర్వాత ఆమె కర్రతో కొడతానని కూడా హెచ్చరించింది.
వైరల్ వీడియోలో నిందితురాలు మెట్ల మీద నిలుచోని ఉండగా, ఆమెతో పాటు ఒక పురుషుడు కూడా కనిపిస్తాడు.
వీడియోలో ఉన్నదాని ప్రకారం- ఆ మహిళ ప్రత్యేకంగా ఈశాన్య రాష్ట్ర మహిళలను ఉద్దేశించి “చవకబారు”, “ఈశాన్య రాష్ట్ర ప్రజలు మంచివాళ్లు కాదు” వంటి అవమానకరమైన పదాలను వాడింది.
ఆ ముగ్గురు అమ్మాయిలను “మోమోలు అమ్మే వాళ్లు”, “500 రూపాయలకు మసాజ్ సెంటర్లో పని చేసేవాళ్లు” అంటూ జాతిపరమైన దూషణలు చేసింది.
పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్న ఒక పోలీసును కూడా ఆ వీడియోలో చూడవచ్చు.
ఈ ముగ్గురు అమ్మాయిలలో ఒకరు యూపీఎస్సీ(యూపీఎస్సీ)నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షకు సన్నద్ధం అవుతున్నారు.
దుమ్ము పడినందుకు తాము ఆ దంపతులకు క్షమాపణ కూడా చెప్పామని బాధితురాలు వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు.
అయినప్పటికీ తమపై వారు జాతి వివక్షతో, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అసలు సమస్యను పక్కనపెట్టి, తమ ఈశాన్య ప్రాంత నేపథ్యాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారని ఆమె వాపోయారు.
నిందితులను అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
బాధితుల ఫిర్యాదు ఆధారంగా, మాలవీయ నగర్ పోలీస్ స్టేషన్లో భారతీయ శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.
ఒక మహిళ గౌరవానికి భంగం కలిగించడం, నేరపూరిత బెదిరింపు, ఉమ్మడి ఉద్దేశ్యం, వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం వంటి అభియోగాలు ఇందులో ఉన్నాయి.
మీడియా కథనాల ప్రకారం- షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల(అత్యాచారాల నివారణ) చట్టం కింద(ఎస్సీ/ఎస్టీ యాక్ట్) ఢిల్లీ పోలీసులు నిందితులైన రూబీ జైన్, హర్ష్ సింగ్లను అరెస్టు చేశారు.
ఈ కేసులో అరెస్టులు జరిగాయని, నిందితులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
ప్రజా ప్రతినిధుల ఖండన
దీనికంటే ముందు, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఈ దుష్ప్రవర్తనను ‘చాలా బాధాకరమైనది, ఆమోదయోగ్యం కానిది’అని అభివర్ణించారు.
తన ‘ఎక్స్’ పోస్ట్లో , “ఢిల్లీలో అరుణాచల్ మహిళలపై జరిగిన జాతి వివక్ష తీవ్ర ఆందోళనకరంతోపాటు వ్యతిరేకించాల్సిన విషయం. ఏ పౌరుడినీ కూడా తమ సొంత దేశంలోనే బయటి వ్యక్తిలా భావించేలా ప్రవర్తించకూడదు. ప్రస్తుతం జరిగిన ఈ ఘటన ఈశాన్య ప్రాంత ప్రజలపై ఇప్పటికీ పక్షపాతం కొనసాగుతుందనడానికి స్పష్టమైన రుజువు”అని రాశారు.
“ఈ ఘటనను సాధారణ వివాదంగా తోసిపుచ్చలేము. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి, చట్టం ప్రకారం జవాబుదారీతనాన్ని నిర్ధారించాలి. అంతేకాకుండా బాధితులకు పూర్తి రక్షణ, సహాయం అందించాలి. సమాన పౌరసత్వం అంటే దేశంలోని ప్రతి ప్రాంతంలో సమాన గౌరవం, సమాన రక్షణ అని అర్థం” అని ఆయన నొక్కిచెప్పారు.
మణిపూర్ లోక్సభ సభ్యుడు, కాంగ్రెస్ నేత ఎ బిమోల్ అకోయిజామ్ పీటీఐతో మాట్లాడుతూ, “కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది కేవలం ఒక సంఘటన కాదు. అయినప్పటికీ, భవిష్యత్తులో ఇటువంటి ప్రవర్తనను ఎవరూ ప్రోత్సహించకుండా లేదా మళ్లీ జరగకుండా చూసుకోవడానికి ఆదర్శవంతమైన చర్యలు తీసుకోవాలి” అని అన్నారు.
సిక్కిం ఎంపీ ఇంద్ర హంగ్ సుబ్బా ఢిల్లీ పోలీసులకు రాసిన లేఖలో, ఈ సంఘటన ‘పొరుగువారితో వివాదం మాత్రమే కాదు- జాతి విద్వేషం, సాంస్కృతిక అవమానంతో కూడిన తీవ్రమైన చర్య’అని పేర్కొన్నారు.
ఈశాన్య ప్రాంతాన్ని దేశంలో ‘ఒక అంతర్భాగం’గా అభివర్ణిస్తూ, ఇటువంటి సంఘటనలు అన్ని సందర్భాల్లో పరస్పర గౌరవ, మర్యాదలతో కాపాడుకోవడం ప్రాముఖ్యతను గుర్తుచేస్తుందని; ప్రతి పౌరుడు గౌరవం, సమానత్వం, రక్షణకు అర్హుడని సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ అన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
