మతమేదైనా, దేవుడెవరైనా అన్నీ ఆదిమ సమాజంలో రూపుదిద్దుకున్న భావనలే. అలాగే మతమేదైనా సరే, కష్టజీవుల్ని ఎప్పుడూ ఎక్కడా గుర్తించలేదు. సరికదా, వారిని బానిసలుగా మార్చి హింసించింది. ఆ బాధపడలేక వారు ఒక మతంలోంచి మరో మతంలోకి మారుతూ వచ్చారు. అయినా వారికి ఎక్కడా ప్రశాంతమైన జీవితం లభించలేదు. ఆధిపత్యం నెరపేవారికీ, అణగదొక్కబడిన వారికీ మధ్య ఘర్షణ నిరంతరం జరుగుతూనే ఉంది. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. *పైపైన కొన్ని మార్పులు జరుగుతున్నట్టు కనిపించినా, మనుషుల మెదళ్లలో విభజనలు అలాగే ఉన్నాయి.*
అనాదిగా అన్ని మతాలకు సంబంధించిన విగ్రహాలు, ప్రతిమలు, రూపాలు కొన్ని కోట్లలో తయారవుతూ వచ్చాయి కదా? మరి వాటిని రూపొందించిన శ్రామికుల గురించి ఎవరైనా ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? గుడ్డిగా గుండంలోనో, పుష్కరిణిలోనో, నదిలోనో మునిగి గుడిలో దేవుడి ప్రతిమకు తమ కోర్కెల చిట్టా సమర్పించుకొని రావడం తప్ప, ప్రతి అడుగునూ అందంగా తీర్చిదిద్దిన శ్రామికుల కృషి గురించి ఎవరూ ఎందుకు ఆలోచించరూ? అవన్నీ ఉన్న ఫలానా ఏ దేవుడూ సృష్టించినవి కావు.
ఈ పరిస్థితి మారాలి..
ఏ దేవుడు కూడా తన ప్రతిమను/ విగ్రహాన్ని/ శిల్పాన్ని తనే తయారు చేసుకోలేదన్నది నిజం. ఇటీవలి అయోధ్య రామాలయంలోనైనా, యూఏఈలో భారత ప్రధాని డాబుగా ప్రారంభించిన ఆలయంలోనైనా దేవుళ్ల ప్రతిమలు మనుషులు రూపొందించినవే కదా? గోపురాలు, ఆలయాలు శిల్ప సౌందర్య శోభ అంతా మనుషుల కృషేనన్న సంగతిని క్షణమాత్రమైనా ఆలోచించరు. వారి సౌందర్య దృష్టిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభినందించరు. ఇవన్నీ ఆలోచించగలవాడు విజ్ఞుడు.
వీటిని పట్టించుకోకుండా మూఢత్వంలో మునిగే జనమే ఎక్కువ! ఈ పరిస్థితి మారాలి!! మూఢత్వంలోనే పరమానందభరితులవుతూ కెమరాలకు ఫోజులిచ్చే మన దేశ నాయకులకు ఎలాగూ ఈ పరిస్థితి మారాలని ఉండదు.
ఆదిమానవుడి ఒక అజ్ఞానపు భావనకు వంగి దండం పెడతారు. ఆ భావనకు ఒక రూపాన్నిచ్చిన శిల్పకారుడి “శ్రమ”ను మాత్రం కనీసం గుర్తించరు. ప్రశంసించరు. అంటే ఏమిటి? పట్టించుకోవాల్సింది పట్టించుకోరు. అవసరం లేనిది విపరీతంగా పట్టించుకుని తమను తాము భక్తుల జాబితాలో చేర్చుకుంటారు.
మనిషి ఏ కాలం వాడైనా, అతని కృషి ఏ రూపంలో ఉన్నా గుర్తించగలిగినవాడే మానవవాది! దైవ దర్శనం చేసుకున్నామని కాకుండా “స్థలాల విహారయాత్ర” అని అనుకుంటే- వందల, వేల యేళ్లనాటి మన పూర్వీకుల సౌందర్య దృష్టికి, సాంకేతిక పరిజ్ఞానానికి అబ్బురపడినట్టు దాన్ని అర్థం చేసుకున్నట్టు. వాటి చుట్టూ అల్లుకున్న చారిత్రక, సామాజిక, సంగీత, సాహిత్యాల గూర్చి తెలుసుకోవడం మరొక శోధన.
అజ్ఞానపు ఆలోచనే దైవ భావన..
ఆదిమ సమాజంలో రూపుదిద్దుకున్న ఒక అమాయకపు లేదా అజ్ఞానపు ఆలోచన దైవ భావన అయితే, దాని చుట్టూ మహామహా సంగీత, సాహిత్య పండితులంతా తమ ప్రతిభను ప్రదిర్శించారు. ఒక రకంగా వారు ఆయాకాలాలకు తగినట్టు ప్రవర్తించారేమో కానీ, ఇప్పటి తరం ఏం చేయాలి? ఆయా కళాకారుల ప్రతిభను గుర్తించి అందులో నిక్షిప్తమైన భక్తిని, దైవభావనని వదిలేయాలి. పండు తిని టెంక వదిలేస్తున్నాం కదా?
సంగీతాన్ని ఆనందిస్తూనే అందులో ఉన్న భావనను వదిలేయాలి. సంగీతాన్ని సాహిత్యాన్ని మధించిన మహానుభావులంతా; తమ శక్తిని, ప్రతిభను మనిషి కేంద్రంగా ప్రదర్శించలేకపోయారేనని విచారించాలి. మనువాదుల ప్రభావంలో కొట్టుకుపోయి దుర్బలులయ్యారేనని బాధపడాలి. వారి కీర్తనలు వారి కృతులు మనిషి ఔన్నత్యాన్ని ఎలుగెత్తి చెప్పలేక పోయాయి. వారి ప్రతిభను వారిలోని మూఢత్వం కప్పేసింది.
రాగల కాలాలలో మానవ విజయ దుందుభిని శ్లాఘించే సంగీత, సాహిత్యాలు వస్తాయి. కాలానికి అనుగుణంగా ఎదగని సంగీత సాహిత్యాన్ని జనం వదిలేసి ముందుకు వెళ్తారు. రామాయణాలు రాసి జ్ఞానపీఠాలు తెచ్చుకునే మూఢ పండితోత్తములు మనకు భవిష్యత్తులో ఉండకపోవచ్చు.
మనిషి జీవనయానంలో మనిషి సామాజిక పరిణామక్రమంలో వచ్చిన వాటిని కాదనలేం. కానీ, ప్రతి అంశంలో మానవుడి శ్రమ, సౌందర్య పిపాసను అర్థం చేసుకుంటూ వస్తే, ఆధునిక ఆలోచనా ధోరణికి అనుగుణంగా ఎదిగి ఆలోచిస్తే, మూఢ భక్తిలో కృంగికృశించి పోవడానికి వీలుండదు. “ఏ విగ్రహానికి ఏ మహత్తూ ఉండదు.
ఏ దేవుడూ ఎవరి కోర్కెలూ తీర్చలేడు” అని గట్టిగా నమ్మిన వారి ఆలోచన వేరుగా ఉంటుంది. “మాకు దైవశక్తి మీద విశ్వాసముంది” అని అనుకునే వారితో మనకు పేచీ లేదు. వారి నమ్మకం వారిది. పురాతన కాలంలో ఎప్పుడో మనిషి గీసుకున్న సరిహద్దుల్ని దాటి, బయటికి వచ్చి స్వేచ్ఛగా ఆలోచిస్తామన్న వారిని ఆలోచించనీయాలి. వారిపై దాడులు చేయగూడదు. మీ విశ్వాసం మీకు ఉన్నప్పుడు, వారి విశ్వాసం వారికి ఉంటుంది కదా? అంత మాత్రానికి మానసికంగా హింసించడం, చంపేయడం చేస్తారా? వారికి ఆ హక్కు ఎవరిచ్చారూ? నిజానికి మూఢవిశ్వాసాల వల్ల, దైవ భావనల వల్ల ప్రగతి సాధ్యం కాలేదు. స్వేచ్ఛాలోచనాపరులతోనూ వైజ్ఞానిక సాంకేతిక శ్రమ జీవులతోనే ప్రగతి సాధ్యమవుతూ వస్తోంది!
ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి స్మృతి చిహ్నంగా సమాధి కట్టడం వాడుకలో ఉంది. షాజహాన్ చక్రవర్తి గనక, భార్య ముంతాజ్ మహల్ స్మృతిలో అద్భుతమైన తాజ్మహల్ నిర్మించాడు. ఆర్థిక స్థోమతలను బట్టి కట్టడాలు ఉంటాయి. అలాగే అన్ని మతాల అన్ని పుణ్యక్షేత్రాలూ స్మృతి చిహ్నాలే. ఒక మహానుభావుడి స్మృతిలో మ్యూజియం ఏర్పాటు చేస్తే అందులో ఏముంటాయి? ఆయన చిత్రపటాలు, వాడిన వస్తువులు, ఆయన జీవన శైలికి, వ్యక్తిత్వానికి సంబంధించిన ఏ క్షేత్రంలోనైనా దేవుడు ఉండడు. ఆయన ఉన్నాడన్న భావన చుట్టూ అల్లుకున్న సరంజామా- సంరంభం మాత్రమే ఉంటాయి.
మనిషి తన ప్రాథమిక దశలో దేవుడిపట్ల ఏర్పరుచుకున్న ఊహలకు భ్రమలకూ ప్రతిరూపాలు మాత్రమే అక్కడ ఉంటాయి. దైవ భావన మాత్రమే అక్కడ ఉంటుంది. ఆ భావన వల్ల జనానికి జరిగే మేలు ఏమీ ఉండదు. ఏ మతానికి సంబంధించిన ఏ దేవుడి మీద ఎంత భక్తి పెంచుకున్న ఒరిగేది శూన్యం. అద్భుతాలేవీ జరగవు. ఎవరి తిండి వారు సంపాదించుకోవాల్సిందే. ఎవరి వ్యక్తిత్వాన్ని వారు తీర్చి దిద్దుకోవాల్సిందే. దైవ శక్తితో జరిగాయని ప్రచారం చేసుకున్నవన్నీ నిరూపణ కాలేదు. కావుకూడా!. ఇక ముందు సాధించుకోబోయేవే. అందువల్ల అన్ని మతాల అన్ని దైవక్షేత్నాలనీ స్మృతి చిహ్నాలనుకుంటే గొడవే ఉండదు. దైవ భావనకు కట్టుకున్న సమాధులనుకుంటే, అప్పుడు చారిత్రక ప్రాధ్యాన్యత కూడా ఉంటుంది. పైగా విశ్వనరుడి ఆవిర్భావం జరగుతుంది.
అమానవీయ సంస్కృతికి వంత..
ఒక మతకేంద్రానికి లేదా ప్రార్థనా స్థలానికి లేదా పుణ్యక్షేత్రానికి మీరు వెళ్లి మొక్కుతున్నారంటే, అర్థం ఏమిటీ? ఎప్పుడో వేలవేల ఏళ్ల క్రితం మన పూర్వీకులు ఏర్పరుచుకున్న భావనకు నమస్కరిస్తున్నామాట! పూర్వీకుల్ని వారి భావనని గౌరవించుకుంటున్నారన్న మాట. అంతేగాని, నిజంగా దేవుడనేవాడు అక్కడ ఉన్నట్టు కాదు. ఆయన మీ గొంతెమ్మ కోర్కెల్ని తీరుస్తాడనీ కాదు. కాలక్రమంలో ఆ దైవభావన చుట్టూ అభివృద్ధి చెందిన వ్యాపారం ఇతోధికంగా కొనసాగడానికి మీ వంతు కృషి మీరు చేస్తున్నారన్న మాట!
మనుషుల్ని వర్ణాలుగా, వర్గాలుగా విభజించిన మనువాదానికి మీరు చెక్క భజన చేస్తున్నారన్న మాట! కొందరిని లోనికి రానిచ్చి, మరికొందరిని బహిష్కరించే అమానవీయ సంస్కృతికి మీరు వంత పాడుతున్నారన్నమాట.
సంపూర్ణ మానవుడు, పరిపూర్ణ మానవుడు ఎప్పుడైనా మానవశక్తినే నమ్ముకుంటాడు. మానవీయ విలువలకే ప్రాధాన్యమిస్తాడు. ఇదికాక, మరేవో అతీంద్రియ శక్తుల గురించి మాట్లాడేవారు ఎలాంటి అసంపూర్ణ జీవులన్నది మనం ఆలోచించాలి. మనుషుల్ని కులాలుగా, మతాలుగా, లింగపరంగా, ప్రాంతపరంగా విభజించేవాడు రాజకీయ నాయకుడవుతాడు. లేదా మత బోధకుడవుతాడు. అంతేగాని పరిపూర్ణ మానవుడెలా అవుతాడు? వీరికన్నా జంతువులు, పక్షులు, కీటకాలు నయం కదా? అవి తమని తాము విభజించుకోవు.
ప్రఖ్యాత కన్నడ కవి గోపాలకృష్ణ ఆడిగా అంటారు కదా,
“నీరు మరిగి ఆవిరవుతుంది/ విద్యుత్తు అవుతుంది/
వర్షంగా హర్షిస్తుంది/ నది నీరా చెరువు నీరా/
బావిలోని మంచి నీరా? చెరువులోని ఉప్పు నీరా?/
కుంటలోని మురికి నీరా? ఏమో/
అనంతాకాశంలో కలుసుకున్నప్పుడు/
నీరంతా ఒక్కటే-
తేడాలేదు!
ఇప్పుడు చెప్పండి ఇందులో
కుల ప్రసక్తి ఎక్కడుందీ?
అది మీరు మట్టిలో నాటి
మీ ఇష్ట ప్రకారం పెంచి పోషించింది కాదూ?”
అన్నది ఆయన కవిత్వాత్వకంగా వెలిబుచ్చిన ఆవేదన! మనుషులు విడిపోవడమే కాదు, ప్రార్థనా స్థలాల్ని విడగొట్టుకోవడం, మళ్లీ వాటికోసం పోట్లాడుకోవడడం..
మన గొప్ప సంస్కృతిలో భాగమా?
ఆలోచించుకునే పనే లేదా?
సమకాలీన సామాజిక, రాజకీయ పరిస్థితుల్ని కవి గోపాలకృష్ణ ఆడిగ యాభై ఏళ్లకు ముందే ఊహించి, ఈ కవిత రాసి ఉంటారు. కవి దార్శనికుడు కావడమంటే ఇదే-
ఉన్న మనుషుల ఇళ్లు బుల్డోజర్లతో కూలగొట్టి,
లేని దేవుళ్లకు గుళ్లుకట్టే విజ్ఞతలేని పాలకులు వస్తారని మాత్రం
ఆయన ఊహించి ఉండరు. ఎందుకంటే, మూర్ఖత్వం ఏ అంచనాలకూ అందదు!
(వ్యాస రచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫేసర్)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
