సమర్థత, పర్యావరణ పరిరక్షణ చర్యలు లేకుండా, అత్యధిక విద్యుత్ వినియోగించే డిజిటల్ మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడానికి ప్రజా ధనాన్ని ఉపయోగించవచ్చా? ఈ దశాబ్దంలో అత్యంత ప్రముఖ సాంకేతిక పోటీ కృత్రిమ మేధస్సు. డిజిటల్ మౌలిక సదుపాయాలను భవిష్యత్ ఆర్థిక వృద్ధికి ప్రాతిపదికగా భావిస్తూ, డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెమీకండక్టర్ తయారీలో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు పోటీపడుతున్నాయి. భారతదేశం కూడా దీనికి మినహాయింపు కాదు.
“ఇండియా ఏఐ మిషన్”, మెరుగైన రాష్ట్ర ప్రోత్సాహకాలు, హైపర్స్కేల్ డేటా సెంటర్లలో బిలియన్ల కొద్దీ డాలర్ల ప్రైవేట్ పెట్టుబడులతో భారత్ తనను తాను ప్రపంచ డిజిటల్ హబ్గా తీర్చిదిద్దుకుంటోంది.
చెన్నై, హైదరాబాద్, ముంబై, నోయిడా వంటి నగరాలు ఈ మార్పుకు ప్రధాన కేంద్రాలుగా వేగంగా మారుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత – స్థానిక ప్రజల ఆందోళనలు..
విధాన రూపకర్తలు డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రశంసిస్తూ ఉండవచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా మరో కథనం వెలుగులోకి వస్తోంది. పెరుగుతున్న విద్యుత్ వాడకం, అధిక నీటి వినియోగం, భూసేకరణ, ప్రభుత్వ రాయితీలపై అమెరికాలోని నివాసితుల నుంచి భారీ డేటా సెంటర్లు నిరసనలను ఎదుర్కొంటున్నాయి.
ఐర్లాండ్, నెదర్లాండ్స్, మలేషియాలలో కూడా ఇటువంటి వ్యతిరేకత తలెత్తడం మనం చూశాం. అక్కడ స్థానిక ప్రజలు డిజిటల్ మౌలిక సదుపాయాల ఖర్చులను భరిస్తుంటే, వాటి ప్రయోజనాలు మాత్రం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాయా అని స్థానిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
మొదటి చూపులో, ఈ నిరసనలు భారతదేశ డిజిటల్ లక్ష్యాలతో సంబంధం లేనివిగా కనిపించవచ్చు. కానీ అవి నిజంగా ఒక ముఖ్యమైన హెచ్చరికను ఇస్తున్నాయి.
ప్రతి సాంకేతిక పురోగతి ఒక భౌతిక ప్రభావ ముద్రను మిగులుస్తుంది. ప్రతి భౌతిక ముద్ర ఒక రాజకీయ ప్రశ్నను లేవనెత్తుతుంది. సాధారణ ఆలోచనలో, క్లౌడ్ అనేది ఒక అదృశ్యమైనదిగా, సమాచారం నెట్వర్క్ల ద్వారా గుప్తంగా ప్రయాణించే ఒక అనంతమైన డిజిటల్ వ్యవస్థగా భావించబడుతుంది. కానీ క్లౌడ్ బరువు లేనిది కాదు. కనిపించనిది అసలే కాదు.
అదృశ్య క్లౌడ్ వెనుక కనిపించే భౌతిక వనరులు..
ప్రతి ఏఐ మోడల్, ప్రతి డిజిటల్ చెల్లింపు, ప్రతి ఆన్లైన్ శోధన(సెర్చ్), ప్రతి స్ట్రీమింగ్ సేవ రోజులో 24 గంటలు నిరంతరాయంగా నడిచే సర్వర్లతో నిండిన భారీ గోదాములపైనే ఆధారపడి ఉంటాయి. ఇటువంటి సదుపాయాలకు అంతరాయం లేని విద్యుత్ సరఫరా, పెద్ద కూలింగ్ (చల్లబరిచే) వ్యవస్థలు, విశ్వసనీయ నీటి వనరులు, అధిక సామర్థ్యం గల ప్రసార మౌలిక సదుపాయాలు, భారీ భూభాగాలు అవసరం.
పర్యావరణ మౌలిక సదుపాయాలే డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ప్రాతిపదిక. భారతదేశంలో ఇందుకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యానికి ఇదే కారణం.
డేటా సెంటర్లను సాధారణంగా ఆవిష్కరణలు, ఉద్యోగాలు, విదేశీ పెట్టుబడులకు మూలాలుగా పేర్కొంటారు. కానీ వాటి పర్యావరణ ప్రభావంపై చాలా తక్కువ దృష్టి పెడుతున్నారు.
పెరుగుతున్న డిమాండ్ – రాజకీయ పరిణామాలు..
ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక రంగం, తయారీ, పాలనలో కృత్రిమ మేధస్సు అనువర్తనాలు మరింత సాధారణం అవుతున్నందున, కంప్యూటింగ్ శక్తికి ఉండే డిమాండ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఆ డిమాండ్ను తీర్చడానికి కేవలం ఎక్కువ కంప్యూటర్లు మాత్రమే కాకుండా, మరిన్ని విద్యుత్ సబ్స్టేషన్లు, ట్రాన్స్మిషన్ లైన్లు, అధిక నీటిని వినియోగించే కూలింగ్ వ్యవస్థలు అవసరం. ఇది ప్రధాన రాజకీయ పరిణామాలకు దారితీస్తుంది.
మౌలిక సదుపాయాల వివాదాలు – పర్యావరణ సవాళ్లు..
భారతదేశంలో మౌలిక సదుపాయాల వివాదాలు సాంప్రదాయకంగా రహదారులు, ఆనకట్టలు, గనుల తవ్వకం ప్రాజెక్టులు, పారిశ్రామిక కారిడార్ల చుట్టూ తిరిగేవి. ఇటీవలి కాలంలో, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు భూమి యాజమాన్యం, జీవవైవిధ్యం, సామాజిక హక్కులపై కొత్త చర్చలను రేకెత్తించాయి.
రాజస్థాన్లోని సోలార్ పార్కులు, గుజరాత్లోని ట్రాన్స్మిషన్ కారిడార్లు, కచ్ అంతటా విస్తరించిన పునరుత్పాదక మౌలిక సదుపాయాలు, పరిహారం, భాగస్వామ్యం, పర్యావరణ పరిరక్షణ సమస్యలను సరిగ్గా పరిష్కరించకపోతే, వాతావరణ మార్పులతో పోరాడటానికి రూపొందించిన ప్రాజెక్టులు కూడా స్థానిక వివాదాలకు కారణమవుతాయని నిరూపించాయి. డేటా సెంటర్ల విషయంలోనూ ఇది ఇలాగే ఉంటుంది.
కనిపించని కాలుష్యం – తీవ్ర ప్రభావం..
ఒక సాధారణ తయారీ కర్మాగారంతో పోలిస్తే, డేటా సెంటర్లు సాధారణంగా కనిపించే కాలుష్యాన్ని విడుదల చేయవు. అవి అంత స్పష్టంగా కనిపించవు. కానీ పర్యావరణంపై పెద్ద ప్రభావాన్నే చూపుతాయి.
ఒక హైపర్స్కేల్ ప్లాంట్ ఒక మధ్యస్థ తరహా పట్టణానికి అవసరమైనంత విద్యుత్ను ఉపయోగిస్తుంది. అది వేడెక్కిపోకుండా నిరోధించడానికి నిరంతర కూలింగ్ అవసరమవుతుంది.
డిజిటల్ ఆకాంక్షలు వర్సెస్ వనరుల పంపిణీ..
భారతదేశ డిజిటల్ ఆకాంక్షలు పెరుగుతున్న కొద్దీ, దాని విద్యుత్ డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
కొరతగా ఉన్న పునరుత్పాదక విద్యుత్ను ఏఐ మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యతగా ఇవ్వాలా, పారిశ్రామిక ఉత్పత్తికా, లేక వ్యవసాయ సరఫరాకా? ఇప్పటికే తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న ప్రాంతాలలో అధిక నీటిని ఉపయోగించే కూలింగ్ వ్యవస్థలను ఎలా నిర్వహించాలి? అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికీ నష్టాల్లో నడుస్తున్నప్పుడు, అంతర్జాతీయ సాంకేతిక సంస్థలకు రాష్ట్రాలు భూమి, విద్యుత్లపై ఎందుకు రాయితీలు ఇవ్వాలి? ఇవి కేవలం సాంకేతిక సమస్యలు మాత్రమే కావు. ఇవి పంపిణీ సమానత్వానికి సంబంధించిన ఆందోళనలు.
డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అనేది పర్యావరణ ఆర్థిక వ్యవస్థే..
పునరుత్పాదక ఇంధనం భూసేకరణ చర్చను మార్చివేసింది. ఏఐ మౌలిక సదుపాయాల వేగవంతమైన విస్తరణ విద్యుత్, నీరు, ప్రజా ప్రయోజనాల చుట్టూ ఉన్న చర్చను మార్చగలదు. భారతదేశ డిజిటల్ విప్లవమైనా, పర్యావరణ అనుకూల మార్పు అయినా సాంకేతిక ఆశావాదం(టెక్నో-ఆప్టిమిజమ్) ఇకపై సరిపోని దశకు చేరుకుంటున్నాయి. కానీ సవాలు కేవలం డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మించడం మాత్రమే కాదు. అటువంటి మౌలిక సదుపాయాలు దేశ పర్యావరణ పరిమితులు, అభివృద్ధి ప్రాధాన్యతలకు ఎలా సరిపోతాయో నిర్ధారించడమే అసలైన సవాలు.
ప్రపంచవ్యాప్తంగా చెలరేగుతున్న వివాదాలు, డేటా సెంటర్లు ఇకపై కేవలం సాంకేతిక పురోగతికి చిహ్నాలు మాత్రమే కావు అని సూచిస్తున్నాయి. అవి అభివృద్ధి, నిలకడతనం (సస్టైనబిలిటీ), ప్రజా ప్రయోజనాల పోటీ దృక్పథాలకు పోరాట వేదికలుగా మారుతున్నాయి.
స్వచ్ఛమైన విద్యుత్ ప్రాజెక్టులు అంతిమంగా భూ రాజకీయాలకు సంబంధించినవని పునరుత్పాదక ఇంధనం ద్వారా భారతదేశం తెలుసుకుంటే, డేటా సెంటర్ల రాక మరో పాఠాన్ని నేర్పుతోంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అనేది ప్రాథమికంగా పర్యావరణ ఆర్థిక వ్యవస్థ. అన్ని ఏఐ అప్లికేషన్లు, క్లౌడ్ సేవలు, డిజిటల్ ప్లాట్ఫారమ్లు భౌతిక వనరులపై ఆధారపడి ఉంటాయి. వాటి లభ్యత ప్రమాదంలో పడుతోంది.
వ్యూహాత్మక ఆవశ్యకత – స్థానిక వ్యతిరేకత..
ఇది డిజిటల్ మౌలిక సదుపాయాలకు లేదా ఏఐకి వ్యతిరేకమైన వాదన కాదు. ఏఐ విప్లవంలో భారతదేశం పక్కన నిలబడటానికి ఇష్టపడదు. స్వయంసమృద్ధి గల ఏఐ సామర్థ్యాలను నిర్మించడానికి, ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి పోటీపడుతున్న దేశాలకు ఓడరేవులు, రహదారులు, పారిశ్రామిక కారిడార్ల వలే డేటా సెంటర్లు కూడా వ్యూహాత్మకంగా అంతే ముఖ్యమైనవిగా మారాయి.
ఆర్థిక పోటీతత్వానికి, డిజిటల్ పాలనకు, సాంకేతిక ఆవిష్కరణలకు ఇవి ఎంతో అవసరం. అయితే ఇక్కడ ప్రశ్న భారతదేశం డేటా సెంటర్లను నిర్మించాలా వద్దా అనేది కాదు. వాటిని ఎలా నిర్మించాలి అనేదే ప్రశ్న.
ఈ పర్యావరణ సమస్యను విస్మరించడం వల్ల చెల్లించాల్సిన రాజకీయ మూల్యాన్ని ప్రపంచ అనుభవం చూపిస్తోంది. అమెరికాలో, ఈ సదుపాయాలు ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న విద్యుత్ గ్రిడ్లను మరింత దెబ్బతీస్తాయని, విద్యుత్ ఛార్జీలను పెంచుతాయని, భారీగా నీటిని వినియోగిస్తాయని ఆందోళన చెందుతున్న స్థానిక ప్రజల నుంచి డేటా సెంటర్ల ప్రతిపాదనలు వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి.
ఐర్లాండ్లో డేటా సెంటర్ విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరగడంతో, గ్రిడ్ స్థిరత్వం, ఇంధన భద్రతపై ఆందోళనలు కూడా పెరిగాయి. ఇతర ప్రాంతాలలో కూడా ఇలాంటి ఆందోళనలే తలెత్తాయి. అవి ఒక పెద్ద నిజాన్ని ప్రతిబింబిస్తాయి.
డిజిటల్ మౌలిక సదుపాయాలు ఇకపై పర్యావరణానికి హాని లేనివిగా పరిగణించబడటం లేదు. నేడు, ఇది ప్రజా వనరులు, పర్యావరణ నిలకడతనం, పురపాలక జవాబుదారీతనానికి సంబంధించిన విస్తృత చర్చలలో భాగంగా మారింది. భారతదేశపు విధానపరమైన చర్చలు ఇంకా ఈ నష్ట భయాలను పూర్తిగా ఎదుర్కొనలేదు.
పర్యావరణ నష్టం – విధాన రూపకర్తల బాధ్యత..
ఏఐ గురించిన చాలా చర్చలు ఆవిష్కరణలు, పెట్టుబడులు, ప్రపంచ పోటీతత్వం గురించే జరుగుతున్నాయి. ఆ వృద్ధికి అయ్యే పర్యావరణ వ్యయంపై చాలా తక్కువ దృష్టి పెడుతున్నారు. డేటా సెంటర్లకు విశ్వసనీయ విద్యుత్ సరఫరా, ప్రత్యేక ప్రసార మౌలిక సదుపాయాలు, పెద్ద కూలింగ్ వ్యవస్థలు అవసరం.
ఈ ప్రాజెక్టుల వేగవంతమైన వృద్ధి ఖచ్చితంగా విద్యుత్ ఉత్పత్తి, భూమి, నీటి వనరులపై మరింత ఒత్తిడి తెస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే వాతావరణ ఒత్తిడి, భూగర్భ జలాల క్షీణత, పెరుగుతున్న పట్టణ డిమాండ్ను ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో. ఇది ఇంధన న్యాయం గురించి పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతుంది.
భూ రాయితీలు, పన్ను మినహాయింపులు, చౌక విద్యుత్తో సాంకేతిక పెట్టుబడుల కోసం ప్రభుత్వాలు పోటీపడుతున్నాయి. ప్రయోజనాలు, వ్యయాలు సమానంగా విస్తరించి ఉన్నాయో లేదో విధాన రూపకర్తలు పరిశీలించాలి. మరింత సమర్థత, పర్యావరణ పరిరక్షణ చర్యలు లేకుండా అత్యధిక విద్యుత్ వినియోగించే డిజిటల్ మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడానికి ప్రజాధనాన్ని ఉపయోగించవచ్చా?
ఏఐ మౌలిక సదుపాయాల కోసం, గృహాల కోసం, రైతుల కోసం, చిన్న వ్యాపారాల కోసం ప్రభుత్వాలు విద్యుత్ను ఎలా ఉత్తమంగా ఉపయోగించాలి?
జాతీయంగా ప్రశంసించబడిన సాంకేతిక పెట్టుబడుల ఒత్తిడిని స్థానిక పర్యావరణ వ్యవస్థ మాత్రమే గ్రహించినప్పుడు పర్యావరణ నష్టం వల్ల ఎవరు ఎక్కువగా నష్టపోతారు?
ప్రజాస్వామ్య జవాబుదారీతనం – విధానపరమైన మార్పులు..
మైనింగ్ ప్రాజెక్టులు, పారిశ్రామిక కారిడార్లు, ఇటీవల పునరుత్పాదక ఇంధన పార్కుల విషయంలో ఇటువంటి ప్రశ్నలు గతంలో కూడా తలెత్తాయి.
ప్రతి సందర్భంలోనూ మౌలిక సదుపాయాలు జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతగా సమర్థించబడ్డాయి. కానీ దాని పర్యావరణ, సామాజిక పరిణామాలు ఎక్కువగా స్థానికంగానే ఉన్నాయి.
డేటా సెంటర్లు దీనికి భిన్నంగా ఉండే అవకాశం లేదు. వాటి ప్రభావాలు పొగ గొట్టం లేదా బొగ్గు గని కంటే తక్కువగా కనిపించవచ్చు. కానీ వనరుల కేటాయింపు, పర్యావరణ పాలన, ప్రజాస్వామ్య జవాబుదారీతనం విషయానికి వస్తే ఇవి కూడా అంతే ముఖ్యమైనవి. వీటిని గ్రహించడం అంటే ప్రభుత్వ విధానాన్ని మార్చడమే.
డేటా సెంటర్లను వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులుగా పరిగణించే బదులు, పర్యావరణ అంచనా చట్రాలు (ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్స్) విద్యుత్ సంచిత వినియోగం, నీటి వినియోగం, వాతావరణ స్థితిస్థాపకతను (క్లైమేట్ రెసిలియన్స్) పరిగణనలోకి తీసుకోవాలి.
పట్టణ ప్రణాళిక డిజిటల్ మౌలిక సదుపాయాలను విస్తృత వనరుల నిర్వహణ వ్యవస్థలలో విలీనం చేయాలి. ప్రభుత్వ రాయితీలు, పర్యావరణ పనితీరుపై మరింత పారదర్శకత ఉంటే, ఉద్రిక్తతలు తలెత్తక ముందే ప్రజలలో నమ్మకాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది.
భారీ స్థాయి డిజిటల్ మౌలిక సదుపాయాలపై నిర్ణయాలు కేవలం పరిపాలనా విషయాలకు మాత్రమే పరిమితం కాకుండా ఉండటానికి స్థానిక వర్గాలతో అర్థవంతమైన భాగస్వామ్యం ఉండటం కూడా ముఖ్యం.
పర్యావరణ పరిమితులు – భవిష్యత్ సవాళ్లు..
భారతదేశ డిజిటల్ పరివర్తన తరచుగా పాత అభివృద్ధి నమూనాల కంటే మెరుగ్గా పనిచేసే దేశ సామర్థ్యానికి ఉదాహరణగా ప్రచారం చేయబడుతుంది.
అయితే, ప్రతి మౌలిక సదుపాయాల విప్లవం చివరికి పర్యావరణ పరిమితులను ఎదుర్కొంటుందని చరిత్ర మనకు చెబుతోంది. రైల్వేలు ప్రకృతి దృశ్యాన్ని మార్చివేశాయి. రహదారులు అడవుల విచ్ఛిన్నానికి కారణమయ్యాయి.
పునరుత్పాదక ఇంధనం ఉమ్మడి వనరులు, సంరక్షణపై చర్చలను మార్చివేసింది. ఏఐ ఇంధనం, నీరు, పర్యావరణ న్యాయం చుట్టూ ఉన్న చర్చను మారుస్తుంది.
భారతదేశంలో తదుపరి పర్యావరణ పోరాటం బొగ్గు గని లేదా థర్మల్ విద్యుత్ కేంద్రం కాకపోవచ్చు. ఇది సర్వర్లతో నిండిన కిటికీలు లేని గోదాము నుండి రావచ్చు.
డిజిటల్ వృద్ధికి పర్యావరణ సమతుల్యత ఆధారం..
ఈ ముప్పు భారతదేశ డిజిటల్ ఆకాంక్షలకు అడ్డంకిగా మారకూడదు. దానికి బదులుగా, సాంకేతిక పురోగతిని పర్యావరణ నియంత్రణ నుండి వేరు చేయలేమని ఇది మనకు గుర్తు చేస్తుంది.
భారతదేశ ఏఐ ఆర్థిక వ్యవస్థ విజయం కేవలం నిర్మించిన డేటా సెంటర్ల సంఖ్యతో మాత్రమే కాకుండా, డిజిటల్ వృద్ధి, పర్యావరణ నిలకడతనం, సామాజిక సమానత్వం కలిసి మనగలుగుతాయని నిరూపించే దాని సామర్థ్యం ఆధారంగా కూడా కొలవబడుతుంది.
డేటా 21వ శతాబ్దం అయితే, డేటా రాజకీయం భూమి, నీరు, ఇంధన రాజకీయాల ద్వారా మరింత ఎక్కువగా రూపుదిద్దుకుంటుంది.
నేటి డిజిటల్ మౌలిక సదుపాయాలు రేపటి పర్యావరణ వివాదంగా మారకముందే భారతదేశం ఈ సత్యాన్ని గుర్తించడమే అసలైన సవాలు.
అనుశ్రీతా దత్తా
(రచయిత పొలిటికల్ రీసెర్చ్ అనాలిసిస్, ఈఎస్జీ రీసెర్చ్, ఎనర్జీ పాలసీలో అనుభవం ఉన్న ఒక వ్యాసకర్త. వాతావరణ పరిశోధకురాలు. ఇవి ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
