పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్సభలో, కాలుష్యంతో ముడిపడిన విషయాలను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రస్తావించింది. ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలు ప్రస్తుతం తీవ్రమైన వాయు కాలుష్యంతో సతమతమవుతున్నాయని తెలియజేసింది. మరోవైపు దేశవ్యాప్తంగా కాలుష్య నియంత్రణ బోర్డులు, కమిటీలలో మంజూరు చేయబడిన శాస్త్రీయ- సాంకేతిక పోస్టులలో దాదాపు 45% ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నది.
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్సభలో, ఢిల్లీ- ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలు ప్రస్తుతం తీవ్రమైన వాయు కాలుష్యంతో సతమతమవుతున్నాయని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా కాలుష్య నియంత్రణ బోర్డులు, కమిటీలలో మంజూరైన శాస్త్రీయ, సాంకేతిక పోస్టులలో దాదాపు 45% ఖాళీగా ఉన్నాయని చెప్పుకొచ్చింది.
నివేదిక ప్రకారం, డిసెంబర్ 8న లోక్సభలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలో ప్రత్యక్షంగా పనిచేసే– దేశంలోని అత్యున్నత కాలుష్య నియంత్రణ సంస్థ కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ)లో 16.28% పోస్టులు ఖాళీగా ఉన్నాయని పర్యావరణ శాఖ సహాయమంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలియజేశారు.
ఈ విషయంలో, సీపీసీబీ- రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు(ఎస్పీసీబీ)లు– పర్యావరణ ఇంజనీర్లు, శాస్త్రవేత్తల వంటి క్షేత్రస్థాయి సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయాని భారత కమ్యూనిస్ట్ పార్టీ(మార్క్సిస్ట్) ఎంపీ రత్నవేల్ సచ్చిదానంతం అడిగారు.
ఈ మానవ వనరుల కొరతను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రణాళిక, కాలక్రమంతో పాటు; సీపీసీబీ, అన్ని ఎస్పీసీబీలలో ప్రస్తుతం మంజూరు చేయబడిన మొత్తం సిబ్బంది సంఖ్య; ఖాళీగా ఉన్న గ్రౌండ్ లెవల్ సిబ్బంది పోస్టుల సంఖ్య వివరాలను కూడా ఆయన కోరారు.
దేశవ్యాప్తంగా ఖాళీగా 3,161 పోస్టులు
సీపీసీబీ కాకుండా 28 ఎస్పీసీబీలు– ఎనిమిది కాలుష్య నియంత్రణ కమిటీలు(పీసీసీలు, ఢిల్లీ- ఎన్సీఆర్తో సహా కేంద్రపాలిత ప్రాంతాలలో పనిచేస్తున్నాయి) ఉన్నాయి.
శాస్త్రీయ– సాంకేతిక పోస్టులకు మొత్తం మంజూరు చేయబడిన సంఖ్య 6,932 అని, ఇందులో 3,161 లేదా 45.6% పోస్టులు ఖాళీగా ఉన్నాయని సింగ్ తెలియజేశారు.
సింగ్ తన ప్రతిస్పందనలో పేర్కొన్న దాని ప్రకారం– సీపీసీబీలో మంజూరు చేయబడిన 393 శాస్త్రీయ, సాంకేతిక పోస్టులలో 64; అదే సమయంలో, ఎస్పీసీబీలోని 6,137 పోస్టులలో 2,921 పోస్టులు; పీసీసీలోని 402 పోస్టులలో 176 ఖాళీగా ఉన్నాయి.
ఇన్ని పోస్టులు ఎందుకు ఖాళీగా ఉన్నాయి? దీనికి రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనలే కారణమని సింగ్ ఆరోపించారు.
‘రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులు, కాలుష్య నియంత్రణ కమిటీలు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా సంస్థల పరిపాలనా నియంత్రణలో ఉన్నాయి. అంతేకాకుండా, ఎస్పీసీబీలు/పీసీసీలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసే బాధ్యత సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా సంస్థలదే‘ అని మంత్రి అన్నారు.
‘రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులు, కాలుష్య నియంత్రణ కమిటీల అధికారులు, ఉద్యోగులను వారి వారి నిబంధనల ప్రకారం ఎస్పీసీబీ/పీసీసీ నియమిస్తాయి’ అని ఆయన చెప్పారు.
నిరంతర సమస్య..
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, కాలుష్య నియంత్రణ బోర్డులు– కమిటీలు ఖాళీ పోస్టులను భర్తీ చేయడంలో అసమర్థత కనీసం ఐదు సంవత్సరాలుగా కొనసాగుతోంది.
ఈ సంవత్సరాల్లో ఖాళీలు 44-51% మధ్య ఉన్నాయని నివేదిక పేర్కొన్నది.
ఈ ఏడాది మార్చిలో పార్లమెంటులో చేసిన ఒక ప్రకటన ప్రకారం దేశవ్యాప్తంగా ఎస్పీసీబీలు, పీసీసీలలో మొత్తం ఖాళీలు 49% ఉన్నాయి(మంజూరైన 11,562 పోస్టులలో 5,671 పోస్టులు ఖాళీగా ఉన్నాయి).
భారతదేశంలోని 28 స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ హెల్త్కేర్ కార్పొరేషన్లలో(ఎస్పీసీబీఎస్)12 కార్పొరేషన్లలో 50% కంటే ఎక్కువ ఖాళీలు ఉన్నాయని మార్చిలో మంత్రి ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు.
సిక్కిం 100% ఖాళీలతో అగ్రస్థానంలో ఉండగా; జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రెండూ 70% కంటే ఎక్కువ సిబ్బంది కొరతతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
10% కంటే తక్కువ ఖాళీలు ఉన్న ఏకైక ప్రధాన రాష్ట్రం కేరళ. గోవాలో 9.3% ఖాళీలు ఉండగా; అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్లలో ఖాళీలు లేవు. పీసీసీలో ఢిల్లీలో 44.5% ఖాళీలు; లడఖ్, దాద్రా నాగర్ హవేలి, డామన్ డయ్యూలలో 69% ఖాళీలు ఉన్నాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
