ఆంధ్రప్రదేశ్ గ్రామ-వార్డు సచివాలయ వ్యవస్థలోని సంక్షోభాన్ని పీపుల్స్ పల్స్ పరిశోధనా సంస్థ బహిర్గతం చేసింది.
అంతేకాకుండా, గ్రామ స్వరాజ్య స్వప్నాన్ని కాపాడటానికి ఆధారాలతో కూడిన తక్షణ సంస్కరణలకు పిలుపునిస్తోంది.
పారదర్శక ప్రజా విధాన విశ్లేషణకు అంకితమైన పీపుల్స్ పల్స్ పరిశోధనా సంస్థ, ఆంధ్రప్రదేశ్ గ్రామ-వార్డు సచివాలయ వ్యవస్థపై నిర్వహించిన సమగ్ర క్షేత్రస్థాయి సర్వే ఫలితాలను విడుదల చేసింది.
2025 డిసెంబర్ 1 నుంచి 2026 జనవరి 20 మధ్య ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
ఉత్తరాన ఇచ్ఛాపురం నుంచి దక్షిణాన తడ వరకు తీర ప్రాంత గ్రామాలు, రాయలసీమ జిల్లాలు, మారుమూల గిరిజన తండాలతో సహా రాష్ట్రవ్యాప్తంగా సర్వే కొనసాగింది.
పరిశోధనా బృందం సచివాలయ సిబ్బంది, లైన్ డిపార్ట్మెంట్ అధికారులు, ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, లబ్ధిదారులు, సామాన్య పౌరులతో సహా 1,200మందికి పైగా భాగస్వాములతో ముఖాముఖిని సంస్థ బృందం నిర్వహించింది.
ప్రాథమిక సమాచారం, రికార్డుల పరిశీలన, లోతైన ఇంటర్వ్యూల ఆధారంగా రూపొందించిన ఈ ఐదు అధ్యాయాల నివేదిక- 2019లో గొప్ప ఆశయంతో ప్రారంభమై, ప్రస్తుతం తన అసలు లక్ష్యం నుంచి పక్కకు దారితప్పిన వ్యవస్థపై నిష్పాక్షికమైన, పారదర్శకమైన అంచనాను అందిస్తుంది.
వాగ్దానం వర్సెస్ క్షేత్రస్థాయి వాస్తవికత
మహాత్మా గాంధీ ఆశయమైన గ్రామ స్వరాజ్య సాధనలో గ్రామ-వార్డు సచివాలయ వ్యవస్థ ఒక విప్లవాత్మక అడుగుగా భావించబడింది.
బహుళ శాఖల పరిపాలనను ప్రజల ఇంటి వద్దకే తీసుకురావడం, సంక్షేమ పథకాల పంపిణీలో పారదర్శకత, అవినీతి నిర్మూలన, స్థానిక ఉపాధి కల్పన, గ్రామ సభలు, పంచాయతీ రాజ్ సంస్థలకు పాలనను జవాబుదారీగా చేయడం దీని ముఖ్య ఉద్దేశం.
ప్రారంభంలో ఈ వ్యవస్థ స్పష్టమైన ప్రయోజనాలను అందించింది. 15,000 పైగా సచివాలయాలు ఏర్పాటయ్యాయి.
ఇందులో 1.34 లక్షల మందికి పైగా సిబ్బంది, 2.52 లక్షల మంది వాలంటీర్లు పనిచేశారు. పెన్షన్లు నేరుగా ఇంటికే అందాయి, సర్టిఫికేట్లు వేగంగా జారీ అయ్యాయి. దీంతోపాటు అనేకమంది గ్రామీణ యువతకు ప్రభుత్వ అనుబంధ ఉద్యోగాలు లభించాయి. మొదటి రెండు మూడు ఏళ్ల పాటు ఈ వ్యవస్థ విస్తృత ప్రజాదరణ పొందింది. అయితే, మా సర్వే ప్రకారం ఈ వ్యవస్థ క్రమంగా బలహీనపడింది.
బలహీనపడడానికి ప్రధానాంశాలు
సిబ్బందిపై ఒత్తిడి, మానసిక ఆరోగ్య సంక్షోభం
వారానికి 48 గంటల కంటే ఎక్కువ సమయం పనిని 1.10 లక్షల మందికి పైగా రెగ్యులరైజ్డ్ ఉద్యోగులు చేస్తున్నారు. పొంతన లేని విధులు, అంతులేని సర్వేలు, ఫేషియల్ రికగ్నిషన్ హాజరులో సాంకేతిక లోపాలు; రాజకీయ జోక్యం విస్తృత అసహనానికి దారితీశాయి.
తీవ్ర ఒత్తిడి, డిప్రెషన్ కారణంగా 2025లోనే సచివాలయ సిబ్బందిలో సుమారు 10 ఆత్మహత్యలు లేదా ఆకస్మిక మరణాలు నమోదయ్యాయి.
వాలంటీర్ల శూన్యత
2024లో వాలంటీర్ వ్యవస్థను హఠాత్తుగా రద్దు చేయడం వల్ల చివరి మైలు వరకు సేవలు అందించడంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఒకప్పుడు ఇంటికే పెన్షన్లు వచ్చేవి. దరఖాస్తుల కోసం ఇప్పుడు పౌరులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇది జాప్యానికి, అసౌకర్యానికి కారణమవుతోంది.
పౌరుల అసంతృప్తి
హామీ ఇచ్చిన 72 గంటల పరిష్కార గడువు ఎక్కడా అమలు కావడం లేదు. సచివాలయాలు సమస్యల పరిష్కార కేంద్రాలుగా కాకుండా, కేవలం దరఖాస్తుల సేకరణ కేంద్రాలుగా మిగిలిపోయాయి.
గ్రామీణ ప్రజలు తమ సమస్యల కోసం తరచూ జిల్లా కలెక్టరేట్లు లేదా ముఖ్యమంత్రి ప్రజా దర్బార్లను ఆశ్రయిస్తున్నారు.
రాజకీయ ఉదాసీనత
ఎన్నికైన ప్రతినిధులు తమను పక్కన పెట్టినట్టు భావిస్తున్నారు. సచివాలయాలు తమకు సహకరించే సంస్థలుగా కాకుండా, సమాంతర అధికార కేంద్రాలుగా మారాయని వారు పేర్కొంటున్నారు. గ్రామసభ నిర్ణయాలు ఆచరణలోకి రావడం లేదు.
ఆర్థిక భారం
ఈ వ్యవస్థ ఒక “శ్వేతహస్తి” (White Elephant)గా మారింది. వేల కోట్ల రూపాయలు జీతాలు, నిర్వహణ కోసం ఖర్చవుతున్నా, ఫలితాలు మాత్రం క్షీణిస్తున్నాయి.
మౌలిక సదుపాయాల లోపాలు
అనేక సచివాలయాలు “జీరో-బడ్జెట్” మోడల్లో నడుస్తున్నాయి. నిరీక్షణ గదులు, తాగునీరు, సరైన పరిశుభ్రత వంటి కనీస సౌకర్యాలు కరువయ్యాయి.
ప్రభుత్వానికి స్పష్టమైన సిఫార్సులు
దీనిని రాజకీయ ఘర్షణగా కాకుండా, అర్థవంతమైన సంస్కరణలకు ఒక అవకాశంగా పరిగణించాలని పీపుల్స్ పల్స్ పరిశోధనా సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతోంది. మేము ఈ క్రింది నిర్దిష్టమైన, ఆచరణాత్మక సిఫార్సులను సమర్పిస్తున్నాము.
ఉన్నత స్థాయి స్వతంత్ర అధ్యయన కమిటీ
రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన 15 రోజుల్లోగా కమిటీని ఏర్పాటు చేయాలి. ఇందులో అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, పౌర సమాజం, మేధావులు, పరిశోధకులకు ప్రాతినిధ్యం ఉండాలి. ఈ కమిటీ మూడు నెలల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాలి.
మానవీయ కోణంలో సిబ్బంది హేతుబద్ధీకరణ
జనాభా ప్రాతిపదికన సిబ్బంది సర్దుబాటును(ఏ, బీ & సీ కేటగిరీలు) పూర్తి చేయాలి. అదనపు సిబ్బందిని నైపుణ్య పరీక్షల ద్వారా ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలి, ఎవరినీ తొలగించకూడదు.
రాజకీయ రహిత వాలంటీర్ వ్యవస్థ పునరుద్ధరణ
ఒక తటస్థ నియామక సంస్థ ద్వారా పరిమిత సంఖ్యలో వాలంటీర్లను (ప్రతి 100 ఇళ్లకు ఒకరు) నియమించాలి. వారికి రూ 10,000 గౌరవ వేతనం, స్పష్టమైన విధులతోపాటు కఠినమైన పనితీరు పర్యవేక్షణ ఉండాలి.
సిబ్బంది సంక్షేమం
పని వేళల్లో వెసులుబాటు, జిల్లా స్థాయిలో రహస్య కౌన్సెలింగ్ సేవలు, అర్హత ఆధారిత ప్రమోషన్లు, మహిళా సిబ్బందికి రక్షణ ప్రోటోకాల్స్ ప్రవేశపెట్టాలి.
8 గంటల పని దినాన్ని కచ్చితంగా అమలు చేస్తూ, అదనపు పనికి తగిన పరిహారం చెల్లించాలి.
పంచాయతీ రాజ్ సంస్థలతో అనుసంధానం
సచివాలయ సిబ్బందిని గ్రామసభలకు, ఎన్నికైన ప్రతినిధులకు జవాబుదారీగా చేయాలి. సర్పంచులు, వార్డు సభ్యులకు రోజువారీ విధుల్లో స్పష్టమైన పర్యవేక్షణ అధికారాలు ఉండాలి.
మౌలిక సదుపాయాలు, డిజిటల్ వ్యవస్థల ఆధునీకరణ
ఎంజీఎన్ఆర్ఈజీఏ, ఫైనాన్స్ కమిషన్ నిధుల ద్వారా అన్ని కార్యాలయాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి. ఏకీకృత సర్వేలు, ఫిర్యాదుల ట్రాకింగ్, నిధుల వినియోగం కోసం ఒకే డిజిటల్ ప్లాట్ఫారమ్ను అమలు చేయాలి.
గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
ఏజెన్సీ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా, తక్కువ అవగాహన ఉన్న ప్రజలకు సేవలందించేందుకు హ్యామ్లెట్ స్థాయిలో ‘మల్టీ పర్పస్ అసిస్టెంట్లతో’ కూడిన ప్రత్యేక నమూనాను రూపొందించాలి.
సమగ్ర సర్వే విధానం
ప్రతి శాఖ విడివిడిగా చేసే సర్వేల స్థానంలో, ఏడాదికి ఒకసారి మాత్రమే ఓటీపీ ఆధారిత సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించాలి. ఈ డేటాను అన్ని శాఖలు వాడుకునేలా చూడాలి.
“గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయాలనే నిజాయితీ గల సంకల్పంతో గ్రామ-వార్డు సచివాలయ వ్యవస్థ ప్రారంభమైంది. మా సర్వే ప్రకారం, లక్ష్యం సరైనదే అయినప్పటికీ, అమలులో తీవ్ర లోపాలు ఉన్నాయి. పారదర్శకమైన, ఏకాభిప్రాయంతో కూడిన సంస్కరణల ద్వారా ఈ తప్పులను సరిదిద్దడానికి ప్రభుత్వానికి ఇదొక చారిత్రాత్మక అవకాశం. ఈ హెచ్చరికలను విస్మరిస్తే ప్రజాధనం వృధా కావడమే కాకుండా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంటుంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ, పట్టణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం త్వరగా, నిర్ణయాత్మకంగా స్పందించాలని మేము కోరుతున్నాము.”
నిజాయితీ గల విశ్లేషణ, సమిష్టి చర్యల ద్వారా మాత్రమే గ్రామ స్వరాజ్య స్వప్నాన్ని కాపాడగలంతోపాటు బలోపేతం చేయగలమని పీపుల్స్ పల్స్ పరిశోధనా సంస్థ నమ్ముతోంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
