న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా క్యాంపస్లలో విద్యార్థుల ఆత్మహత్యలు, మానసిక ఆరోగ్య సమస్యలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు నియమించిన జాతీయ టాస్క్ ఫోర్స్(ఎన్టీఎఫ్) పరిశోధనలో, ఐఐటీ ఢిల్లీ, ఎయిమ్స్ ఢిల్లీ, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, జామియా మిలియా ఇస్లామియా, రామ్జాస్ కళాశాలలతో సహా ఢిల్లీలోని ప్రధాన ఉన్నత విద్యా సంస్థలు ప్రముఖంగా నిలిచాయి.
భారతదేశం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన ఉన్నత విద్యా సవాళ్లలో ఒకటిగా ఆవిర్భవిస్తున్న ఈ అంశంపై సంప్రదింపులను విస్తరిస్తున్నందున, 10 రాష్ట్రాల్లోని 30 సంస్థలను సందర్శించిన ఈ టాస్క్ ఫోర్స్కు, తన తుది నివేదికను సమర్పించడానికి అక్టోబర్ 31 వరకు గడువు ఇవ్వబడింది.
టాస్క్ఫోర్స్ గడువు పొడిగింపు..
గత ఏడాది కాలంగా చేసిన పనిని వివరిస్తూ సమర్పించిన స్టేటస్ రిపోర్టును స్వీకరించిన అనంతరం, మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ నేతృత్వంలోని 10 మంది సభ్యుల ప్యానెల్ పదవీకాలాన్ని సుప్రీం కోర్టు మే 27 వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
2025 మార్చిలో ఏర్పాటైన ఈ టాస్క్ ఫోర్స్, ఐఐటీ ఢిల్లీ, ఎయిమ్స్ విద్యార్థులతో సహా 2 లక్షలకు పైగా విద్యార్థుల స్పందనల ఆధారంగా, 2025 నవంబర్లో ఒక మధ్యంతర నివేదికను సమర్పించింది. దీనిని ఇటీవల బహిరంగపరిచారు.
ఢిల్లీకి ప్రత్యేక సవాళ్లు..
“భారతదేశం నలుమూలల నుంచి విద్యార్థులు కలిసే కేంద్రంగా, అగ్రశ్రేణి విద్యాసంస్థలకు నిలయంగా ఉన్న ఢిల్లీకి ప్రత్యేకమైన సవాళ్లు ఉన్నాయి. అదే సమయంలో, జాతీయ స్థాయిలో విస్తరించగల చర్యలను పరీక్షించడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. విభిన్న విద్యార్థినీ విద్యార్థులు ఎదుర్కొనే సవాళ్లు అనేకం. కావున, ఒకే విధానం అందరికీ సరిపోదు” అని జామియా హమ్దార్డ్ అసోసియేట్ ప్రొఫెసర్, టాస్క్ ఫోర్స్ సభ్యురాలు డాక్టర్ అక్సా షేక్ అన్నారు.
సుప్రీంకోర్టు ఆందోళన..
ఐఐటీ ఢిల్లీకి చెందిన ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యలపై, పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంలో విఫలమయ్యారన్న ఆరోపణలకు సంబంధించి సుప్రీంకోర్టులో జరిగిన విచారణల నేపథ్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
తన తీర్పులో, విద్యార్థుల ఆత్మహత్యల పెరుగుదలను కోర్టు “అత్యంత ఆందోళనకరం”గా అభివర్ణించింది.
2022లో 13,000 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని మరణించారని, ఇది భారతదేశంలోని మొత్తం ఆత్మహత్యలలో 7.6 శాతమని, ఆ సంవత్సరంలో నమోదైన రైతుల ఆత్మహత్యల సంఖ్య కంటే ఎక్కువని పేర్కొంది.
బహుముఖ కారణాలు..
విద్యార్థుల ఆత్మహత్యలను కేవలం మానసిక ఆరోగ్య సమస్యగా మాత్రమే చూడలేమని మధ్యంతర నివేదిక పేర్కొన్నది. విద్యాపరమైన ఒత్తిడి, వివక్ష, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక ఒంటరితనం, వేధింపులు, సంస్థాగత మద్దతు కొరత వంటివి పదేపదే తలెత్తుతున్న ఆందోళనలుగా వెలుగులోకి వచ్చాయి.
సర్వేలో వెల్లడైన సంచలన విషయాలు..
సర్వే చేసిన 2.4 లక్షలకు పైగా విద్యార్థులలో, 34 శాతం మంది క్యాంపస్లో తాము బయటివారిలా భావిస్తున్నట్లు తెలిపారు.
కేవలం 56 శాతం మంది మాత్రమే తీవ్రమైన సమస్యలను తమ సంస్థ యాజమాన్యం నిష్పక్షపాతంగా పరిష్కరిస్తుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
సుమారు 15 శాతం మంది గత ఆరు నెలల్లో దీర్ఘకాలం పాటు మానసిక క్షోభ, ఆందోళన లేదా నిరాశను అనుభవించినట్లు నివేదించగా, 9 శాతం మంది గత సంవత్సరంలో తరచుగా లేదా చాలా తరచుగా ఆత్మహత్య ఆలోచనలను ఎదుర్కొన్నట్లు తెలిపారు.
సర్వే చేసిన సంస్థలలో 70 శాతం కంటే ఎక్కువ సంస్థలలో పూర్తికాల మానసిక ఆరోగ్య నిపుణులు లేరని, 4 శాతం కంటే తక్కువ సంస్థలలో మాత్రమే అధికారిక ఆత్మహత్య ప్రమాద నిర్వహణ ప్రొటోకాల్లు ఉన్నాయని కూడా ఈ నివేదికలో తేలింది.
జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడానికి, క్యాంపస్ మానసిక ఆరోగ్య వ్యవస్థలను మెరుగుపరచడానికి, విద్యార్థుల మానసిక క్షోభకు గల నిర్మాణాత్మక కారణాలను పరిష్కరించడానికి తుది నివేదిక చర్యలను సిఫార్సు చేస్తుందని భావిస్తున్నారు.
సూక్ష్మంగా..
ఒత్తిడి, పక్షపాతం, విశ్వాస లోపం. మొత్తం ఆత్మహత్యలలో 13,000 మంది విద్యార్థులు 7.6 శాతం ఉన్నారు (ఎన్సీఆర్బీ 2022).
విద్యార్థుల మానసిక క్షోభతో 15 శాతం మంది దీర్ఘకాలిక మానసిక క్షోభను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
9 శాతం మందికి తరచుగా ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయి.
మానసిక ఆరోగ్య లోపాలు..
10 శాతం కంటే తక్కువ మందికి పూర్తికాల మానసిక ఆరోగ్య నిపుణులు ఉన్నారు, 70 శాతం మందికి మానసిక ఆరోగ్య సిబ్బంది కొరత ఉంది. 4 శాతం కంటే తక్కువ మందికి ఆత్మహత్య ప్రమాద నివారణ ప్రణాళికలు ఉన్నాయి.
ప్రధాన కారణాలు..
విద్యాపరమైన ఒత్తిడి, స్కాలర్షిప్ల ఆలస్యం, కుల/లింగ వివక్ష, బలహీనమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలు.
క్యాంపస్తో అనుబంధం లేకపోవడం వల్ల 34 శాతం మంది తమను బయటివారిగా భావించారు. 56 శాతం మంది నిర్వాహకులను విశ్వసించారు.
ఐఐటీ ఢిల్లీ పరిశోధనల ఫలితాలు..
విద్యాపరమైన ఒత్తిడి, సీజీపీఏపై దృష్టి, కుల వివక్ష, రిజర్వేషన్ వ్యతిరేక వైఖరులు.
జేఈఈ ర్యాంకుల శ్రేణి ఒంటరితనాన్ని పెంచుతుంది. సహాయక వ్యవస్థలపై తక్కువ నమ్మకం. సంస్థాగత సంస్కరణలు, అధ్యాపకుల బలమైన భాగస్వామ్యం అవసరం.
అనువాదం: సుబ్రమణ్యం
టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
