“వెలుగు నేలమట్టం”అనేది వెలుగుమట్ల విధ్వంసంపై ప్రముఖ కవి, విమర్శకులు సీతారాం వ్యక్తీకరణ ఇది.
వెలుగుమట్ల ప్రాంతంలో కింద గుట్టపైన వందలాది మంది పేదలు నివాస సముదాయాలను ఏర్పాటు చేసుకున్నారు. వాటిని ప్రభుత్వం కూల్చివేసింది.
ఈ సందర్భంలో తక్షణ స్పందనగా ఆయన వ్యక్తీకరణ ఇది. ఆ పదబంధాలు, ఆ బడుగు జీవుల కన్నీటి ధారల ప్రతిరూపమే ఈ వెలుగుమెట్ల.
ఖమ్మం జిల్లా కేంద్రానికి దాదాపు ఆనుకోని ఉన్న ఒక గుట్టపైన వందలాది మంది పేదలు నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు.
అవి భూదాన్ భూములని, ఆ బోర్డు నుంచి తాము పట్టాలు తీసుకున్నామని బాధితులు అంటున్నారు.
భూదాన్ ఉద్యమం బోర్డు వారూ ఇదే అంశాన్ని ధృవీకరించినట్టు మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. మరోవైపు అక్కడి నిర్మాణాలు చట్టవిరుద్ధమైని, అందుకే కూల్చేశామని ప్రభుత్వం అంటున్నది.
ఎవరి వాదన ఎలా ఉన్నా, అక్కడ ధ్వంసమైనది కేవలం ఇళ్లు మాత్రమే కాదు- పేదల ఆశలు, ఆకాంక్షలు, భవిష్యత్తు సంపూర్ణంగా నేలమెట్టం అయ్యాయి.
ది వైర్ క్షేత్ర స్థాయి పరిశీలన
జరిమానాల విధింపు ద్వారానో, జీవోల ద్వారానో, మరొక రూపంలోనో అక్రమ నిర్మాణాలను ప్రభుత్వాలు క్రమబద్ధీకరిస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలోనే అట్లా క్రమబద్ధీకరించిన నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. వెలుగుమట్ల అందుకు మినహాయింపు అయ్యిందని బాధితుల, వివిధ సంఘాల ఆరోపణ.
ఖమ్మం జిల్లాలో ఉన్నత సామాజిక వర్గాల వారు పేదల కోసం తమ ఆస్తులను, భూములను సహృదయంతో పంచి ఇచ్చారు. ఇదంతా గతం. ఇప్పుడు ఖమ్మం మున్నేరుకు ఆవల నుంచి ఇవతలి సుమారు పది కిలోమీటర్ల మేర భూములు దొరకడం అంత సులభం కాదు. అది గజమైన, వంద గజాలైనా.
హైదరాబాద్ నగరంతో పోటీపడి అక్కడ భూమల రేట్లు ఉన్నాయి.
సరిగా వెలుగుమట్లకు కుడి ఎడమల భారీ వెంచర్లు వెలిశాయి.
వాటికి కాస్త ఎడంగా విల్లాలున్నాయి. అక్కడి ధరలు మూడు కోట్లపై మాటనేనని బాధితుల్లో కొందరు ది వైర్ తెలుగుకు చెప్పారు.
వెలుగుమట్ల, ఖమ్మం పట్నం- గ్రామీణం, మున్నేరు ఆవలి ప్రాంతాలను ది వైర్ తెలుగు బృందం సందర్శించింది. పలువురితో మాట్లాడింది. ఈ సందర్భంగా వారి మనోభావాలను రికార్డు చేసింది.
ప్రశ్నలను సంధిస్తున్న ప్రశ్నలు..
వెలుగుమట్ల దగ్గర పదేళ్లుగా తాము నివాసాలు ఏర్పాటు చేసుకోని ఉంటున్నామని మమత చెప్పారు.
పదేళ్ల కింద తాము ఉన్న ప్రాంతంలో ఏ వెంచరూ లేదని, తామిక్కడ అభివృద్ధి చేసిన తర్వాత పలువురు వెంచర్లు ఏర్పాటు చేశారని తెలియజేశారు.
ఒక వేళ తాము ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే, తమకు సమీపంలోనే కలెక్టర్ కార్యాలయం ఉందని, సదరు కలెక్టర్ తమ పైన ఎందుకు చర్యలు తీసుకోలేదని వారు వేస్తున్న ప్రశ్నలు.
దీనికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం లేదు.
వెలుగుమట్లలో పేదలు ఉన్నారని, వారికి ఇందరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
తమకున్న భూములను అమ్ముకోని, అప్పులు చేసి కట్టుకున్న ఇళ్లను కూల్చి ఇందరమ్మ ఇళ్లు ఇస్తామని అనడం న్యాయమేనా? అనే బాధితుల సవాలుకు మంత్రి వద్ద సమాధానం లేదు.
వందలాది బలగాల మధ్య బుల్లోడజర్లతో తమ ఇళ్లను నేలమట్టం చేశారని, అక్కడి వారి రోదనాభరితమైన వ్యక్తీకరణ. వారిని ఓదార్చిన ఎమ్మెల్యే, మంత్రి ఎవరూ లేరు.
ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు..
ఈ పేదల ఇళ్లు కూల్చి వారందరిని ఖమ్మం పట్టణంలో ఉన్న అంబేద్కర్ భవనంలో కొందరిని, అక్కడికి సమీపంలో ఉన్న మహిళా భవన్లో కొందరిని ఉంచారు అధికారులు. ఆ ప్రాంతమంతా భూకంప బాధితులను, వరద బాధితులను తలపించేలా ఉన్నది. వందలాది మహిళలకు సౌకర్యాలను కల్పించడంలో అధికార యంత్రాంగం సంపూర్ణంగా విఫలమైంది.
కొందరు దాతలు దాయార్థ హృదయంతో భోజనాలు ఏర్పాటు చేస్తున్నారని, అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదని బాధితుల ఆవేదన. కనీసం రెండు డజన్లకుపైగా పసిపిల్లలు ఉన్నారు. వందమందికి పైగా వృద్ధులు ఉన్నారు.
వారందరూ గూడి చెదిరిన పక్షుల తీరైందని ఆవేదన చెందుతున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఓట్లు వేసినందుకు బహుమతిగా తమ ఇళ్లు కూల్చారని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఇదేనా ప్రజా పాలనంటే?..
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తామని చెప్పి ప్రజల ఇళ్లను కూల్చేస్తున్నది. గత ప్రభుత్వం ఖమ్మంలో రైతులకు బేడీలు వేసి అధికారానికి దూరమైంది.
ఈ ప్రభుత్వం పేదల ఇళ్లు కూల్చి అంతకు మించిన ఫలితాన్ని అందుకుంటుందని వేరే చెప్పాల్సిన పని అసలే లేదని అక్కడి మహిళల మాట.
ఇళ్ల కూల్చివేతకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కొందరు పెద్దల రియల్ ఎస్టేట్ దాహానికి తమ నివాసాలు బలయ్యాయని అంటున్నారు. ప్రభుత్వం ఈ పేదలకు గౌరవప్రదమైన జీవితం, నివాసం ఏర్పాటు చేయాలని అక్కడి కుల ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అక్కడి రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు బడుతున్నాయి.
అభయహస్తం, ఇందిరమ్మ పాలన, ప్రజాప్రభుత్వమని ఎన్నేసి పేర్లు చెప్పుకున్నా చివరికి పేదలపైనే ఈ ప్రభుత్వం విరుచుకుపడిందని వెలుగుమట్ల, బడుగు జీవుల వేదనాభరిత వ్యాఖ్యలివి.
ఈ విషయంలో ప్రభుత్వం పేదల పక్షపాతిగా ఉంటుందో లేదా వారిని అలా వదిలేస్తుందో చూడాలి. వెలుగుమట్ల ప్రజల్లో సరికొత్త వెలుగులు రావాలన్నా, వారి మొఖాల్లో ఆనందం వెల్లివిరియాలన్నా ప్రభుత్వం వారు కోరుకున్న దగ్గరే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, వారికి తగిన నష్ట పరిహారం ఇవ్వాలని ఖమ్మం జిల్లా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల డిమాండ్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.


