భారతదేశంలో విశ్వవిద్యాలయాల పరిపాలనపై ఇటీవల జరిగిన చర్చలు, ఉపకులపతుల నియామకాలపై వివాదాలు, నియంత్రణ సంస్థల జోక్యాలు; అలాగే అకడమిక్ నిర్ణయాలపై పెరుగుతున్న కేంద్రీకరణపై వ్యక్తమవుతున్న ఆందోళనలు, అకడమిక్ స్వేచ్ఛ, సంస్థాగత స్వయంప్రతిపత్తి పరిస్థితిపై మళ్లీ దృష్టిని సారించాయి.
ముఖ్యంగా జాతీయ విద్యా విధానం- 2020 అనంతరం విధాన చర్చల్లో “స్వయంప్రతిపత్తి”, ఫ్లెక్సిబిలిటీ, ఇన్నోవేషన్, నాణ్యత వంటి పదాలు తరచుగా వినిపిస్తున్నాయి.
అయినప్పటికీ, అనేక ఉన్నత విద్యాసంస్థలలో చోటుచేసుకుంటున్న పరిణామాలు మరింత సంక్లిష్ట వాస్తవాన్ని సూచిస్తున్నాయి.
విస్తరిస్తున్న నియంత్రణ వ్యవస్థలు, పరిపాలనా కేంద్రీకరణ, పెరుగుతున్న వాణిజ్య ఒత్తిళ్లు, క్యాంపస్లలో విమర్శనాత్మక ఆలోచనకు ఉన్న ప్రజాస్వామ్య స్థలం క్రమంగా తగ్గుతున్నదనే ఆందోళనలను పెంచుతున్నాయి.
ఈ ఉద్రిక్తతలు భారత ఉన్నత విద్యలో ఒక పెద్ద నిర్మాణాత్మక మార్పు జరుగుతున్న సమయంలో కనిపిస్తున్నాయి.
నియంత్రణ సంస్థల పునర్వ్యవస్థీకరణ, సంస్థాగత స్వయంప్రతిపత్తిని నిర్వచించే కొత్త విధానాల రూపకల్పన, అలాగే డిజిటల్, ప్రైవేట్ విద్యా వేదికల వేగవంతమైన విస్తరణ, ఇవన్నీ కలిపి అకడమిక్ రంగాన్ని మలుస్తున్నాయి.
ఇదే సమయంలో సంస్థల ర్యాంకింగ్స్, పనితీరు ప్రమాణాలు, మేనేజీరియల్ పరిపాలనపై పెరుగుతున్న దృష్టి విశ్వవిద్యాలయాలు, కళాశాలల అంతర్గత సంస్కృతిని కూడా ప్రభావితం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో విద్యా సంస్థలలో అధికారం ఎవరి చేతుల్లో ఉంది, అకడమిక్ నిర్ణయాలు ఎలా తీసుకోబడుతున్నాయి, చర్చలకు, అసమ్మతికి, భిన్న అభిప్రాయాలకు అవకాశాలు ఎలా కల్పించబడుతున్నాయి అనే ప్రశ్నలు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి.
ఉన్నత విద్యపై పునరాలోచన..
ఈ నేపథ్యంలో “అకడమిక్ స్వేచ్ఛ, సంస్థల స్వయంప్రతిపత్తి- ప్రజాస్వామ్య స్థైర్యం: NEP-2020 యుగంలో ఉన్నత విద్యపై పునరాలోచన”(Academic Freedom, Institutional Autonomy, and Democratic Resilience: Rethinking Higher Education in the Age of NEP 2020) అనే శీర్షికతో రెండు రోజుల జాతీయ సదస్సు 2026 మార్చి 6–7 తేదీలలో తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండలో ఉన్న కాకతీయ ప్రభుత్వ కళాశాలలో ఫ్యాకల్టీ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, పరిశోధనా విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొని సమకాలీన భారతదేశంలో అకడమిక్ స్వేచ్ఛ తాత్విక, సంస్థాగత పునాదులపై చర్చించారు.
కేవలం ఉపన్యాసాల శ్రేణిగా కాకుండా సమిష్టి ఆలోచనలకు, సంభాషణలకు వేదికగా ఈ సదస్సు రూపకల్పన చేయబడింది.
ప్రారంభ సమావేశంలో భారత రాజ్యాంగ పీఠికను చదవడం ద్వారా చర్చలను రాజ్యాంగ విలువలతో అనుసంధానించే సంకేతాత్మక చర్య చేపట్టబడింది.
ఆహ్వానిత వక్తలు విద్యలో పెరుగుతున్న డిజిటల్, వాణిజ్య దిశ, ఎన్ఈపీ 2020 కింద మారుతున్న నియంత్రణ వాతావరణం, అలాగే విశ్వవిద్యాలయాలు ఎదుర్కొంటున్న విస్తృత సవాళ్లపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
సంస్థాగత స్వయంప్రతిపత్తి గురించి విధానాలలో వినిపించే మాటల ప్రచారం- పరిశోధన, అకడమిక్ నిర్ణయాల రోజువారీ వాస్తవ పరిస్థితుల మధ్య ఉన్న అంతరంపై కూడా ఆలోచనలు పంచుకున్నారు.
చర్చలలో పదేపదే వ్యక్తమైన అంశం ఏమిటంటే, అకడమిక్ స్వేచ్ఛను కేవలం ఒక సూత్రంగా మాత్రమే చూడలేము.
అది విద్యాసంస్థల రోజువారీ ఆచరణలో అంతర్నిహితంగా ఉంటుంది.
పాఠ్యాంశాలను రూపకల్పన చేయగల స్వేచ్ఛ, శాస్త్రీయ నిబద్ధత ఆధారంగా పరిశోధనలు చేయగల అవకాశం, జ్ఞానాన్ని ప్రచురించి పంచుకునే హక్కు, అకడమిక్ సమాజంలో తార్కిక విభేదాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ.
బ్యూరోక్రటిక్ విధానాల ద్వారా, మేనేజీరియల్ నియంత్రణల ద్వారా, లేదా సిద్ధాంతపరమైన ఒత్తిళ్ల ద్వారా ఈ స్వేచ్ఛలు నిర్బంధించబడినప్పుడు, దాని ప్రభావం వ్యక్తిగత ఉపాధ్యాయులకే పరిమితం కాకుండా, విద్యార్థులు నేర్చుకునే మేధోపరమైన వాతావరణంపైనా పడుతుంది.
ముసాయిదా పత్రం చర్చ
ఈ సందర్భంలో సదస్సులో పాల్గొన్నవారి ముందు “హన్మకొండ ప్రకటన: అకడమిక్ స్వేచ్ఛ, సంస్థాగత స్వయంప్రతిపత్తి” అనే ముసాయిదా పత్రం చర్చ కోసం ఉంచబడింది.
ఇది ముందుగానే నిర్ణయించబడిన తీర్మానంగా కాకుండా చర్చకు ఆహ్వానంగా ఉద్దేశించబడింది.
ఈ ప్రకటన ఉన్నత విద్యాసంస్థలు ప్రజాస్వామ్య జీవితానికి కీలకమైనవని, సత్యాన్వేషణ, విమర్శనాత్మక పరిశోధన, ప్రజా సంభాషణలకు అకడమిక్ స్వేచ్ఛ అనివార్యమని పునరుద్ఘాటించింది.
అలాగే న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంవంటి రాజ్యాంగ విలువలు భారత విద్యా వ్యవస్థ నైతిక లక్ష్యాలను మార్గనిర్దేశం చేయాలని పేర్కొంది.
ఈ ముసాయిదా ప్రకారం అకడమిక్ స్వేచ్ఛలో భయం లేకుండా బోధించగల, నేర్చుకోగల స్వేచ్ఛ, శాస్త్రీయ ప్రమాణాల ఆధారంగా పరిశోధనలు చేయగల హక్కు, జ్ఞానాన్ని ప్రచురించి పంచుకునే అవకాశం, తార్కిక అకడమిక్ చర్చల్లో పాల్గొనే స్వేచ్ఛ వంటి అంశాలు ఉన్నాయి.
అదే సమయంలో అకడమిక్ స్వేచ్ఛకు నైతిక బాధ్యత, శాస్త్రీయ క్రమశిక్షణ కూడా అవసరమని ఇది స్పష్టం చేసింది.
ఈ పరిస్థితులు రక్షించబడినప్పుడే విశ్వవిద్యాలయాలు తమ మేధోపరమైన, సామాజిక బాధ్యతలను నెరవేర్చగలవు.
చర్చలలో సంస్థాగత స్వయంప్రతిపత్తిని కేవలం పరిపాలనా స్వేచ్ఛగా కాకుండా సరైన భావంలో అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని కూడా ప్రస్తావించారు.
విధాన చర్చల్లో స్వయంప్రతిపత్తిని తరచుగా సంస్థల సామర్థ్యం లేదా నిర్వహణ సౌలభ్యంతో అనుసంధానిస్తారు.
అయితే నిజమైన స్వయంప్రతిపత్తి అకడమిక్ నిర్ణయాలను రాజకీయ, బ్యూరోక్రటిక్ లేదా వాణిజ్య ఒత్తిళ్ల నుంచి రక్షించాలి.
అలాగే పారదర్శకతను, బాధ్యతను, సమిష్టి పాలనను ప్రోత్సహించాలి.
ఈ అంశాలు లేకపోతే స్వయంప్రతిపత్తి అకడమిక్ సమగ్రతను రక్షించే సాధనంగా కాకుండా కేవలం మేనేజీరియల్ వికేంద్రీకరణగా మిగిలిపోతుంది.
సదస్సులో పాల్గొన్నవారు ప్రజాస్వామ్య పరిపాలన, అకడమిక్ సంస్కృతి మధ్య ఉన్న సంబంధంపై కూడా ఆలోచించారు. చారిత్రకంగా విశ్వవిద్యాలయాలు చర్చలకు, భిన్నాభిప్రాయాలకు, మేధోపరమైన బహుళత్వానికి వేదికలుగా పనిచేశాయి.
అయితే అనేక సందర్భాలలో విద్యా సంస్థలలో చర్చలు చేసే ప్రక్రియలు బలహీనపడుతూ, నిర్ణయాధికారం పరిపాలనా నిర్మాణాలలో కేంద్రీకృతమవుతున్నట్టు కనిపిస్తోంది.
ఈ ధోరణులు కేవలం సంస్థల పనితీరును మాత్రమే కాకుండా సమాజంలో ప్రజాస్వామ్య విలువలను పెంపొందించాల్సిన విశ్వవిద్యాలయాల పాత్రను కూడా దెబ్బతీస్తాయి.
హన్మకొండ ప్రకటన ఆమోదం..
సదస్సు ముగింపు సమావేశంలో పాల్గొన్నవారు సమిష్టిగా హన్మకొండ ప్రకటనను ఆమోదించారు. ఈ ప్రకటనను ఒక ప్రతిఘటనాత్మక ప్రకటనగా కాకుండా అకడమిక్ సమాజం పంచుకునే విలువలను ధృవీకరించే సాధారణ ప్రకటనగా ప్రతిపాదించారు.
విద్యాసంస్థలలో స్వేచ్ఛ, స్వయంప్రతిపత్తి, ప్రజాస్వామ్యం ఆచరణలో ఉండినప్పుడే అవి సమాజంలో అర్థవంతంగా నిలుస్తాయని ఇది పేర్కొంది.
నియంత్రణ పునర్వ్యవస్థీకరణ, మార్కెట్ ఒత్తిళ్లు, మేనేజీరియల్ పరిపాలనవంటి ప్రభావాలు భారత ఉన్నత విద్యను మలుస్తున్న ఈ కాలంలో అకడమిక్ సమాజంలో ఇలాంటి సంభాషణలు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.
విశ్వవిద్యాలయాలను కేవలం ర్యాంకింగ్స్, సామర్థ్య సూచికలు, లేదా ఉద్యోగావకాశాల ఫలితాల ఆధారంగా మాత్రమే అంచనా వేయలేము. అవి విమర్శనాత్మక ఆలోచన, మేధో స్వతంత్రం, ప్రజాస్వామ్య సంభాషణలను నిలబెట్టే కీలక సంస్థలు- ఈ విలువలు లేకుండా సమాజపు ప్రజాస్వామ్య జీవితం కూడా క్షీణిస్తుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
