2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్లు లెక్కింపు ముగిసింది. ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తోంది. 89 సీట్లు గెలుచుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. 85 సీట్లను జేడీయూ కైవసం చేసుకుంది. ఎల్జేపీ(రామ్ విలాస్) 19 సీట్లు గెలుచుకుంది.
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ స్పష్టమైన మెజారిటీని సాధించింది. 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. జేడీయూ 85 సీట్లు గెలుచుకుంది. ఆశ్చర్యకరంగా, ఎల్జేపీ(రామ్ విలాస్) 19 సీట్లు గెలుచుకుని రెండు చోట్ల ఆధిక్యంలో ఉంది. హెచ్ఏఎం పార్టీ కూడా ఐదు సీట్లను గెలుచుకుని తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
ఈసారి నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరిగింది. రికార్డు స్థాయిలో రాష్ట్రంలో 66.91% ఓటింగ్ నమోదైంది, ఇది 2020 ఎన్నికల కంటే 9.62% ఎక్కువ.
ఈ రేసులో మహాకూటమి చాలా వెనుకబడి పోయింది. కేవలం 25 సీట్లను మాత్రమే ఆర్జేడీ గెలుచుకోగా, ఆరు సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. కూటమి భాగస్వామి సీపీఐ(ఎంఎల్) కేవలం రెండు సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఉపముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన ముఖేష్ సాహ్ని వికాస్షీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) తన ఖాతాను కూడా తెరవలేకపోయింది.
వీఐపీ మాదిరిగానే, ప్రశాంత్ కిషోర్కు చెందిన జన్ సూరజ్ పార్టీ ఇటీవల ఇలాంటి సమస్యనే ఎదుర్కొంది. అది ‘ఓట్లను కత్తిరించే’ అవకాశం ఉందనే భయాల మధ్య ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.
ఏ కూటమిలోనూ భాగం కాని అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం ఐదు సీట్లు గెలుచుకుంది.
వీరి మధ్యే ప్రధాన పోటీ..
ప్రధాన పోటీ భారతీయ జనతా పార్టీ(బీజేపీ), జనతాదళ్ యునైటెడ్(జేడీయూ)- ఎన్డీఏ కూటమి, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) నేతృత్వంలోని మహా కూటమి మధ్య జరిగింది.
ఎగ్జిట్ పోల్స్ను పరిశీలిస్తే, ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని దాదాపు అన్నీ సూచించాయి. అయితే, మహా కూటమి నాయకులు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తోసిపుచ్చారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతుందని బలంగా మాట్లాడారు.
ఎన్డీఏ తరపున జేడీయూ, బీజేపీ 101-101 స్థానాల్లో పోటీ చేశాయి. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ(రామ్ విలాస్) 29 స్థానాల్లో పోటీ చేసింది. జితన్ రామ్ మాంఝీ పార్టీ హిందూస్తాన్ అవామ్ మోర్చా, ఉపేంద్ర కుష్వాహా పార్టీ రాష్ట్రీయ లోక్ మోర్చాకు చెరో 6 స్థానాలు ఇచ్చారు.
మరోవైపు, మహాకూటమి నుంచి ఆర్జేడీ అత్యధికంగా 143 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. కాంగ్రెస్ 61 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. ముఖేష్ సాహ్ని నేతృత్వంలోని వీఐపీ 15 స్థానాల్లో పోటీ చేయగా, వామపక్షాలు 33 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి.
అదే సమయంలో, మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ ‘జన్ సూరజ్’పై అందరూ తమ దృష్టిని సారించారు.
2020 ఎన్నికల ఫలితాలు..
2020 అసెంబ్లీ ఎన్నికల్లో, ఆర్జేడీ 75 సీట్లు- 23.11% ఓట్ షేర్తో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీని తరువాత 74 సీట్లు, 19.46% ఓట్ షేర్తో భారతీయ జనతా పార్టీ రెండవ స్థానంలో నిలిచింది.
జనతాదళ్(యునైటెడ్) 43 సీట్లు గెలుచుకుని 15.39% ఓట్లను సాధించగా, కాంగ్రెస్ 19 సీట్లు సాధించి 9.48% ఓట్లను సాధించింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
