
చర్చను, నిజాన్ని ఫాసిస్టు శక్తులు అంగీకరించవని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు రాఘవులు అన్నారు. భారత జాతీయోద్యమం నిరక్ష్యరాసులను చైతన్య పరిచిందని, ఫలితంగా సార్వ జనీన ఓటు హక్కు వచ్చిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి నష్టం చేసే విధంగా బీజేపీ ప్రస్తుతం వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు.
హైదరాబాద్: ఆగస్టు 12న(మంగళవారం) సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో “రాజ్యంగం- ఎన్నికల కమిషన్- దొంగ ఓట్లు” అనే అంశంపై సీతారాం ఏచూరి జయంతి సందర్భంగా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు రాఘవులు పాల్గొన్నారు. సభాధ్యక్షులుగా సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య వ్యవహరించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించారు.
బీజేపీ అనుసరిస్తున్న నియో ఫాసిస్టు విధానాలపై దేశవ్యాప్త క్యాంపెయిన్ చేపట్టాలని ప్రధాన వక్త రాఘవులు పిలుపునిచ్చారు. భారతీయ భావాన్ని ఏచూరి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారని గుర్తుచేశారు. దేశంలో అనేక మతాలు, భాషలు, ఆహారపు అలవాట్లు, సంస్కృతి, సంప్రదా యాలు, తాత్విక చింతన కలిస్తేనే భారతీయ భావన అవుతుందన్నారు. కానీ, బీజేపీ సంకుచిత ధోరణితో ఒక భావాన్ని, ఒక భాషను, ఒక ఆహారాన్ని, ఒక జాతికి పరిమితమై ఆలోచిస్తున్నదని విమర్శించారు. దేశాన్ని విడదీసి, ప్రజల్లో ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని అన్నారు.
రాజ్యాంగ దిశానిర్దేశం..
నూతన ఆలోచన, ప్రశ్న, నిజం పట్ల బీజేపీకి నమ్మకం లేవనీ, సమానత్వాన్ని అంగీకరించట్లేదనీ చెప్పారు. ఇండియా అయినా, భారత్ అయినా కులం, మతం, లింగబేధం లేకుండా పౌరులందరూ సమానమేనని రాజ్యాంగం చెప్తుందని పేర్కొన్నారు. మతాలు ఉన్నా, ప్రజలంతా లౌకికంగా ఉండాలనే రాజ్యాంగం దిశానిర్దేశం చేస్తున్నదన్నారు.
కానీ, బీజేపీ ఫ్యూడల్ వ్యవస్థను తేవాలనుకుంటున్నదనీ, కులాలు ఉండాలంటున్నదని చెప్పుకొచ్చారు. స్వాతంత్య్రానికి ముందు అందరికీ ఓటు హక్కు లేదనీ, దేశంలో అందరికీ ఓటును రాజ్యాంగం కల్పించిందని గుర్తు చేశారు. దానివల్లే భారత్లో అధ్యక్ష తరహా పాలన కాకుండా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అమల్లో ఉందన్నారు.
నిర్వీర్యమవుతోన్న వ్యవస్థలు..
మోడీ పాలనలో రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయని రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమిలో ఒక పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) మారిందని చెప్పారు. అందుకే బీహార్లో ఎస్ఐఆర్ను చేపట్టిందన్నారు. డబ్బు, కులం, మతం, అధికార యంత్రాంగం ద్వారా కాకుండా ఎన్నికల వ్యవస్థలోనే మార్పులు తెచ్చి గెలవాలని అనుకుంటున్నారని విమర్శించారు.
ఓటు హక్కు కోసం ఆధార్, రేషన్కార్డును పరిగణనలోకి తీసుకోవడం లేదనీ, బర్త్ సర్టిఫికెట్, పాస్పోర్టు కావాలంటున్నారని చెప్పారు. దొంగ బర్త్ సర్టిఫికెట్, దొంగ పాస్పోర్టులు ఉండడం లేదా?అని ప్రశ్నించారు. దొంగ ఓట్లు వేయడం ఎప్పటినుంచో జరుగుతున్నదనీ, తాజాగా సామూహికంగా ఓట్ల తొలగింపును చేరుస్తున్నారని తెలిపారు. ఈసీ అర్హులను అనర్హులుగా ప్రకటిస్తున్నదనీ, అది ప్రజాస్వామ్యానికి ప్రమాదమని ఆందోళన వ్యకం చేశారు.
పౌరసత్వం, ఓటు హక్కు వేర్వేరని స్పష్టం చేశారు. భారత్లో నివాసం ఉంటే ఓటు హక్కు కల్పించాలని చెప్పారు. హిట్లర్ కూడా ఎన్నికల ద్వారానే అధికారంలోకి వచ్చి రాజ్యాంగాన్ని తొలగించారని గుర్తు చేశారు. మోడీ ప్రభుత్వం కూడా అదే తరహాలో పాలన సాగిస్తుదని తెలిపారు.
ఇంకా మాట్లాడుతూ, అప్రమత్తంగా లేకుంటే రాజ్యాంగాన్ని మార్చి మనుధర్మాని అమలు చేస్తారని హెచ్చరించారు. రాజ్యాంగ పీఠిక నుంచి లౌకికవాదం, సోషలిస్టు పదాలను తొలగించాలనుకుంటున్నారని చెప్పారు.
అమెరికా అధ్యక్షులు ట్రంప్కు, ఇక్కడ ప్రధాని మోడీకి కమ్యూనిస్టులంటే భయమని అన్నారు. భారతీయ భావం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఇదే ఏచూరికి ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.