న్యూస్క్లిక్ పై వచ్చిన ఎఫ్డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి) ఆరోపణలను న్యాయమూర్తి క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో ఏదీ నేరం కాదని స్పష్టం చేశారు.
మనీ లాండరింగ్(అక్రమ ద్రవ్య చలామణి) నివారణ చట్టం ఒక నేరం ద్వారా సంపాదించిన సంపదను లాండరింగ్ చేయడాన్ని శిక్షిస్తుంది. ఆ మునుపటి నేరమే దీనికి ప్రారంభ బిందువు.
ఈ చట్టం దీనిని షెడ్యూల్డ్ అఫెన్స్ లేదా ప్రిడికేట్ అఫెన్స్ అని పిలుస్తుంది. ఈ శాసనంలో షెడ్యూల్ అంటే ఇతర చట్టాల కింద ఉన్న నేరాల జాబితా.
మోసం, అవినీతి, మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలు ఈ జాబితాలో ఉంటాయి. జాబితాలో పేర్కొన్న నేరం ద్వారా వచ్చిన డబ్బు మాత్రమే నేర ఫలితంగా వచ్చిన ఆస్తిగా పరిగణించబడుతుంది.
మనీలాండరింగ్ అనేది ఆ తరువాత జరిగే రెండో చర్య. అంటే ఆ అక్రమ డబ్బు మూలాన్ని దాచిపెట్టి దానిని చట్టబద్ధంగా సంపాదించిన సొమ్ములా చూపించే ప్రయత్నం.
ముందుగా మూల నేరం జరుగుతుంది. ఆ తరువాత ఆ డబ్బు అసలు స్వరూపాన్ని దాచిపెట్టే చర్య అంటే మనీలాండరింగ్ జరుగుతుంది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మూల నేరం ఉన్నప్పుడే రంగంలోకి వస్తుంది. ఆ నేరం ద్వారా వచ్చినట్లు చెప్పబడుతున్న డబ్బు లేదా ఆస్తి జాడను అది అనుసరిస్తుంది.
ఈ రెండింటి మధ్య సంబంధం చాలా స్పష్టమైనది, కచ్చితమైనది. పూర్వాధార నేరం లేకపోతే నేర ఫలితంగా వచ్చిన ఆస్తి ఉండదు.
అలాంటి ఆస్తి లేకపోతే మనీలాండరింగ్ జరిగినట్లు చెప్పలేరు. కాబట్టి మనీలాండరింగ్ కేసును కూడా కొనసాగించలేరు.
మూల నేరం ఉంటేనే లాండరింగ్ కేసు..
ఈ విషయాన్ని ఒక సాధారణ ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. ఏ వస్తువూ దొంగిలించబడకపోతే, దొంగిలించిన వస్తువులను కలిగి ఉన్నారనే ఆరోపణ నిలవదు.
అలాగే మూల నేరమే లేకపోతే, దానిపై ఆధారపడి ఉన్న కేసుకు నిలబడటానికి ఆధారం ఉండదు.
న్యూస్ పోర్టల్ న్యూస్క్లిక్ పై మోపిన అభియోగం కూడా ఇదే తర్కం ఆధారంగా కూలిపోయింది.
ఈ వివాదం ఒకే ఒక్క విదేశీ పెట్టుబడి చుట్టూ తిరిగింది. న్యూస్క్లిక్ ఒక స్వతంత్ర డిజిటల్ వార్తా వేదిక.
ఇది దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు, పోరాటాలు, సామాజిక సమస్యలకు సంబంధించిన ఘటనలను నిరంతరం నమోదు చేస్తూ, వార్తల రూపంలో ప్రజల ముందుకు తీసుకొచ్చింది.
2018 ఏప్రిల్లో న్యూస్క్లిక్ మాతృసంస్థకు వరల్డ్ వైడ్ మీడియా హోల్డింగ్స్ ఎల్ఎల్సీ అనే అమెరికా పెట్టుబడి సంస్థ నుంచి సుమారు రూ 9.59 కోట్లు అందాయి.
దానికి ప్రతిగా ఆ సంస్థ పెట్టుబడిదారునికి కంపెనీలో మైనారిటీ వాటాను సూచించే షేర్లను జారీ చేసింది.
ఈ నిధులు అధికారిక బ్యాంకింగ్ మార్గాల ద్వారానే వచ్చాయి. అంతేకాక ఈ లావాదేవీ గురించి భారతీయ రిజర్వు బ్యాంక్కు కూడా సమాచారం అందించి నియమాల ప్రకారం నివేదించారు.
రెండేళ్లకు పైగా గడిచిన తర్వాత 2020 ఆగస్టులో ఢిల్లీ పోలీసుల ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఈ ఫిర్యాదును మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్లోని ఒక అధికారి పంపించారు.
అందులో మూడు నేరాలకు సంబంధించిన ఆరోపణలు చేశారు: 1 మోసం, 2 నమ్మకద్రోహం లేదా విశ్వాసభంగం, 3 నేరపూరిత కుట్ర- ఈ నేరాలు న్యూస్క్లిక్కు సంబంధించిన వ్యవహారంలో జరిగాయని ఆ ఫిర్యాదులో ఆరోపించారు.
హైకోర్టు కొట్టివేత..
కొద్ది రోజుల వ్యవధిలోనే ఈడీ అదే ఆరోపణలు, అదే వాస్తవాల ఆధారంగా తన స్వంత మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది.
2021 ఫిబ్రవరిలో ఈడీ అధికారులు న్యూస్క్లిక్ కార్యాలయాలపై, దాని సిబ్బంది నివాసాలపై సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు నాలుగు రోజుల పాటు కొనసాగాయి.
మే 29న ఢిల్లీ హైకోర్టు పోలీసుల ఎఫ్ఐఆర్, ఈడీ కేసు రెండింటినీ కొట్టివేసింది. ఈ తీర్పును జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ వెలువరించారు.
ఒక ట్రయల్ కోర్టులా ఆమె సాక్ష్యాలను తూకం వేయలేదు. ఆమె పని మరింత సంకుచితంగా ఉంది.
ఆరోపణలను పూర్తిగా అంగీకరించినప్పటికీ, అవి ఏదైనా నేరాన్ని వెల్లడిస్తున్నాయా అని ఆమె ప్రశ్నించుకోవలసి వచ్చింది. ఆమె వాటిని ఒక్కొక్కటిగా తీసుకున్నారు. ఈ తీర్పును అనుసరించడానికి అత్యంత స్పష్టమైన మార్గం కూడా అదే విధంగా చేయడం.
అప్పుడు లేని నిబంధన..
అభియోగం మొత్తం చట్టాన్ని తప్పించుకున్నారనే అనుమానంపై నిలబడింది.
డిజిటల్ వార్తా సంస్థలలోకి విదేశీ నిధులు వచ్చే దారిని అడ్డుకునే పరిమితిని దాటవేయడానికి న్యూస్క్లిక్ తన వాటాలకు అసలు విలువకంటే చాలా ఎక్కువ ధర నిర్ణయించిందని ప్రాసిక్యూషన్ వాదించింది. ఆ పరిమితి నేడు చట్టంలో ఉంది.
డిజిటల్ వార్తా రంగంలో విదేశీ పెట్టుబడి 26% మించకూడదని, దానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని అది స్పష్టంగా చెబుతుంది. కానీ ఆ నిధులు వచ్చిన సమయానికి 2018 ఏప్రిల్లో ఆ నిబంధన అసలు అమలులోనే లేదు.
ఆ పరిమితి తరువాత వచ్చింది. అది 2019 సెప్టెంబర్ 18న జారీ చేసిన ప్రెస్ నోట్ 4 ద్వారా అమల్లోకి తీసుకువచ్చారు.
అంటే న్యూస్క్లిక్కు వచ్చిన విదేశీ పెట్టుబడి ఈ నిబంధన అమల్లోకి రావడానికి ఒక సంవత్సరానికి పైగా ముందే వచ్చింది.
కాబట్టి ఆ సమయంలో ఆ పరిమితి అనే నియమమే లేనప్పుడు దానిని తప్పించుకునే ప్రయత్నం చేశారని చెప్పడానికి ఎలాంటి ఆధారం ఉండదు.
అప్పటికి ఉల్లంఘించడానికి గానీ తప్పించుకోవడానికి గానీ అలాంటి నియమం అసలు ఉనికిలోనే లేదు.
ఇందులో స్పష్టమైన అంశం ఏమిటంటే, విదేశీ పెట్టుబడిని స్వీకరించే ముందు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు న్యూస్క్లిక్ లేఖ రాసింది.
ఆ లేఖలో ముద్రిత మాధ్యమాలకు వర్తించే నియమాలు ఆన్లైన్ వార్తా మాధ్యమాలకు కూడా వర్తిస్తాయా? అని స్పష్టత కోరింది.
అందుకు మంత్రిత్వ శాఖ సమాధానంగా ఆన్లైన్ వార్తా ప్రచురణ ముద్రిత మాధ్యమం పరిధిలోకి రాదని తెలిపింది. అంటే వాస్తవానికి ఆ కంపెనీకి ఈ రంగానికి సంబంధించిన విదేశీ పెట్టుబడి పరిమితి ఏదీ వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసినట్లే అయింది.
ఈ లేఖల మార్పిడిని కోర్టు ఒక ముఖ్యమైన అంశంగా పరిగణించింది.
ఎందుకంటే నియంత్రణ సంస్థను స్వయంగా సంప్రదించి నియమాల గురించి స్పష్టత కోరిన వ్యక్తి లేదా సంస్థ చట్టం నుంచి దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పలేమని, మరో మాటలో చెప్పాలంటే అధికారులను అడిగి అనుమతి లేదా స్పష్టత పొందిన వ్యక్తి చట్టాన్ని రహస్యంగా ఉల్లంఘిస్తున్నాడని ఆరోపించడం సమంజసం కాదని కోర్టు భావించింది.
బాధితుడే లేనప్పుడు మోసం ఎక్కడిది?
ఆస్తికి సంబంధించిన ఈ రెండు నేరారోపణలు వాటి స్వంత ప్రమాణాల ప్రకారమే నిలబడలేకపోయాయి.
చట్టపరంగా మోసం అనే నేరానికి ఒక నిర్దిష్ట నిర్వచనం ఉంది. అందులో, ఎవరో ఒక వ్యక్తి మోసపోయి ఉండాలి. ఆ మోసం కారణంగా ఆ వ్యక్తి తన ఆస్తి లేదా డబ్బును ఇవ్వడానికి ప్రేరేపించబడి ఉండాలి.
కానీ ఈ కేసులో ఈ రెండు అంశాలు ఏవీ లేవు. అంటే మోసపోయిన వ్యక్తి ఎవరూ లేరు. అలాగే మోసం వల్ల తన ఆస్తిని కోల్పోయిన వ్యక్తి కూడా ఎవరూ లేరు.
అందువల్ల చట్టపరంగా మోసం అనే నేరానికి అవసరమైన ప్రాథమిక అంశాలే ఇక్కడ కనిపించలేదని కోర్టు పేర్కొంది.
పెట్టుబడిదారుడు తన డబ్బును స్వచ్ఛందంగా పెట్టుబడిగా ఇచ్చాడు. తాను మోసపోయానని అతడు ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు.
ఫిర్యాదు చేసిన వ్యక్తి మాత్రం కేవలం ఒక సమాచారం అందించిన వ్యక్తి మాత్రమే.
అతనికి ఆ పెట్టుబడి ఒప్పందంలో ఎలాంటి ప్రత్యక్ష ప్రయోజనం గానీ సంబంధం గానీ లేదు. అంటే ఇక్కడ తాను నష్టపోయానని చెప్పే వ్యక్తి ఫిర్యాదు చేయలేదు.
ఫిర్యాదు చేసిన వ్యక్తి మాత్రం నష్టపోయిన పక్షం కాదు. అందువల్ల మోసం జరిగిందనే ఆరోపణకు అవసరమైన ప్రాథమిక ఆధారం కనిపించలేదని కోర్టు గమనించింది.
నేరపూరిత నమ్మకద్రోహం లేదా విశ్వాసభంగం అనే ఆరోపణ కూడా ఇదే తరహా కారణంతో నిలబడలేకపోయింది.
ఈ నేరం నిరూపించాలంటే, ఒక వ్యక్తికి లేదా సంస్థకు ఏదైనా ఆస్తి అప్పగించబడాలి.
ఆ తర్వాత ఆ ఆస్తిని నిజాయితీ లేకుండా స్వాధీనం చేసుకోవడం లేదా దుర్వినియోగం చేయడం జరగాలి.
కానీ షేర్ల కొనుగోలు విషయం ఈ రెండింటిలో దేని కిందకీ రాదు. అది ఆస్తిని నమ్మకంతో అప్పగించడం కాదు.
దానిని దుర్వినియోగం చేయడం కూడా కాదు. అది సాధారణ వాణిజ్య లావాదేవీ మాత్రమే.
అందువల్ల ఆరోపణలలో చెప్పిన ప్రతి మాటను పూర్తిగా నిజమని అంగీకరించినప్పటికీ మోసం, నేరపూరిత విశ్వాసభంగం అనే రెండు నేరాలూ చట్టపరంగా ఏర్పడవని కోర్టు తేల్చింది.
కేవలం ఆరోపించబడిన కుట్ర..
ఈ దశకు వచ్చేసరికి, ఆస్తికి సంబంధించిన నేరారోపణలు(మోసం, విశ్వాసభంగం) అన్నీ కొట్టుకుపోయాయి. అయితే ఈడీకి ఒక ఆరోపణ మాత్రం ఇంకా ముఖ్యంగానే మిగిలింది.
నేరపూరిత కుట్ర అనేది మనీలాండరింగ్ చట్టం కింద షెడ్యూల్డ్ నేరంగా పరిగణించబడుతుంది.
అందువల్ల కుట్ర ఆరోపణ నిలబడితే దాని ఆధారంగా ఈడీ నమోదు చేసిన మనీలాండరింగ్ కేసు కూడా కొనసాగవచ్చు. అందుకే ఈడీ తన వాదనను ప్రధానంగా ఈ ఆరోపణపై ఆధారపరిచింది.
ఈడీ ప్రకారం, న్యూస్ పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ, విదేశాల్లో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఒక నేరపూరిత కుట్రలో పాల్గొన్నారని ఆరోపించింది.
ఈ విషయంలో కోర్టు ఈడీకి అనుకూలంగా ఉన్న ఒక చట్టపరమైన సూత్రాన్ని అంగీకరించింది. అదేమిటంటే ఒక నేరం చేయడానికి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య ఒప్పందం కుదిరితే ఆ కుట్ర స్వతంత్ర నేరంగా పరిగణించబడవచ్చు.
ఆ కుట్ర ప్రకారం నేరం నిజంగా జరిగి ఉండాల్సిన అవసరం లేదు, ఒప్పందం కుదిరిన క్షణంలోనే కుట్ర నేరం పూర్తవుతుంది.
అయితే ఈ కేసులో సమస్య చట్టపరమైన సూత్రం కాదు. సమస్య సాక్ష్యాధారాల విషయంలో ఉంది. అంటే కుట్ర అనేది స్వతంత్ర నేరం కావచ్చని కోర్టు అంగీకరించినప్పటికీ అలాంటి కుట్ర నిజంగా జరిగిందని చూపించే తగిన ఆధారాలు ఉన్నాయా లేదా? అన్నదే అసలు ప్రశ్నగా మారింది.
ఒక నేరపూరిత కుట్ర నిరూపించాలంటే దాని వెనుక చట్ట విరుద్ధమైన లక్ష్యం లేదా చట్ట విరుద్ధమైన పద్ధతులు ఉండాలి. కానీ ఈడీ తన ఆరోపణల్లో ఈ రెండింటిలో ఏదీ స్పష్టంగా చూపించలేకపోయింది.
వ్యక్తుల మధ్య కుట్రపూరిత కుమ్మక్కు జరిగిందని మాత్రమే ఆరోపించింది. అయితే వారు కలిసి ఏ చట్ట విరుద్ధమైన పనిని చేయాలని ఒప్పందం చేసుకున్నారో మాత్రం వివరించలేకపోయింది.
అంతేకాక సుమారు 18 నెలలపాటు దర్యాప్తు జరిపిన తరువాత, అలాగే న్యూస్క్లిక్ సిబ్బందిని పలుమార్లు విచారించిన తరువాత కూడా వారి మీద నేరాన్ని సూచించే ఎలాంటి ఆధారం బయటపడలేదు. అందువల్ల కేవలం ఒక ఆరోపణ చేయడం వల్లనే కుట్ర నిరూపితమైనట్లు కాదు. ఒక ఆరోపణ, ఒక నేరపూరిత కుట్ర రెండూ ఒకటే కావని కోర్టు స్పష్టం చేసింది.
మూల నేరం పోతే, కేసు కూడా పోతుంది..
ఇక్కడితో తీర్పు తన తుది నిర్ధారణకు వచ్చింది. మనీలాండరింగ్ నేరం ఉండాలంటే ముందుగా నేర ఫలితంగా వచ్చిన ఆస్తి ఉండాలి. అలాంటి ఆస్తి ఉండాలంటే, దాని వెనుక ఒక షెడ్యూల్డ్ నేరం ఉండాలి.
ఈ సూత్రాన్ని విజయ్ మదన్లాల్ చౌదరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా(2022) కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా నిర్ధారించింది.
మనీలాండరింగ్ చట్టం ఎంతవరకు వర్తిస్తుందో వివరించిన కీలక తీర్పు ఇదే. తర్వాత వివిధ హైకోర్టులు కూడా ఇదే సూత్రాన్ని అనుసరించాయి.
ఆ నియమం చాలా సరళమైనది. మూల నేరాన్నే కోర్టు కొట్టివేస్తే దానిపై ఆధారపడి ఉన్న మనీలాండరింగ్ కేసు కూడా నిలబడలేదు. అంటే ఆధార నేరం లేకుండా మనీలాండరింగ్ కేసుకు చట్టపరమైన పునాది ఉండదు. అందువల్ల మూల నేరం రద్దయితే దాని ఆధారంగా నమోదైన మనీలాండరింగ్ కేసు కూడా సహజంగానే నిలబడదు.
ఈ కేసులో కూడా సరిగ్గా అదే జరిగింది. ఎఫ్ఐఆర్ కొట్టివేయబడిన వెంటనే ఈడీ నమోదు చేసిన మనీలాండరింగ్ కేసుకు ఎలాంటి చట్టపరమైన పునాది మిగలలేదు. అందువల్ల కోర్టు ఎఫ్ఐఆర్తో పాటు ఈడీ చేపట్టిన మనీలాండరింగ్ దర్యాప్తును కూడా ముగించింది.
అదే విధంగా ఈడీ కేసుకు సంబంధించిన కేసు ఫైల్ను సమర్పించాలంటూ దాఖలైన మరో పిటిషన్ కూడా అర్థరహితంగా మారింది.
ఎందుకంటే ప్రధాన కేసే రద్దయిన తర్వాత ఆ పిటిషన్పై ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేకపోయింది. కాబట్టి కోర్టు ఆ పిటిషన్ను కూడా ముగిసినదిగా పరిగణించి పరిష్కరించింది.
నిశ్శబ్దంగా తొలగించబడిన క్లియరెన్స్..
ఈ తీర్పుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిన ఒక అంశం ఉంది. పోలీసులు కోర్టుకు ఒక స్టేటస్ రిపోర్ట్ మాత్రమే సమర్పించలేదు. రెండు స్టేటస్ రిపోర్టులు సమర్పించారు. వాటిలో మొదటి రిపోర్టు ముందస్తు కాపీగా న్యూస్క్లిక్కు కూడా పంపబడింది. అందులో ఆర్బీఐ ఇచ్చిన సమాచారం ప్రస్తావించబడింది.
ఆర్బీఐ ప్రకారం, విదేశీ పెట్టుబడి నిధులు ఆటోమేటిక్ రూట్ ద్వారా వచ్చాయి. నిధుల స్వీకరణలో ఎలాంటి ఆలస్యం జరగలేదు. విదేశీ మారకద్రవ్య నిబంధనలు ఉల్లంఘించబడినట్లు ఎలాంటి ఆధారం కనిపించలేదు.
సంక్షిప్తంగా చెప్పాలంటే, ఈ లావాదేవీని సంబంధిత నియంత్రణ సంస్థ అయిన ఆర్బీఐ పరిశీలించి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. అంటే నియంత్రణ సంస్థ దృష్టిలో ఈ పెట్టుబడి లావాదేవీ చట్టబద్ధంగానే జరిగింది.
రెండవ స్టేటస్ రిపోర్టు మాత్రం భిన్నంగా ఉంది. అందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి చేసిన ప్రస్తావనను తొలగించారు. దాని స్థానంలో కొత్త ఆరోపణలను చేర్చారు. ఈ మార్పు ఎందుకు చేశారో ఎలాంటి కారణం చెప్పలేదు.
అయితే ఈ రెండు రిపోర్టులపైనా అదే అధికారి సంతకం ఉంది. ఈ మార్పును కోర్టు నిర్లక్ష్యం చేయలేదు. ఆర్బీఐ ప్రస్తావనను తొలగించడం ఏమి సూచిస్తుందో కోర్టు గమనించింది.
చివరికి నియంత్రణ సంస్థ నుంచి వచ్చిన క్లియరెన్స్ను నమోదు చేసిన మొదటి రిపోర్టే ఈ లావాదేవీలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని చూపించడానికి సరిపోతుందని కోర్టు తేల్చింది. అంటే ఆర్బీఐ స్వయంగా లావాదేవీ చట్టబద్ధమని పేర్కొన్న నేపథ్యంలో దానిని ఉల్లంఘనగా చూపించే తరువాతి ఆరోపణలు నిలబడవని కోర్టు భావించింది.
ఈ సంఘటనల క్రమం ఈ ఒక్క కేసుకే పరిమితం కాదు. దీనికి విస్తృతమైన ప్రాధాన్యం ఉంది.
ఒక దర్యాప్తు సంస్థ తన నివేదికను సవరించవచ్చు, కొత్త విషయాలు వెలుగులోకి వస్తే తన అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు కూడా.
అయితే ఒక నియంత్రణ సంస్థ ఇచ్చిన క్లియరెన్స్ను ఎలాంటి వివరణ లేకుండా దాచిపెట్టి లేదా తొలగించి, తర్వాత కోర్టు ఆ పాత నివేదికను పట్టించుకోదని ఆశించలేరు.
మరో మాటలో చెప్పాలంటే దర్యాప్తు సంస్థలు తమకు అనుకూలమైన విషయాలను మాత్రమే చూపించి తమ వాదనకు విరుద్ధంగా ఉన్న అధికారిక సమాచారాన్ని కారణం చెప్పకుండా విస్మరించలేవు. అలాంటి చర్యలను కోర్టులు పరిశీలిస్తాయి. వాటిని సులభంగా పక్కన పెట్టవు.
స్వేచ్ఛా పత్రికారంగంపై దాడి..
కోర్టు కేవలం నేరం జరిగినట్లు ఆధారాలు లేవు అని చెప్పి ఆగిపోవచ్చు. కానీ అది అంతకంటే ముందుకు వెళ్లింది.
కోర్టు ఈ దర్యాప్తును పిటిషనర్ల ఆర్థిక వ్యవహారాల్లో ఏదైనా తప్పు దొరుకుతుందేమోనని లక్ష్యం లేకుండా విస్తృతంగా జరిపిన అన్వేషణగా అభివర్ణించింది.
అలాగే ఈ చర్యలు దురుద్దేశంతో ప్రారంభించబడ్డాయని కోర్టు అభిప్రాయపడింది. అంటే అవి నిజాయితీతో కూడిన చట్టపరమైన ఉద్దేశంతో కాకుండా చెడు ఉద్దేశం లేదా పక్షపాతంతో చేపట్టబడ్డాయని సూచించింది.
ఇంకా ఈ చర్యలను కోర్టు పిటిషనర్ల స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక జర్నలిజంపై అధికారాల దుర్వినియోగం ద్వారా జరిగిన దురుద్దేశ దాడిగా పేర్కొంది.
అంటే కోర్టు దృష్టిలో ఈ కేసు కేవలం చట్టపరమైన లోపాలున్న దర్యాప్తు మాత్రమే కాదు. స్వతంత్ర పాత్రికేయ కార్యకలాపాలపై అధికార దుర్వినియోగం ద్వారా జరిగిన అన్యాయ జోక్యం కూడా అని భావించింది.
ఈ తీర్పును కోర్టు వాక్ స్వాతంత్ర్యం, పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన పూర్వపు కీలక తీర్పుల సంప్రదాయంలో భాగంగా పరిగణించింది. ఈ సందర్భంలో కోర్టు, శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా(2015), వినోద్ దువా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా(2021) కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరించింది.
ఇక న్యూస్క్లిక్ తన స్పందనలో ఈ తీర్పు తాము మొదటి నుంచీ చెబుతున్న వాదనను సమర్థించిందని పేర్కొంది.
అంటే తమపై చేసిన ఆరోపణలు నిరాధారమని, తమ చర్యలు చట్టబద్ధమైనవేనని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని, ఇప్పుడు కోర్టు తీర్పు కూడా అదే విషయాన్ని ధృవీకరించిందని న్యూస్క్లిక్ అభిప్రాయపడింది.
అప్పీలుకు ఈడీ.. వాదనలు ఏంటి?
తాము ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్తామని ఈడీ తెలిపింది. వారి వాదనను కూడా నిష్పక్షపాతంగా పరిశీలించాల్సి ఉంది.
కోర్టు మోసం అనే అంశాన్ని చాలా సంకుచిత కోణంలో అర్థం చేసుకుందని ఈడీ వాదిస్తోంది. అసలు ఇరు పక్షాలలో ఎవరు మోసపోయారు? అని కోర్టు ప్రశ్నించింది.
అయితే అది తప్పుడు ప్రశ్న అని ఈడీ అంటోంది. బ్యాంకులు, నియంత్రణ సంస్థలకు తప్పుడు నివేదికలు సమర్పించడమే తమ అసలు కేసని ఈడీ వాదిస్తోంది.
ఈడీ ప్రకారం ఆ తప్పుడు ప్రకటనలు లేదా వివరాలు పెట్టుబడిదారుడి నిజస్వరూపం, నిధుల మూలం అలాగే షేర్ల విలువ నిర్ణయం వంటి అంశాలకు సంబంధించినవి. ఈడీ వాదన ప్రకారం ఈ విషయాన్ని ఆ కోణంలో చూస్తే మోసపోయిన పక్షం విదేశీ పెట్టుబడి సంస్థ కాదు. ప్రభుత్వం లేదా నియంత్రణ సంస్థలే మోసపోయిన పక్షం అవుతాయి.
అంటే నియంత్రణ సంస్థలను లేదా ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించే విధంగా తప్పుడు సమాచారం ఇవ్వడం కూడా ఒక రకమైన మోసమేనని ఈడీ వాదిస్తోంది.
ఈ తర్కం ప్రకారం, నియంత్రణ సంస్థపై జరిగిన మోసం నిరూపించడానికి తప్పనిసరిగా ఒక ప్రైవేట్ వ్యక్తి లేదా కంపెనీ బాధితురాలిగా ఉండాల్సిన అవసరం లేదు.
ప్రభుత్వం లేదా నియంత్రణ సంస్థనే మోసపోయిన పక్షంగా పరిగణించవచ్చని ఈడీ అభిప్రాయపడుతోంది.
ఈ వాదన తీసిపారేయదగినదేమీ కాదు. ఉన్నత న్యాయస్థానం దీనిని పరిశీలించవచ్చు(పరీక్షించవచ్చు). కానీ ఇది రెండు కఠినమైన నిజాల ముందు నిలబడాల్సి ఉంటుంది.
మొదటిది ఆ నిధుల బదిలీని రిజర్వ్ బ్యాంక్ క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదం తెలిపింది.
రెండవది, ఆ డబ్బును తీసుకురావడంలో ఏ పరిమితిని అయితే దాటేశారని ఆరోపిస్తున్నారో ఆ డబ్బు వచ్చిన సమయానికి అసలు అలాంటి పరిమితే ఏదీ అమలులో లేదు.
మోసం అనేది ఎవరో ఒకరు తప్పుదారి పట్టించబడినప్పుడే పనిచేస్తుంది. అంటే ఎవరైనా నిజంగా మోసపోవాలి.
కానీ ఈ సందర్భంలో నియంత్రణ సంస్థ తప్పుదారి పట్టించబడలేదు. అది ఈ లావాదేవీని పరిశీలించింది, ఆ తర్వాత దానికి ఆమోదం కూడా ఇచ్చింది.
అందువల్ల ప్రభుత్వాన్ని మోసం చేశారని ఆరోపించడం కష్టం అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వ తరపున ఈ అంశాన్ని పరిశీలించిన నియంత్రణ సంస్థే ఎలాంటి తప్పు జరగలేదని నిర్ధారించింది.
మరో మాటలో చెప్పాలంటే రాష్ట్రానికి చెందిన అధికారిక నియంత్రణ సంస్థ లావాదేవీని పరిశీలించి అన్నీ సక్రమంగానే ఉన్నాయి అని చెప్పినప్పుడు అదే రాష్ట్రాన్ని మోసం చేశారని నిరూపించడం చాలా కష్టమైన పని అవుతుంది.
ఇక్కడ ఒక వ్యత్యాసాన్ని గమనించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రెండు కేసులు చాలా సులభంగా ఒకదానికొకటి పొరబడే అవకాశం ఉంది. ఇది ఉగ్రవాద నిరోధక చట్టం కింద నమోదైన కేసు కాదు. అది వేరే విషయం.
చైనాకు అనుకూలంగా ప్రచారం వ్యాప్తి చేయడం కోసం విదేశీ నిధులు పొందారనే ఆరోపణలపై పుర్కాయస్థను 2023లో ఆ ప్రత్యేక కేసులోనే అరెస్ట్ చేశారు.
అరెస్టుకు గల కారణాలను లిఖితపూర్వకంగా అతనికి అందించలేదనే కారణంతో(గ్రౌండ్పై), సుప్రీంకోర్టు మే 2024లో అతని అరెస్టును కొట్టివేసింది.
అయితే ఆ కేసు విచారణ పూర్తిగా ముగిసిపోయిందని కాదు. ఇంకా వేరుగా కొనసాగుతుంది.
మనీ లాండరింగ్ కేసు విషయం, దాని ఫలితం రెండూ భిన్నమైనవి. ఇది చట్టబద్ధంగా జరిగి నియంత్రణ సంస్థ చేత ఆమోదించబడిన ఒకే ఒక్క పెట్టుబడిపై ఆధారపడి నడిచింది.
ఇందులో ఎలాంటి నేరమూ జరగలేదని హైకోర్టు తేల్చింది.
ఈ తీర్పులోని హేతుబద్ధత కేవలం న్యూస్క్లిక్కే పరిమితం కాదు. ఇలాంటి ప్రతి కేసును కూడా ప్రారంభంలో చాలా సులభంగా దాటవేసే ఒక ప్రాథమిక ప్రశ్న వద్దకే ఇది మళ్లీ తీసుకువస్తుంది. అదేంటంటే అసలు అక్కడ ఏదైనా నేరం జరిగిందా?
అనువాదం: కె. మనోహర రాజు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
